ఇంజినీరింగ్లో సబ్జెక్ట్ ఏదైనా అంతిమంగా ఐటీ జాబ్కే అందరూ గురిపెట్టడం మనదేశంలో రివాజుగా మారింది. పట్టా పుచ్చుకుని కాలేజీ నుంచి బైటకు రాగానే ఏదో ఒక టెక్ కంపెనీలో చేరిపోవచ్చనే ధీమా అందుకు కారణం. ఐటీ జాబ్ వస్తే స్థిరమైన కెరీర్కు బాటలు పడుతాయి. చక్కటి జీతంతో కార్పొరేట్ జీవితం గడపొచ్చని అనుకోవడం సహజమే. కానీ ప్రస్తుతం ఎంట్రీలెవెల్ జాబ్స్ క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈసారి రిక్రూట్మెంట్లు పూర్తిగా డోలాయమాన స్థితిలో పడిపోవడంతో వేలమంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.
గ్లోబల్ డిమాండ్ తగ్గిపోవడంతో అనేక కంపెనీలు ఫ్రెషర్స్ను తీసుకోవడం నిలిపివేశాయి. వాటిలో ఇన్పోసిస్, విప్రో వంటి టెక్ దిగ్గజాలు ఉండటం గమనార్హం. మన దేశానికి ఉపాధి కల్పించే రంగాల్లో ఐటీ వాటా 7.5 శాతం వరకు ఉంటుంది. ఐటీ ఉద్యోగాలు పుట్లకొద్దీ చూసిన మనదేశంలో జాబ్స్ కొరత అసాధారణమైన విషయమే. అయితే ఇది కేవలం ఫ్రెషర్స్ సమస్య మాత్రమే కాదు. లక్షల కోట్ల పరిశ్రమలో ఏర్పడుతున్న సంక్షోభానికి ఇది ఒక సూచనగా నిలుస్తుంది. భారతదేశ వృద్ధిపై ప్రభావం చూపి, భారత ఆర్థిక వ్యవస్థను మూడు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకువెళ్లాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు ఇది గండి కొట్టే అవకాశం ఉన్నది. కరోనా కల్లోలం ప్రధానంగా ఉద్యోగాలకు గండిపెట్టింది. అయితే గత రెండేండ్లలో పరిస్థితి మెరుగుపడి ఐటీ కంపెనీలు భారీస్థాయిలో రిక్రూట్మెంట్ జరిపాయి.
వర్క్ ఫ్రం హోం పద్ధతి రావడం కూడా ఇందుకు దోహదం చేసింది. అగ్రస్థాయి కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ దాదాపు 3 లక్షల మంది ఫ్రెషర్స్ను తీసుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచంలో అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచ ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల దానికి ఆజ్యం పోశాయి. ఫలితంగా ఐటీ సేవలను ఉపయోగించుకునే కంపెనీలు ఖర్చులను తగ్గించే పనిలో పడ్డాయి. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత సాధించిన అభివృద్ధి కూడా ఫ్రెషర్స్ ఉద్యోగాలు తగ్గడానికి కారణమవుతున్నది. దీంతో కొత్త ఉద్యోగులను తీసుకోవడం భారీగా తగ్గిపోయింది. నిరుడుతో పోలిస్తే ప్రెషర్స్ రిక్రూట్మెంట్ మొన్నటి సెప్టెంబర్లో 43 శాతం, అక్టోబర్లో 14 శాతం తగ్గింది. క్రమం తప్పకుండా క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిపే పెద్దపెద్ద కంపెనీలు ఈ ఏడాది ముఖం చాటేశాయి. గత అక్టోబర్లో ఒక అంచనా ప్రకారం నిరుద్యోగం 10.05 శాతానికి పెరిగింది. ఐటీలో మాంద్యం వస్తే దాని ప్రభావం ఇతర రంగాలపైనా ఉంటుందనేది తెలిసిందే.
ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోదీకి ఇదొక తలనొప్పిగా మారవచ్చు. ఎందుకంటే కేంద్ర విపక్షాలు దీనిపై హంగామా చేయకుండా ఉంటాయని భావించలేం. నిరుద్యోగులు ఆందోళన బాట పడితే సమస్య చేయిదాటిపోయే ప్రమాదమూ ఉంటుంది. దీనిని పసిగట్టే ప్రధాని మోదీ స్వయంగా ఉపాధి మేళాలకు వచ్చి నియామక పత్రాలు అందజేస్తూ ఇమేజ్ కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఈ రాజకీయ వ్యవహారాన్ని పక్కన బెడితే ఐటీ రంగాన్ని ప్రస్తుత సంక్షోభం నుంచి బైటపడేసే చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. సీనియర్లతో కిందిస్థాయి పనులు చేయించడం మానుకొని ఫ్రెషర్స్కు అవకాశాలు కల్పించడం అనేది దిద్దుబాటు చర్యల్లో ముఖ్యమైంది. అయితే అందుకు నూతన అవకాశాలను అందిపట్టుకోవడమూ అవసరమేనని చెప్పక తప్పదు.
– ఎడిటోరియల్ డెస్క్