ఈ దేశంలో పౌరులుగా పుట్టినందుకు ఓటు ఒక్కటే మన జీవితానికి కొలమానమా? రాజకీయాలు, పార్టీలు, ప్రతినిధులు ఇవి మాత్రమే ముఖ్యమా? కాదు కదా! మరి నిజం ఏమిటి? ఏ ప్రాంత ప్రజలైనా జరుగుతున్న పరిణామాలు నిశితంగా గమనించాలె. ఇక తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ సార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిర్వహించిన ప్రతి సభలోనూ చెప్పిన విషయం ఏమంటే.. ‘దయచేసి మీరంతా ఆలోచించాలె. మీ ఇండ్లల్లో తెలిసినవారితో చర్చించాలె’ అని. అంటే కేసీఆర్ సార్ చెప్పింది ఏమిటంటే.. మనల్ని ఎరుక కలిగి ఉండమని. అంతేగానీ, తన గెలుపు గురించి ఆయన ఆలోచించలేదు. ‘జనాలు మోసపోవద్దు’ అన్నదే ఆయన మాటల సారాంశం.
కేసీఆర్ నెత్తి, నోరు కొట్టుకొని చెప్పిన, మనమంచి కోసమే మరీమరీ హెచ్చరించిన విషయం అది. ‘అబ్బా! మనకే ఇన్నిసార్లు చెప్పుడా.. ఇంత చిన్న విషయం మాకు తెల్వదా’ అని అనుకున్నరు ప్రజలు. ఎవుసానికి 24 గంటల కరెంట్, రైతుబంధు, చిన్న జిల్లాలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, గురుకుల విద్యాలయాలు, బస్తీ దవాఖానలు, సకల సౌలత్లు.. అక్రమాలు, దళారీలు, లంచాలు లేకుండా అన్ని పనులు ఆన్లైన్లో జరుగుతుంటే మనకు వాటి విలువ తెల్వలేదు. ‘ఇవి ఏమంత గొప్ప విషయాలా?’ అని అనుకున్నాం కదా! సీన్ మారితే.. ఇవాళ ఏం మాట్లాడాలన్నా అభిమానం అడ్డు వస్తున్నది. ఎందుకంటే తెలిసి చేసిన తప్పు కదా!
నిప్పు కాల్తది అన్న విషయం తెలియని వారుండరు. చిన్నపిల్లలకి కూడా ‘హాయి’ కాల్తది అంటే ‘అమ్మో హాయి హాయి’ అని మనకే మళ్లీమళ్లీ అటు చూపించి చెప్తుంటరు. పదేండ్ల నుంచి తెలంగాణలో ఎంతో క్రమపద్ధతిలో అన్ని పనులు సవ్యంగా జరిగిపోతున్నాయని మనకు తెల్వదా? ఒక్కసారన్నా మనం విశాలంగా ఆలోచించాలె. మనకున్న రెండెకరాల భూమి, మనింట్లో ఉన్న నిరుద్యోగ బిడ్డ, కొడుకు, తాత, అవ్వ.. ఇంతేనా మనం ఆలోచించేది. దివ్యాంగులకు అన్నిరకాలుగా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరడం ఒక ప్రత్యేక అవసరం. కానీ, ఏది ముందు, ఏది వెనుక అనేదాంట్లో కొంచెం వెనుకముందు అవుతాయి పనులు. మనిషికి ముందు నీళ్లే కదా ముఖ్యం. ఆ సమస్యకి ముందుగా సమయం పెట్టడం తప్పు కాదు కదా! ఆ తర్వాత మనందరికీ ముఖ్యమైన ఇంకో సమస్య కరెంట్ కదా. దాన్ని అద్భుతంగా అమలు చేయడం చూస్తిమి, అనుభవిస్తిమి కూడా. ఎక్కువ జిల్లాల ఏర్పాటుతో జిల్లా కేంద్రం దూరం తగ్గి ఇంకొన్ని పనులు చక్కబెట్టుకునే సమయం చిక్కె కదా? కానీ, మనం ‘రైతు ఎవరైనా రైతే’ అన్న ఉదాత్త విషయం మర్చిపోయి ‘ఎకరం భూమి ఉన్న నాకే రైతుబంధు రావాలి. పది, యాభై, వంద ఎకరాల భూమి ఉన్న రైతుకు వచ్చుడు చాలా అన్యాయం’ అని కడుపుమంటతో రగిలిపోతూ లేనిపోని ఆలోచనలన్నీ నెత్తిన పెట్టుకున్నాం.
ఇదే అదునుగా కడుపుమంట ఉన్న మిగతా పెద్దమనుషులు కప్పలలాగా, కాకులలాగా ఒర్రి ఒర్రి ‘ఇది చేస్తాం.. అది చేస్తాం’ అనంగనే మార్పు కావాలి అనుకుంట మోసపోతిమి. ఇప్పుడు చచ్చిన పాముల్లాగా ఉండిపోయినం. ‘ఆలోచించాలె’ అని నెమ్మది మనిషి చెప్పినా ఆలోచించకుండా పెద్దపెద్ద రంకెలు వేసినం. ‘మార్పు మాతోనే’నని మొగ్గు చూపినం. ఇప్పుడు మన అవస్థ ‘కాకి నడక మర్చినం – హంస నడక రాదు’ అన్న చందంగా తయారైంది.
కడుపులో చల్ల కదలకుండా, కూచున్న చోటు నుంచి ఫోన్తోనే బాయికాడి మోటరు చాలు చేసుడు, బంద్ చేసుడు ఉండేది. రైతుబంధు వచ్చి పెట్టుబడికి ఆసరా అవుడు, ఇండ్లల్లో కరెంట్ కష్టాలు తీరిపోవుడు.. ఇలా ఎన్ని? ఒకటని కాదు. వందలసార్లు కేసీఆర్ సారు చెప్పిండు ‘మీరే ఆలోచించండి, చర్చ పెట్టండి’ అని. అవకాశం మనకే ఇచ్చిండు సారు. ఒకసారి ఆలోచిద్దాం, చర్చ చేద్దాం అన్న ఆలోచనే మనకు రాలేదు. వచ్చినా దురభిమానమే ఎక్కువ మనకి. చిన్నప్పుడు మనం వినేది కదా.. కథల్లో, కలల్లో ఒక వ్యక్తిని వెనక్కి చూడకుండా ఫలానా సాధనం ఒకచోట నుంచి ఇంకో చోటుకి తీసుకుపోయేటప్పుడు ‘వెనక్కి చూడకురా నాయనా’ అని చెప్తే కొద్ది దూరం పోంగనే కుతూహలం కొద్దీ వెనక్కి చూసుడు.. ఆ పని చెడిపోవుడు, శాపాలు వగైరా.
ఇప్పుడు మనం అదే పని చేసి కూచున్నం. దాదాపు చాలా సమస్యలు తీరిపోయి 2014 నుంచి హాయిగా ఉంటున్నాం. నీళ్లు, కరెంట్, విద్యాలయాలు, వైద్యాలయాలు, ఇన్నిన్ని సౌకర్యాలతో నిరంతరంగా ముందుకుపోతున్న మనకు మార్పు అవసరమా? ఇవే సౌకర్యాలు చక్కగా కొనసాగితే చాలు అని ఆలోచన చేయకపోతిమి. నిరుద్యోగం గురించి మనం ఎక్కువ ఆశకుపోతున్నాం. ప్రభుత్వంపై ఎక్కువ ఆధారపడుతున్నం. ఏదో ఒకటి ప్రభుత్వమే చేయాలనే మన నిర్ణయం సరైనది కాదేమో! ఎక్కువ వనరులు, ఎక్కువ నిధులు ఉన్న కేంద్రమే నిరుద్యోగ సమస్య గురించి ఏమీ చేయలేనప్పుడు.. ఏ రాష్ట్రం మాత్రం ఇస్తుంది భారీగా ఉద్యోగాలు.
ముందు విషయాన్ని చక్కగా విశ్లేషించుకోవడం మనం అలవాటు చేసుకోవాలె. తెలియకపోతే కుహనా మేధావులను కాకుండా నిష్పక్షపాతంగా ఉండేవాళ్లతో చర్చించాలె. అన్ని తెలుసుకోవాలె. ఓట్లు, రాజకీయాలు, నాయకులు, ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు ఇవి మాత్రమే జీవితం కాదు. జీవితమంటే కొన్ని విలువలు, కొంత ఎరుక, నైతికత, కుటుంబం, ఇరుగుపొరుగు, ఊరు, సమూహం, సమాజం ఎన్నో కలబోసిన సమాహారమే జీవితం. దురభిమానంతో దాన్ని పణంగా పెట్టవద్దు.
-భోజన్నగారి అనసూయ
99898 22494