Haritha Haram | ‘వాయూనాం శోధకాః వృక్షాః రోగాణా మపహారకాఃతస్మాత్ రోపణమేతేషాం రక్షణం చ హితావహం’
ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంగా నడిచేకన్నా, ప్రజాఉద్యమంగా సాగినప్పుడే విజయవంతమవుతుంది. తెలంగాణ సాధన ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్కు ఇది బాగా తెలుసు. అందుకని హరితహారం కార్యక్రమంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేశారు.
చెట్లు గాలిని శుద్ధి చేస్తాయి. రోగాలను పారదోలతాయి. అందుకని, చెట్లను నాటడం, పరిరక్షించడం ప్రాణులకు ఉపయోగకరం అని హితవు చెప్పారు పెద్దలు. అడవుల ప్రాధాన్యాన్ని నాడే గుర్తించి హెచ్చరించారు విజ్ఞులు.
నేడు ప్రపంచాన్ని వేధిస్తున్న అత్యంత ప్రధాన సమస్య అడవులు అంతరించడం. అడవులను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకే ముప్పు అని శాస్త్రవేత్తలు ఎంత హెచ్చరించినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. యూరప్ దేశాల్లో నెలకొన్న స్పృహ వల్ల అక్కడి ప్రభుత్వాలపై కొంత ఒత్తిడి వస్తున్నది. దీంతో కొంత ముందడుగు పడింది. కానీ ఇప్పటికీ ఆశించిన లక్ష్యాలను చేరుకోవడం లేదు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలు మాత్రమే చూసుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ‘రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించే ఆలోచిస్తాడు. పరిపాలకుడు భవిష్యత్తరాల గురించి ఆలోచిస్తాడు’ అన్నాడు అబ్రహం లింకన్. నేడు ప్రపంచ దేశాల్లో రాజకీయ నాయకులున్నారే తప్ప పరిపాలకుల్లేరు.
మన దేశ పరిస్థితి కూడా ఇంతే. కానీ, మన ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ మాత్రం పరిపాలకుడిలా ఆలోచిస్తారు. ఆయన భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందిస్తారు. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసినప్పుడు పత్రికల వారు సాధారణమైన రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు వేశారు. కేసీఆర్ ఇందుకు భిన్నంగా దేశం గురించిన ప్రశ్నలు వేయాలని కోరారు. దేశ సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి మాట్లాడే నాయకులు కరువయ్యారు. విలేకరుల సమావేశాలు నాయకుల పరస్పర దూషణలకు వేదికలుగా మారుతున్నాయి. కానీ, కేసీఆర్ అసెంబ్లీ చర్చలను, విలేకరుల సమావేశాలను ఉపయోగకరంగా మార్చాలని భావిస్తుంటారు. ఇది చాలు ఆయన గురించి చెప్పడానికి.
భావితరాల సంక్షేమం కోసం ముందే ఆలోచించే క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మానవాళికి పొంచి ఉన్న ముప్పును గ్రహించారు. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నారు. తన పరిధిలోని తెలంగాణలో శక్తి మేరకు చెట్లు నాటడం, పరిరక్షించే కార్యక్రమాన్ని ఉద్యమ స్పృహతో సాగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో చేపట్టిందే తెలంగాణకు హరితహారం కార్యక్రమం. ఇది ప్రపంచ చరిత్రలోనే చెప్పుకోదగిన పెద్ద ఉద్యమంగా చెప్పవచ్చు. కేసీఆర్ దేనినైనా ఉన్నతస్థాయిలో ఆలోచిస్తారు, ఆచరిస్తారు. హరితహారం కార్యక్రమానికి కూడా భారీ ఎత్తున రూపకల్పన చేశారు. దీని అమల్లో విజయవంతమయ్యారు. నేడు దేశానికి తెలంగాణ ‘హరితహారం’ ఒక రోల్ మాడల్.
ఈ తొమ్మిదేండ్లలో హరితహారం ఫలితాలు అబ్బురపరిచేలా ఉన్నాయి. 2015 నుంచి 2023 వరకు జరిగిన కృషి అసాధారణమైనది. కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఈ స్వల్పకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 273.33 కోట్ల మొక్కలు నాటడం గర్వకారణం.
ఈ హరితహారం నిర్వహణ కోసం ఇప్పటి వరకు 10,822 కోట్లు ఖర్చుచేయడం విశేషం. 13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు జరిగింది. 6,298 ఎకరాల విస్తీర్ణంలో 2,011 బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. 1,00,691 కిలోమీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు విస్తరించుకొని ఉన్నాయి.
కొత్తగా మొక్కలు నాటి అటవీ విస్తీర్ణాన్ని గొప్పగా చెప్పుకోవడం కాదు. అటవీ ప్రాతంలోనే అడవులు అంతరించిన దీనావస్థ ఉన్నదని కేసీఆర్ గమనించారు. అందుకోసం అటవీ పునరుద్ధరణకు కూడా చర్యలు చేపట్టారు. కేసీఆర్ ఏ అంశం చేపట్టినా అన్ని కోణాల్లో ఆలోచించి పక్కా ప్రణాళిక ప్రకారం చేస్తారనేది తెలిసిందే. కేసీఆర్ ఆలోచనల మేరకు 13.44 లక్షల ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అటవీ పునరుద్ధరణ సాగించింది. 1.40 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తిచేసింది. ఈ విధంగా 24.53 కోట్ల మొక్కలను నాటింది. 10,886 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతాల చుట్టూ కందకాల తవ్వకం సాగించింది. అగ్ని ప్రమాదాల నివారణ కోసం 8,740 కి.మీ. మేర ఫైర్ లైన్లు ఏర్పాటుచేసింది. నేల, తేమ పరిరక్షణ కోసం అడవుల్లో పెద ఎత్తున నీటి నిర్వహణ విధానాలను అమలుచేసింది. చెక్డ్యాంలు, చెరువులు, కుంటలు మొదలైన వాటి నిర్మాణం చేపట్టింది. పరిపరివిధాల చేపట్టిన అటవీ పునరుద్ధరణ చర్యలు ఫలితాన్నిచ్చాయి. ఈ పునరుద్ధరణ చర్యల ద్వారా 53.84 కోట్ల మొక్కలు పెరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా నగరాలకు సమీపంలో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుజరిగింది. కాంక్రీట్ జంగిల్స్గా పేరొందిన నగరాల్లో వీటి ప్రాధాన్యం చెప్పవలసిన అవసరం లేదు. ఈ ఉద్యానవనాల్లో నగరవాసులు ఆనందంగా సేద దీరుతున్నారు. దాదాపు 75,740 ఎకరాల్లో ఈ పార్కుల అభివృద్ధి జరిగింది. ఇదేవిధంగా 164 హరితవనాల్లో వంద శాతం పచ్చదనం సాధించేందుకు 1.71 లక్షల ఎకరాల్లో 1.06 కోట్ల మొక్కలను రాష్ట్ర ప్రభుత్వం నాటించింది. భారత అటవీ సర్వే, అడవుల స్థితిగతుల నివేదికల (2021) ప్రకారం రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ 2015-21 మధ్యకాలంలో 6.85 శాతం పెరిగింది. అంటే 3.36 లక్షల ఎకరాల విస్తీర్ణం పెరిగింది. ఇదే కాలంలో రాష్ట్రంలో గ్రీన్కవర్ 7.70 శాతం విస్తరించింది. అంటే 5.13 లక్షల ఎకరాల మేర పెరిగింది. 2011-21 దశాబ్దిలో హైదరాబాద్ నగరం అటవీ పెరుగుదల 146.8 శాతం సాధించింది.
అడవి వృద్ధి చెందిందీ అంటే దాన్ని ఆశ్రయం చేసుకొని జంతువులు, పక్షులు వివిధ జీవరాశులు వృద్ధి చెందుతాయి. ప్రకృతి వైవిధ్యం విలసిల్లుతుంది. జీవ వైవిధ్యానికి తెలంగాణ నిలయం. 2,939 వృక్షజాతులు, 365 పక్షి జాతులు, 103 క్షీరద జాతులు, 28 పాకుడు జీవ జాతులు, 21 ఉభయచర జాతులు, అనేకరకాల అకశేరుకాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ సకల జీవరాశులకు జవం చేకూర్చినట్టయింది.
ఛాయా మన్యస్య కుర్వంతి తిష్ఠంతి స్వయ మాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాః ఇవ అని నీతిశాస్త్రం చెప్తుంది. చెట్టు సత్ఫురుషులలాగా తాము ఎండలో ఉంటూ ఇతరులకు నీడనిస్తాయి. ఇతరుల కోసం ఫలాలనిస్తాయి. మిగతా నాయకుల మాదిరిగా ఏదో మొక్కుబడిగా చేయకుండా పచ్చదనాన్ని నిండుగా పెంచేందుకు.. ఇది నిరంతర ప్రక్రియగా సాగేలా స్థిరపరచాలని కేసీఆర్ భావించారు. కొందరు ఇవాళ చెట్లు నాటుతారు, రేపు ఎండిపోతాయి. కానీ హరితహారం లక్ష్యం అది కాకూడదు. చెట్లు నాటడం, అడవులను సంరక్షించడం అనేది ఒక్కనాటి బాగోతం కాదు. ఇది నిరంతర ప్రక్రియగా సాగినప్పుడే మానవాళి మనుగడ సాధ్యమవుతుంది. అందువల్ల దీనికి నిరంతర కార్యక్రమంగా మార్చడానికి కేసీఆర్ చర్యలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 14,864 నర్సరీలను ఏర్పాటుచేయించారు. గ్రామాల్లో నర్సరీలు నిర్వహించడానికి, చెట్లను పరిరక్షించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయించారు. నీళ్లు పోయించేందుకు ట్యాంకర్లు కూడా ఏర్పాటుచేయించారు. ఇక పంచాయతీరాజ్, పురపాలక చట్టాలను కూడా సవరించి మొక్కలను పెట్టడం, సంరక్షించేందుకు చట్టం చేశారు. 10 శాతం గ్రీన్ బడ్జెట్ పెట్టడంతోపాటు మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్లు, అధికారులపై చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేశారు. రాష్ట్రస్థాయిలో గ్రీన్ఫండ్ ఏర్పాటుచేశారు. దేశంలో ఈ విధంగా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. బహుశా ప్రపంచంలో కూడా ఇలా చట్టం చేసి, ప్రత్యేకంగా 10 శాతం బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం మరొకటి లేదు. కేసీఆర్ ఆలోచన, ఆయన ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయో అనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ఏ కార్యక్రమాన్ని చేపట్టిన దాని అంతిమ ఫలితం అందేవరకు.. గమ్యాన్ని ముద్దాడేవరకు వదిలిపెట్టకపోవడం కేసీఆర్ నైజం. రైతులకు సాగునీటిని అందించేందుకు చేపట్టిన కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఎంతటి సత్ఫలితాలను ఇస్తున్నాయో.. హరితహారం కూడా అదేస్థాయిలో ఫలితాన్నిస్తున్నది.
ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంగా నడిచేకన్నా, ప్రజా ఉద్యమంగా సాగినప్పుడే విజయవంతమవుతుంది. తెలంగాణ సాధన ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్కు ఇది బాగా తెలుసు. అందుకని హరితహారం కార్యక్రమంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేశారు. పాఠశాలలు, పరిశ్రమలు ఎక్కడైనా చెట్లు నాటవలసిందే. పర్యావరణ అవగాహన కోసం బడి పిల్లలకు విస్తృతంగా వనదర్శిని కార్యక్రమాన్ని అటవీశాఖ చేపట్టడం ఈ ఉద్దేశంతోనే. వన సంరక్షణ, పర్యావరణ అభివృద్ధి, నీటి పరిరక్షణ మొదలైన లక్ష్యాలతో ప్రాంతాలకు అనుగుణంగా ప్రజల భాగస్వామ్యం ద్వారా ఉద్యమ రీతిలో అటవీ పరిరక్షణ, విస్తరణ సాగుతున్నది.
ఈ ఉమ్మడి కృషి వల్ల కేసీఆర్ ఆకాంక్షల మేరకు ఈ రోజు హరిత తెలంగాణ సాక్షాత్కారమైంది. గ్రామాలు, నగరాలు, రహదారులు, గనులు, కార్ఖానాలు ఎక్కడైనా పచ్చదనం పరుచుకొని ఉన్నది. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో ‘అశోకుడు మొక్కలు నాటించెను’ అని చదువుకున్నాం. కానీ, నేడు కేసీఆర్ అశోకుడు నాటించిన మొక్కల కన్నా కొన్ని వందల రెట్లు మొక్కలు నాటించారు.
ప్రపంచంలో వృక్ష ప్రేమికులుగా పేరున్న చిప్కో ఉద్యమాన్ని పరిచయం చేసిన సుందర్లాల్ బహుగుణ, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పయాంగ్, హరిత విప్లవ సృష్టికర్త ఎం.ఎస్. స్వామినాథన్ వంటివారికి ఏ మాత్రం తీసిపోని వ్యక్తి కేసీఆర్. హరితహారాన్ని కూడా తెలంగాణ ఉద్యమం స్థాయిలో ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు తెలంగాణనే కాదు, యావత్ దేశంలో అనేక మంది తమ పుట్టినరోజు నాడు మొక్కలు నాటుతున్నారు. అనేక మంది తమ వారు చనిపోతే వారి జాపకార్థం ఒక మొక్కను పెడుతున్నారు. పెళ్లి చేసుకున్నా.. పిల్లలను కన్నా మొక్క పెట్టడం ఒక సంప్రదాయంగా మారుతున్నది. ఫంక్షన్లలో బహుమతులుగా కూడా మొక్కలను ఇచ్చే సంస్కృతి వచ్చింది. ఇది తెలంగాణ నుంచే మొదలైంది. చంద్రుడికో నూలుపోగులా నేను కూడా కేసీఆర్ స్ఫూర్తితో ‘హరితహారం’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర పోషించాలని, ఉడుతాభక్తితో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఇప్పుడు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అనేక మందిని హరితహారంలో భాగస్వామ్యులను చేసింది.
ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు: హరితహారంతో తెలంగాణ సాగించిన కృషికి ప్రపంచం నీరాజనాలు పడుతున్నది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయసంస్థ-అర్బర్ డే ఫౌండేషన్ ద్వారా ఇచ్చే ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’ గుర్తింపును హైదరాబాద్ నగరం 2020లో, 2021లో సాధించింది. నీతి ఆయోగ్ సమీకృతాభివృద్ధి లక్ష్యాల సూచీల్లో, (2020-21) అటవీకరణ విభాగంలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేసే ఉద్యానవన ఉత్పత్తిదారుల అంతర్జాతీయ సంఘం (ఎఐపీహెచ్) హైదరాబాద్ నగరానికి 2022లో గ్రీన్ సిటీ అవార్డును ఇచ్చింది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ దేశవ్యాప్తంగా నగరాల్లో నిర్వహించిన ‘సిటీ నేచర్ ఛాలెంజ్-2023’లో హైదరాబాద్ మొదటిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ అత్యధిక జీవవైవిధ్యం గల నగరంగా గుర్తింపు పొందింది. ఇవి కేసీఆర్ దార్శనికతకు లభించిన అవార్డులుగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద మానవ ప్రయత్నాల్లో తెలంగాణ హరితహారం కూడా ఒకటి కావడం గమనార్హం. గోబీ ఎడారి విస్తరణను అడ్డుకునేందుకు, ఇసుక తుఫానుల నుంచి మానవ ఆవాసాలను రక్షించేందుకు చైనాలో ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా’ పేరుతో 1978లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు 2050లో ముగియనున్నది. దీనికోసం 8 బిలయన్ డాలర్లను ఖర్చుపెట్టి 8.8 కోట్ల ఎకరాల్లో మొక్కలు నాటుతున్నారు.
ఇది తొలి అతిపెద్ద మానవ ప్రయత్నం కాగా… బ్రెజిల్లో అమెజాన్ అడవుల పునరుద్ధరణ కోసం 7.3 కోట్ల మొక్కలను ఆరేండ్లలో నాటేందుకు కార్యాచరణ అమలుచేస్తున్నారు. 75 వేల ఎకరాల్లో ఇది సాగుతున్నది. వీటి సరసన తెలంగాణ హరితహారం చేరింది. మన హరితహారం ప్రపంచంలో మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా కీర్తించబడుతున్నది. ఇలాంటి అద్భుత కార్యక్రమాన్ని చేపట్టిన కేసీఆర్ మానవాళి సంరక్షణలో ముందు నడిచిన మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోయారు. తెలంగాణను హరితబాటలో నడిపించారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.
హరితహారం ద్వారా కేసీఆర్ మనకు కలిసి పనిచేయడం నేర్పారు. మన బాగు కోసమే కాకుండా సమష్టి శ్రేయస్సు కోసం పరిశ్రమించడం అలవాటు చేశారు. కేసీఆర్ స్ఫూర్తితో అందరం మరింత కృషిచేద్దాం. అందమైన భవిష్యత్తులోకి ప్రయాణిద్దాం.
(వ్యాసకర్త: రాజ్యసభ సభ్యులు)
జోగినిపల్లి సంతోష్కుమార్