తెలంగాణ ప్రభుత్వ పురోగామి విధానాలు , సత్వర నిర్ణయాలు, సరికొత్త ఆలోచనలతో ఐటీ రంగం దూసుకుపోతున్నది. ఇప్పటివరకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న బెంగళూరు నగరానికి గట్టి పోటినిస్తున్నది. తాజాగా మన హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పనలో బెంగళూరు నగరాన్ని వెనుకకు నెట్టేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో(ఏప్రిల్-జూన్) కొత్త ఉద్యోగాల కల్పనలో 34% వాటాతో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. 33% వాటాతో బెంగళూరు రెండవ స్థానానికి పరిమితమైంది. ముంబై 12%, పూణే 9%, చెన్నై 5% శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయని క్వెస్ ఐటీ సాప్టింగ్ గ్రూప్ సర్వే తెలిపింది. మొన్నటి వరకు ఐటీ కంపెనీల ఆఫీస్స్పేస్ విషయంలోనూ బెంగళూరుకు మన నగరానికి చాలా వ్యత్యాసం ఉండేది. కానీ బెంగళూరులో హిజాబ్, హలాల్ ఆందోళనల మూలంగా శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో కొత్తగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకునే వారిలో బెంగళూరులో 60% మంది మాత్రమే ఉద్యోగాలలో చేరుతుండగా మెరుగైన శాంతి భద్రతలున్న మన హైదరాబాద్లో అది 90% వరకు ఉన్నది.
చారిత్రక వారసత్వ సంపదకు నిలయంగా ఉన్న హైదరాబాద్.. అభివృద్ధిలో దూకుడును ప్రదర్శించి దేశంలోనే ఒక ప్రీమియర్ సిటీగా గుర్తింపు పొం దింది. తెలంగాణ ప్రభుత్వం ఐదేండ్లకు ఒకసారి తీసుకొస్తున్న ఐటీ పాలసీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలకు హైదరాబాద్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. అంతేకాదు ఆసియా ఖండంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా ప్రధాన పాత్ర పోషిస్తున్నది. హైదరాబాద్ నగరానికి భౌగోళికంగా అనుకూల వాతావరణం, పుష్కలమైన మానవ వనరులతో పాటు సుస్థిరమైన పాలన, మెరుగైన వసతులు ఉండటంతో ప్రపంచంలోని అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కట్టా యి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్ర కటించిన రెండో ఐటీ పాలసీతో హైదరాబాద్ నగరం గ్లోబల్ హబ్ గా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లే దు. 2015లో తెలంగాణ ప్రభుత్వం ప్ర తిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన టీ-హబ్ అనేక సంచలనాలకు కేంద్రంగా మారిం ది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2022లో జాతీయ ఉత్తమ ఇంక్యుబేటర్గా నిలిచింది. టీ-హబ్ ఇప్పటికే 2500పైగా స్టార్టప్లకు సాయం అందిం చి, 13 వేల కోట్ల పెట్టుబడులు సమీకరించి 12, 500 మందికి ఉపాధి కల్పించింది.
తెలంగాణలో ఇన్నోవేషన్ ఎకో సిస్టం ను వృద్ధి చేసేందుకు టీ-హబ్, టీ ఎస్ ఐసీ, వీ-హబ్, రిచ్, టాస్క్, టీ- వర్క్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ ఏర్పాటు చేశారు. గడిచిన ఐదేండ్లలో పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా మూడు లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా దేశంలోనే అత్యధిక ప్లేస్మెంట్ రేట్ ఉన్న సెంటర్గా టాస్క్ నిలిచింది. ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్తో ఓపెన్ డాటా, బ్లాక్ చైన్, డాటా ఎనలిటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ అడాప్షన్, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ విభాగాల్లో సెక్టోరల్ పాలసీలు ప్రారంభించడం జరిగింది. డబ్ల్యూఈఎఫ్, యుఎన్డీపీ, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ ఎంతో ముందంజలో ఉన్నది. ఐటీ ఎగుమతులు 2013-14లో రూ.57 వేల కోట్లుండగా 2021-22 నాటికి లక్షా 83 వేల కోట్లకు పెరిగాయి. తద్వారా దేశానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలిచే కీలక రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ తెలిపింది.
ప్రజలు జీవించేందుకు హైదరాబాద్ ఉత్తమమైనదని మెర్సర్, డైనమిక్ సిటీ అని జెఎల్ఎల్ సర్వేలు పేర్కొన్నాయి. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల డేటా సెంటర్లకు హైదరాబాద్ కేరాఫ్గా నిలుస్తున్నది. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి. తాజాగా భారతీ ఎయిర్టెల్ రూ.2వేల కోట్లతో మన నగరంలో గ్రీన్ ఫీల్డ్ హైపర్ స్కేల్ డేటా కేంద్రం ఏర్పాటుకు అంగీకరించింది.
రెండో ఐటీ పాలసీలో క్లౌడ్ కంప్యూటింగ్ పాలసీ తీసుకురావడంతో రాబో యే రోజుల్లో క్లౌడ్ ప్రొవైడర్స్కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా హైదరాబాద్ మారుతుంది. ఐటీ రంగంలో నూతన సాంకేతిక విప్లవం క్లౌడ్ కంప్యూటింగ్ను పాలన సేవల్లో వినియోగించుకోవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచయినా డిజిటల్ వనరులను పంచుకోవడం, నిర్వహించుకోవడం దీంతో సులభమవుతుంది. పాలన వ్యవహారాలను గ్రామ పంచాయతీల నుంచి సచివాలయం వరకు ఇంటర్నెట్ ద్వారా అత్యంత వేగంగా సురక్షితంగా అందించేందుకు ఈ సాంకేతికత తోడ్పడుతుంది. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని ఇంటలిజెంట్ టెక్నాలజీ అని పేర్కొన్న కేటీఆర్ మాటలు అక్షర సత్యం.
(వ్యాసకర్త: గుర్రం రజితా దేవి, 94419 10560, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కంప్యూటర్ సైన్స్)