న్యూఢిల్లీ, మే 14: చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా చక్కెర విరివిగా లభ్యమయ్యేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు సెప్టెంబర్ 30 వరకు నిషేధం అమలులో ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ నోటిఫికేషన్ ప్రకారం ముడి చక్కెర, తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులపై నిషేధం అమల్లో ఉంటుంది.
‘పరిమితం చేసిన’ కేటగిరీలో చక్కెరను ‘నిషేధిత’ జాబితాలో చేర్చారు. అయితే సీఎక్స్ఎల్, టీఆర్క్యూ కోటా ప్రకారం యూరోపియన్ దేశాలు, అమెరికాలకు మాత్రం ఎగుమతులు యథావిధిగా కొనసాగుతాయి. నోటిఫికేషన్ విడుదల కంటే ముందు నౌకల్లో లోడింగ్ ప్రారంభమైన, షిప్పింగ్ బిల్లులు దాఖలు చేసిన, కస్టమ్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్లో నమోదైన చక్కెరకు ఎగుమతి నుంచి మినహాయింపునిచ్చారు.