చరిత్రకు అందని అతి ప్రాచీనకాలం నుంచి దేశ స్వాతంత్య్రం వచ్చేవరకు కశ్మీర్ చరిత్రను మనం కూలంకషంగా పరిశీలించాం. ఈ పరిశీలనలో మనకు స్పష్టంగా తేలే అంశం ఏమంటే.. ఇస్లాం మతం కశ్మీర్లో ప్రవేశించిన క్రీస్తుశకం 14వ శతాబ్దంలో కశ్మీర్ చరిత్ర ప్రారంభం కాలేదు. కశ్మీరియత్ అంటే కేవలం ఇస్లాం మత సంబంధమైనది కాదు. కశ్మీర్కు ఐదు వేల సంవత్సరాల సుదీర్ఘ, సుసంపన్నమైన సాంస్కృతిక, సామాజిక చరిత్ర ఉన్నది. నాగా తెగలు, మైదాన వాసుల సహజీవన చరిత్ర దానిది.
కశ్యప మహర్షి పేరుతో కశ్మీర్, సంస్కృత వ్యాకరణవేత్త పాణినిని, ఆయుర్వేద పితామహుడు చరకుని,అలంకార శాస్త్రవేత్త ముమ్మటుని అందించింది. శారదా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన కశ్మీరాన్ని, శ్రీనగర్నిర్మించిన అశోకుని వారసత్వాన్ని తెలుసుకోకుండా కశ్మీరియత్ను అర్థం చేసుకోలేం. నాగా, హిందూ,బౌద్ధ, సిక్కు, సూఫీ, ఆఫ్గన్, డోగ్రాల సంస్కృతీ, సంప్రదాయాల సమ్మేళనమే కశ్మీరియత్. కశ్మీరియత్ అంటే కేవలం ముస్లిం మత ఛాందసవాదానికే పరిమితం చేసే వేర్పాటువాదం కాదు.
దేశ విభజన-కశ్మీర్: స్వాతంత్య్రం వచ్చాక దేశం నుంచి మత ప్రాతిపదికన పాకిస్థాన్ విభజించబడటం చారిత్రక విషాదం. ఇస్లాం మతాన్ని జాతీయతగా భ్రమించి ముస్లింలను ముస్లిం లీగ్ తప్పుదోవ పట్టించడం, మతవాదాన్ని జాతీయ విముక్తి ఉద్యమంగా భావించి కమ్యూనిస్టులు వత్తాసు పలకడం, విభజించి పాలించు అనే ద్వంద్వనీతితో భారతీయుల మధ్య బ్రిటిషు వారు మత వైషమ్యాలు రెచ్చగొట్టడం వల్ల దేశ విభజన జరిగి లక్షలాది మంది మత కలహాలలో చనిపోయారు. వేలాదిమంది ఇరు దేశాలలో కట్టుబట్టలతో శరణార్థులుగా వలసపోయారు. ముస్లింల కోసం ప్రత్యేక పాకిస్థాన్ ఏర్పడినప్పటికీ భారతదేశంలో ముస్లింలు అధికంగా ఉన్న కశ్మీర్ లాంటి ప్రాంతాలను, ముస్లిం సంస్థానాధీశులు ఉన్న హైదరాబాద్ లాంటి ప్రాంతాలను పాకిస్థాన్లో కలపడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు జిన్నా ఇక్కడి తాబేదార్లతో కుట్రలు పన్నాడు. అతని కుతంత్రాలకు కలతచెందిన మహాత్మాగాంధీ ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికి హెచ్.ఎస్.సుహ్రవర్దిని 1947 అక్టోబర్లో తన దూతగా జిన్నా వద్దకు పంపించాడు. ఇరు దేశాల్లోని అల్పసంఖ్యాక వర్గాల, మతాల వారి రక్షణకు చర్యలు తీసుకోవాలనీ, పొరుగు దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని షరతులతో శాంతి, పరస్పర సహకార ఒప్పందంపై సంతకం చేయవలసిందిగా జిన్నాను కోరారు. జిన్నా ఆ ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాడు.
ప్రతిగా ఐదు వేల మంది అఫ్రిదీలు, పఠాన్లకు ఆయుధాలు సమకూర్చి 1947, అక్టోబర్ 22 నాడు కశ్మీరుపై దురాక్రమణకు ఉసిగొల్పాడు. కశ్మీర్కు చెందిన సైన్యంలోని ముస్లిం సైనికులు పాకిస్థాన్ దురాక్రమణదారులతో చేతులు కలిపి జిహాద్ పేరుతో వేలాది మంది హిందువులను, సిక్కులను ఊచకోత కోశారు. కశ్మీర్ రాజు హరిసింగ్, కశ్మీర్లోని ప్రధాన రాజకీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్లా లిఖితపూర్వకంగా భారతదేశంలో విలీనం కావడానికి అంగీకారం తెలపడంతో 1947, అక్టోబర్ 26 నాడు భారత సైన్యం కశ్మీర్ రక్షణకు పూనుకున్నది. జిన్నాతో పొసగనందుకే షేక్ అబ్దుల్లా భారత్లో విలీనం వైపు మొగ్గుచూపాడు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి కశ్మీర్ను పాకిస్థాన్లో కలపడానికి భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన ప్రయత్నాలను జిన్నా తిరస్కరిస్తూ ఏదేమైనా ‘కశ్మీర్లో పండిన ఆపిల్ లా నా ఒడిలో పడటం ఖాయమని’ అన్నాడు. పాకిస్థాన్లో విలీనం కాకుండా భారత్ వంటి ‘సామ్రాజ్యవాద దేశం’తో చేతులు కలిపినందుకు షేక్ అబ్దుల్లాను భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా విమర్శించింది.
భారత్లో విలీనానికి అంగీకరించాక షేక్ అబ్దుల్లా తన వాటాగా కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని, ప్రత్యేక జెండా, ప్రత్యేక చట్టాలకు అనుమతించడంతో పాటుగా భారత రాజ్యాం గంలోని అనేక అంశాలనుంచి, సుప్రీంకోర్టు పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేసి, రాజ్యాంగంలో 370 అధికరణాన్ని పొందుపరిచేలా చేశాడు. ఈ ప్రతిపాదనకు అప్పటి గృహ మంత్రి సర్దార్ పటేల్ ససేమిరా అన్నప్పటికీ, తర్వాత అందుకు అంగీకరించి ముసాయిదా రాజ్యాంగ ప్రతిపాదన తయారు చేయవలసిందిగా డాక్టర్ అంబేద్కర్ను కోరారు. రాజ్యాంగం 370 అధికరణాన్ని రూపొందించడానికి, కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని నిరాకరిస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు.. ‘కశ్మీర్ ఎల్లలను భారతదేశం కాపాడాలని, కశ్మీర్లో రోడ్లు నిర్మించాలని, వారికీ ఆహార ధాన్యాలు సరఫరా చేయాలనీ, భారతదేశంతో పాటు అన్ని విషయాల్లో సమాన వాటా కావాలని కోరతారు. కానీ, భారత పౌరులకు కశ్మీర్లో ఎలాంటి హక్కులు ఇవ్వడానికి నిరాకరిస్తారు. భారత ప్రభుత్వానికి కశ్మీర్లో పరిమిత హక్కులు మాత్రమే ఇస్తామంటారు. ఇలాంటి ప్రతిపాదనకు అంగీకరించడం అంటే భారతదేశ ప్రయోజనాలకు ద్రోహం చేయడమే. భారత దేశ న్యాయశాఖ మంత్రిగా నేను ఇది ఎప్పటికీ చేయలేను..’
భారత్లో కశ్మీర్ విలీనమై ప్రత్యేక ప్రతిపత్తి పొందిన తర్వాత ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం గానీ, మరే ఇతర ప్రభుత్వాలు గానీ కశ్మీర్లో శాంతిభద్రతలను కాపాడటంలోనూ, మత సామరస్యాన్ని నెలకొల్పడంలోనూ పూర్తిగా విఫలమయ్యాయి. అంతేకాకుండా వాటి పాలనా కాలంలోనే వేర్పాటువాద ధోరణులు, తీవ్రవాద దాడులు అధికమయ్యాయి. దీని పర్యవసానంగా ముస్లిం లీగ్కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్, జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) వంటి తీవ్రవాద సంస్థలు 1989లో పెద్ద ఎత్తున హింసాయుత దాడులకు పాల్పడి వేలాదిమంది హిందువులను, ముఖ్యంగా కశ్మీర్ పండితులను అమానుషంగా చంపారు. ఈ మతోన్మాద దాడులకు భయపడి 4 లక్షలకు పైగా హిందువులు కశ్మీరు నుంచి కట్టుబట్టలతో తమ దేశంలోనే శరణార్థులుగా అనేక ప్రాంతాలకు వలసవెళ్లారు. కశ్మీర్ చరిత్రలో ఇది మూడో హిందూ జన హననం.
కశ్మీర్లో వేర్పాటువాద ముఠాలు కోరే ఆజాదీ (స్వాతంత్య్రం) ఏమిటి? వారి కశ్మీరియత్ ఏమిటి? కశ్మీర్లో ఇస్లాం స్థాపించడం, నిర్బంధ షరియా చట్టాన్ని అమలుచేయడం అన్ని వేర్పాటువాద, తీవ్రవాద ముఠాల లక్ష్యం. పాకిస్థాన్లో కశ్మీర్ను విలీనం చేయడమో లేదా ఇస్లామిక్ కశ్మీరును ఏర్పాటుచేయడమో వీరి సిద్ధాంతం. వీరు కోరే ఆజాదీ కేవలం ముస్లింలకేనా? కశ్మీర్లోని హిందువుల, సిక్కుల, బౌద్ధుల, క్రిస్టియన్ల హక్కులు, సంస్కృతీ, సంప్రదాయాల పట్ల సహనం పట్టదా? అరుంధతిరాయ్, కమ్యూనిస్టులు, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీఎఫ్ తదితర వ్యక్తులు, పార్టీలు మానవ హక్కుల గురించి, కశ్మీరియత్ గురించి ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా వారు ఒక మతాన్ని, అది కూడా ముస్లిం మతాన్ని మాత్రమే ఒక ప్రాంతం ప్రత్యేకతగా ప్రచారం చేయడం అజ్ఞానం. సెక్యులరిజం గురించి ప్రతిక్షణం జపించే ఈ వ్యక్తులు, పార్టీలు ఒక మతం ప్రాతిపదికన ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలనడం విడ్డూరం. కమ్యూనిస్టులకు ఇలాంటి చారిత్రక తప్పిదాలు చేయడం అలవాటే. ముస్లింలను ఒక జాతిగా గుర్తించి పాకిస్థాన్ ఏర్పాటుకు సైద్ధాంతిక, ప్రత్యక్ష మద్దతు ఇచ్చి దేశ విభజనకు దోహదం చేసిన చరిత్ర వీరిది.
పాలస్తీనాలో జరుగుతున్న అణచివేతపై ఉద్యమాలు లేవనెత్తుతూ, అమెరికాలో నల్లజాతి ప్రాణాలకు విలువ ఉందని గొంతుచించుకునే వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య పార్టీలు కశ్మీర్లో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లపై జరిగే హింసాకాండను గానీ, కశ్మీరీ పండితులపై జరిగే హత్యాకాండలపైగానీ, కశ్మీరీ ముస్లిం మహిళలపై ముల్లాలు, ఇస్లాం మతతత్వ వాదులు విధించే నిర్బంధాలపై గానీ నోరు మెదపరు.
కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు-రాజ్యాంగ అధికరణం 370 రద్దు: రాజ్యాంగ అధికరణం 370 తొలగించి తద్వారా కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని భారత పార్లమెంట్ రద్దుచేయడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, కమ్యూనిస్టు, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీఎఫ్ తదితర పార్టీలు ఈ పార్లమెంట్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ అంశంపై వచ్చిన అన్ని కేసులను ఒకే కేసుగా ఏకంచేసి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ద్వారా విచారించింది. 2023, డిసెంబర్ 11న తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, రాజ్యాంగ అధికరణం 370 తొలగించి కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని భారత పార్లమెంట్ రద్దుచేయడం రాజ్యాంగబద్ధమేనని ఏకగ్రీవంగా సమర్థించి దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడి ఒకే దేశం, ఒకే జండా, ఒకే చట్టం, ఒకే లౌకిక రాజ్యాంగం సూత్రాన్ని చాటిచెప్పింది.
-ఆనందేశి నాగరాజు
98488 38323