వడ్డించే వాడు మన వాడైతే కడ బంతిలో ఉన్నా ముక్క పడుతుందనేది సామెత శుద్ధ తప్పని రుజువైంది. ఓబీసీ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినా, అందులో ఓబీసీ మహిళలకు అన్యాయం జరిగింది. వారికి ఈ బిల్లులో రిజర్వేషన్లు కల్పించలేదు. వాస్తవాన్ని మరుగుపరిచి ఓబీసీ మహిళలు తమకు అన్యాయం జరిగిందని తెలుసుకునేలోపే అంతా కానిచ్చేశారు. వారిని చట్ట సభల దరిదాపుల్లోకి రాకుండా చేశారు. తాము ముమ్మాటికీ అగ్ర కుల పక్షపాతులమని చెప్పకనే చెప్పారు.
ఓబీసీ మహిళలకు ఎందుకు న్యాయం జరగలేదని అడిగితే మోదీ ప్రభుత్వం తీసుకునే విధానపరమైన, చారిత్రక నిర్ణయాల్లో ఓబీసీల విషయం వచ్చే వరకు షరతులు వర్తిస్తాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఈ షరతులు గురించి ముందుగా ఎవ్వరికీ ఎందుకు చెప్ప లేదు? దీనిపై ఎందుకు చర్చించలేదు? ఏడాది కింద బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధాని కేంద్రంగా చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం ఆందోళన నిర్వహించారు. అనేక రాజకీయ పార్టీలను ఈ దీక్షలో భాగస్వామ్యులను చేయడం ద్వారా ఇక ఈ బిల్లుకు ఎవరూ అడ్డు లేరనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా చేశారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రధాన కారణమయ్యారు. కానీ బీజేపీ నేతలు వాస్తవాలను మరుగు పరిచి తామే అంతా ఉద్ధరించామని చెప్పుకుంటారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలోనూ నిస్సందేహంగా ఇదే జరిగింది.
నిజంగానే బీసీలు, ఓబీసీలపై మోదీ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా జన గణన చేసి అందులో భాగంగా కుల గణనను చేసేవారు. రాజ్యాధికారంలో వాటా కావాలని దేశంలోని సుమారు 60 కోట్ల మందికి పైగా బీసీ, ఓబీసీలు కోరుకుంటున్నారు. కానీ వారి జీవితాలు ఎట్లా ఉన్నాయి? వారి జనాభా ఎంత, దేశ పురోగతిలో వారి పాత్ర ఏమిటనే విషయాల గురించి కేంద్ర ప్రభుత్వ పాలకులు పట్టించుకోలేదనే చెప్పాలి.
బీసీలకు తన మంత్రివర్గంలో సముచిత స్థానం ఇచ్చానని చెప్పుకుంటున్న మోదీ బీసీల కోసం మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదు? బీసీల కోసం, వారి రాజకీయ భవిష్యత్తు కోసం చారిత్రక చర్యలు తీసుకోకుండా మోదీని అడ్డుకుంటున్న శక్తులు ఏమిటి? ఇవేవీ ఎవ్వరూ చెప్పరు. ఈ విషయాల గురించిన చర్చ దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీలు, బీసీల్లో జరుగుతూనే ఉన్నది.
మహిళల్లో బీసీ కులాలకు చెందినవారు ఉంటారనే సోయి బీజేపీ పెద్దలకు ముమ్మాటికీ లేదు! బీసీలను మరింత దరిద్రంలోకి నెట్టేయాలనే ఆలోచన వారికి ఉన్నట్లుంది. దానికి తోడు ఇలాంటివారు చట్ట సభల్లోకి వస్తే ఉన్నత సామాజిక వర్గాల స్టేటస్ పడిపోతుందనే మానసిక వేదన కూడా తోడు కావడం వల్లనే ఓబీసీలకు చట్ట సభల్లో చోటు కల్పించేందుకు పెద్దలు జంకినట్లు అర్థమవుతున్నది. హిందువులంతా ఒక్కటే అని చెప్పే బీజేపీ అండ్ కో వారికి ఇతర శూద్ర కులాల మహిళలు ఎందుకు కన్పించడం లేదు. వారు హిందువులు కాదని వారు భావించారా? గతంలో మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు యాదవ త్రయం అడ్డుకున్నది. బీసీ, ఓబీసీ మహిళలు చట్ట సభల్లోకి రావొద్దా? అని వారు ప్రశ్నించారు. అందుకే అప్పుడు ఆ బిల్లు పాస్ కాలేదు. ఈసారి మాత్రం అలాంటి డిమాండ్లు ఏమీ లేకుండానే బిల్లు పాస్ చేయించుకున్నారు. ఇక్కడ కులాల ప్రస్తావన చేసి మనం మాత్రమే ఎందుకు మహిళల పట్ల వ్యతిరేక ముద్రను పొందాలన్నట్టు ఉంది దక్షిణాది బీసీ నాయకుల పరిస్థితి. అందుకే వాస్తవ సామాజిక నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను విస్మరించి లేదా అలాంటిది ఏమీ లేదనే భ్రమల్లో జనాల్ని ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఓబీసీలంటే దేశంలో ఆ యాదవ త్రయమేనా? దక్షిణాదిన దేశస్థాయిలో ప్రశ్నించే ఓబీసీ నాయకులే లేరా?అన్న ప్రశ్న ఇప్పుడు తెలంగాణలో మొదలైంది. నా లుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం అన్ని వర్గాలు కలిసి కొట్లాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాయి. ఆ ఉద్యమ స్ఫూర్తితో ఓబీసీ బిల్లు కోసం మరో పోరాటానికి ఇక్కడి బీసీ నాయకులు సమాయత్తమవుతున్నారు. ఢిల్లీ వేదికగా ఉద్యమాన్ని ఉరకలెత్తించే విషయమై మాట్లాడుకోవడానికి అన్ని కుల సంఘాలను ఇందులో భాగస్వామ్యం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్లో సమావేశాన్ని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు.
మహిళా బిల్లు సాధించే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ కవిత సహాయ సహకారంతో ఓబీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు పోరాటం వీడరాదని బీసీ సంఘం నాయకులు ప్రతినబూనారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యతో పాటు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, ఎమ్మెల్సీ రమణ మొదలైనవారు ఇప్పటికే కవితతో సమావేశమై ఓబీసీ బిల్లుపై ఉద్యమించే రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. ఔర్ ఏక్ మోకా…ఓబీసీ బిల్లు పక్కా అని ఉద్యమించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ అంశంపై బలంగా ఉద్యమించి దక్షణాదిన సైతం బలమైన బీసీ నాయకత్వం ఉందనే విషయాన్ని కేంద్రానికి చాటిచెప్పి బిల్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
పార్లమెంట్లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికిప్పుడు మహిళలకు ఉపయోగపడదనే విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జనగణన జరిగాక నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అన్నీ అనుకూలించాలి. అప్పుడే మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత పురుషులతో పోటీపడి మహిళలు రాజకీయాల్లో పాల్గొనాలి. అప్పుడే ఆ బిల్లు ఫలితాలు మహిళా లోకానికి అందుతాయి. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ర్టాల్లో సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఇలా ఏ విధంగా చూసినా మహిళల వ్యతిరేకి, దక్షిణాది అననుకూల పార్టీ అని చెప్పుకొనేలా బీజేపీ వ్యవహరిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చివరగా ఓ మాట. మోదీజీ మరోసారి ఆలోచించండి. ఓబీసీ మహిళల ఉన్నతి కోసం అనివార్యంగా ఓబీసీ బిల్లు పెట్టాల్సిందే.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)