విద్యుత్ ప్రవాహ వేగంతో అభివృద్ధి చెందుతూ హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన, అత్యున్నత మౌలిక సదుపాయాల్లో కరెంటు అత్యంత ప్రధానమైనది. నిరంతరాయ విద్యుత్తు సరఫరా లేని నగరంలో అభివృద్ధిని ఆశించలేం. 2012వ సంవత్సరం అనుకుంటాను. హైదరాబాద్ నగరంలో పగలు 2 గంటలు, సాయంత్రం 2 గంటలు కరెంటు కోతలు అమలవుతున్నాయి. పారిశ్రామిక వాడలకు, ఐటీ కంపెనీలకు వారంలో రెండు రోజులు ‘పవర్ హాలిడే’.
ఓ రోజు ఉదయం ఒక పారిశ్రామికవేత్త పోన్జేసి ‘మీరు 2 రోజులు పవర్ హాలిడే ఇస్తున్నారు. పరిశ్రమ ఆవరణలో నివాసం ఉంటున్న కార్మికులు నీళ్లు పట్టుకోవడానికిగాను గంటసేపు కరంటు ఇవ్వగలరా?’ అని అభ్యర్థించారు. ఉన్నతాధికారులు ఇవ్వకూడదన్నారు. 15 నిమిషాల కంటే ఎక్కువ కరెంటు ఇస్తే ఫీడర్ మీటర్లలో రికార్డవుతుంది. దీనికితోడు నిబంధనలు ఉల్లంఘించి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీర్లు కరెంటు ఇస్తున్నారా అని విజిలెన్స్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేసేవారు. కరెంటు ఇవ్వకుండా మాకు ఎన్నో ఆంక్షలు. కరెంటు కోతల గురించి ప్రశ్నించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ‘కిటీకలు తెరిస్తే గాలి ఆడుతుంది’ అంటూ శాస్త్రీయ, సాంకేతిక ఉచిత సలహాలు ఇచ్చేవారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క ఏడాదిలోగా పరిస్థితులను తారుమారు చేసేశారు. రాష్ర్టాభివృద్ధికి గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరంలో అన్నివర్గాల వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్తు సరఫరా గావించడానికి అవసరమైన ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను పటిష్ఠపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తక్కువ సమయంలోనే నిర్మించింది. హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత జనసమ్మర్దం ఉండే రాయదుర్గం ప్రాంతంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ (జీఐఎస్)గా పిలవబడే 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ, 33 కేవీ సబ్స్టేషన్లు నిర్మాణమయ్యాయి. ఇవన్నీ ఐదెకరాల కనీస విస్తీర్ణంలో నిర్మించడం అభినందనీయం. తక్కువ స్థలంలో, తక్కువ సమయంలో నిర్మించడానికి అవకాశం ఉన్న మోనోపాల్ టవర్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని మొదటిసారి వినియోగించి ఈ సబ్స్టేషన్లో 500 మెగా వోల్ట్ ఆంపియర్ సామర్థ్యం కలిగిన రెండు పవర్ ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పారు. భవిష్యత్తులో మరో రెండు పవర్ ట్రాన్స్ఫార్మర్లు బిగించనున్నారు. తద్వారా హైదరాబాద్ నగరానికి 2000 మెగావాట్ల అదనపు ట్రాన్స్మిషన్ సామర్థ్యం చేకూరుతుంది. అదేవిధంగా 220 కేవీ సబ్స్టేషన్లో 160 ఎంవీఏ సామర్థ్యం కలిగిన మూడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 132 కేవీ పరిధిలో 80 ఎంవీఏ సామర్థ్యం ఉన్న మూడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు బిగించారు. రాబోయే ఇరువై ఏండ్లలో ఏర్పడబోయే సుమారు 1600 మెగావాట్ల విద్యుత్ అవసరాలను తీర్చడమే ప్రధాన ధ్యేయంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.
హైదరాబాద్ నగరం చుట్టూ తొమ్మిది 400 కేవీ సబ్స్టేషన్లు మల్కారం, ఘణపూర్, మామిడిపల్లి, మహేశ్వరం, కేతిరెడ్డిపల్లి, శంకర్పల్లి, గజ్వేల్, నర్సాపూర్లో ఏర్పాటుచేయడంతో వలయాకార గ్రిడ్ నిర్మాణం పూర్తయ్యింది. దీంతో అత్యంత పకడ్బందీ వ్యవస్థ నడుమ హైదరాబాద్ నగరం సురక్షితంగా ఉంటున్నది. డిస్ట్రిబ్యూషన్ రంగం విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో అద్భుత, అనితర సాధ్యమైన ఫలితాలను సాధించింది. ప్రజలతో నిరంతరం ప్రత్యక్ష సంబంధాలుండే డిస్కం 58 లక్షల మంది నగర ప్రజలకు సేవలందిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 316 ఉండగా, 11 కేవీ ఫీడర్లు 3,194 ఉన్నాయి. వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్తు సరఫరాలో ఎస్సీఏడీఏ పాత్ర గణనీయమైనది. జీహెచ్ఎంసీ పరిధిలో 4,982 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 1009 అదనపు ట్రాన్స్ఫార్మర్లు, 21,658 కిలోమీటర్ల 11 కేవీ లైన్లు నిర్మించుకున్నాం. హైదరాబాద్ పరిధిలో 1,39,610 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా 56,229 కిలోమీటర్ల ఎల్టీ లైన్లున్నాయి.
2014కు 2,261 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదవ్వగా 2023 మే 19న జీహెచ్ఎంసీ పరిధిలో 3,756 మెగావాట్ల రికార్డు డిమాండ్ నమోదయ్యింది. కరోనా కాలం మినహాయిస్తే విద్యుత్ వినియోగం 12 శాతానికి పైగా ఏటా పెరుగుతున్నది. అభివృద్ధి చెందిన నగరాలతో సమానంగా దీన్ని పేర్కొనవచ్చు. హైదరాబాద్ పరిధిలో విద్యుత్తు పంపిణీ మెరుగు కోసం ప్రభుత్వం రూ.3,313 కోట్లు వెచ్చించింది. వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్తు సరఫరా నిమిత్తం వేల కోట్ల రూపాయలు వెచ్చించడమే కాకుండా గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు పారదర్శకంగా అత్యున్నత ప్రమాణాలతో సేవలందించడానికి ఎన్నో వినూత్నమైన పద్ధతులను అవలంబిస్తున్నది.
వినియోగదారుల సేవా కేంద్రాలు, నూతన కనెక్షన్, అదనపు లోడు పేరు, క్యాటగిరీ మార్పు అన్ని సేవలను ఆన్లైన్లోనే అందిస్తున్నది. మానవ ప్రమేయం లేకుండా బిల్లింగ్, మొబైల్ యాప్లు, సాస (ఎస్ఏఎస్ఏ), ఆన్లైన్ చెల్లింపులు వివిధ మార్గాల ద్వారా సులభమైన పద్ధతుల్లో, సెల్ఫ్ మీటర్ రీడింగ్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్, కన్జ్యూమర్ కాల్ సెంటర్, సీజీఆర్ఎఫ్ పోర్టల్ ఇలా ఎన్నో పద్ధతుల ద్వారా వినియోగదారులకు సత్వరమైన సేవలందిస్తున్నది. అంతేకాకుండా..
సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, నాయీబ్రాహ్మణ, రజక వృత్తుల వారికి నెలకు 250 యూనిట్లను సబ్సిడీలో అందిస్తున్నది.
వినియోగదారుడి చెంతకు కరెంటు చేరుకునేలోగా ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డిలతో పాటు అహర్నిశలు అజ్ఞాతంగా పనిచేసే వ్యవస్థలు, ఉద్యోగులు చాలామందే ఉంటారు. ఎస్సీఏడీఏ, సీబీడీ సెంట్రల్ బ్రేక్డౌన్ టీంలు, ఫ్యూజ్ ఆఫ్ కాల్ సిబ్బంది, హెచ్టీ లైన్లలో పనిచేసే సిబ్బంది, లోడ్ మానిటరింగ్ సెల్ ట్రాన్స్ఫార్మర్లు రిపేరింగ్ చేసేవారు, మాస్టర్ ప్లాన్, కన్స్ట్రక్షన్ వింగ్, ప్రొటెక్షన్ వింగ్ ఇలా ఎంతోమంది కష్టాల ఫలితంగా నిర్మితమైందే నేటి 24/7 గంటల కరెంటు వ్యవస్థ.
(వ్యాసకర్త: టీఎస్ఎస్పీడీసీఎల్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు)
-తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313