ఎల్లారెడ్డి,(లింగంపేట), మే 14: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య ఆత్మహత్యకు యత్నించగా వారించిన భర్త.. ఆ తర్వాత తనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటి నుంచి అందరినీ బయటికి పంపించి, నాటు తుపాకీతో కాల్చుకున్నాడు. లింగంపేట మండలం మోత గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మోతె గ్రామంలో నివసించే ఇంద్రజిత్సింగ్ (30)కు భార్య సనమ్ కౌర్, కుమారుడు మన్మిత్ సింగ్ ఉన్నారు. ఇండ్లలో ఉపయోగించే పదనైన వస్తువులు తయారుచేసి విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
అయితే, గురువారం దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. సమీపంలోని కుంటలో దూకేందుకు వెళ్లగా, భర్త వారించి ఇంటికి తీసుకొచ్చాడు. సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న వారిని బయటికి పంపించి, తన వద్ద ఉన్న నాటు తుపాకీతో కాల్చుకున్నాడు. పొట్టలో కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ఆందోళనకు లోనయ్యారు.
మరోవైపు, ఇంద్రజిత్ సింగ్ నాటు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సమాచారమందుకున్న ఎస్సై దీపక్కుమార్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే, పోలీసులు వచ్చేసరికి కుటుంబ సభ్యులు నాటు తుపాకీని అటవీ ప్రాం తంలో దాచారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి నాటు తుపాకీ గురించి ఆరా తీశారు. అటవీ ప్రాంతంలో గాలించి నాటుతుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావ్ గ్రామానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతుడు చనిపోయిన స్థలాన్ని, ఆత్మహత్య కోసం ఉపయోగించిన నాటు తుపాకీ పరిశీలించారు.