తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలించినప్పుడు, ప్రజలను మెప్పించేందుకు అభివృద్ధి, సంక్షేమాలు మాత్రమే సరిపోవని అర్థమవుతున్నది. అవి కాకుండా వారింకా కోరుకుంటున్నవి ఏమిటనేది జాగ్రత్తగా గ్రహించి, అందుకు అనుగుణంగా మన పద్ధతులను సవరించుకోవటం అవసరం. దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ మాటలు తెలంగాణకు బీఆర్ఎస్కు మాత్రమే కాదు. ఎక్కడైనా, ఎవరికైనా వర్తిస్తాయి.
తన పదేండ్ల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన చేసిన అభివృద్ధి, సంక్షేమాలు తక్కువ కావు. అందువల్లనే ఇప్పుడు పదేండ్ల తర్వాత ఓటమిలోనూ ప్రజ లు గణనీయమైన స్థాయిలో ఓట్లు, సీట్లు ఇచ్చారు. ఆయా అభివృద్ధి, సంక్షేమాలు అందరి కళ్లెదుట ఉండటమే గాక ఎన్నో రికార్డులు సృష్టించాయి. దేశ విదేశాల్లో అనేక ప్రశంసలు పొందాయి. వీటన్నింటికి తలమానికంగా తెలంగాణ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి అనుగుణమైన స్థాయిలో ప్రజల జీవితాలు పట్టణాలు, గ్రామాల్లో కూడా మెరుగుపడ్డాయి. ఇదంతా ప్రభుత్వ విమర్శకులు సైతం బహిరంగంగా కాకపోయినా జనాంతికంగా అంగీకరిస్తున్న విషయం.
భవిష్యత్తుకు సంబంధించి కూడా అభివృద్ధి, సంక్షేమ రంగాలలో కేసీఆర్ అనేక కొత్త హామీలను ఈ ఎన్నికల సందర్భంగా ఇచ్చారు. అటు ఆ గత పదేండ్ల రికార్డు, ఇటు ఈ కొత్త హామీలు ఉండి కూడా ప్రజలు ఎందువల్ల బీఆర్ఎస్ను అధికారం నుంచి తప్పించారనేది ప్రశ్న. పైన అన్నట్టు జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన కీలకమైన ప్రశ్న ఇదే. ఇందుకు సమాధానంగా పైపైన స్థూలంగా కనిపించేది కొంత ఉండగా, కొంత లోతుల్లోకి వెళ్లి చూడవలసింది మరికొంత ఉన్నది. ఈ రెండింటిని కలిపి చూస్తే తప్ప విషయం సమగ్రంగా బోధపడదు.
స్థూలంగా కనిపించేవి ఈ విధంగా ఉన్నాయి. అవి పలువురు ఇప్పటికే ఎత్తిచూపుతున్నవే. లేదా బీఆర్ఎస్ నాయకత్వం స్వయం గా గుర్తిస్తున్నవే. అందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. రైతుబం ధు లభిస్తున్న లక్షలాది మందిలో అత్యధికులు సంతృప్తిగా ఉన్నా, పెద్ద రైతులకు కూడా ఇవ్వటం నచ్చనివారు అనేకులున్నారు. దళితబంధు ఒక గొప్ప పథకం కాగా, ఆర్థిక పరిమితుల వల్ల అది ఇప్పటికి కొద్ది మందికి మాత్రమే లభించటం, అది కూడా అధికారపక్షం వారి ఆశ్రితులకు మాత్రమేనన్న ఫిర్యాదు, మొత్తమ్మీద పథకం దశలవారీగా ప్రతి ఒక్క దళిత కుటుంబానికి అందగలదని కేసీఆర్ ఎన్నిమార్లు నమ్మకంగా చెప్పినా దళితులు సమాధాన పడకపోవటం మరో కారణం. ఇటువంటిదే బీసీ బంధు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రైవేట్ ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పన దేశంలో మరెక్కడా లేనిస్థాయిలో ఇక్కడ జరిగాయని ప్రభుత్వం గణాంకాలతో సహా పలుమార్లు వివరించినా, యథాతథంగా ఆ అంకెలను ఎవరూ సవాలు చేయకపోయినా, యువకులు తమ నిరుద్యోగ సమస్యతో సతమతమవుతుంటారు గనుక ఈ వివరణలను వారు లెక్కచేయలేదు. అదే విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు. ఇటువంటివన్నీ కలిసి బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి.
పార్టీ నాయకత్వం గుర్తించి ఇప్పటికే సూచనామాత్రంగా మాట్లాడిన లోపాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు, ఉద్యోగ, ఉపాధుల విషయమై వాస్తవాలను యువకులకు కొంతకాలం కిందటినుంచే తెలియజేయటంలో జరిగిన జాప్యం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు లేకపోవటం. రైతుబంధు పరిధి నుంచి పెద్ద రైతులను తొలగించే ఆవశ్యకతను సకాలంలో గుర్తించకపోవటం. దళితబంధు అందనివారికి అందుకు కారణాలను మరింత విస్తృతంగా తెలిపి, రాగల కాలంలో అందగలదని ఇంకా శ్రద్ధగా, వ్యక్తుల స్థాయిలోనూ వివరించకపోవటం వంటివి. ఈ స్థితికి మూలం అతి విశ్వాసం. ఎప్పుడైనా అతి విశ్వాసం ముం దుచూపు తగ్గటానికి, అజాగ్రత్త పెరగటానికి కారణం అవుతుంది.
ఆదివారం సాయంత్రం అంతిమ ఫలితాలు గమనించినప్పుడు, కాంగ్రెస్ గెలుపు, బీఆర్ఎస్ ఓటమి స్పష్టంగానే ఉన్నప్పటికీ, గెలుపోటముల మధ్య ఓట్ల అంతరాలను చూసినట్టయితే, పైన పేర్కొన్న వివిధ పరిస్థితుల విషయమై బీఆర్ఎస్ మొదటినుంచి జాగ్రత్త వహించి ఉంటే పరిస్థితి మరొక విధంగా ఉండేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అందరి ఎదుట కనిపిస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను కాదనలేని స్థితిలో, కాదని ప్రజలను ఒప్పించలేని స్థితిలో, స్వయంగా తనపై గాని, తన రాష్ట్ర నాయకత్వంపై గాని ప్రజలకు ప్రత్యేకమైన విశ్వాసమేదీ లేని పరిస్థితుల మధ్య, ప్రజల్లో గల ఇటువంటి చిన్నా, పెద్దా అసంతృప్తులను తెలివిగా వాడుకొని, రెచ్చగొట్టి, తనకు ఓట్లుగా మలుచుకోగలిగింది. లేని పక్షంలో, బీఆర్ఎస్కు సీట్లు కొన్ని కోల్పోయినా మెజారిటీ లభించి ఉండేది.
బీఆర్ఎస్ ఓటమికి ఇటువంటివి పైకి కనిపించే స్థూలమైన కారణాలు కాగా, పైన అనుకున్నట్టు కొంత లోతులోకి వెళ్తే తోచే ముఖ్యమైన కారణాలు కొన్నున్నాయి. వాటిలో ఒకటి బీఆర్ఎస్ పార్టీకి సంస్థాపరమైనది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యవస్థాపరమైనది కాగా, మూడవది సమాజ పరమైనది. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక పార్టీ పద్ధతి ప్రకారం నిర్మాణమై, ఒక మంచి యంత్రం వలె పనిచేస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వలె వ్యవహరించినట్టయితే అందువల్ల ఒనగూడే ఉపయోగాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు పైన చర్చించిన అంశాలనే పరిగణనలోకి తీసుకుంటే, రైతుబంధు, దళితబంధు, ఉద్యోగ ఉపాధులు, ఇళ్ల వంటి విషయాలను, పార్టీ శ్రేణులకు తగిన శిక్షణ ఇచ్చినట్టయితే పట్టణాల్లో గ్రామాల్లో కూడా ప్రజలకు, యువకులకు ఒకటికి నాలుగు సార్లు వివరంగా చెప్పగలవు. తాము చెప్పలేని ప్రశ్నలు ఏవైనా ఎదురైతే పై స్థాయి నాయకత్వాన్ని సంప్రదించి ఆ పని చేయగలవు. ప్రజల సూచనలు ఏవైనా ఉంటే నాయకత్వం దృష్టికి తేగలవు. ఇదంతా చేయటం వల్ల అసంతృప్తి చెందిన వారిలో కొందరిని సమాధానపరచవచ్చు. మరికొందరికి ప్రభు త్వం పార్టీ తమను పట్టించుకొని మాట వింటున్నాయనే సంతృప్తి అయినా కలుగుతుంది. ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు కూడా ఆయా అంశాలపై తగిన పరిజ్ఞానం, నేర్పరితనం ఏర్పడుతాయి. ఆ విధంగా ఇదొక పద్ధతిగా మారి, ఇటువంటి వాటితో సహా అన్ని విషయాల్లో పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగకరమవుతాయి.
ఇటువంటి పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ నిర్మితమై ఉండినట్టయితే, పైన ప్రస్తావించినటువంటి సమస్యలు గణనీయంగా తగ్గి ఉండేవి. ఒక శాస్త్రీయమైన రాజకీయ పార్టీ ఎప్పుడైనా యుద్ధకాలపు పార్టీ, శాంతికాలపు పార్టీ అని రెండు విధాలుగా పనిచేయాలి. యుద్ధకాలమన్నది ఎన్నికల సమయం, లేదా ఏవైనా సవాళ్లు, ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు. రెండు ఎన్నికలు, లేదా ఏవైనా ప్రత్యేక పరిస్థితుల మధ్యది శాంతికాలమవుతుంది. ఆ సమయాలలో పార్టీ ఇటువంటి నిర్మాణాత్మక, ఉపయోగకర పాత్రను పోషించటం ప్రయోజనకరమవుతుంది స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో కూడా. అటువంటి పార్టీయే బలమైన పునాదులతో, సరైన నిర్మాణంతో ఆటుపోట్లను తట్టుకొని నిలబడుతుంది. ముఖ్యంగా ప్రాంతీయ ప్రయోజనాల కోసం పనిచేసే ఫెడరల్ పార్టీలకు స్వయంగా నిలిచేందుకైనా, జాతీయ పార్టీలను తట్టుకునేందుకైనా ఇది తప్పనిసరి. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు పార్టీ సిద్ధాంతాలలో, విలువలలో శిక్షణ ఇస్తూ పోవాలి. ఇరువై ఏండ్లు దాటిన బీఆర్ఎస్ విషయంలో ఇది ఇంతకాలం ఏం జరిగినా, జరగకున్నా ఇప్పుడు జరగటం అవసరం.
బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం కూడా చేసి ఉండవలసిన మరొక ముఖ్యమైన పని ప్రజా సంబంధాలు, మీడియా సంబంధాలు బాగా నెరపటం. మీడియా సంబంధాలు ఇక్కడే గాక ఢిల్లీ స్థాయిలోనూ అవసరం. ఎందువల్ల? అది లేకపోవటం వల్ల ఉద్యమకాలం నుంచి కూడా జరుగుతున్న నష్టాలు ఏమిటనే వివరాల్లోకి ఇక్కడ పోవటం లేదు. కానీ, ఆ పని ఇప్పటికైనా జరిగితే ఆ నష్టాలు మన్ముందు తగ్గుతాయి. ఈ రెండు విధాలైన సంబంధాల కొరతకు, ఈ విధమైన ఎన్నికల ఫలితాలకు ఎంతో కొంత సంబంధం ఉందనేది విశ్లేషణల్లోకి వెళ్లినట్టయితే అర్థమవుతుంది. ఇక ప్రభుత్వ వ్యవస్థాపరమైన కారణాల్లోకి వెళ్లినట్టయితే, గతంలో ప్రభుత్వంలోని పౌర సంబంధాల శాఖలు క్రియాశీలకంగా, సజీవమైన పాత్రలను పలు విధాలుగా, పలు రూపాల్లో రాష్ట్రస్థాయి నుంచి జిల్లా, మండలస్థాయి వరకు పోషిస్తుండేవి. ఇప్పుడదంతా లుప్తమైంది. ఇది కూడా ఇప్పుడు కొంత నష్టం జేసింది.
ఇక, పైన అనుకున్న సమాజపరమైన కారణాలను దృష్టిలోకి తీసుకున్నప్పుడు ఆసక్తికరమైన విషయాలను గమనించవచ్చు. అవి జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినవి. తెలంగాణలో మొదటి నుంచి గల ప్రజా చైతన్యం, నక్సలైటు ఉద్యమ చైతన్యం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కలిగించిన చైతన్యం, ఆర్థిక సంస్కరణల కాలం నుంచి పెరుగుతున్న అభివృద్ధి, సంపదలు, చదువులు, ఆకాంక్షలు, అవకాశాలు, పట్టణీకరణలు, ఆధునిక మార్పులకు ఎక్స్పోజర్ వంటివి సమాజంలో ఊహించని వేగంతో మార్పులను తెస్తున్నాయి. పట్టణాల్లో, గ్రామాల్లో, అన్నివర్గాల ప్రజల్లో. వాటిలో కొన్ని ప్రస్ఫుటంగా పైకి కన్పిస్తాయి, కొన్ని కన్పించవు గాని ఆయా వర్గాలు, వ్యక్తుల ఆలోచనలను, ప్రవర్తనను ప్రభావితం చేస్తున్నాయి. కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు, సామాజిక సంబంధాలలో మాత్రమే కాదు. తమ చుట్టూ ఉండే సంస్థల నుంచి మొదలుకొని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల వరకు కూడా. సామూహిక ప్రయోజనాలు, అభివృద్ధి, సంక్షేమాలు ఎంత బాగా ఉన్నా.. వ్యక్తి గత లాభాలకు పెద్దపీఠ వేయడం ఒక ధోరణిగా మారి బలప డుతున్నది. వారికి ఎంతజేసినా సంతృప్తి కలగటం లేదు.
ఈ విధమైన పరిణామాలను, నేపథ్య స్థితిని ప్రస్తుత ఎన్నికల పరిస్థితులకు వర్తింపజేసినట్టయితే ఓటర్ల నుంచి వినిపించిన పలు వ్యాఖ్యలను అనేకులు గుర్తించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ చర్యలతో మీకూ లాభం కలుగుతున్నదా అని ప్రశ్నిస్తే, అవును, అయితే ఏమిటి? అన్నది ఎదురు ప్రశ్న. ఇది ఎవరున్నా జరుగుతుంది. వీళ్లుపోయి మరొకరు వచ్చినా. వాళ్ల జేబులోంచి ఇస్తున్నారా. ఇవి బాగున్నా ఇంకొకరు వచ్చి ఇంకా బాగా ఇస్తారేమో. అసలు ఎప్పుడూ ఒకళ్లకే ఎందుకేయాలి ఓటు కొన్ని ఇచ్చి, కొన్ని ఇయ్యకపోతే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే ఎందుకు ఒప్పుకోవాలి. వాళ్లు కొంత తిని మాకు కొంత ఇస్తున్నారు, అంతే కదా. ఇవీ ప్రశ్నలు, వ్యాఖ్యలు. ఎవరో ఒకరు కాదు, అనేకులు. పురుషులు, స్త్రీలు కూడా. వృద్ధులు సైతం. యువతీయువకులు సరే సరి. ఇది కాక, ఈ మార్పులు, ధోరణుల నేపథ్యంలో సోషల్మీడియా ప్రభావం సమాజంపై పెద్ద ఎత్తున ఉంటున్నది.
ఇటువంటి సామాజిక స్థితి గతంలో ఉండేది కాదు. ఈ ధిక్కార ధోరణులు పైన పేర్కొన్న సామాజిక, ఆర్థిక పరిణామాలు, ప్రభావాల వల్ల క్రమంగా రూపు తీసుకుంటున్నాయి. ఇతర చోట్ల కన్న ఎక్కువగా తెలంగాణలో. దీనిని కొందరు సరికొత్త ప్రజాస్వామిక చైతన్యం అని కూడా అంటున్నారు. బీఆర్ఎస్ ఓటమికి ఈ విధమైన పరిణామ క్రమం కూడా ఒక ముఖ్య కారణమైంది. కనుకనే అన్ని పార్టీలు కూడా నేర్చుకోవలసిన విషయాలు కొన్ని ఈ లోతైన సామాజిక పరిణమాలలో కొన్ని ఉన్నాయి.
టంకశాల అశోక్