తెలంగాణను అవమానించటాన్ని మోదీ హయాంలో బీజేపీ ఒక విధానంగా పెట్టుకున్నది. ఎన్నో త్యాగాలతో, ఎంతో పోరాటంతో తెలంగాణను సాధించుకుంటే..రాష్ట్ర ఆవిర్భావాన్నే అవమానించేలా ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతారు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనాలని అడిగితే తీసుకోకుండా, తెలంగాణ ప్రజలు నూకలు తినాలంటూ కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ అపహాస్యం చేస్తారు. ఇదే వైఖరిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటులో ప్రదర్శించారు. తెలంగాణ వాళ్లు మాట్లాడే భాష సరికాదంటూ, కమ్జోర్గా ఉంటుందని అవమానించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి తెలంగాణ తాకత్ ఏమిటో తెలియజెప్పాల్సిన అవసరం ఉంది.
మనసులోని భావనను బహిర్గతపరిచేదే భాష. భాషలో అల్ప, మహా ప్రాణాక్షరాలు ఉంటాయే తప్ప.. ఏ భాషకూ అల్పత్వం ఉండదు. అలా ఉందనుకునేవారే అల్పులవుతారు. కానీ.. ఎవరికైనా సరే మాతృభాషను మించినది లేదు. అందుకే ‘మాతృభాషను ప్రేమించు.. పరభాషలను గౌరవించు’ అన్నారు పెద్దలు. అదే బాటలో, తెలంగాణలో పుట్టి పెరిగిన ఎందరో మాతృభాషను ప్రేమిస్తూనే.. పరభాషలపై పట్టు సాధించారు. అనేకానేక రచనలు, గ్రంథాలు రచించారు. వివిధ రంగాల్లో రాణించి తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేశారు.
మన విద్యాభూషణుడు గుండేరావు హర్కారే (జననం: 1887)
హైదరాబాద్లో జన్మించిన గుండేరావు హర్కారే బహుబాషావేత్త. నిజాం కాలంలో న్యాయస్థానంలో గుమస్తాగా పనిచేసి అరబ్బీ, పార్సీ, తెలుగు, మరాఠీ, కన్నడం, ఇంగ్లిష్, సం స్కృత భాషల్లో విశేష ప్రజ్ఞ సంపాదించారు. అనే క ఇంగ్లిష్, అరబ్బీ, పార్సీ, తెలుగు ప్రాచీన, ఆధునిక గ్రంథాలను సంస్కృతంలోకి అనువదించా రు. మరాఠీ సాహిత్య చరిత్రను తెలుగులోకి అనువదించారు. ఈశ, కౌన, కఠోపనిషత్తులపై కారికలు, ప్రత్యయకోశము అనే పేరుతో సంస్కృత వ్యాకరణ గ్రంథం రాశారు.
డాక్టర్ ఆఫ్ లిటరేచర్ బూర్గుల రామకృష్ణారావు (జననం:1899)
మహబూబ్నగర్ జిల్లా బూర్గుల గ్రామంలో పుట్టిన పుల్లంరాజు రామకృష్ణారావు ఇంటిపేరే బూర్గులగా ప్రసిద్ధి చెందింది. బహుభాషా కోవిదుడిగా, రచయితగా, కవిగా, పండితుడిగా పేరు గడించారు. తెలంగాణ సమాజాన్ని చైతన్య పథంలో నడిపించిన మేధావి. తెలుగు, పార్సీ, ఉర్దూ, హిందీ, ఆంగ్లం, కన్నడం, మరాఠీ, సంస్కృత భాషలలో ఎనలేని పాండిత్యం కలిగిన వ్యక్తి. హైదరాబాద్ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ఉర్దూ, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ పంచభాషా కవిసమ్మేళనాలు నిర్వహించిన ఘనత ఆయనది. ఉమర్ ఖయ్యూం రుబాయిల్ని అనువదించిన ఆయన.. పండిత రాజ పంచామృతాన్ని తెలుగు ప్రజలకు చేరువ చేశారు. సౌందర్యలహరి, కనక ధారాస్తవమును తెలుగులోకి అనువదించారు. సంస్కృతంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకాలు రచించారు. తెలంగాణ రచయితల సంఘం, ఆంధ్ర మహాసభ, దక్షిణ భారత హిందీ ప్రచారసభ, సంస్కృత పరిషత్ వంటి సంస్థల పురోగతికి ఎనలేని కృషి చేశారు.
సినీ వినీలాకాశంలో ధ్రువతార పైడి జైరాజ్ (జననం : 1909)
కరీంనగర్లో జన్మించిన పైడి జైరాజ్ అసలు పేరు పైడిపాటి జైరుల నాయుడు. భారత కోకిల సరోజినీ నాయుడు భర్త ముత్యాల గోవింద రాజులు నాయుడుకు జైరాజ్ స్వయానా మేనల్లుడు. చిన్నతనంలోనే హైదరాబాద్కు రావడంతో ఆయన విద్యాభ్యాసం మొత్తం అక్కడే కొనసాగింది. కుటుంబ సభ్యులు కాదన్నా సరే.. సినిమా రంగంలోకి ప్రవేశించారు. 1930లో జగ్ మగాతీ జవానీ అనే మూకీచిత్రంతో అరంగేట్రం చేశారు. హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, భోజ్పురీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించినా.. మాతృభాష అయిన తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. హీరో, విలన్, దర్శకత్వం, నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్, అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ కెమెరామన్ , టీవీ సీరియళ్ల దర్శకత్వం.. ఇలా వివిధ విభాగాల్లో బహుముఖ ప్రతిభ కనబర్చారు. ఆయనకు 1980లో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
సాహిత్య శిరోమణి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి (జననం: 1911)
మహబూబ్నగర్ జిల్లా వనపర్తి సంస్థానంలో జన్మి ంచారు. దేశంలోని సంస్కృత మహావక్తల్లో ఒకరైన ఆయన.. తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, హిందీ, ఉర్దూ భాషల్లోనూ గొప్ప పండితుడు. సంస్కృత మహాభారతాన్ని తెలుగు వచనంలోకి మార్చారు. తెలుగు సంస్కృత కోశం, సంస్కృత వాచకం రాశారు. ఉర్దూ, హిందీ, మరాఠీ భాషల్లోని చాలా గ్రంథాలను అనువదించారు. బ్రహ్మభూషణ, మహా మహోపాధ్యాయ, వేదాంత శిరోమణి వంటి బిరుదులున్నాయి.
తెలుగుకు కొత్త వెలుగు కాళోజీ (జననం: 1914)
ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రాంరాజా కాళోజీ వరంగల్ జిల్లా మడికొండ వాస్తవ్యులు. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లిషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. తెలంగాణకు తొలి పొద్దుగా నిలిచి.. భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందిన గొప్ప వ్యక్తి. ‘నా గొడవ’ పేరిట సామాజిక సమస్యలపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించారు. ఆయన జయంతినే తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
నవ తెలంగాణ జాగృతి కోసం మఖ్దూం మొహియుద్దీన్ (జననం: 1908)
మెదక్ జిల్లా ఆందోల్లో జన్మించారు. భూస్వాముల ఆగడాల్లో నలిగిపోతున్న తెలంగాణను జాగృతం చేయడంతోపాటు, నవ తెలంగాణ నిర్మాణం కోసం ఎన్నో రచనలు చేశారు. ఇంగ్లిష్, ఉర్దూ, పార్సి, హిందీ భాషల్లో నిష్ణాతుడు. గొప్ప కవి, రచయిత, సాహితీవేత్త, మానవతావాదిగా గుర్తింపు పొందారు. తెలంగన్, సిపాయి, అంధేరా, రాత్ కె బరాబరే వంటి కావ్య ఖండికలు, గేయాలు ప్రసిద్ధి పొందాయి.
భారతీయ భాషల్లో ప్రావీణ్యం నలిమెల భాస్కర్ (జననం: 1956)
కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణ్పూర్లో జన్మించారు. తెలుగు, హిందీ, ఆంగ్లంతోపాటు మొత్తం 14 భాషల్లో పట్టుంది. తొలుత ‘30 రోజుల్లో కన్నడ నేర్చుకోవడం ఎలా?’ అన్న పుస్తకాన్ని చదువుతూ కన్నడ భాష మీద పట్టు సాధించారు. ఆ తర్వాత ఏడాదికో భారతీయ భాషను నేర్చుకొని ప్రావీణ్యం సాధించారు. పలు భారతీయ భాషల్లోని కథలను తెలుగులోకి అనువదించారు. స్మా రక శశిగల్ అనే మలయాళ నవలను తెలుగులోకి అనువదించినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.
కవితాన్వేషి వారాల ఆనంద్ (జననం: 1958)
కరీంనగర్ జిల్లా వేములవాడలో జన్మించారు. ఇరుగు-పొరుగు శీర్షికన ఇప్పటి వరకు 17 భారతీయ భాషల నుంచి 70 కవితలను అనువదించారు. ప్రముఖ హిందీ కవి గుల్జార్ ‘గ్రీన్స్ పోయెమ్స్’ను ‘ఆకుపచ్చ కవితలు’ పేరిట తెలుగులోకి అనువదించారు. దీనికి ఇటీవలే అనువాద రచనల విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
చివరగా.. నాడు దాశరథి
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని అన్నారు. కానీ ఇప్పుడది నాలుగు కోట్ల రతనాల వీణ. అలాంటి వీణలో ఇప్పుడు మీకు చెప్పింది 11 రత్నాల గురించే.. కానీ.. మన రాష్ట్రంలో వెతికితే ఇంటికో రత్నం దొరుకుతుంది. వారిలోని ప్రావీణ్యాన్ని గుర్తించి వెలుగులోకి తీసుకు రావాల్సిన బాధ్యత మనపైనే ఉంది.
బహు భాషావేత్త-పి.వి.నరసింహారావు (జననం: 1921)
కరీంనగర్ జిల్లా వంగరలో జన్మించారు పాములపర్తి వెంకట నరసింహారావు. హైస్కూలు పూర్తయ్యే సరికే తెలుగు, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో నైపుణ్యం సంపాదించిన ఆయన.. తెలుగు సహా 17 భాషలు ధారాళంగా మాట్లాడగలిగిన వ్యక్తి. అపర చాణక్యుడు, మౌనముని, సంస్కరణల పితామహుడు, సాహితీవేత్త, బహుభాషావేత్తగా పేరొందిన ఆయన.. వేయిపడగలు వంటి తెలుగు మహారచనను హిందీలోకి అనువదించారు. దేశ రాజ్యాంగాన్ని హిందీలోకి తర్జుమా చేసిన ఘనత కూడా పీవీదే. హిందీలో సిద్ధార్థ వర్డ్ ప్రాసెసర్ను తయారు చేయించిన పీవీ.. ఆ తర్వాత లిపి వర్డ్ ప్రాసెసర్తో హిందీలో డీసీఏ ప్రారంభించారు. అలా భారతీయ భాషలతో కంప్యూటర్ కూడా నడుస్తుందని నిరూపించిన మేధావి ఆయన. కేంద్రమంత్రిగా ఒక సందర్భంలో చెన్నై వెళ్లి, అక్కడ తమిళం అర్థం కాకపోవటంతో, తిరిగి హైదరాబాద్ వచ్చేలోపు పట్టుబట్టి, కొన్ని గంటల్లోనే ఆ భాషను నేర్చుకున్నారు పీవీ.
తెలుగు తేజం.. జ్ఞానపీఠం సి. నారాయణరెడ్డి (జననం: 1931)
కరీంనగర్ జిల్లా హన్మాజీపేట గ్రామంలో జన్మించారు. మాధ్యమిక విద్య నుంచి డిగ్రీ వరకు ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఓయూ నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ, డాక్టరేటు పట్టా పొందారు. అనంతరం అధ్యాపకుడిగా పని చేశారు. ఆయన రచించిన ‘ఆధునికాంధ్ర కవిత్వం-సంప్రదాయాలు, ప్రయోగాలు’ అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరొందింది. సినారె రచించిన ఎన్నో గ్రంథాలు ఇంగ్లిషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం తదితర భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయన కూడా స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో చాలా కవితలల్లారు. దక్షిణాది నుంచి రాజ్యసభ సభ్యులుగా నియమింపబడిన తొలి కవి సినారె. మూడు వేలకు పైగా సినిమా పాటలు రాశారు. విశ్వంభర అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు.
ఎల్లలు దాటిన జర్నలిజం ముద్దు రామకృష్ణయ్య (జననం: 1907)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించారు. పేదరికంలో పుట్టి కూడా అనేక వ్యయప్రయాసల కోర్చి ఉన్నతవి ద్య కోసం ఇంగ్లండుకు వెళ్లారు. అక్కడ లీడ్స్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికినప్పటికీ, కడుపు నింపుకోవడానికి రైల్వే స్టేషన్లో హమాలీ పని కూడా చేశారు. పరిస్థితులు మెరుగవుతున్న దశలో బీబీసీలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగం లభించింది. అవకాశం ఉన్నా లండన్లో స్థిరపడలేదు. తిరిగి వచ్చాక రెండేండ్లు విజయవాడ రేడియో కేంద్రంలో పని చేశారు. ఆ తర్వాత కరీంనగర్, వరంగల్, నిజామాబాద్లో పనిచేసి.. జగిత్యాలలో హెడ్మాస్టర్గా చేసి, 1965లో రిటైరయ్యారు. విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వేలాదిమంది విద్యార్థుల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన జీవిత విశేషాలతో ‘మార్గదర్శి’ అనే పుస్తకాన్ని ప్రచురించి ఇప్పటికీ ఉచితంగా పంచుతున్నారు ఆయన విద్యార్థులు.