వికసించే సమాజానికి గ్రంథాలయాలు ఆక్సిజన్ వంటివి. అందుకే పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటుచేసి పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో మానసిక వికాసానికి బీజం వేస్తున్నది చిన్నారి ‘ఆకర్షణ’. గత నెల రోజులుగా దేశం మొత్తం చర్చిస్తున్న పేరు ‘ఆకర్షణ’. ఆ చిన్నారి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ‘ఆకర్షణ’ అనే పన్నెండేండ్ల విద్యార్థిని 7వ తరగతి చదువుతున్నది. ఆమె ఏర్పాటుచేస్తున్న గ్రంథాలయాలు నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, తమిళనాడులోనూ ఆకర్షణ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
కరోనా మహమ్మారి కాలంలో గ్రంథాలయాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ‘ఆకర్షణ’ స్నేహితులు, తోటి విద్యార్థుల నుంచి 6,498 పాత పుస్తకాలను సేకరించింది. వాటితో పలు ప్రాంతాల్లో గ్రంథాలయాలు ఏర్పాటుచేసింది. ‘ఆకర్షణ’ తండ్రి సతీష్ కుమార్ లీడ్ ఇండియా ఫౌండేషన్-2020 కో-ఆర్డినేటర్గా తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో మిస్సైల్మెన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలిసి పనిచేశారు.
‘ఆకర్షణ’ను మొదటిసారిగా చూసినప్పుడు తను ఆకర్షణీయంగా ఉన్నదని అబ్దుల్ కలాం తనకు ‘ఆకర్షణ’ అనే పేరు పెట్టారని తండ్రి సతీష్కుమార్ చెప్తున్నారు. అబ్దుల్ కలాం ప్రేరణతోటి అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నానని ‘ఆకర్షణ’ ఉద్ఘాటిస్తున్నది.
పుస్తకం చదవడం వల్ల సంక్లిష్ట విషయాల్లో కూడా సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుందని, చక్కటి వాక్చాతుర్యాన్ని అలవర్చుకోవడానికి నాకు పుస్తక పఠనం ఉపయోగపడిందని చెప్తున్నది ఆకర్షణ.గ్రంథాలయం స్థాపించాలనే ఆలోచన తనకెందుకు వచ్చిందనే క్రమంలో కరోనా కాలంలో ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో రోగులకు పళ్లు, ఆహారం పంచే కార్యక్రమంలో పుస్తకాలను కూడా పంచానంటున్నది ఆకర్షణ. తద్వారా, ముఖ్యంగా చిన్న పిల్లలు మానసిక ఉల్లాసాన్ని పొందుతారని, తద్వారా వారికి కొంత ఉపశమనం కలిగే ఆస్కారం ఉన్నదని చెప్తున్నది. ఆస్పత్రి పెద్దలతో మాట్లాడి మొట్టమొదటి గ్రంథాలయం 2021 ఆగస్టు 6న 1,036 పుస్తకాలతో ప్రారంభించింది. నాటి నుంచి పలుచోట్ల, పలు గ్రంథాలయాలకు శంకుస్థాపన చేస్తూనే ఉన్నది ఆకర్షణ. ఈ చిన్నారి చేసిన సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ 105వ భాగంలో కొనియాడారు. అంతేకాదు, ఆకర్షణ ఏర్పాటుచేయబోయే 25వ గ్రంథాలయానికి తాను అతిథిగా వస్తానని వాగ్దానం చేశారు.
దేశవ్యాప్తంగా కనపడని ‘ఆకర్షణ’లు ఎంతోమంది ఉన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పాఠశాలలో, సామాజిక కూడలిలో, స్వచ్ఛంద సంస్థలలో స్వచ్ఛందంగా గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి గ్రంథాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తే చక్కటి విజ్ఞానవంతమైన తరాన్ని ఈ సమాజానికి అందించగలిగినవారమవుతాం. అందుకే ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలతో ఆకర్షణ లాంటి వారికి సహాయ సహకారాలు అందించాలి. యువత, విద్యార్థులను పుస్తక పఠనం వైపు తీసుకువెళ్లాల్సిన అవసరం ప్రభుత్వాలపైనా ఉన్నది. ‘ఆకర్షణ’కు తన లాంటి పుస్తక ప్రేమికులకు ఈ సందర్భంగా అభినందనలు.
-డాక్టర్ రవికుమార్ చేగోని
98669 28327