రెండున్నరేండ్లుగా నన్ను వేధిస్తున్నరు
నాలుగుసార్లు విచారణకు హాజరయ్యాను
ప్రశ్నలకు జవాబిచ్చిన. ఫోన్లూ అప్పగించిన
అయినా ఏమీ దొరకనందుకే అరెస్టు చేశారు
ఇంతవరకు ఒక్క ఆధారాన్నీ చూపలేదు
రాజకీయంగా దెబ్బతీయాలన్నదే వారి కుట్ర
దర్యాప్తుసంస్థల్ని మించి మీడియా విచారణ
న్యాయమూర్తి ముందు కవిత వాదన
లాయర్ ద్వారా బహిరంగ లేఖ విడుదల
కవిత కస్టడీ 23వరకు పొడిగింపు
MLC Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తాను నిందితురాలిని కాదని, బాధితురాలిని మాత్రమేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. లిక్కర్ కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని, అయినా నాలుగుసార్లు విచారణకు హాజరయ్యానని ఆమె న్యాయమూర్తికి తెలిపారు. దర్యాప్తు సంస్థలు చెప్తున్నట్టు తనకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆమె స్పష్టంచేశారు. జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా మంగళవారం కోర్టుకు హాజరైన కవిత, న్యాయమూర్తిని ఉద్దేశించి మాట్లాడేందుకు రాసుకున్న అంశాలను తన అడ్వకేట్ మోహిత్రావు ద్వారా బహిరంగ లేఖ రూపంలో విడుదల చేశారు. ఆ లేఖలోని అంశాలు యథాతథంగా..
‘నా తరఫున మాట్లాడేందుకు విలువైన కోర్టు సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ కేసులో చెప్తున్న అంశాల్లో నా ప్రమేయం లేదని, ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలను నేను పొందలేదని చెప్పాలనుకుంటున్నాను. మేడమ్ జస్టిస్, ఇందులో నా ప్రమేయం ఏమైనా ఉందంటే కేవలం బాధితురాలిగా మాత్రమే. రెండున్నర సంవత్సరాలుగా ఎప్పటికీ ముగిసిపోని ఈడీ, సీబీఐ విచారణ.. మీడియా ట్రయల్గా మారిపోవడాన్ని దేశం మొత్తం చూస్తున్నది. ఒక మహిళా రాజకీయ నాయకురాలైనందున, ఈ ప్రక్రియ మొత్తంలో నేను ఎకువగా బాధితురాలిని. ఇది నా వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టకు తీవ్ర నష్టం చేస్తున్నది.
నా వ్యక్తిగత మొబైల్ఫోన్ నంబరును అన్ని టీవీ చానళ్లలో ప్రదర్శించారు. ఇది నా గోప్యతను ప్రత్యక్షంగా దెబ్బతీస్తున్నది.
నేను రెండు దర్యాప్తు సంస్థలకు సహకరిస్తూనే ఉన్నాను. నేను వారి ముందు ఇప్పటికే నాలుగుసార్లు హాజరయ్యాను. అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసినంత వరకూ సమాధానాలు ఇచ్చాను. అన్ని బ్యాంకు, వ్యాపార వివరాలు అందించాను.
నేను నా మొబైల్ఫోన్లను ధ్వంసం చేశానని బదనాం చేస్తున్నారు. కానీ వాటిని నేను దర్యాప్తు సంస్థలకు అందజేశాను. ఎలాంటి దురుద్దేశం లేకుండా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాను.
గత రెండున్నర సంవత్సరాల విచారణలో రెండు దర్యాప్తు సంస్థలు అనేక సోదాలు జరిపాయి. అనేకమందిని శారీరకంగా, మానసికంగా వేధించాయి. ఒత్తిడికి గురి చేశాయి, బెదిరించాయి, అరెస్టు చేశాయి. అయినప్పటికీ.. వాంగ్మూలాలను, రాజకీయ కూటములను మార్చుకుంటూ ఉన్న కొంతమంది నుంచి వాంగ్మూలాలను మాత్రమే పొందుపర్చగలిగాయి.
ఈ కేసు పూర్తిగా వాంగ్మూలాల మీదనే నడుస్తున్నది. ఈ కేసులో డబ్బు జాడ లేదని, అవినీతికి ఆధారాలు లేవని, కేసును పక్కకు పడేయవచ్చని స్వయంగా గౌరవ జస్టిస్ సంజయ్ ఖన్నా వ్యాఖ్యానించారు. నేను సాక్ష్యాలను తారుమారు చేస్తున్నానని ఈడీ బదనాం చేస్తున్నది. అలాగైతే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదు ?
రెండున్నరేండ్ల విఫల విచారణ తర్వాత ఆధారాలు లేకుండా, కేవలం వాంగ్మూలాల ఆధారంగా, లోక్సభ ఎన్నికల ముందు మార్చి 15న ఈడీ నన్ను అరెస్టు చేసింది. ఎలాంటి బలవంతపు చర్య తీసుకోమని సుప్రీంకోర్టులో చెప్పిన తర్వాత కూడా అరెస్టు చేశారు.ఇప్పుడు 95 శాతం ఈడీ, సీబీఐ కేసులు ప్రతిపక్ష పార్టీల నేతల మీదనే ఉన్నాయి. ఈ కేసుల్లో నిందితులు బీజేపీలో చేరగానే విచారణ ఆకస్మికంగా ఆగిపోతున్నది.
పార్లమెంటు సాక్షిగా బీజేపీ నాయకులు.. ‘నోరు మూసుకొని ఉండండి.. లేదంటే ఈడీని పంపిస్తాం’ అని ప్రతిపక్షాలను బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు తమకు ఉపశమనం కల్పిస్తుందని న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకంతో చూస్తున్నాయి.నేను ఇప్పటివరకు విచారణ ప్రక్రియకు పూర్తి స్థాయిలో సహకరించాను. ఇక మీదట కూడా సహకరిస్తాను. బెయిల్ ఇవ్వగలరని కోరుతున్నా.
చివరగా నా మైనర్ కుమారుడు బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు తల్లిగా నా బాధ్యత ఎంత ముఖ్యమైనదో విద్యావంతురాలిగా అర్థం చేసుకోగలను. చదువుకు సంబంధించి ఇది నా కుమారుడికి కీలకమైన సంవత్సరం. నేను లేకపోవడం తనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడుతున్నాను. ఈ నేపథ్యంలోనైనా బెయిల్ వినతిని మళ్లీ పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నా.
– కృతజ్ఞతలు.