మన దేశానికి కావాల్సిన విజన్.. బడ్జెట్-2023లో లేదు. ఇంకా చెప్పాలంటే అతుకుల బొంతలాగా ఉంది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు ముందు తాము ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదన్న వాస్తవాన్ని ఆర్థికమంత్రి విస్మరించారు. అంతేకాదు ద్రవ్యోల్బణం, అభివృద్ధి లేమి, నిరుద్యోగం కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సాధారణ ప్రజలను, ఆర్థికరంగంలో నెలకొన్న కఠిన వాస్తవాలను కూడా ఆవిడ పట్టించుకోలేదు.
ఆర్థికరంగం నిరాశాజనక పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా.. ఏడు ప్రాధామ్యాలను ఈ బడ్జెట్ ప్రాతిపదికగా చేసుకున్నట్లు కనిపిస్తున్నది. అవి..
వీటిలో ఒక్కోదానిని వివరంగా విశ్లేషిద్దాం..
సమీకృత అభివృద్ధి: ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ అనేది బహిరంగసభల్లో నినాదాలకే పరిమితమైంది తప్ప ఆచరణలో లేదు. దేశంలో 28 రాష్ర్టాలు, 8 కేంద్రపాలితప్రాంతాలున్నాయి. వీటిలో చాలావరకు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మూడు దశాబ్దాల వ్యవధిలో ఏర్పాటయ్యాయి. ప్రతీ రాష్ట్రం తనదైన అభివృద్ధి దశలో, నమూనాలో ఉంది. కాబట్టి ప్రతీ రాష్ర్టానికి తనదైన ప్రణాళిక అవసరం. ఇంత వైవిధ్యం ఉన్న మన దేశంలో అన్నింటికీ ఒక్కటే అన్న సిద్ధాంతం పనికిరాదు. ఈ ఏడాది బడ్జెట్ రూపకల్పన సందర్భంగా కేంద్రప్రభుత్వంగానీ, ఆర్థిక మంత్రిగానీ రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో ఎటువంటి చర్చలు జరుపలేదు. పారిశ్రామికవేత్తలను, ఇతర భాగస్వామ్యపక్షాలను మాత్రం వారు సంప్రదించారు. నిజంగానే ఇది ‘అమృతకాలం’ అయితే, సమ్మిళిత అభివృద్ధి కోసం బడ్జెట్ పూర్వ చర్చల్లో రాష్ర్టాలను, కేంద్రపాలితప్రాంతాలను కూడా కేంద్రప్రభుత్వం సంప్రదించి ఉండాల్సింది. ఎందుకంటే వాస్తవ కార్యాచరణ, ఫలితాలు రాష్ర్టాలు, కేంద్రపాలితప్రాంతాల్లోనే ఉన్నాయి కాబట్టి.
బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు, మత్స్యరంగానికి కేంద్రం కొన్ని పథకాలను ప్రకటించింది. అయితే, ఈ రంగాల్లో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఉత్పాదకతను రెట్టింపు చేసిన తెలంగాణ ప్రభుత్వం కృషిని గుర్తించటం మాత్రం ఆర్థికమంత్రి మర్చిపోయారు. సహకార రంగం కింద ‘ప్రాథమిక వ్యవసాయ సంఘాల’ కంప్యూటరీకరణను మంత్రి ప్రతిపాదించారు. తెలంగాణ ప్రభుత్వం చాలా కాలం కిందటే ఈ పని పూర్తి చేసిందన్నది ఈ సందర్భంగా గమనించాల్సిన అంశం. అదీగాక సహకార రంగం అనేది రాష్ర్టాలకు సంబంధించిన అంశం. అటువంటప్పుడు కేంద్రప్రభుత్వం దీనిపై బడ్జెట్లో ఎందుకు ప్రతిపాదనలు చేసిందన్నది అర్థం కాని విషయం.
చిట్టచివరి లబ్ధిదారునికీ ప్రభుత్వ సేవలు: గిరిజన విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉపాధ్యాయులను నియమిస్తామని బడ్జెట్ ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12 శాతం మంది గిరిజనులు ఉన్నప్పటికీ.. కేంద్రం ఒక్క ఏకలవ్య పాఠశాలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు ఈ స్కూళ్లను కేటాయించాలి. తెలంగాణలో కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు కేటాయించాలని కోరితే వాటినీ ఇప్పటి వరకూ ఇవ్వలేదు.
మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు: పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు కేటాయింపులు పెంచుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు తగిన నిధులను కేటాయించాల్సిందిగా కేంద్ర ఆర్థికమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్య యాన్ని ఈ కేటాయింపుల నుంచి చెల్లించే (రీయింబర్స్ చేసే) అంశాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి.
యువశక్తి: ఉద్యోగ కల్పనకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం, యువతలో నైపుణ్యాల పెంపుదల, అప్రెంటిషిప్లకు ైస్టెపెండ్ చెల్లింపు వంటి చర్యలు అమలులోకి వస్తే మంచిదే. కానీ, ఇప్పటి వరకూ ఏ మేరకు అమలు అయ్యాయి అన్నదే అసలు ప్రశ్న.
సామర్థ్య వినియోగం: సాధారణ పౌరుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జవాబుదారీతనంతో, పారదర్శకంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయటం కోసం పలు దీర్ఘకాలిక చర్యలను ప్రకటించారు. దీంట్లో భాగంగా కృత్రిమ మేధోరంగంలో (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఏర్పాటుచేయ తలపెట్టిన మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో ఒకదానిని హైదరాబాద్లో ఏర్పాటు చేయమని కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నాం.
పర్యావరణ అనుకూల అభివృద్ధి: గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎదురవుతున్న పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవటానికి ప్రకటించిన చర్యలను బాధ్యతాయుత రాష్ట్రంగా తెలంగాణ స్వాగతిస్తున్నది. ఇదే సందర్భంలో, ఈ రంగంలో తెలంగాణ జరిపిన కృషిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హరితహారం కింద గత ఏడేండ్లలో 240 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 28 శాతం నుంచి 33 శాతానికి పెరిగింది.
ఆర్థికరంగం: ఈ రంగానికి ప్రతిపాదించిన పలు అంశాలు దీర్ఘకాలికమైనవి. వీటిని ఏ విధంగా అమలు చేస్తారన్నదానిపై స్పష్టత లేదు.
సమాఖ్య స్ఫూర్తిని కేంద్రప్రభుత్వం ప్రదర్శించలేదు. బడ్జెట్ రూపకల్పనలో రాష్ర్టాలతో సంప్రదింపులు జరుపలేదు. 7 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. కానీ, రాష్ర్టాల పాత్ర లేకుండా దీనిని సాధించటం ఎలా సాధ్యమవుతుంది? ఈ విధంగా కేంద్ర బడ్జెట్ వాస్తవాలను విస్మరించిన కసరత్తుగానే నిలిచిపోయింది.
(వ్యాసకర్త: వైస్ చైర్మన్, తెలంగాణ ప్రణాళిక సంఘం)
-బి.వినోద్కుమార్