సినిమా అంటే తెలుగు వారికి ఒక భావోద్వేగం. ఆ ఎమోషన్ను ‘సొమ్ము’ చేసుకునే క్రమంలో టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమా ఇప్పుడు కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక ఖరీదైన వ్యసనంగా మారిపోయింది. ఒకప్పుడు సామాన్యుడికి అతి తక్కువ ఖర్చుతో దొరికే
ఏకైక ఉపశమనం సినిమా. కానీ నేడు థియేటర్ గడప తొక్కాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలో సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రభుత్వ జీవోలు, పైరసీ వెబ్సైట్ల పట్ల ప్రజల మొగ్గు వంటి అంశాలు సమాజంలో ఒక లోతైన చర్చకు దారి తీస్తున్నాయి.
తెలుగు రాష్ర్టాల్లో సంక్రాంతి పండుగ అంటేనే థియేటర్ల వద్ద సందడి, స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాల జాతర. అయితే ఈ ఏడాది వినోదం సామాన్యుడికి మరింత భారం కానుంది. తెలుగు రాష్ర్టాల్లో, ముఖ్యంగా తెలంగాణలో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. గతంలో సినిమా టికెట్ల ధరల పెంపును, బెనిఫిట్ షోలను అడ్డుకుంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఇటీవల డివిజన్ బెంచ్ స్టే విధించింది. ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంక్రాంతి బరిలో ఉన్న ‘రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ చిత్రాల నిర్మాతలు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి మార్గం సుగమమైంది.
నలుగురు సభ్యులున్న మధ్య తరగతి కుటుంబం సినిమాకు వెళ్లాలంటే, టికెట్ల కోసం కనీసం రూ.2 వేలు ఖర్చు చేయాల్సి వస్త్తోంది. ఇది వారిపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఈ అధిక ధరల కారణంగా, చాలా కుటుంబాలు థియేటర్లకు వెళ్లడం మానేసి, పైరసీ సైట్లకు, ఓటీటీ ప్లాట్ఫామ్లు లేదా టీవీలకు పరిమితమవుతున్నాయి. ఓటీటీలు, పైరసీ వైపు ప్రేక్షకులు మొగ్గు చూపడం వల్ల దీర్ఘ కాలంలో చిత్ర పరిశ్రమకే నష్టం! ఈ బెనిఫిట్ షోల నిర్వహణ, టికెట్ల ధరల వివాదానికి పరిణామంగా నిరుడు హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన నిదర్శనంగా నిలిచింది. ఇష్టానుసారం ప్రదర్శించిన బెనిఫిట్ షో, స్టార్ల హైప్, అభిమానుల వెర్రి ఆనందం లాంటి విపరీత పరిణామాలతో జరిగిన ‘పుష్ప’ సినిమా తొక్కిసలాట ఘటనలో ఓ గృహిణి అక్కడికక్కడే మృతి చెందింది.
సినిమా టికెట్ల సమస్య తీవ్రత ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. కేవలం తమ ప్రయోజనాల కోసం టిక్కెట్ల రేట్లు పెంచి ప్రేక్షకులను దోచుకుంటే ఊరుకోబోమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సినీ పరిశ్రమను హెచ్చరించారు. ముఖ్యంగా టికెట్ల పెంపు, బెనిఫిట్ షోల పేరిట జరుగుతున్న దోపిడీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పిన మాటలు ఒక ఆశాజనక మార్పుగా కనిపించాయి. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా ఉంది. ప్రభుత్వం గతంలో రేట్లు పెంచబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా, తాజాగా సంక్రాంతి సినిమాలకు ధరల పెంపు ఉత్తర్వులు ఇవ్వడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనం!
ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు పొంది రేట్లు పెంచుతున్న క్రమంలో, అది కేవలం బడా నిర్మాతలకే లాభం చేకూరుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సగటు అభిమాని పైరసీ వైపు మొగ్గు చూపుతున్నాడు. థియేటర్లలో టిక్కెట్ రేట్లు భరించలేనంతగా పెరగడం వల్లే సామాన్యులు ఉచితంగా సినిమాలు అందించే పైరసీ సైట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఉచితంగా సినిమాలు అందించే ‘ఐ బొమ్మ’ అడ్మినిస్ట్రేటర్ రవి అరెస్ట్ అయినప్పుడు, సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అతనికి మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది. ‘వందల రూపాయల టికెట్ కొనలేని మాకు ఉచిత వినోదం అందించినవాడు నేరస్తుడా?‘ అనే ప్రశ్న అక్కడ వినిపించింది. ఇది వ్యవస్థ వైఫల్యానికి ఒక సంకేతం. చట్టపరంగా పైరసీ తప్పు అయినప్పటికీ, అధిక ధరలు సామాన్యుడిని ఆ వైపు నెడుతున్నాయనేది నగ్న సత్యం. ఇది ఒక రకంగా సినిమా పరిశ్రమకు, ప్రభుత్వాలకు చెంపపెట్టు. ప్రేక్షకుడు పైరసీని ప్రేమిస్తున్నాడంటే, దానర్థం సామాన్యుడికి సినిమా పరిశ్రమ దూరం అవుతోందనే కదా?!
సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల సమస్యకు తక్షణమే ఒక శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వం జీవోలు ఇచ్చి రేట్లు పెంచడానికి సహకరించడం కాకుండా, కనీస ధరలను నియంత్రించాల్సిన బాధ్యత తీసుకోవాలి. అదే సమయంలో, సినిమా పరిశ్రమ కూడా సామాన్య ప్రేక్షకుడి జేబుకు చిల్లు పడకుండా, అందరికీ అందుబాటులో ఉండేలా టికెట్ల ధరలను నిర్ణయించాలి. అప్పుడే సినిమా పరిశ్రమ మనుగడ సాగిస్తుంది, ప్రేక్షకుల ఆదరణ నిలబడుతుంది. కేవలం ‘స్టార్ డమ్’ పేరుతో థియేటర్లలో దోపిడీ కొనసాగితే, భవిష్యత్తులో థియేటర్లు ఖాళీగా ఉండి, ప్రజలు పైరసీ వెబ్సైట్ల వైపే చూస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పరిశ్రమ కలిసి కూర్చుని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుని, ఈ టికెట్ల ధరల చిచ్చుకు శాశ్వతంగా తెర దించుతారని ఆశిద్దాం.
(వ్యాసకర్త : జర్నలిస్ట్, కరీంనగర్)
-దిడ్డి శ్రీకాంత్
86868 65759