‘వెల్లువొచ్చి గోదారమ్మా ఎల్లకిల్లా పడ్డాదమ్మో’ అని వేటూరి ఏ కోణంలో పాట రాసిండో కానీ, ఆ పాట అందించాల్సిన అసలు అర్థాన్ని అపర భగీరథుడు సీఎం కేసీఆర్ నిజం చేసిండు. తలాపున పారుతున్నా అందకుండా ఉరుకుతున్న గోదారమ్మను నిలువరించి ఎనకకు నడిపించి తెలంగాణ బీళ్లకు ఎల్లెల్కల ఎత్తిపోసిండు. కవి రసాత్మక భావనను రైతుల కోసం నిజం చేసిన సృజనాత్మక పాలకుడు మన సీఎం కేసీఆర్.
కృష్ణవేణి తెలుగింటి విరిబోణి’ అంటూ సినారె రాసిన పాటలోని (తెలుగంటే ఆంధ్రం అనే) అర్థ భావనను తిరగరాస్తూ, కృష్ణవేణి ఆంధ్రింటి విరిబోణి మాత్రమే కాదు..తెలంగాణ పాలిట కల్పవల్లి కూడా అనే సంపూర్ణ అర్థాన్ని అద్దబోతున్నరు తెలంగాణ కవి రాజు. నాడు కాళేశ్వరంతో నిరూపించి, నేడు పాలమూరు రంగారెడ్డిని ప్రారంభిస్తూ తెలంగాణ రైతుల కోసం నదుల మళ్లింపు ప్రకియను సంపూర్ణం చేయబోతున్న మన సీఎం కేసీఆర్కు నేడు దేశమే జల హారతి పడుతున్నది! తెలంగాణ ఉత్తరాన తలాపున పారుతున్న గోదారిని పట్టుబట్టి పైకెత్తి పోసిన అపర భగీరథుడు కేసీఆర్ వజ్ర సంకల్పం కొనసాగింపులో భాగంగా తెలంగాణ దక్షిణాన మళ్లీ సూడకుండా బిర బిరా పరుగులిడుతూ తరలిపోతున్న కృష్ణవేణిని కూడా కరువు బీళ్లకు మళ్లిస్తున్న మహోన్నత చారిత్రక జల క్రియ ఈ నెల 16న సాక్షాత్కారం కానున్నది. నిజమే ధైర్యం లేని రోజులవి. ధైర్యమే కాదు కనీసం ఆలోచనా రాని ఉమ్మడి పాలన రోజులవి. ఏ పాట విన్నా ఏ రాత చదివినా మన తలరాత మార్చే కోణమే లేకపోవు. తెలంగాణను దాటేసుకుంటూ తరలిపోయే గోదావరి, కృష్ణా నదుల రమణీయ దృశ్యాలను నాడు ఆంధ్రా వర్ణంలో వర్ణించిన కలాలు, గళాలు తలాపున పారుతున్నా తెలంగాణ బిడ్డలకు గంటెడు నీళ్లెందుకు అందుతలేవు నదీమ తల్లులారా అని అడగలేదు!
ఆంధ్రావనిని అన్నపూర్ణ చేసేందుకే ఈ నదులు పుట్టినట్టు తమ కలాల ద్వారా మళ్లీ మళ్లీ పుట్టించిన సాహిత్యం ఉండేది. నాడు తెలంగాణ పాలకులకే రాని ఆలోచన, ఆధిపత్యాలకు అణకువగా పాటలు రాసుకొని బతికే కవులకు రాకపోవడంలో విడ్డూరమేమీ లేదు! అలాంటి మానసిక, సామాజిక, ప్రాంతీయ, సాహిత్య, సాంస్కృతిక పరిస్థితులను తిరగరాసే మహోన్నత ప్రక్రియకు శ్రీకారం చట్టిన చారిత్రక పురుషుడు కల్వకుంట్ల చంద్రశేఖరుడు. గోదావరి, కృష్ణా నదుల జలాలనే కాదు, ఇవాళ తెలుగు సాహిత్యకారుల ఆలోచనలను కూడా తెలంగాణ బీళ్లకు మళ్లిస్తున్న మహోన్నత సందర్భాల సృష్టికర్త ఆయన. సెప్టెంబర్ 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఆవిష్కృతమవుతున్న చారిత్రక సందర్భం లోంచి, నదీ జలాలను ఎత్తిపోసినట్టే నాటి కవుల పాటలను, కేవలం ఆంధ్రాకు పరిమితం చేసి సాగించిన వారి రచనలను సాహిత్యాన్ని, సందర్భోచితంగా తిప్పి రాసుకుందాం.
ఆంధ్రాకు మళ్లించిన నాటి కవుల భావుకతను తెలంగాణకు ఎత్తిపోస్తూ సంపూర్ణత సిద్ధింపచేసుకుందాం. నాటి కన్నీటి పాటల స్థానంలో సాగునీటి పాటలు పాడుకుందాం. నిన్నటిదాకా కేవలం ఆంధ్రాను మాత్రమే తడిపిన కృష్ణా, గోదావరులు నేడు తెలంగాణ దిక్కు మళ్లుతున్న అద్భుత జల దృశ్యాలను కలగలిపి కైగట్టి కలిసి పాడుదాం. ఆశలు అడుగంటిపోయిన నాటి ఉమ్మడి పాలన నిస్పృహలోంచి ఇప్పుడిప్పుడే మందిల కలుస్తూ కరువుపై చర్నాకోలా విసురుతున్న నేటి తెలంగాణ రైతన్నకు గుండె ధైర్నాన్ని నింపుతూ, పూడికలో పాతుకుపోయిన తెలంగాణ ఎవుసాన్ని గుంజి బైటేసిన చారిత్రక సందర్భం లోంచి, కుడి, ఎడమ భుజాలుగా నిలబెట్టిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఘనకీర్తిని గుండెల నిండుగా కీర్తిద్దాం. ప్రాంతాలకతీతంగా రైతును విశ్వ నరునిగా నిలబెడుతున్న కిసాన్ సర్కార్ స్వాప్నికుడు సీఎం కేసీఆర్ మహోన్నత దార్శనికతలో మమేకమై…‘అమ్మవో గోదారమ్మ మాయమ్మ కృష్ణమ్మా… మీరు పొంగుతుంటే తెలంగాణ పంట పండేనమ్మా..మీరు కదులుతుంటే ఆంధ్రాలో సిరులు కురిసే నమ్మా’ అని కలిపి పాడుదాం.
– సహస్ర