ఎక్కడో తొమ్మిది వేల కిలోమీటర్ల దూరంలో ఆఫ్రికా అడవుల్లో కొన్ని చిరుతలు వాటి మానాన అవి బతుకుతున్నాయి. అయితే, పబ్లిసిటీ కోసం తెగ ఆరాటపడే ప్రధాని మోదీ.. వాటిని తీసుకొచ్చి ఇక్కడి కునో పార్కులో పడేశారు. చీతాలను విడిచిపెడుతూ ఫొటోలకు ఫోజులిస్తూ నానా హంగామా చేశారు. అయితే, వాటి ఆవాసానికి ఎంతో భిన్నమైన ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేని ఆ మూగజీవాలు ఒకదాని తర్వాత ఒకటి తనువు చాలిస్తున్నాయి. అయితే, చీతాలను తెచ్చినప్పుడు సందడి చేసిన మోదీ.. ఇప్పుడు అవి చచ్చిపోతున్నప్పుడు నోరు మెదపట్లేదు. ప్రచారం కోసం ప్రధాని చూపిన అత్యుత్సాహం కారణంగా చీతాలు ఎలాంటి బాధను అనుభవించాయో… ఓ చీతా, స్వగతంగా చెప్తే.. బహూశా ఇలాగే ఉంటుందేమో..
నా పేరు సూరజ్. పేపర్లో చదివే ఉంటారు గా.. కునో నేషనల్ పార్క్లో ఈ నెల 14న చనిపోయిన చిరుతను నేనే. ఆఫ్రికా నుంచి నన్ను కునోకు తీసుకొచ్చారు. విమానంలో జర్నీ. సెలబ్రిటీ ట్రీట్మెంట్. ‘ఆహా.. ఏమి నా రాజభో గం’ అని మనసులోనే అనుకున్నా. అయితే, నా బతుకు ఎంత దుర్భరంగా ముగియబోతుందోనన్న విషయం ఇక్కడికి వచ్చిన మొదటిరోజే నాకు అర్థమైంది.
జంతు ప్రేమికులు అడ్డుకున్నారు: ఇండియాకు విమానంలో వెళ్తున్నానన్న ఆనందం ఒకపక్క ఉన్నప్పటికీ.. ఆఫ్రికా వైల్డ్లైఫ్ పార్కులో నా కుటుంబం, నేస్తాలతో నేను గడిపిన క్షణాలు, మా సంరక్షకుడు విన్సెంట్ వాన్డర్ నాపై చూపించిన ప్రేమ, ఆదరణ గుర్తొచ్చి ఎంతో బాధపడ్డా. నన్ను కునోకు తరలించడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు అక్కడి జంతు ప్రేమికులు అడ్డుచెప్పారు. కునోలోని జీవావరణం మాకు ఎంతమాత్రం తగినదికాదని, అది మా మరణానికే దారితీయొచ్చని నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు వాళ్లు అలా ఎందుకు వ్యతిరేకించారో.. నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమయింది. ఏదైతేనేం.. మోదీ దౌత్యం మేరకు నాతో కలిపి మరో ఎనిమిది చీతాలను ఆఫ్రికా ప్రభుత్వం భారత్కు పంపించింది.
రాగానే కష్టాలు మొదలు: అది ఫిబ్రవరి 18. విమానంలో దాదాపు 17 గంటల ప్రయాణం. మధ్యప్రదేశ్లోని కునో పార్క్కు రాగానే.. ఫొటోలు, వీడియోలతో గొప్ప వేడుకగా అనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ మమ్మల్ని కునో పార్క్లోకి పంపిస్తూ విజయ సంకేతాలు చూపించారు. ఫొటోలకు ఫోజిచ్చారు. ‘ఆహా.. ఎంత బాగుంది కదా!’ అనుకొన్నా. ఆ తర్వాతే అసలు విషయాలు బోధపడ్డాయి. వచ్చీ రాగానే, ఇక్కడి వాతావరణం నాకు అసౌకర్యంగా అనిపించింది. మా కదలికలను కనిపెట్టడానికి మెడలో కట్టిన రేడియో కాలర్లు, చుట్టూ నిఘా కెమెరాలు, వాతావరణంలో మార్పు, నిర్బంధించినట్టు తక్కువ పరిధిలో మాత్రమే తిరిగేలా ఉన్న ఆవరణ.. ఇలా నా ఇబ్బందులు క్రమంగా పెరుగసాగాయి.
మరణ మృదంగం మొదలు..: నాతోటి స్నేహితులకు కూడా దాదాపుగా ఇవే పెద్ద సమస్యలుగా పరిణమించాయి. దీంతో కునో వాతావరణానికి అలవాటు పడలేక మార్చి 27న ‘సాషా’ మూత్రపిండాల సమస్యతో చనిపోయాడు. ఆ మరుసటి నెల 24న ‘ఉదయ్’ గుండె, ఊపిరితిత్తుల సమస్యతో దూరమయ్యాడు. మే 9న ‘దక్ష’ మగ చీతాలతో సంభోగం చేస్తూ గాయాలపాలై మరణించింది. ఆ తర్వాత ‘జ్వాలా’ పిల్లలైన మూడు చీతా కూనలు వరుసగా మరణించాయి. ఈ నెల 11న మెడలోని రేడియో కాలర్ గాయాల కారణంగా ఇన్ఫెక్షన్ సోకి ‘తేజస్’ చనిపోయాడు. ఇలా వరుసగా చీతాలు మరణిస్తుండటంతో నేను ఎంతో భయపడిపోయా. ఆఫ్రికాలో ఇన్నేండ్లూ నాతో కలిసి ఏంచక్కా ఆడుకొన్న నా నేస్తాలు.. ఎందుకు ఇలా చనిపోతున్నాయో నాకేం అర్థం కావట్లేదు. అప్పటికే, నా ఆరోగ్యం కూడా క్షీణిస్తూ రాసాగింది. ముందుకంటే చాలా బలహీనపడినట్టు అర్థమయింది.
ఆందోళనలు షురూ..: ఐదు నెలల్లోనే ఏడు చీతాలు మరణించడంపై జంతుప్రేమికుల్లో ఆందోళన మొదలైంది. సౌకర్యంగా లేని జీవావరణ ప్రదేశం, రేడియో కాలర్లు అమర్చడం, సంతానం కోసం చీతాలను బలవంతంగా దగ్గరకు చేర్చడం, వాతావరణంలో మార్పు, గతంలో ఆఫ్రికా చీతాలను సంరక్షించిన అనుభవం నిర్వాహకులకు లేకపోవడం తదితర కారణాల వల్లే చీతాలు మరణిస్తున్నట్టు నిపుణులు చెప్పారు. వెంటనే మమ్మల్ని వేరే ప్రాంతాలకు తరలించాలని కేంద్రానికి సూచించారు. నిపుణులు చెప్పిన కారణాలు ముమ్మాటికీ నిజం. ఆఫ్రికాలో నివసించే మా వంటి చీతాల ప్రాదేశిక జీవావరణం విశాలంగా ఉండాలి. ఒక్కో చీతా సంచారానికి కనీసం 100 చదరపు కిలోమీటర్ల పరిధి అవసరం. అయితే కునో పార్కులో మా 8 చీతాలతో పాటు అంతకుముందు తీసుకొచ్చిన పది చీతాలతో కలిపి మొత్తం 18 చీతాలకు 1800 చదరపు కిలోమీటర్ల పరిధి కావాలి. కానీ, 487 కిలోమీటర్ల పరిధినే కేటాయించారు. ఇదెంత అన్యాయం? ఇలాంటి జైలు లాంటి పార్కులో మేం ఎలా ఉంటాం? ఇక, చీతాల సంతానాన్ని వృద్ధి చేయాలన్న లక్ష్యంతో బలవంతంగా మగ చీతాలతో ఆడ చీతాలను ప్రారంభంలోనే ఉంచడం ఎంతవరకు సరైన చర్య అనిపించుకొంటుంది? అసలే, ఈ వాతావరణానికి అలవాటుపడలేని ‘దక్ష’.. ఈ చర్యతో గాయాలపాలై ప్రాణాలు విడిచిపెట్టింది. కునోలోని స్థలం చాలకపోవడంతో, నా మిత్రుడు ‘ఒబాన్’ పార్కు నుంచి సమీప గ్రామాల్లోకి పారిపోయాడు. అయినప్పటికీ, మా బాధను అధికారులు అర్థం చేసుకోలేకపోయారు. ఇక, రేడియో కాలర్లు కారణంగా ఇన్ఫెక్షన్లు అవుతున్నా.. నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోలేదు.
కేంద్రానిది ప్రచార యావ: చీతాల వరుస మరణాలను కేంద్రం అస్సలు పట్టించుకోలేదు. వారికి ప్రచార ఆర్భాటంపై ఉన్న యావ.. మా ప్రాణాలపై లేదు. అందుకే, ప్రెస్టేజ్కు సంబంధించి ఆలోచించాల్సిన సమయం ఇది కాదని, చీతాలను వేరేచోటుకు తరలించే ప్రక్రియ మొదలుపెట్టాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా మొట్టికాయలు వేసినా బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం చలించలేదు. కేంద్రం నిర్లక్ష వైఖరిపై విపక్షాలు మండిపడ్డా వినిపించుకోవట్లేదు. కునో నుంచి మరోచోటుకు చీతాలను తరలించే ఆలోచన లేదని కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ తేల్చిచెప్పడమే దీనికి నిదర్శనం. ఇక, ఇవన్నీ చూశాక.. నేను కూడా బతకడం కష్టమేనని నాకు అర్థమయింది. అప్పటికే, మెడ గాయం ఇన్ఫెక్షన్గా మారింది. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అలా నా కండ్లు క్రమంగా మూతబడ్డాయి.
ఇంతలో నా మనసులో ఓ ప్రశ్న..అది కూడా మోదీకే..అయ్యా.. ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో ఎంతో చక్కగా నా కుటుంబసభ్యులతో ఉండే నన్ను.. ఇక్కడికి తీసుకొచ్చి చితి పేర్చమని మిమ్మల్ని అడిగానా.. చెప్పండి? ఇక, సెలవు..!
-కడవేర్గు రాజశేఖర్
83093 70601