తెలంగాణకు మళ్లీ కరువొచ్చింది. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ వర్షాలకు కరువొచ్చింది. చెరువులకు కరువొచ్చింది. భూగర్భానికి కరువొచ్చింది. పంటచేలకు కరువొచ్చింది. రైతుబంధుకు కరువొచ్చింది. కల్లాల మీద పంటకు కరువొచ్చింది. నీళ్లు రాక.. పడావు పడ్డ భూములతో తెలంగాణ గొంతు తడారిపోతున్నది. తెలంగాణ వాకిట్లో కరువు కరాళ నృత్యం చేస్తున్నది. దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. సగటున 11.4 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. 500 ఫీట్ల లోతు వరకు బోర్లు వేసినా నీరే కానరావడం లేదు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉన్నది. ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతన్నలు నానా కష్టాలు పడుతున్నారు. ఇక నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద పంటలు పండించే రైతుల దుస్థితి వర్ణనాతీతం. ఈ ప్రాంత రైతులకు సాగర్ జలాలే ప్రధాన నీటివనరు. సాగర్ ఆయకట్టు కింద చాలా ప్రాంతాల్లో రైతులు యాసంగి పంట సాగు చేయకపోవడం అక్కడి దుస్థితికి అద్దం పడుతున్నది.
ఆశ్చర్యమేస్తున్నది.. విస్మయం కలుగుతున్నది. కేవలం నాలుగు మాసాల్లో ఒక వ్యవస్థ ఇంతలా అతలాకుతలమవుతుందా? ఉన్నట్టుండి ఈ అనావృష్టికి కారణం ఏమిటి? గత పదేండ్లలో లేని కరువు ఇప్పుడెలా వచ్చింది? ‘గత పదేండ్లు వర్షాలు నిరంతరం పడ్డాయి కాబట్టి.. చెరువులు నిండాయి. అందుకే కరువు రాలేదు. కానీ, గత సీజన్లో వర్షపాతం తక్కువగా నమోదైంది అందుకే కరువు వచ్చింది’ అని ప్రభుత్వం చెప్తున్నది. కానీ, గత సీజన్లో అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన వర్షపాతం 920.9 మిల్లీ మీటర్లు. తెలంగాణ సాధారణ వర్షపాతం 879.4 మిల్లీ మీటర్లు. అంటే సాధారణం కంటే గత సీజన్లో 5 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో సాధారణం (785.7 మి.మీ) కంటే ఒక శాతం ఎక్కువ (793.6 మి.మీ) వర్షపాతం నమోదైంది. ఇవి వాతావరణ శాఖ చెప్తున్న లెక్కలు.
వానాకాలం సీజన్లో నైరుతి రుతుపవనాల వల్ల సాధారణ వర్షపాతం నమోదవగా.. ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షపాతం పెద్దగా నమోదవలేదు. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు బాగానే పడ్డాయి. మరి చెరువులు ఎందుకు నిండలేదు? నీళ్లు ఎందుకు రాలేదు. గత పదేండ్లలో సాధారణం కంటే ఎక్కువే వర్షపాతం నమోదవుతూ వచ్చింది. ప్రస్తుత సీజన్లోనూ వర్షపాతం మైనస్లోకి పడిపోలేదు. అయినా కరువొచ్చింది.
విచిత్రమేమంటే గత రెండు దశాబ్దాలలో అంటే 2004 నుంచి తెలంగాణలో నమోదైన సగటు వర్షపాతాన్ని కనుక మనం గమనిస్తే.. ఏటా 614-1100 మి.మీ. వర్షపాతం నమోదవుతూ వస్తున్నది. ఇది దాదాపు సగటు వర్షపాతమే. మరి 2004- 2014 వరకు తెలంగాణ ఎందుకు కరువుతో అల్లాడిపోయింది? తెలంగాణ సిద్ధించాక ఎందుకు పంట ఉత్పత్తి పెరగటం ప్రారంభమైంది? 2014లో స్వరాష్ట్రం సిద్ధించిన ప్పుడు 68 లక్షల టన్నులుగా ఉన్న పంటల ఉత్పత్తి ఒక్కసారిగా దాదాపు 3 కోట్ల టన్నులకు ఎలా పెరిగింది? అదే ఆశ్చర్యం. కాలం కలిసొచ్చినప్పుడు మోడువారిన చెట్టు కూడా తిరిగి ప్రాణం పోసుకుంటుందంటారు. 2014లో తెలంగాణ కాలం మొదలైంది. ఇవాళ మళ్లీ కాలం వెనక్కి పోయిందా? అని అనిపిస్తున్నది. ప్రాణం పోసుకున్న తెలంగాణ తిరిగి మోడువారుతున్నదేమో అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
సోషల్ మీడియాలో, టీవీ చర్చల్లో తెలంగాణపై సానుభూతి ముసుగేసుకుని మేధావులమని చెప్పుకొనే కొందరు తెలంగాణ నీటి వనరులపై అద్భుతమైన పరిజ్ఞానం ఉన్నట్టు మాట్లాడుతుంటారు. ఇటీవల ఓ పత్రికలో ఒక వ్యక్తి వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో.. ‘అమ్మో! అంతంత పెద్ద భారీ మోటర్లు పెట్టి నీళ్లను ఎత్తిపోస్తారా? ఎంత ఖర్చు? మీకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ప్రాజెక్టులు అవసరం లేదు. మెట్టపంటలు వేసుకొని ఏదో బలుసాకు తిని బతకండి’ అన్నట్టుగా అందులో రాశారు. పైగా ప్రాజెక్టులు మొదలు పెట్టిననాడే ఈ కూత కూశానని, తన కూత ఎవరికీ వినిపించలేదని కూడా వక్కాణించారు. మరో పెద్దాయన మల్లనసాగర్ రిజర్వాయర్ను టేబుల్ టాప్ రిజర్వాయర్ అని ఎద్దేవా చేశారు. ఎన్ని చెప్పినా వాళ్లు మారరు. కొత్త కొత్త ఈకలు పీకుతుంటారు తప్ప.. వాళ్లు చెప్పదలచుకున్న దాని గురించి అంగుళం కూడా వెనక్కి తగ్గరు. తెలంగాణ భౌగోళిక స్వరూపం, ఇక్కడి నీటిపారుదల వ్యవస్థ గురించి పూర్తిగా అవగాహన ఉన్నవారెవరూ ఇలా అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేయరు.
కరువు ముంగిట తెలంగాణ నిలుచున్న ప్రస్తుత తరుణంలో కాళేశ్వరం ప్రస్తావన తీసుకురాక తప్పడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సమగ్రంగా, సమర్థంగా ప్రజలకు అవగాహన కల్పించడంలో బీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారనే చెప్పాలి. కాళేశ్వరం ప్రయోజనాల కంటే.. కేసీఆర్పై తీవ్రమైన ద్వేషంతో ప్రతిపక్షాలు, కొందరు కుహనా మేధావులు చేసిన దుష్ప్రచారమే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లింది. గతంలో వైఎస్ఆర్ హయాంలో రూపొందించిన ప్రాణహిత-చేవెళ్లకు కాళేశ్వరానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటనే విషయం గురించి ఎవరైనా ఆలోచించారా? కాళేశ్వరం ప్రాజెక్టు కొద్దిగా కిందకు వెళ్లి తుమ్మిడిహట్టికి బదులు మేడిగడ్డ దగ్గర ప్రారంభమైంది.
ఒకటి రెండు రిజర్వాయర్లు కొత్తగా వచ్చిచేరాయి. మిగతావన్నీ పాత డిజైన్లో భాగమే. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీ ద్వారా నీళ్లు ఎల్లంపల్లికి వస్తాయన్నది కాంగ్రెస్ వాదన. మేడిగడ్డ దగ్గర కడితే ఎత్తిపోసినా ఎక్కువ నీళ్లు తీసుకోవచ్చన్నది కేంద్ర జల సంఘం ఇచ్చిన సూచన. సరే ఈ రాజకీయ ఆరోపణలు చాలాకాలంగా కొనసాగుతున్నవే. రాజకీయ నాయకులు ఎలాంటి ఆరోపణలైనా చేసుకుంటారు.
మనకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం చాలామందికి అర్థం కాలేదు. బాహుబలి మోటర్లు, నీళ్లు ఎత్తిపోయడం, ఎక్కువ ఖర్చు కావడం.. అందరూ ఈ లెక్కలు బాగానే చెప్తున్నారు. కానీ, కాళేశ్వరం అన్నది కష్టకాలానికి అన్న మాట ఎవరికీ పట్టడం లేదు. తెలంగాణలో గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మాత్రమే చేసి వదిలిపెట్టలేదు. దానికి అనుసంధానంగా మిషన్ కాకతీయ కింద 47 వేల చెరువులను పునరుద్ధరించింది. కాళేశ్వరం, చెరువులను బాగుచేయడం అన్నది పరస్పర ఆధారితాలు అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు, కాదు కూడా. గత జూలైలో మేడిగడ్డకు ప్రాణహిత నుంచి లక్ష క్యూసెక్కుల వరద వచ్చింది.
ఈ నీటిని ఒడిసి పట్టేందుకు మేడిగడ్డ చాలా కీలకం. తుమ్మిడిహట్టి వద్ద ఇంత వరద ఉండదు, రాదు కూడా. పైన గోదావరి నుంచి కూడా చుక్క నీరు రాదు. నిజమే బాహుబలి మోటర్లు, భారీగా విద్యుత్తు ఖర్చు అవుతుందని రాజకీయ ఇంజినీర్లు, కేసీఆర్ విద్వేషకులు పదేపదే చెప్తున్నారు. నిజానికి కాళేశ్వరం నుంచి 180 టీఎంసీల నీటిని ఎన్ని రోజులు ఎత్తిపోస్తారో ఎవరికైనా కనీస సోయి ఉందా? సంవత్సరం మొత్తంలో 90 రోజులు. జూలై- ఆగస్టు మాసాల్లో కొన్ని రోజులు. డిసెంబర్- జనవరి మాసాల్లో మరి కొన్ని రోజులు. మిగతా 275 రోజులు కాళేశ్వరం మోటర్లతో పెద్దగా పని ఉండదు. అంటే కరెంటు ఖర్చు కాదు. గత ఐదు సీజన్లలో ఏడాదికి పది మాసాల పాటు నీళ్లు ఎందుకు అందుబాటులో ఉన్నాయి.
భూగర్భ జలాలు ఎందుకు అడుగంటి పోలేదు? ఎందుకంటే.. కాళేశ్వరంలో ఎత్తిపోసిన నీళ్లు 15 రిజర్వాయర్ల ద్వారా దాదాపు 13 జిల్లాల్లోని చెరువులకు చేరాయి. దీనివల్ల వానొచ్చినా, రాకపోయినా ఎలాంటి సమస్య ఉండదు. చెరువుల్లో నీళ్లను రైతులు తమ అవసరాలకు తగ్గట్టు వాడుకొంటారు. ఇంతకాలం చేసింది ఇదే. గత ప్రభుత్వాధినేతల సొంత నియోజకవర్గాల కోసమే మల్లన్నసాగర్ను నిర్మించారని కొందరు విష ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. తెలంగాణకు మల్లన్నసాగర్ అనేది గరిమనాభి లాంటిది.
తెలంగాణ మొత్తం ఒక గుడిసె పైకప్పులాగా ఉంటే.. అందులో శిఖరంపైన మల్లన్నసాగర్ ఉంటుంది. సముద్రమట్టానికి దాదాపు 618 మీటర్ల ఎత్తున ఈ ప్రాంతం ఉంటుంది. తెలంగాణలో ఇదే హైయెస్ట్ పీక్. అక్కడికి నీరు తీసుకొని పోగలిగితే.. దాని నుంచి తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు (హైదరాబాద్ సహా) నీటిని గ్రావిటీ ద్వారా సులభంగా చేర్చవచ్చు. అందుకే అక్కడ 50 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మించారు. 2022లో ఇదే మల్లన్నసాగర్ నుంచి ఎత్తిపోయకుండానే సింగూరుకు, నిజాంసాగర్కు, మంజీరాకు నీళ్లు చేరాయి. ఎస్సారెస్పీకి ఐదు కిలోమీటర్ల దూరం వరకు నీళ్లు వెళ్లాయి. వరదకాల్వ ఒక రిజర్వాయర్గా మారింది. చివరి ఆయకట్టు అయిన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ దాకా నీళ్లు వెళ్లాయి.
ఇంత భారీ ప్రాజెక్టులో ఏదైనా లోపం జరిగితే జరిగి ఉండవచ్చు. లోపాలను సరిచేసుకోవాలి. అంతే కానీ ప్రాజెక్టును పడావు పెడతామంటే ఎలా? పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల కూడా గ్రావిటీ, ఎత్తిపోతల సమ్మిశ్రమమే. అది కూడా దాదాపు పూర్తయింది. అక్కడక్కడా చిన్నచిన్న కాల్వల వంటి పనులు పూర్తి చేస్తే దక్షిణ తెలంగాణ సస్యశ్యామలమవుతుంది.
నాడు నాగార్జునసాగర్ ప్రాజెక్టును ముందుగా ప్రతిపాదించిన ప్రాంతంలో కాకుండా దిగువన నిర్మించి తెలంగాణను ఎండబెట్టారు. ఫలితంగా కృష్ణా, గుంటూరు జిల్లాలు సుసంపన్నమయ్యాయి. అక్కడి రైతులు మన ప్రాంతానికొచ్చి నాయకులయ్యారు.. పాలకులయ్యారు. ఇప్పుడు నీళ్లు అధికంగా ఉండే చోట కట్టిన డ్యాంను ధ్వంసం చేసి.. మళ్లీ నీళ్లు రాని చోట డ్యాంను కడతామంటే ఎలా? వ్యక్తి మీద ద్వేషంతో తెలంగాణను ఆగం చేస్తామంటే ఎలా? తెలంగాణ నుంచి శాశ్వతంగా కరువును తరిమికొట్టేందుకు లక్షించినవి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు. వీటిని సద్వినియోగం చేసుకుంటేనే తెలంగాణ సమాజం బాగుపడుతుంది. అలా కాకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లనుకుంటే మాత్రం.. జరిగేది తెలంగాణ ప్రాజెక్టుల ధ్వంస రచన, తెలంగాణ ప్రజల హింస రచన.
కోవెల సంతోష్కుమార్
90521 16463