కరీంనగర్ రాంనగర్/ విద్యానగర్, మే 14 : దోపిడీ కోసం ఏకంగా ప్రత్యేక యాప్ను రూపొందించి దాని ద్వారా దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ప్రత్యేక యాప్ ద్వారానే దోపిడీకి పక్కా ప్రణాళికను రూపొందించారని తెలిసింది. ఎట్టకేలకు పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులతోపాటు సిమ్కార్డులు విక్రయించిన సహాయకుడిని అరెస్ట్ చేశారు. గురువారం కరీంనగర్లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అరెస్ట్ వివరాలను వెల్లడించారు.
అంతర్రాష్ట్ర నగల దొంగ ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన ముఠా నాయకుడు బీహర్కు చెందిన సుబోధ్సింగ్ కనుసన్నల్లో ఈ దోపిడీ జరిగింది. వివిధ నేరాల్లో నిందితుడిగా ఉన్న సుబోధ్సింగ్ ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్నాడు. అతడికి వెస్ట్బెంగాల్కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీర్సింగ్తో జైల్లో పరిచయం ఏర్పడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రఘునాథ్ కర్మాకర్ ఆధ్వర్యంలో ఈ దోపిడీకి సుబోధ్సింగ్ జైలు నుంచే ప్లాన్ వేశాడు.
కొంతమంది నేరగాళ్లను ఎంపిక చేసుకుని నిజామాబాద్, సిద్దిపేట, ధర్మపురి, మంచిర్యాల, ఖమ్మం, జగిత్యాల ప్రాంతాల్లో ఆరు నెలలుగా భారీ దోపిడీకి రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో కరీంనగర్లోని పీఎంజే నగలషాపును ఎంచుకున్నారు. నాటు తుపాకులను చంద్రాపూర్ నుంచి తెప్పించుకున్నారు. మే 3న రెండు వాహనాలపై ఐదుగురు వ్యక్తులు ఆరు తుపాకులతో కరీంనగర్ వచ్చారు. మొదట ఒక వ్యక్తి కొనుగోలుదారుడిగా దుకాణంలోకి వెళ్లి బయట ఉన్న ఇతర దొంగలకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు మిగతా దొంగలు షాపులోకి చొరబడి తుపాకులతో గురిపెట్టి, రూ.82 లక్షల విలువైన 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.
పకడ్బందీగా ప్లాన్ చేసేందుకు ఓ యాప్నకు రూపకల్పన చేశారు. దోపిడీకి వెళ్లేముందు ఎవరు ఏ మార్గాన వెళ్లాలి? ఎక్కడ కలుసుకోవాలి? దోపిడీ తర్వాత ఏ మార్గం గుండా పారిపోవాలి? ఎక్కడ కలుసుకోవాలి? అన్న రూట్ వివరాలను మొత్తం సదరు యాప్లో నమోదు చేసి ఉంచారు. దోపిడీ తర్వాత రూట్ మ్యాప్ ద్వారా రామగుడు, గొల్లపల్లి, ధర్మపురి గోదావరి వరకు వాహనాలతో ప్రయాణించారు. మార్గమధ్యలో వారు ఉపయోగించిన వాహనాలు, సెల్ఫోన్ ఇతర వస్తువులను వదిలేసి పారిపోయారు. సెల్ ఫోన్లో లభ్యమైన సమాచారంతో 9 రాష్ర్టాల పోలీసులతో సమాచారం సేకరించారు. మొదట ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ను బీహార్లో పట్టుకున్నారు. అతడి ద్వారా బీహార్ రాష్ట్రంలోని హిల్ప మండలానికి చెందిన రవీశ్కుమార్ అలియాస్ ప్రద్యుమన్, రాధే అలియాస్ అభయ్, మిశ్రా, సూర్యమణి దోపిడీలో పాల్గొన్నట్టు గుర్తించారు. ఇందులో రవీశ్, సిమ్లు విక్రయించిన రాధేను పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేశారు. ఈ దోపిడీలో వీరికి 13 మంది సహకరించినట్టు నిర్ధారించారు.
దోపిడీ దొంగలు యాప్ ద్వారా వచ్చిన సూచన ప్రకారం రూ.82 లక్షల విలువైన 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ వజ్రాభరణాలను మధ్యవర్తులకు అప్పగించారు. వారు వాటిని ఇతర రాష్ర్టాలకు తరలించారు. బంగారు ఆభరణాలను నేపాల్లో విక్రయించిట్టు సమాచారం. ఈ దోపిడీకి స్కెచ్ వేసిన సుబోధ్సింగ్ను త్వరలో విచారిస్తామని సీపీ తెలిపారు. ప్రస్తుతం పట్టుపడిన దొంగల నుంచి రూ.51వేల నగదు, నకిలీ ఆధార్కార్డులు, రెండు సెల్ఫోన్లు, సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.