వైద్యవిద్య ఒకప్పుడు అందరికీ అందని ద్రాక్ష. ఒక వైద్యుడు తయారు కావాలంటే ప్రభుత్వాల ప్రోత్సాహం తప్పనిసరి. ఇందుకు విద్య, వైద్యం ఆయా ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యత కావడం అనివార్యం. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలతో పోల్చితే 75 ఏండ్ల స్వర్ణోత్సవ భారతావనిలో వైద్యవిద్య ఎండమావిగానే తయారవుతున్న ఈ రోజుల్లో స్వయం పాలన సాగుతున్న తెలంగాణలో వైద్యవిద్య ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైద్యవిద్య పై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.
ఒకప్పుడు ఎంసెట్ రాసి ప్రతిభ కనబరిచినా ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు దక్కని దుస్థితి. కానీ నేడు స్వ రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో వైద్య కళాశాలలు నిర్మితమయ్యాయి. గతం కంటే కాలేజీల సంఖ్య పెరిగింది. దీంతో కాస్తా కష్టపడి నీట్ పరీక్ష రాసి రాణించగలిగితే సీటు అవలీలగా లభిస్తుండడం సంతోషం. ఒక దశలో నా మిత్రులు వైద్య విద్య కోసం ఉక్రెయిన్, రష్యా, చైనా దేశాలకు వెళ్తూ నన్ను కూడా రమ్మని పిలిచారు. కానీ నా లాంటి సాదాసీదా పూసల సామాజికవర్గం(సంచారజాతులు)లో ఖర్చు తో కూడిన విద్య ఎండమావే. అయితే వైద్య విద్య చదువాలన్నది నా ఆశ. పెద్ద డాక్టర్ కావాలన్నది నా కోరిక.
నా కల నెరవేరుతుందా అని ఆలోచిస్తున్న క్రమంలోనే ప్రభుత్వం సీట్లను పెంచి నా కల సాఫల్యానికి బాటలు వేసింది. ఐదేండ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పీజీకి ప్రిపేరవుతున్న క్రమంలోనే ప్రభుత్వం మళ్లీ సీట్లను పెంచిందన్న సమాచారం మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి సర్వదా రుణపడి ఉంటాను. తెలంగాణలో నాలాంటి పేద కుటుంబాలు అనేకం ఉన్నాయి. గత రెండు మూడేండ్ల నుండి ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను పరికిస్తే పేద బడుగు బలహీనవర్గాలకు వైద్యవిద్య మిథ్య కాదు.. గట్టిగా చదివితే చాలా సులువని చెప్పక తప్పదు.
వాస్తవానికి తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండేవి. కానీ ఇవాళ సీఎం కేసీఆర్ కొత్తగా 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. 2014 లో 2,950 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే నేడు 8,340 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే స్థాయికి రాష్ట్రం ఎదగడం సంతోషం. అంటే రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు దక్కుతున్నాయి. అంతేకాకుండా ప్రతి లక్ష జనాభాకు 7.5 పీజీ సీట్లతో రెండో స్థానంలో ఉండడం చెప్పుకోదగ్గది. ఎంబీబీఎస్ సీట్ల పెరుగుదల దేశంలో 71 శాతంగా ఉంటే, తెలంగాణలో 124 శాతంగా ఉన్నది. పీజీ సీట్ల పెరుగుదల జాతీయ సగటు 68 శాతం ఉంటే, తెలంగాణ 111 శాతం నమోదు చేసుకోవడం విశేషం.
ఇక గతేడాది నుంచి బీ క్యాటగిరీలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,071 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించాయి. ఫలితంగా 8,78,280 ర్యాంకు వచ్చిన విద్యార్థికి కూడా సీటు వచ్చింది. ఎస్టీ రిజర్వేషన్ కోటాను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో ఎంతో మంది ఎస్టీ విద్యార్థులకు లబ్ధి చేకూరింది.
అంటే నా లాంటి పేద బడుగు బలహీనవర్గాల పిల్లలకు వైద్యవిద్య చాలా చేరువయ్యిందని తెలుస్తున్నది. అంతేకాకుండా ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేపట్టిన వైద్య ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కూ డా గతానికి భిన్నంగా జరిగి ఆదర్శంగా నిలిచింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించ డం తో పాటు వాటికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తూ మా లాంటి మధ్యతర గతి వారికి చేయూత నివ్వడం సంతోషకరం.
(వ్యాసకర్త: వైద్య విద్యార్థిని)
డాక్టర్
రుచిత గుంటిపల్లి