ఈ నెల 28న ఢిల్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు (ఎన్టీఆర్) గౌరవార్థం భారత ప్రభుత్వం ముద్రించిన వంద రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. వివాదాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ రాజకీయ క్రీడలకు వేదిక ఎలా అయిందో కళ్లకు కట్టింది. ఇలా జరగటం నిజంగా దురదృష్టకర పరిణామం. రాజ్యాంగ వ్యవస్థలు హేయమైన రాజకీయాలకు ఎలా బలవుతున్నాయో ఈ కార్యక్రమం మరోసారి రుజువు చేసింది. దీంతో రాజనీతి విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వటమే రామ రాజ్యమా అన్న ప్రశ్న చాలా మందిలో కలుగుతున్నది. ఈ కార్యక్రమం ప్రజల మనోభావాలను గాయపరిచింది. ఈ కార్యక్రమం ఎందుకు వివాదాస్పదమైందో అర్థం చేసుకోవాలంటే, ముందు దీని నేపథ్యాన్ని తెలుసుకోవాలి.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అనేది తప్పనిసరిగా పాటించాల్సిన నియమావళి. అటువంటిది ఒక ప్రైవేట్ వ్యక్తి పేరు మీద ఆహ్వానాలు పంపడమేంటి? అది కూడా వారికి ఇష్టులైన వారికే పరిమితం కావడమేంటి? ఇది ఎన్టీఆర్ మీద ఆయన కూతురు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం కాదు. ప్రభుత్వం ముద్రించిన నాణెం విడుదల కార్యకమం. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలి.
మన దేశంలో ప్రజా జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రముఖుల మరణానంతరం వారి సేవలకు చిహ్నంగా స్మారక తపాలా బిళ్లలు, నాణేలు విడుదల చెయ్యటం ఒక సాంప్రదాయంగా వస్తున్నది. వీటి విడుదలను సంబంధిత శాఖలు ఒక వేడుకలా నిర్వహిస్తాయి. ఇవి ఆయా శాఖల వారసత్వ సంపదగా నిలుస్తాయి. ఇటువంటి నాణేలను సేకరించే అభిరుచిని న్యూమిస్మాటిక్స్ అంటారు. తపాలా బిళ్లలను సేకరించే అభిరుచిని ఫిలాటెలీ అంటారు. తపాలా బిళ్లలను సాధారణ అమ్మకాలకు అందుబాటులో ఉంచుతారు. కానీ స్మారక నాణేలు మార్కెట్లో దొరకవు. అవి మార్కెట్లో చెల్లుబాటు అవ్వటం కూడా సందేహమే. సాధారణ సర్క్యులేషన్లో ఉంటేనే కదా.. వాటిని ప్రజలు అంగీకరించేది. ఇటువంటి నాణేలు ఇష్టంతో సేకరించేవారి వద్దే ఉంటాయి. వాటి ముఖ విలువ కన్నా చాలా అధిక ధరలో ఉంటుంది వీటి ఖరీదు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ముద్రించిన వంద రూపాయల నాణెం రూ.4,850,4,350, 4,050 ధరలకు లభిస్తుంది. ఈ నాణెన్ని ఆసక్తి ఉన్నవారు కొంటారు. ఈ నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం జింక్, 5 శాతం నికెల్ ఉంటాయి.
సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. స్మారక తపాలా బిళ్లలు, నాణేలు భారత ప్రభుత్వ సంపద. వీటిని విడుదల చేసే వేడుక మరణించిన మనిషి స్మృతికి చిహ్నంగా జరిపేవి. అందువల్ల ఈ స్మారక నాణేలు, తపాలా బిళ్లలను మామూలు వస్తువులుగా చూడకూడదు. వీటి విడుదల వేడుక ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగా జరుగుతుంది. ఎవరు విడుదల చేస్తారనేది మృతి చెందిన మనిషి స్థాయిని బట్టి ఉంటుంది. కానీ కార్యక్రమం మాత్రం పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమంగానే ఉంటుంది.
అయితే ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలలో అసలు సమస్య ఇక్కడే ఉత్పన్నమైంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానాలను ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి తరఫున పంపినట్టు తెలుస్తున్నది. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమానికి ఒక ప్రైవేట్ వ్యక్తి పేరుతో ఆహ్వానాలు వెళ్లటమేమిటి అనేది మొదటి ప్రశ్న. ఎవరిని ఆహ్వానించాలి అనే దానిలో ప్రభుత్వం ప్రమేయం లేకపోవటం రెండవ ప్రశ్న. ఒక ప్రశ్నార్థకమైన కార్యక్రమంలోకి ఏకంగా రాష్ట్రపతిని లాగటం మరో పెద్ద ప్రశ్న.
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ లాంటి కార్యక్రమాలు జరగటం ఆనవాయితీ. అటువంటి కార్యక్రమాలు పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమాలే. వాటి నిర్వహణ బాధ్యత పుస్తకాన్ని ప్రచురించినవారు, రచించినవారు చూసుకుంటారు. అంటే అక్కడ వాడే పూలదండలు, శాలువాలు ఇతర బహుమతులకు, అల్పాహార విందుకు అయ్యే ఖర్చులు సంబంధిత వ్యక్తులే భరిస్తారు. రాష్ట్రపతి భవన్ కేవలం వేదిక మాత్రమే. భద్రతా కారణాల వల్ల ఆహ్వానాలు కూడా పరిమితంగానే ఉంటాయి. రాష్ట్రపతి గౌరవ అతిథి మాత్రమే. అయితే పుస్త్తకంలోని అంశాలను పరిశీలించిన తర్వాతే దాన్ని రాష్ట్రపతి విడుదల చెయ్యాలా లేదా అనేది రాష్ట్రపతి కార్యాలయం నిర్ణయిస్తుంది. నాణేల విషయంలో అటువంటి సందేహాలు ఉండవు. కానీ విడుదల వేడుక మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి తప్పక హాజరు కావాలి. అది ప్రోటోకాల్.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అనేది తప్పనిసరిగా పాటించాల్సిన నియమావళి. అటువంటిది ఒక ప్రైవేట్ వ్యక్తి పేరు మీద ఆహ్వానాలు పంపడమేంటి? అది కూడా వారికి ఇష్టులైన వారికే పరిమితం కావడమేంటి? ఇది ఎన్టీఆర్ మీద ఆయన కూతురు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం కాదు. ప్రభుత్వం ముద్రించిన నాణెం విడుదల కార్యక్రమం. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలి. అటువంటిది దీని నిర్వహణ బాధ్యత ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎవరు అప్పజెప్పారు? ఎందుకు అప్పజెప్పారు? అనేవి ముఖ్యమైన ప్రశ్నలు. దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ తెలుగువారికి గర్వకారణమైన మహోన్నత వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి గౌరవార్థం దేశ రాజధానిలో జరిగే కార్యక్రమానికి తెలుగు రాష్ర్టాల పార్లమెంటు సభ్యులను ఆహ్వానించాలి కదా.. అలా జరగలేదు. తెలుగు దేశం పార్టీ ఎంపీలు, ఆ పార్టీ నాయకులకు అనుకూలంగా ఉన్న ఎంపీలు, మరికొందరికి మాత్రమే ఆహ్వానాలు అందాయి.
ఇది పూర్తిగా అసంబద్ధం. ఇది ఏమాత్రం అంగీకారం కాదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు ఇతర పార్టీల అధ్యక్షులను కూడా ఆహ్వానించాలి కదా? ఏ స్థాయిలో నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు? అయన పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించటం లేదు. తన స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన రాజ్యసభ సభ్యులుగా వచ్చారా లేక బీజేపీ అధ్యక్షులుగా వచ్చారా? రాజ్యసభ సభ్యులుగా వస్తే మరి మిగిలిన సభ్యులను ఆహ్వానించారా? బీజేపీ అధ్యక్షులుగా వస్తే మరి మిగిలిన పార్టీల అధ్యక్షులను పిలిచారా? ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కదా.. అందువల్ల రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించాలి కదా! ‘ఇది మా నాన్న గౌరవార్థం జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అంతా నా ఇష్టం’ అన్న రీతిలో జరిగింది. ఇటువంటి చోద్యానికి రాష్ట్రపతి భవన్ వేదిక అవ్వటం, ఈ వివాదంలోకి రాష్ట్రపతిని లాగటం విచారకరం. కానీ దీనికి ఎవరు బాధ్యులు? ఎవరు సమాధానం చెప్పాలి ఈ గందరగోళానికి?
రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాలు అన్నీ ప్రధాన మంత్రి కార్యాలయం కనుసన్నలలోనే జరుగుతాయనేది జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ కుటుంబంలో అనేక వివాదాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా ఎన్టీఆర్ గౌరవార్థం జరిగే కార్యక్రమంలో ఆయన భార్యకు ఆహ్వానం లేకపోవటం విస్మయం కలిగించే విషయం. రాజకీయ పలుకుబడితో ప్రోటోకాల్ను, రాజ్యాంగ విలువలను గాలికి వదిలేసి జరిపిన కార్యక్రమంగా ఉంది ఈ వేడుక. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపే నాయకులకు రాజకీయంగా ఏది ప్రయోజనం కలిగిస్తే అదే చేస్తారు. అందులో మంచి, చెడు అన్న విచక్షణ గురించి ఆలోచించరు అనేది అర్థమవుతున్నది. ఇది రాజ్యాంగాన్ని నిమ్న స్థాయి రాజకీయాలకు బలి చెయ్యటం తప్ప ఇంకేమీ కాదు అనేది స్పష్టంగా తెలుస్తున్నది.
విచిత్రమేమిటంటే మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం పేరుతో వేడుకలు చేస్తున్నది. కానీ ఈ వేడుకలను బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవార్థం చేస్తున్నామని సామాజిక న్యాయ శాఖ చేసిన ప్రభుత్వ ప్రకటన చెప్తున్నది. ఇదేనా బాబాసాహెబ్కు మనం చూపించే గౌరవం? ఇదేనా రాజ్యాంగం పట్ల పాలకులకున్న గౌరవం? రాష్ట్రపతి ఈ ఘోరాలన్నీ చూస్తూ కూడా నోరు మెదపలేకపోవటం మరీ దురదృష్టకరం. ఈ సంఘటనలు రాష్ట్రపతి నిస్సహాయతను వేలెత్తి చూపుతున్నాయి అనటంలో సందేహం లేదు.
-గుమ్మడిదల రంగారావు