శ్రమ దోపిడీ ఓ సామాజిక దురాచారం. సాంకేతిక యుగంలోనూ ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శ్రమ దోపిడీకి గురవుతున్నారు. శ్రమకు తగ్గ వేతనాలు అందక.. ఎక్కువ సమయం పని చేస్తూ యజమానుల చేతుల్లో బానిసలుగా మారుతున్నారు. వారి చేతుల్లో బందీలుగా మారిపోయి వెట్టిచాకిరి బాధితులుగా మిగిలిపోతున్న వారు కోకొల్లలు.
Migrant Labourers | ఉపాధి నిమిత్తం ఇతర రాష్ర్టాలు, ప్రాంతాలకు వలసపోతున్న వారిలో అత్యధికులు వెట్టిచాకిరి బారిన పడుతున్నారు. ఒక నిర్ణీత సమయం అంటూ లేకుండా వారంతా గొడ్డు చాకిరి చేస్తున్నారు. పొద్దు పొడిచిన దగ్గరి నుంచి పొద్దుపోయే వరకు అహర్నిశలు శ్రమించే వారికి సరైన కూలీ కూడా అందకపోవడం విచారకరం. ఇటుక బట్టీల నుంచి పెద్దపెద్ద పరిశ్రమల వరకు మనకు తారసపడిన వారిని ఒకసారి పలకరిస్తే అసలు విషయం తెలుస్తుంది. వారక్కడ ఇష్టంగా పని చేస్తున్నారా? లేదా బలవంతంగా పని చేయాల్సి వస్తున్నదా? అనేది అవగతం అవుతుంది. అప్పులు, ముందస్తు చెల్లింపుల కారణంగా లక్షల మంది ఇప్పటికీ అయిష్టంగానే వెట్టిచాకిరి చేస్తున్నారు. ఒకరి కింద బానిసలాగా బతకాలని ఎవరికి మాత్రం ఉంటుంది. కానీ, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, మన దేశంలో జనాభాకు తగ్గట్టుగా ఉపాధి కల్పన లేకపోవడం తదితర కారణాల వల్ల లక్షల మంది ఈ సామాజిక దురాచారానికి గురవుతున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం బలవంతంగా పని చేయించడం, మానవ అక్రమ రవాణా నేరం. దాన్ని రూపుమాపడం ప్రభుత్వాల బాధ్యత. వెట్టిచాకిరి బాధితులు ఎక్కడ కనిపించినా వారికి విముక్తి కల్పించి పునరావాసం కల్పించాలి. 1978లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం బాధితుల పునరావాసం కోసం రూ.4,000 ఆర్థిక సాయం చేయాలి. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చట్టంలో పొందుపరిచారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా దీన్ని 2000 సంవత్సరంలో రూ.20 వేలకు, 2022లో రూ.30 వేలకు పెంచారు. ప్రత్యేక పరిస్థితుల్లో పురుషులకు రూ.లక్ష, మహిళలు, బాలలకు రూ. 2 లక్షలు, లైంగిక వేధింపులకు గురైనవారికి రూ.3 లక్షల వరకు పునరావాసం కోసం సాయం చేసేలా జిల్లా కలెక్టర్లకు వెసులుబాటు కల్పించారు. దీంతో పాటు వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందినట్టు ఓ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీ చేయాలి. విముక్తి పొందిన వారికి ధ్రువపత్రాలు జారీ చేస్తున్న ప్రభుత్వాలు.. బాధితులకు పునరావాసం కల్పించడంలో అలసత్వం వహిస్తున్నాయి. ఆర్థిక సాయం చేయాల్సి ఉండటంతో ఈ విషయంలో ప్రభుత్వాలు వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో వారంతా కొంతకాలానికి కొత్త ప్రాంతానికి వెళ్లి అక్కడ తిరిగి వెట్టిచాకిరి బాధితులుగా మారుతున్నారు.
వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించి, వారికి పునరావాసం కల్పించే విషయంలో మన ప్రభుత్వాలు విఫలమయ్యాయనే చెప్పాలి. 1978 నుంచి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇప్పటివరకు 3,15,302 మంది వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందారు. వారిలో 2,96,305 మందికి ప్రభుత్వం పునరావాసం కల్పించింది.
2030 నాటికి 1.8 కోట్ల మందిని వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని కేంద్ర ప్రభుత్వం 2016లో సంకల్పించింది. ఆ నాటి నుంచి చూసుకుంటే 32,873 మందికి మాత్రమే విముక్తి కల్పించడం గమనార్హం. అంటే సరాసరి ఏడాదికి సుమారు 4,696 మంది విముక్తి పొందారు. భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న 1.8 కోట్ల లక్ష్యంలో ఇది సుమారు 2 శాతం.
ఇప్పటి వరకు విముక్తి పొందిన బాధిత కార్మికులు ఎక్కువగా ఐదు రాష్ర్టాల్లోనే ఉండటం గమనార్హం. కర్ణాటక (66,281), తమిళనాడు (65,573), ఒడిశా (51,441), ఉత్తరప్రదేశ్ (42,279), ఆంధ్రప్రదేశ్ (38,141) ముందు వరుసలో ఉన్నాయి. ఇది 84 శాతం.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలన చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీలే బాధితులుగా ఉండటం బాధాకరం. 2019లో ఈ చట్టం కింద 1,155 కేసులు నమోదవగా.. వాటిలో 96 శాతం బాధితులు ఎస్సీ, ఎస్టీలే. 2020లో నమోదైన 1,231 కేసుల్లో 94 శాతం, 2021లో నమోదైన 592 కేసుల్లో 96 శాతం వారే బాధితులు. నమోదైన కేసుల సంఖ్యతో సమానంగా విముక్తి కల్పించిన వారి సంఖ్య లేకపోవడం విచారకరం. విముక్తి కల్పిస్తున్నప్పటికీ వారి వివరాలు బయటికి రావడం లేదనేది ఓ వాదన. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, రాజకీయ నేతల హస్తం ఉండటం తదితర కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో జిల్లా యంత్రాంగాలు ఈ వివరాలను బయట పెట్టడం లేదని తెలుస్తున్నది.
మారుతున్న కాలానికి అనుగుణంగా వెట్టిచాకిరిలోనూ మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఆధునిక బానిసత్వం పుట్టుకొచ్చింది. ఈ బానిసత్వంలో అనేకమంది తమ కుటుంబాల కోసం యాజమాన్యాలను ప్రశ్నించకుండా మిన్నకుంటున్నారు. శ్రమకు తగ్గ వేతనాలు లేకపోయినా సర్దుకుపోతున్నారు. వారికి కార్మిక చట్టాలు, శ్రమకు తగ్గ వేతనాలు అమలు కావడం లేదు. ఓ సంస్థ అంచనా ప్రకారం మన దేశంలో 1.1 కోట్ల మంది ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నట్టు తేలింది. వారిలో 83 శాతం మంది ఎస్సీ, ఎస్టీలే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఆసియా-పసిఫిక్ రీజియన్లో ఇరాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, భారత్లో మాత్రమే ఈ ఆధునిక బానిసత్వాన్ని రూపుమాపేందుకు సరైన ప్రణాళికలు లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతున్నది.
– ఎడిటోరియల్ డెస్క్