ఓ పదిహేనేండ్ల కిందట… వరదరాజుపల్లి, టైం జూస్తే పొద్దుగాళ్ల తొమ్మిది గొడ్తున్నది. ‘అరేయ్ కన్కరాజు ఆయిళ్ల అస్సల్కే నిర్ద వట్టలేదురా. పానమంతా సవసవా అంటున్నది. నాకు శాతనైతలేదు. లో జరంగినా కొడుతుందో మన్నో.. దుబ్బాక బాదుకున్న లచ్చపేటల బోరెయ్యాల్నట… ఇయ్యాళ్ల నాత్రికి బోరు బండి నువ్వే నడుపాలె’ అని మంచంల పడుకున్న బాపు గంగరాం నాతో అంటున్నడు. ‘మా నడుపుతడు గని, నువ్వయితే గా డాక్టర్ సీను దగ్గరికి పొయి ఓ సూది ఏపిచ్చుకోరాదు’ అని అమ్మ సత్తవ్వ బాపును బతిలాడుతున్నది. ‘ఎహ్హె.. మా వోత తియిగని, నువ్వు జర నోర్మూస్కోరాదు..’, ‘అగ్గొ జూసినావురా.. బోర్లేసి ఎవ్వల్నో పెద్దగజేసినట్టు ఎట్ల గెదుముతున్నడో మనిషిని’ అని అమ్మ సత్తవ్వ నా దిక్కు సూత్తున్నది.
బాపు గంగరాం 1995 నుంచే బోరు బండి నడుపుతున్నడు. మా సొంతూరు వరదరాజుపల్లిల్నే గాకుండా సిద్దిపేట సుట్టపక్కల ఉన్న ఊర్లళ్లకు గూడ బోర్లెయ్యనీకి వోతడు. ఇంటర్ దాకా సదువుకున్న నేను, మా తమ్ముడు ఇద్దరం గల్సి బాపుకు ఆసరయ్యేటోళ్లం. అట్లా మాగ్గూడా అదే పని అబ్బింది. అసలు బాపు గంగరాం ఈ పనినే ఎందుకు ఎంచుకున్నడో ఇప్పటికీ అర్థం గాదు. రాత్రంత దుమ్ము, దూళిల కట్టవడితే పైసల్ చేతిల వడేదాన్క నమ్ముకం ఉండదు. మేం ఏసిన బోరు బాయిల నీళ్లువడితే మాకు పైసలచ్చినట్టు, లేకుంటే అంతే సంగతి. ఎందుకంటే మేం ఏసేది ఎవుసం బోరు బాయిలే కావట్టి నీళ్లు వడని రైతుల్ని పైసలియ్యిమని కచ్చితంగ ఉండరాదు గదా? అందుకే కొందరు బోరు బం డోళ్లు ముందుగాళ్లనే పైసల్ తీసుకుంటరు. కనీ బాపు మాత్రం నమ్మకం మీదనే బోరేస్తడు. మేమేసిన బోరు బాయిల నీళ్లు వడ్డా, వడకున్నా పైసలిచ్చినోళ్లు కొందరైతే.. ఇయ్యనోళ్లే మస్తుమందే ఉంటరు.
తెలంగాణ రాకముందు… మొదాలు మిడిదొడ్డి ఊరికి వోదాం. నర్సన్న అనే ఓ పేద రైతు… ఓ రోజు బాపు దగ్గరికొచ్చి ‘గంగన్నా నా భూమిల బోరెయ్యాల్నే… పైసలు మాత్రం ఇప్పుడు లెవ్వే.. మళ్ల పంట మీదిస్తా.. నీళ్లు లేక భూమిని బీడుంచుడైతంది.. పోరగాండ్ల తిండిగ్గూడ తిప్పలయితున్నది.. నీ పుణ్యాన బాయిల నీళ్లువడితే జీవితాంతం యాజ్జేసుకుంటమే’ అని బతిలాడిండు. నర్సన్నను జూత్తే బాధనిపించినట్టుంది బాపుకు. అప్పుడే ‘అరేయ్ కన్కా.. ఇయ్యాళ్ల బండి మిడిదొడ్డికి గొట్టురా, నాత్రి నర్సన్న పొలంల బోరేద్దాం’ అన్నడు. బాపు మాట జవదాటకుండా ఆ నాత్రికే బోరుబండి మిడిదొడ్డికి వోయిం ది. రాత్రి పదింటికి షురూ అయిన బోరు బండి తెల్లారి పది గొట్టేదాన్క నడ్శింది. రెండు జాగల్ల గుద్ది జూసినం. ఏం లాభం..? సుక్క నీరు వల్లేదు.
‘నర్సన్నా… ఏం జేద్దామే…’ అని బాపు అడిగితే ఎర్రగైన కండ్లతోని ‘గంగన్నా.. 45 వేలయితే ఇస్తనే, అవిగూడ ఇప్పుడు లెవ్వు… కొన్నొద్దులాగుమంటే’ బాపు ఆర్నెళ్లాగిండు. అప్పటికే అప్పుల పాలై ఉన్న నర్సన్న ఎవ్వలికి చెప్పకుండ, చెయ్యకుండ బొంబాయికి వలసవోయిండు.
ఇప్పుడోపారి ఘనాపూర్ ఊరికి వోదాం. స్వామి అనే ఓ రైతు బోరు కోసం బాపుకు బయానిచ్చివోయిండు. తెల్లారి ఘనాపూర్కు వొయి బోరేసినం. ముందుగాళ్ల 500 ఫీట్ల కేసింగ్ వోయింది. తర్వాత మూడు వందల ఫీట్లు, ఆ తర్వాత మల్లోపారి మూడు వందల ఫీట్ల కేసింగేసినం. ఈ మూడిట్లా నీళ్లు వల్లే. పాపం స్వామికి పక్కింటి పాలైన ‘ఏ స్వామి నీకెందుకురా, నువ్వు బోరేసుకో నేను పైసలిత్తా’ అని మాటిచ్చిండట. ఆయన మాట వట్టుకొని మాతోని బోరేపిచ్చిండు స్వామి. నీళ్లు వడ్తే అప్పు ఇస్తుండెనో ఏమో గని, నీళ్లు వడకపోయేసరికి ‘ఏ పైసల్ లెవ్వురా స్వామి’ అని చేతులెత్తేసిండట ఆ పాలైన. అప్పటిదప్పుడు పెండ్లాం మీదున్న బంగారం తీసియ్యిమని, దాన్ని కుదవెట్టి మరీ మాకు పైసలిచ్చిండు.
ఇప్పుడు చిన్నగుండెల్లి తిరిగొద్దాం.. సత్తిరెడ్డి అని పెద్ద రైతే. పొలం వారుతలేదని, దాంట్ల బోరేపిద్దామని మా దగ్గరికొచ్చిండు. ఫీటుకు గింత అని బ్యారం కుదిరింది. ఇచ్చిన మాట ప్రకారం పలానా తేదీ నాడు వొయి బోరు గుద్దినం. ‘ఎందుకు వడదో బోరు నేను సూత్తా’ అని పట్టుమీదున్న సత్తిరెడ్డి 1200 ఫీట్ల లోతు గుద్దిపిచ్చిండు. అయినా నీళ్ల పదన లేదు. బోరు వడితే యాటపిల్ల కోద్దామన్నంత కుషీతోని ఉన్న సత్తిరెడ్డి ఇన్ని ఫీట్లేసినా నీళ్లు వడకపాయెనని మొహమంతా సిన్నగ జేసుకున్నడు.
మళ్లా పదిహేనేండ్ల కిందికి వోదాం…. దుబ్బాక బాదుకున్న అదే లచ్చపేటల ఓ రైతు బోరేస్తే సుక్కా నీళ్లు వల్లేదని ఉరేసుకొని కాలంజేసిండు. ఇట్లా మేం పది బోర్లేస్తే ఒక్కదాంట్లనో, బల్మీట్టికి రెండిట్లనో నీళ్లు వడ్తుండె. అదిగూడ ఓ పావుగంట ఆగకుంట వోత్తే మా గొప్ప. అందుకే మా అమ్మ సత్తవ్వ నాడు బాపును ‘బోర్లేసి ఎవ్వల్ని పెద్దగజేసినవ్’ అన్నది గావొచ్చు.
తెలంగాణ అచ్చినంక…. నాడు పన్నెండు వందల ఫీట్లేసిన చిన్నగుండెల్లి రైతు సత్తిరెడ్డి పొలంల ఇప్పుడు నాలుగు వందల ఫీట్లేస్తనే నీళ్లు వడ్డయి. ఆ నీళ్ల రువ్వడికి కేసింగే పైకి ఎక్కొస్తున్నది. దిగువ మానేరు, లోయర్ మానేరు, మధ్య మానేరు, మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులన్నీ నీళ్లతో కళకళలాడుతున్నయి. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇప్పుడు పది బోర్లేస్తే, పది బోర్లళ్ల నీళ్లు వడ్తున్నయి.
అయినా నీళ్లు పుష్కలంగా ఉన్న ఈ రోజుళ్ల ఎవుసం బోర్లు ఏయించుకునేటోళ్లెవరున్నరు? మాకు ఉపాధి తగ్గినా మంచిదేగని రాష్ట్రంల నిండు గా ఉన్న గంగను జూసుకుంటా రైతన్న సంబురపడుతున్నడు. రైతన్న సంతోషంగుంటే అంతకన్నా మనకు కావాల్సిందేముంటది?
గడ్డం సతీష్
99590 59041