ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలనుకునే రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు రాష్ట్ర బడ్జెట్ను అనుసరించి అభివృద్ధి సంక్షేమాలను ప్రజల ముందు మ్యానిఫెస్టోల రూపంలో వెల్లడిస్తారు. తద్వారా ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సందర్భంలోనే ఆయా పార్టీల అసలైన స్వభావం ప్రజలు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఆయా పార్టీల మ్యానిఫెస్టోలు.. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాలను సంతులితం చేస్తూ రూపొందించవలసిన అవసరం ఉంటుంది.
తెలంగాణలో తొలి ఎన్నికల నుంచి కూడా ఆయా పార్టీ లు సంక్షేమరంగానికి పెద్దపీట వేస్తూ పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలను ప్రకటించి ఎన్నికలకు వెళ్లాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మిగిలిన అన్ని పథకాలు టీఆర్ఎస్తో సమానం గా ప్రకటించినా, రైతు రుణమాఫీ విషయంలో రూ.2లక్షల వర కు మాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ, ప్రజలు టీఆర్ఎస్కే పట్టంగట్టారు. అయితే చాలామంది టీఆర్ఎస్ ప్రకటించిన సం క్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని, ఆ బడ్జెట్తో ఈ సంక్షేమ పథకాలు ఎవరూ ఇవ్వలేరని భావించారు, విమర్శించారు. కానీ టీఆర్ఎస్ అన్నిరకాల సంక్షేమ పథకాలను అమలు చేసింది.
రెండోసారి అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్తు లాంటి పెద్ద ప్రాజెక్టులతో బడ్జెట్ అంతా ఖర్చయి తెలంగాణకు సమస్యలు తప్పవని, దానివల్ల సంక్షేమ పథకాలు నిలిచిపోవడమో లేదా ప్రాజెక్టులు ఆగిపోవడమో జరుగుతుందని అందరూ అనుకున్నారు. అయినా ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను కొనసాగించింది.
ఆ తర్వాత 2020లో వచ్చిన కరోనా సందర్భంలోనూ వీటిని ముందుకు తీసుకువెళ్లటం సాధ్యం కాదేమోనని భావించారు. వాస్తవంగా దేశమంతా ఆర్థికంగా అతలాకుతలమై ఆయా ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి చూశాం. అయినప్పటికీ తెలంగాణలో వాగ్దానం చేసిన అన్ని ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు పూర్తిగా ప్రజలకందించి తెలంగాణలో ఒక సమర్థవంతమైన సుస్థిర పాలన అందించింది. అభివృద్ధి సంక్షేమ రాజకీయాలు సమర్థ వంతమైన పాలనకు గీటురాయి.
కరోనా ప్రభావంలో కూడా ప్రకటించిన పథకాలు, అభివృద్ధి పనులకు తోడు దళిత బంధులాంటి భారీ బడ్జెట్తో కూడుకున్న పథకాలను కూడా ప్రకటించి ప్రజలను, రాజకీయ పార్టీలను ఆశ్చర్యపరిచారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దళితబంధు అందరికీ ఇవ్వరన్న ఆరోపణలను పటాపంచలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆ పథకాన్ని దశలవారీగా విజయవంతంగా అమలుచేస్తూ దేశమే ఆలోచించేలా చేశారు.
కరోనా లాంటి సంక్షోభ సందర్భంలో కూడా ఆర్థిక పురోగతి ఎలా సాధ్యపడింది. సంక్షేమ పథకాలకు సంపద ఎలా చేకూరిందని విశ్లేషిస్తే ఏవైతే ప్రజలను సోమరులను చేస్తున్నారని విమర్శలకులోనైన ఆ సంక్షేమ పథకాలే తెలంగాణలో ప్రజల వినియోగ స్థాయిని పెంచి పెద్దమొత్తంలో పన్ను చెల్లించేవారిగా చేసి తెలంగాణ ఆర్థికవ్యవస్థ పురోగమించేలా చేశాయి.
కేవలం ఎన్నికల తాయిలాలుగానే సంక్షేమ పథకాలు ప్రకటించి ఉంటే ఇలాంటి ఆర్థిక పరిపుష్టి రాకపోగా రాష్ట్రం మరింత వెనుకపడేది. కానీ, ఏ సంక్షేమ పథకం ప్రకటించినా అది ఆయా లబ్ధిదారుల జీవితాలకు ఒక స్వావలంబన అయ్యేవిధంగా పథకాల రూపకల్పన చేయడం వల్ల ఆయా పథకాలు ప్రజల సమగ్ర ఆర్థిక పరిపుష్టికి దోహదపడ్డాయి. అది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడింది. ఇలా సంపద సృష్టించడంతో పెరిగిన సంపదను తిరి గి పేదవర్గాల సముద్ధరణకు ఖర్చుచేయటం అన్న ఒక కొత్త పం థాను నిర్దేశించింది టీఆర్ఎస్ పార్టీ. ప్రస్తుత ఎన్నికలు పదేండ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్, బీజేపీలకు చాలా కీలకం కనుక ఆ పార్టీలు ఎన్నో వినూత్న పథకాలు ప్రారంభించబడ్డ తెలంగాణ గడ్డమీద తాము ఎన్నడూ ఎక్కడా అమలుచేయని పథకాలను మ్యానిఫెస్టోల్లో ప్రకటించి ముందుకువచ్చాయి. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు వాగ్దానాలను తలదన్నేలా ప్రజా ఆకర్షక మ్యానిఫెస్టోను రూపొందించి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడింది బీఆర్ఎస్.
రైతుబంధు పథకాన్ని రాబోయే ఐదేండ్లలో 16 వేలకు పెంచుతామని, ఉచిత విద్యుత్తును, ధాన్యం కొనుగోలును కొనసాగిస్తామని రైతులకు భరోసా కల్పించారు. రైతుబీమా ఉండనే ఉన్నది. కేసీఆర్ బీమా అందరికీ ధీమా అనే పథకంతో భూమిలేని కూలీలకు, కౌలు రైతులకు, పేదలకు కూడా ఒక భరోసా ఇస్తూ, ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.15 లక్షలకు పెంచడం పేదల ఆరోగ్యానికి ఒక గ్యారెంటీ ప్రకటన. వృద్ధులకు 5వేలు, వికలాంగులకు 6వేల వరకు ఆసరా పింఛను పెంచబోతున్నట్టు ప్రకటించి బలహీనవర్గాలకు భరోసా ఇచ్చారు. ముఖ్యంగా సమాజంలో సగంగా ఉన్న స్త్రీలకు ఆర్థిక స్వావలంబన కల్పించటం కోసం తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇది అమలైతే సమాజంలో గొప్ప పురోగతిని చూడగలుగుతాం. ఈ మొత్తాన్ని మహిళలకు ఇవ్వటం వల్ల నూటికి నూరుశాతం సద్వినియోగమవుతాయి.
ఆ కుటుంబ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. అదే బీఆర్ఎస్కు ఇతర పార్టీలకు పథకాల రూపక్షల్పనలో ఉన్న తేడా. బీఆర్ఎస్ రూపొందించిన పథకాలకు ఆర్థిక పురోగమన లక్షణాలు ఉండటం విశేషం. ప్రతి పథకం సామాజిక ఆర్థిక రుగ్మతలను రూపు మాపేదిగా ఉండేలా రూపొందించడం ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే సాధ్యమైంది.
తెలంగాణ ప్రజలు కేవలం వాళ్లకేదో రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి ఎక్కువ లబ్ధి చేస్తే చాలనుకునేంత అమాయకంగా ఉన్నారనుకోలేం. సంక్షేమ పథకాల ప్రకటనలే కాక వాటి సాధ్యాసాధ్యా లు వాటిని అమలుచేయగల అనుభవం, సత్తా ఉన్న నాయకుడు, పార్టీ, వారి పూర్వపు ఆచరణ అంత పరిశీలించకుండా ఉంటారనుకోవడం సాహసమే. కాబట్టే రాజకీయ నాయకులు ఏ అవకాశాన్ని, సందర్భాన్నీ నిర్లక్ష్యం చేయకుండా ప్రజల శాశ్వత పురోభివృద్ధికి కృషిచేయాలి. లేకుంటే రాజకీయ అధికారం అందని ద్రాక్షే అవుతుంది.
(వ్యాసకర్త:తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు)
– మల్లావజ్జల విజయానంద్ 79895 25848