‘అన్నం పెట్టిన వారి నోట్లోనే సున్నం గొట్టే బాపతు’.. అనే సామెత ఎందుకు పుట్టిందో, ఏ సందర్భంలో పుట్టిందో కానీ పీవీ నరసింహారావు విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం అనుసరించిన వైఖరిని పరిశీలించినప్పుడు మాత్రం ఇది సరిగ్గా సరిపోతుందనేది నూటికి నూరు పాళ్లు సత్యం. పీవీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం చూశాకే ఈ సామెత పుట్టిందా? అనిపిస్తుంది.
పీవీ నరసింహారావు రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైంది మొదలు, సీఎం పదవైనా, చివరికి ప్రధాని పదవైనా కోరుకోకుండా వచ్చినవే కానీ, తనకు తానుగా ప్రయత్నం చేసి పొందినవి కావు. అలాంటి నిష్కపటి, నిర్మలచిత్తుడు ప్రధాని కాగానే ఆర్థిక సంస్కరణలు మొదలు పలు కీలకరంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని చేసి దేశాన్ని ప్రగతిపథంలో నడిపారు. దార్శనికతను కలిగిన మేధావిగా, నవ భారత నిర్మాణ సారథిగా ప్రపంచ అగ్ర రాజ్యాధిపతుల ప్రశంసలందుకున్నారు.
పీవీకి వచ్చిన పేరు ప్రఖ్యాతులు చూడగానే, వినగానే, సోనియమ్మ కడుపులో కార్చిచ్చు ఏర్పడింది. మన్మోహన్సింగ్ ఎంత ఓదార్చినా లాభం లేకపోయింది. మరోవైపు అర్జున్సింగ్, తివారి, తదితర చతుష్టయం ఆమె చెవిలో ఇల్లు కట్టి కందిరీగల వలె ఝుమ్మని వికృతరాగాలు తీయడంతో పీవీ పట్ల అయిష్టత కలిగి అభద్రతా భావన ఏర్పడింది. మనమే గద్దె ఎక్కించాం.. కాబట్టి ఒక్క టర్మ్ ఎలాగో భరిద్దామని సాలోచనగా అన్నది.
1997-99లో ఎప్పట్లాగే ఎన్డీయే తగవులతో కాలక్షేపం చేసి 1977-79 కాలం నాటి జనతా పార్టీ వైఫల్య చరిత్రను పునర్ లిఖించినప్పుడు, సోనియమ్మకు సువర్ణావకాశం దొరికి ప్రజల మధ్యకు వచ్చింది. బాబ్రీ మసీద్ విధ్వంసం మొదలు రకరకాల కేసులతో సతమతవుతున్న పీవీకి అండదండలందించే బదులు ఆయనను కాంగ్రెస్ కార్యాలయం వరకు కన్నెత్తకుండా చేయడంలో తొలి ఎత్తుగడ ఫలించింది. 1999లో ఎన్డీయే ప్రభుత్వంపై నెగెటివ్ ఓటింగే కాంగ్రెస్ను ప్రభుత్వం ఏర్పాటుచేయించింది. ప్రధానిగా సింహాసనం అధిష్టించే పట్టాభిషేక సమయానికి బీజేపీ ఆమె విదేశీయతను ప్రశ్నించి ఆమె తప్ప ఎవరైనా మాకు ఓకే అనడంతో మన్మోహన్సింగ్ ప్రధాని కావలసి వచ్చింది. అయితేనేం ఆయన ఉత్సవ విగ్రహం మాత్రమే. సోనియా గాంధీనే సమస్తం.
గతంలో దేవకాంత్ బారువా అనే ఓ భట్రాజు నేత ‘ఇందిరానే ఇండియా-ఇండియాయే ఇందిర’ అని నినాదం ఇచ్చినట్టు కాంగీయులు అంగీలు చింపుకొని సోనియానే సమస్తమని సహస్ర నామార్చన చేయడం మొదలుపెట్టారు. ఉమ్మడి ఏపీ కాంగీయులకైతే పట్ట పగ్గాల్లేవు. వైఎస్ఆర్, హన్మంతరావు.. ఒకరా, ఇద్దరా ఇలా ఎంతోమంది నాయకులు ఢిల్లీలోనే మకాం వేయడం షోడశోపచారాలతో పూజించడం నిత్యకృత్యమైంది. ప్రధాని కాలేకపోయానని సోనియా లోలోన వలవల ఏడ్చింది. ఇదంతా పీవీ కుట్ర అని ఆమె అపోహ. ఎలాగంటే పీవీ తన కవి మిత్రుడైన వాజపేయిని బ్రెయిన్ వాష్చేసి ఉంటాడని ఆమెకు అనుమానం. దాన్ని భజనపరులు చిలవలు పలవలు చేయడంతో తోక తొక్కిన తాచులా బుసలు కొట్టసాగింది. మరోవైపు పీవీ తన కేసులు తానే వాదించుకొని నిర్దోషిగా బయటపడ్డారు. కానీ, అనారోగ్యం పాలై 2004 డిసెంబర్ 23న మృత్యుఒడిలోకి జారుకున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సోనియాగాంధీ ఆదేశాలతో మొక్కుబడిగా దండం పెట్టుకొని, దహన సంస్కారాలకు దూరంగా ఉండిపోయింది. దేశ చరిత్రలో ఒక మాజీ ప్రధానికి ఇంత ఘోర అవమానం ఎన్నడూ జరగలేదు. ఇక హైదరాబాద్కు దేహం వచ్చాక నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నిర్వహించిన పాత్ర శకునికి కూడా సరిపోదు. దేహాన్ని సరిగా దహనం కూడా చేయించకుండానే చేతులు దులుపుకొన్నారు. దాంతో సోనియాగాంధీ ఊపిరి పీల్చుకున్నది. నాటినుంచి నేటిదాకా ఒక్క కాంగ్రెస్ గల్లీ నాయకుడైనా పీవీ సేవలు స్మరించలేదు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పీవీ పట్ల కాంగ్రెస్ అనుసరించిన వైఖరిని తీవ్రంగా ఖండించారు. పార్టీలకు అతీతంగా ఆయన దేశానికి చేసిన మేలును వేనోళ్ల పొగిడారు. పీవీ మన తెలంగాణ బిడ్డవడం మన అదృష్టమన్నారు. ఆయన పేరిట విశ్వవిద్యాలయం ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ ధృతరాష్ట్ర బుద్ధిని ఎండగట్టారు. చివరికి 2020-21లో పీవీ శత జయంత్యుత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించి ఒక 10 శాతం రుణం తీర్చుకున్నానని ఇంకా 90 శాతం ఉందన్నారు.
ఎక్కడో మూలన తన కళాసేవను తాను చేస్తూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీని చూసుకొనే విద్యావేత్త అయిన పీవీ కూతురు సురభి వాణీదేవిని పిలిచి మరీ ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. నిజానికి కేసీఆర్కు పీవీ శత జయంత్యుత్సవాలు చేస్తే ఒరిగిందేమి లేదు. స్వపక్షీయుడు కాడు. పైగా పీవీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కానీ, పార్టీలకతీతంగా కేసీఆర్ సమున్నతంగా ఆలోచించారు. దేశం కోసం పాటుపడిన పీవీని సముచితంగా గౌరవించారు. అది ఆయన సంస్కారం. అన్నం పెట్టిన పీవీ సేవలను స్మరించుకున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ మాత్రం పీవీ నోట్లో సున్నం కొట్టింది. పీవీకి క్రెడిట్ ఇస్తే సోనియాగాంధీ వ్యక్తిత్వం ఎక్కడ మసకబారుతుందోనని, కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఆయన ప్రస్తావన తీసుకురాకుండా జాగ్రత్తపడుతూ వచ్చింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
1956-83 వరకు ప్రజలు కాంగ్రెస్నే గెలిపించారు. చివరికి కాంగ్రెస్ అంటేనే అగ్నిశిఖలా ప్రజ్వరిల్లే ఎన్టీఆర్ సైతం పీవీని నంద్యాల నుంచి గెలిపించడానికి అభ్యర్థిని పోటీకి నిలపకుండా మన తెలుగు బిడ్డ అని మమకారంతో గౌరవించిన సంస్కారి. ఆ పాటి సంస్కారం, మానవతా విలువలూ లేని కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం ప్రజల్లోకి వచ్చింది. కాంగ్రెస్కు పట్టంగడితే హెడ్ క్వార్టర్స్ ఢిల్లీకి బదిలీ అవుతాయి. షికాయత్లు, సిఫారసుల పర్వంలో మళ్లీ డ్రామా మొదలవుతుంది. 1వ కృష్ణుడు, 2వ కృష్ణు డు అనేవిధంగా ముఖ్యమంత్రుల మార్పులు మొదలవుతాయి.
ఇక ఇంకో అంశం తెలంగాణ రాష్ర్టావతరణ గురించి. ఇప్పుడు కాంగీయులు సోనియమ్మే తెలంగాణ ఇచ్చిందని చెవులు కోసిన మేకల్లా అరుస్తున్నారు. 1969 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి నాలుగు దశాబ్దాల పాటు పట్టించుకోని కాంగ్రెస్ 2013లో కేవలం కేసీఆర్ అలుపెరుగని పోరాటానికి తలొగ్గింది. కేసీఆర్ వ్యక్తి కాదు వ్యవస్థ అని కళ్లు తెరిచింది. ‘తెలంగాణ అచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనంగనే కాంగ్రెస్ కలవరపడింది. అలా కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజల తలరాతలు మారినయి. ఈ ఆధునిక సమాజంలో సోషల్ మీడియా మార్పులు తెచ్చింది. చెవుల్లో పూలు పెట్టి చెప్తే వినే పరిస్థితిల్లో నేటి తరం యువకుల్లేరు. గాంధీజీ నాయకత్వాన ఎందరో సమరయోధులు ఆసేతు హిమాచలం పోరాడగా ఎందరో త్యాగధనులు తమ ధన, మాన, ప్రాణాలను పణంగా పెడితే వచ్చింది మనకు స్వాతంత్య్రం. రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దుచేయమని గాంధీజీ కోరారు. బాపూజీ ప్రాణాలతోనే ఆయన సూచనలు, ఆశయాలు గాల్లో కలిశాయి.
గాంధీతో విభేదించే నెహ్రూ తదుపరి కాంగ్రెస్ ఆకారం మారిపోయింది. చివరికి ఇందిరమ్మ కాంగ్రెస్ అయింది. తర్వాత పైలెట్ రాజీవ్గాంధీ వచ్చాక కాంగ్రెస్ మరింత సంకుచితమైంది. బోఫోర్స్ కుంభకోణాల చిక్కుల్లో పడిన రాజీవ్ తర్వాత మళ్లీ పీవీనే కాంగ్రెస్ ఐ లోని ఐ తోకను కత్తిరించారు. ఆ కత్తిరింపులు నచ్చని నాయకురాలు నాగమ్మ కోల్డ్వార్ మొదలుపెట్టింది. ‘బంటురీతి కొలువీయవమ్మా’ అని సాగిలపడి మొక్కేవారిని చేరదీసింది. పీవీ ఉన్నంతకాలం తన ఆటలు సాగవని గ్రహించి వెంటనే వెన్నెముక లేని ప్రాణులను చేరదీసి ‘ఉస్కో’ అని ఉసిగొలిపింది. మొరిగే గ్రామ సింహాలకు భయపడని పీవీ మాత్రం ప్రధానిగా దేశాన్ని మహోన్నత పథంలో నడిపించారు.
ఈ అంశాన్ని సీపీఐ, సీపీఎం మొదలైన వామపక్షాలు వాజపేయి వంటి కమలదళ నేతలు అంగీకరించినదే. అయితే సోనియా ఆమె గ్యాంగ్ మాత్రం కళ్లకు గంతలు కట్టుకొని పీవీని తెరమరుగు చేయాలని సంకల్పించారు. పీవీ చేసిన అభివృద్ధిని పొరపాటున కూడా బహిరంగ సభల్లోనే కాదు ఏకాంతంలో, ఇంకా చెప్పాల్నంటే కలలో కూడా ప్రస్తావించరాదని హుకుం జారీచేసింది. అంతేకాదు, అయోధ్య మొదలు జార్ఖండ్ ముడుపుల కేసుల వరకు ఎవరూ పీవీకి అండదండగా ఉండరాదని హుకుం జారీచేసింది. కానీ యథో ధర్మః తథో జయః.. ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది. అలా పీవీ నిర్దోషిగా బయటపడ్డారు.
గాంధీజీని, శాస్త్రీజీని, ఆ తర్వాత పీవీ సాబ్ను తమ చరిత్ర పుటల్లోంచి తొలగించిన కాంగ్రెస్ అఖిల భారతీయులకు భారం అయిందన్నది అక్షర సత్యం. లేకుంటే ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి శరద్పవార్, మమతా బెనర్జీ వంటివారు సొంత పార్టీని పెట్టుకునేవారు కాదు. అయోధ్య వివాదంలో పీవీని దుయ్యబట్టిన అర్జున్ సింగ్ 1982లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భోపాల్ గ్యాస్ లీకైన దుర్ఘటనకు స్పందించాల్సింది పోయి ప్రాణభయంతో హెలీకాప్టర్లో పారిపోయి కేర్వాన్ డాం ప్యాలెస్లో తలదాచుకున్నారు. అయినప్పటికీ కళ్లకు గంతలు కట్టుకొన్న ధృతరాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ‘అర్జునుడు’ మంచివాడని కితాబ్ ఇచ్చారు.
ఇలా చెప్తూ పోతుంటే కాంగీయుల లీలలు అష్టాదశ పురాణాలను మించిపోతాయి. కాబట్టి, రైతు బాంధవుడు, మైనారిటీలు, బ్రాహ్మణ కులంతో సహా అన్ని కులమతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి ఏదో ఒక ‘బంధు’ పథకంతో నిరుపేదల కన్నీళ్లు తుడిచే కేసీఆరే తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చారు. ఇట్లా బంగారుమయంగా మారిన తెలంగాణను మళ్లీ మట్టిముద్దలుగా చేస్తుంది కాంగ్రెస్. బంగారాన్ని కుదువపెట్టి బిచ్చమెత్తుకొనే స్థితికి వచ్చిన భారతదేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లిన అపర చాణక్యుడు మన తెలంగాణ బిడ్డ పీవీనే కృతజ్ఞత లేకుండా తెర వెనుకకు నెట్టిన కాంగ్రెస్ మన బతుకులను బాగు పరుస్తుందంటే నమ్మవచ్చా?
కొసమెరుపు: ‘మొగుడు చచ్చినంక భార్య బుద్ధిమంతురాలైనట్టు’ పీవీ చనిపోయిన పంతొమ్మిదేండ్ల తర్వాత కాంగ్రెస్కు జ్ఞానోదయం అయింది. రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ లబ్ధి పొందేందుకు తెలంగాణలో ఓ జిల్లాకు పీవీ పేరు పెడుతామని ప్రకటించింది. పీవీ ఫొటోకే దండ వేయడానికి తటపటాయించే కాంగీయులు జిల్లాకే పేరు పెడతారంటే తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టడమే.. మొండిచేయి చూపడం, అరచేతిలో బెల్లంపెట్టి మోచేతులు నాకించడం కాంగీయులకు వెన్నతో పెట్టిన విద్య. పీవీ పేరిట జిల్లా పెట్టినంత మాత్రాన తెలంగాణకు ఒరిగేదేమీ ఉండదు. అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే గీస్తే కేసీఆరే చేయగలరు. నేటి కాంగ్రెస్… స్వాతంత్య్రోద్యమ కాలం నాటి కాంగ్రెస్ కానే కాదు. ‘మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి’ అని నేటి కాంగీయులు నాటి కాంగ్రెస్ పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్నారు. తస్మాత్ జాగ్రత్త.
డాక్టర్ వి.వి.రామారావు
98492 37663