డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్గంలోనే దళితుల, ఆదివాసీల, స్త్రీల రక్షణ కోసం ప్రజాస్వామ్య లౌకికవాద సోషలిస్టు భావజాలంతో ఉన్నవారందరం కలసి ఏక కంఠంతో పోరాటం చేయాలి.
మణిపూర్లో జరుగుతున్న అత్యాచారాలు, మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘట్టాల మీద ప్రధాని మోదీ 80 రోజులు నోరు విప్పకపోవడానికి కారణమేమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ అఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియో ద్వారా ప్రపంచమంతా వీక్షించింది. ఈ ఘటనలో ముఖ్యపాత్ర వహించిన మణిపూర్ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని, మణిపూర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ను ఆగస్టు 7న స్వయంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగిన తర్వాత కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు జాప్యం చేశారని సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు ఇటీవల అనేక విషయాల్లో రాజ్యాంగేతర శక్తిగా ప్రభుత్వం నడుస్తున్నదని హెచ్చరిస్తూ వస్తున్నది. ఈ ఘటన మీద హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన అనేక అనుమానాలకు దారితీస్తుంది. గుజరాత్లో ఒక వర్గానికి 2022లో బుద్ధి చెప్పిన తర్వాత అక్కడ మతఘర్షణలు ఆగిపోయాయని హోంమంత్రి అంటున్నారు. 2022 నుంచి హిందువులకు భయపడి ముస్లింలు అక్కడ జీవిస్తున్నారని అర్థం.
కుకీల అటవీ భూములను మొయితీలకు కట్టబెట్టి అడవిపై ఆధిపత్యం వహించాలనేది మణిపూర్లో పన్నిన వ్యూహం. ముఖ్యంగా కుకీలు అడవి సంపదనంతా రక్షిస్తూ వచ్చారు. అడవి సంపదలో ప్రధానంగా గ్రానైట్, ప్లాటినం మెటల్స్, ఎలిమెంట్స్, నికిల్, కాపర్, బొగ్గు, పెట్రోలియం ఇంకా ఎంతో విలువైన ఖనిజ సంపదను వారు భారతదేశానికి ఒక ఘన నిక్షేపంగా కాపాడుతూ వచ్చారు. దానికి కారణం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు చట్టపరమైన, రాజ్యాంగపరమైన హక్కులున్నాయి. ఈ హక్కుల ప్రకారం అక్కడ మైనింగ్ను దోపిడీ చేయడానికి కార్పొరేట్లకు అవకాశం లేదు. అందుకే వాళ్లు విధ్వంసానికి పూనుకున్నారు. ఈ రోజున ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి ఆయువులు. ఈశాన్య రాష్ట్రాల్లో భారత ఉపఖండం మూలాలున్నాయి. ఈ భారతదేశాన్ని జయించిన ఆర్యులు, కుషానులు, అరబ్బులు, తురుష్కులు ఎవరూ కూడా ఈశాన్యాన్ని ముట్టుకోలేకపోయారు. తాకట్టులోకి భారతదేశం వెళ్తున్నప్పుడు కూడా ఈశాన్యం తనను తాను కాపాడుకుంది. గిరిజనుల పోరాటాల వల్ల సంపదను కాపాడుతుంది.
మణిపూర్లో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి, క్రైస్తవులపై దాడి చేయడానికి వెనకాడటం లేదు. అది ప్రపంచమంతా అర్థం చేసుకుంది. ముస్లింల మీద, క్రైస్తవుల మీద, బౌద్ధుల మీద, జైనుల మీద చేస్తున్న దాడులు వెనక మొత్తం భారతదేశాన్ని గుప్పెట్లో తీసుకోవాలని, భారతదేశ వనరులన్నీ కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసి తద్వారా మిగిలిన జాతులన్నింటిని ధ్వంసం చేయాలనే భావన మనకు కనిపిస్తుంది. నిజానికి గిరిజనులు అక్కడ ఎందుకు క్రైస్తవులైనారు. వారు క్రైస్తవులు అవ్వడం వల్ల వారికి కలిగిన లాభమేమిటి? అక్కడ గిరిజన పిల్లలు ఎక్కువ మంది ఈ రోజు అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో చదవగలుగుతున్నారంటే ఇంగ్లీషు విద్యను చదవడానికి క్రైస్తవ మతాన్ని వారు ఆశ్రయించారు.
మణిపూర్ హింస గురించి బీజేపీలోనే వ్యతిరేకత పెల్లుబుకింది. బీజేపీ ఎమ్మెల్యే పోలిన్ లాల్ హోకిప్ మహిళలను నగ్నంగా ఊరేగించడం మీద తీవ్ర ఆక్షేపణ తెలిపారు. మణిపూర్లో చెలరేగుతున్న హింస కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, దీనివెనుక భారీ కుట్ర ఉన్నదని ఆ రాష్ట్ర అధికార బీజేపీ ఎమ్మెల్యే పోలిన్లాల్ హోకిప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల నగ్న వీడియో బయటకు రాకుంటే ప్రధానమంత్రి మోదీ అసలు మాట్లాడేవారే కాదన్నారు. హింస మొదలైనప్పుడే సమస్యను చెప్పుకొనేందుకు ప్రధాని అపాయింట్మెంట్ అడిగామని, ఇప్పటికీ కలిసేందుకు ఆయన అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హింసకు మైతే మిలిషియాతో పాటు పోలీసులూ కారణమని విమర్శించారు.
మణిపూర్లో శాంతిని నెలకొల్పడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గిరిజన రచయితలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. 26 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 86 మంది గిరిజన రచయితలు ఈ లేఖపై సంతకాలు చేశారు. ‘సువిశాలమైన, సాంస్కృతిక వైవిధ్యం కలిగిన దేశానికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు సహాయం చేయాలి’ అని దేశంలోని కోట్లాది మంది గిరిజనుల తరపున ‘ఆల్ ఇండియా ఫస్ట్ నేషన్స్’ (స్వదేశీ, ఆదివాసీ) రచయితల సదస్సు సభ్యులు లేఖలో విజ్ఞప్తి చేశారు.
గత రెండు నెలలుగా మణిపూర్లో కొనసాగుతున్న హింసాకాండ పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు, తాము దిగ్భ్రాంతి చెందామనీ, విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఇద్దరు కుకీ, గిరిజన మహిళలను బందీలుగా చేసి, క్రూరంగా హింసించడం ఇది భారతదేశంలోని 700కు పైగా గిరిజన సంఘాలను మాత్రమే కాకుండా మొత్తం పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. దేశంలోని ఆదివాసీ సాహితీవేత్తలమైన తాము ఈ హీనమైన, అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన మహిళలపై క్రూరమైన దాడికి పాల్పడిన ప్రత్యక్ష, పరోక్ష నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మణిపూర్ విషయాన్ని కొందరు లౌకికవాదులు ఇలా విశ్లేషిస్తున్నారు. మణిపూర్ విషాదం జాతి సంహారం లేదా జాతి ప్రక్షాళనకు ఆరంభమే. అవును, సందేహం లేదు జాతి ప్రక్షాళన (ఎథ్నిక్ క్లీన్సింగ్) ఒక భయానక పదబంధం ఇప్పుడది భారత్ను వెన్నాడుతోంది, పీడిస్తున్నది. జాతిపరంగా ఒక సజాతీయ భౌగోళిక ప్రాంతాన్ని నెలకొల్పేందుకు అవాంఛిత ఉపజాతి సభ్యులను (దేశ బహిష్కృతులను చేయడం, స్థాన చలనం కలిగించడం లేదా మూకుమ్మడిగా హతమార్చడం ద్వారా) సంపూర్ణంగా వదిలించుకోవడమే జాతి ప్రక్షాళన అని హిస్టరీ. కామ్ వెబ్సైట్ ఎడిటర్స్ నిర్వచించారు.
ఎథ్నిక్ క్లీన్సింగ్కు ఉదాహరణలుగా మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఆర్మేనియన్ల ఊచకోత, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో 60 లక్షల మంది యూరోపియన్ యూదుల మారణహోమాన్ని చరిత్రకారులు పేర్కొంటారు. ఐరోపాలో సెర్బియా, కొన్ని ఆఫ్రికన్ దేశాలు కూడా జాతి ప్రక్షాళనను చవిచూశాయి. స్వాతంత్య్రానికి పూర్వం భారత రాజ్యాంగం గుర్తించింది. మూడు ప్రధాన జాతుల వారికి మణిపూర్ నెలవు.
తమ నాగరికత కొన్ని వేల ఏండ్ల నాటిదని గొప్పలు చెప్పుకొనే ఈ దేశంలో ఈ ఆదిమవాసులు నేటికీ ప్రాచీన కాలంనాటి దుర్భర అనాగరిక పరిస్థితిలోనే నివసిస్తున్నారంటే ఏమనాలి? కానీ, ఇది మాత్రం నగ్నసత్యం. ఇన్ని వేల ఏండ్లుగా ఈ దురదృష్టవంతులు నాగరికులు కాలేకపోవడం ఒక్కటే కాక ఇందులో కొందరు దుష్టవృత్తులను అవలంబించే దుస్థితికి దిగజారి నేరస్త జాతులు (క్రిమినల్స్)గా పరిగణించబడుతున్నారు. కోటి ముప్పై లక్షల మంది, నాగరికత మధ్య బతుకుతూ అనాగరిక ఘోర దుస్థితిలో ఉండిపోవడం! పైగా వంశపరంపరగా నేరస్థులుగా బతుకడం! దీనికి పాలకులు సిగ్గయినా పడకపోవడం! ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్ర పరిస్థితి ఇది. ఈ లజ్జాకరమైన పరిస్థితికి ఏమిటి కారణం? ఈ ఆదిమవాసులను నాగరికులుగా మార్చడానికి, గౌరవప్రదమైన వృత్తులు చేపట్టేలాగ చేయడానికి అసలు ప్రయత్నమే జరగలేదు. ఎందువల్ల?
బహుశా, వాళ్ల అనాగరికస్థితికి జన్మసిద్ధమైన బుద్ధిమాంద్యమే కారణమని చెప్పడానికి ప్రయత్నించవచ్చు. ఆదిమవాసులు తరతరాలుగా అనాగరికులుగానే ఉండిపోవడానికి కారణం తామేననీ ఒప్పుకోకపోవచ్చు. వాళ్లకు నాగరికత నేర్పడానికి గాని, వైద్య సహాయం మొదలైన వాటిద్వారా వాళ్లను సరిదిద్దడానికి గాని, వాళ్లను సంస్కరించి మంచి పౌరులుగా తయారుచేయడానికి గాని తాము ఏ మాత్రమూ ప్రయత్నించకపోవడమే ఆదిమవాసుల అనాగరిక స్థితికి కారణమని పాలకులు అంగీకరించకపోవచ్చు. ఆదిమవాసులను నాగరికులను చేయడమంటే వాళ్లను నీ వాళ్లుగా భావించడం. వాళ్ల మధ్య నివసించడం, వాళ్లలో ఒక సహానుభూతిని పెంపొందించడం, క్లుప్తంగా చెప్పాలంటే, వాళ్లను ప్రేమించడం.
(వ్యాసకర్త: మహాకవి, దళిత ఉద్యమనేత)
డాక్టర్ కత్తి పద్మారావు
98497 41695