Plastic | సాంకేతికత అభివృద్ధి చెందుతున్నకొద్దీ అనేక ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. ఇవి రెండు వైపులా పదునున్న కత్తి వలె మానవాళికి ప్రయోజనం చేకూరుస్తూనే ప్రమాదకారిగానూ పరిణమిస్తున్నాయి. 20వ శతాబ్దంలో ఆవిష్కరించిన ప్లాస్టిక్ కూడా ఆ కోవలోనిదే. నిత్య జీవితంలో భాగమైపోయిన ప్లాస్టిక్ రోజురోజుకు మానవాళి పట్ల ప్రాణాంతకంగా మారుతున్నది.
మానవుడి దైనందిన జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది. సాంకేతికత సాయంతో మనకు మరింతగా చేరువైన నానో ప్లాస్టిక్, మైక్రోప్లాస్టిక్ మన ప్రాణాలను హరిస్తున్నాయి. కంటికి కనిపించని పరిమాణంలో ఉండే ఇవి నీరు, ఆహారంలో కలిసిపోయి అక్కడి నుంచి మన శరీరంలోకి చేరుతున్నాయి. తాజాగా వెలుగుచూసిన ఓ పరిశోధనలో మన రక్తంలోనూ నానో ప్లాస్టిక్ ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. మెదడులోకి చొచ్చుకుపోయి నాడీ వ్యవస్థను ప్లాస్టిక్ దెబ్బతీస్తున్నట్టు అందులో తేలింది. అతి సూక్ష్మ రూపంలో ఉండే ఇవి రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి.
మెదడులోకి చొచ్చుకుపోయిన నానో ప్లాస్టిక్ పార్కిన్సన్ వ్యాధికి కారకమవుతుండటం ఆందోళన కలిగించే విషయం. వాతావరణంలో ఉండే నానో ప్లాస్టిక్ పదార్థాలు ఆల్ఫా సినుక్లిన్ అనే ప్రొటీన్తో సంకర్షణ జరుపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్కు ఉపయోగపడే ఇవి క్రమంగా పార్కిన్సన్ వ్యాధిగా రూపాంతరం చెందేలా దోహదం చేస్తున్నాయి. పార్కిన్సన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా విస్తరిస్తున్న నాడీ సంబంధిత రుగ్మత. కదలికలను నియత్రించే నాడీ కణాలను ఈ వ్యాధి నాశనం చేస్తుంది. దీనివల్ల క్రమంగా నాడీ వ్యవస్థ పని చేయడం మానేస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు తేలింది. అయితే 25 ఏండ్లలో పార్కిన్సన్ బాధితుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగించే విషయం. 2019 నాటికి పార్కిన్సన్ కారణంగా సుమారు 58 లక్షల మంది వైకల్యం బారినపడ్డారు. 2000తో పోలిస్తే ఇది 81 శాతం అధికం కావడం గమనార్హం. అదే సమయంలో మరణాలు కూడా భారీగా పెరిగాయి.
2019 నాటికి ఈ వ్యాధితో 3,29,000 మంది మృతిచెందారు. 2000తో పోలిస్తే 100 శాతం అధిక మరణాలు నమోదయ్యాయి. మన దేశంలోనూ పార్కిన్సన్తో బాధపడుతున్నవారు లక్షల మంది ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చైనాలో ఈ వ్యాధి బాధితులు ఎక్కువ మంది ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి.
పార్కిన్సన్ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నా.. ఆయా దేశాలు దీనిపై అంతగా దృష్టి సారించడం లేదు. అందుకే క్రమంగా ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, చికిత్స అందకపోవడం తదితర కారణాల వల్ల అనేకమంది మృత్యువాతపడుతున్నారు. ముందుగానే వ్యాధిని గుర్తించకపోవడం, సరైన సమయంలో చికిత్స అందకపోవడం మరణాలకు కారణం. తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో న్యూరాలజిస్టులు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం ఆందోళనకరం. ఈ దేశాల్లో ప్రతి లక్ష మంది జనాభాకు 0.03 మంది న్యూరాలజిస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అధిక ఆదాయం కలిగిన దేశాల్లో ప్రతి లక్ష మందికి 4.75 మంది న్యూరాలజిస్టులు ఉన్నారు.
యావత్ ప్రపంచంలో సమస్త మానవాళి అనారోగ్యం బారిన పడుతున్నా.. ప్లాస్టిక్ వాడకం తగ్గడం లేదు. ఏటా దీని వినియోగం పెరుగుతూనే ఉన్నది. హానికరమైన ఈ ప్లాస్టిక్ను ప్రభుత్వాలు నిషేధిస్తున్నట్టు ప్రకటనలు చేస్తూ చేతులు దులుపుకొంటున్నాయి.
సరైన రీతిలో చర్యలు చేపట్టకపోవడంతో ప్లాస్టిక్ పెనుభూతంగా మారుతున్నది. 2021 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 400 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయ్యింది. ఈ మొత్తం కొంతకాలానికి ప్లాస్టిక్ వ్యర్థాలుగా మారి వాతావరణంలో కలిసిపోయి మానవాళికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించి ప్లాస్టిక్ వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉన్నది.
– ఎడిటోరియల్ డెస్క్