దేశంలోని మరే రాష్ర్టాల్లో లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆయన దూరదృష్టి గల నాయకుడు అని తెలంగాణ అగర్వాల్ సమాజ్ సహాయతా ట్రస్ట్ అధ్యక్షుడు రాజేశ్ అగర్వాల్ అన్నారు. ట్రస్ట్ ద్వారా చేస్తున్న వివిధ సామాజిక కార్యక్రమాలను గుర్తించి, వారికి ఉప్పల్ భగాయత్లో సీఎం కేసీఆర్ 3 ఎకరాల భూమిని కేటాయించారు. మార్వాడీలు పలు రాష్ర్టాల్లో వ్యాపారాలు చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు., అయితే ఒక్క కేసీఆర్ మాత్రమే వారి సేవలను గుర్తించి ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనపై రాజేశ్ అగర్వాల్ అభిప్రాయం ఆయన మాటల్లోనే….
పొట్ట చేతబట్టుకుని బతకటానికి వచ్చిన మా సామాజిక వర్గం హైదరాబాద్, సికింద్రాబాద్తో సహా తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని పలు జిల్లాల్లో స్థిరపడింది. హైదరాబాద్లో స్థిరపడిన వారిలో మాది పదవ తరం. మా ప్రధాన జీవనధారం వ్యాపారం. దాని ద్వారా వచ్చిన మొత్తంలో కొంత పన్నులకు, మరికొంత ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు ఖర్చు పెడుతాం. అందుకోసం మా పూర్వీకులే ఇక్కడ అగర్వాల్ సహాయతా ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థకు ప్రస్తుతం నేను అధ్యక్షుడుగా ఉన్నాను. మా సంస్థ తరుపున విద్యాసంస్థలు నిర్వహిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు అన్ని కులాలతో పాటు మా వాళ్ల్లూ ఉంటారు. అలాగే పేదల పెండ్లిళ్లకు ఆర్థిక సాయం, పేద విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, రోగుల చికిత్సకు, తదితర సహాయక కార్యక్రమాలు అందిస్తున్నాం.
కేసీఆర్ మా సేవలను గుర్తించారు….
మా సంస్థ ‘అగర్వాల్ సమాజ్ సహాయతా ట్రస్ట్’ తరుపున చేస్తున్న సామాజిక సేవలను తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తించారు. ట్రస్ట్ భవనానికి ఉప్పల్ భగాయత్ వద్ద భూమి కేటాయించారు. మా సామాజిక వర్గాన్ని, సేవలను గుర్తించి భూమి కేటాయించడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆత్మగౌరవ భవనం పేరు సరిగ్గా సరిపోతుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో మా ఆత్మగౌరవం మరింత పెరిగింది. మా సామాజిక వర్గం వారు (మార్వాడీలు) ఎన్నో రాష్ర్టాల్లో ఉన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం ఇలా భూమి కేటాయించలేదు.
కేసీఆర్ దూర దృష్టిగల నాయకుడు….
కేసీఆర్ దూరదృష్టి గల నాయకుడు. అంతే కాదు గొప్ప దాతృత్వ గుణం కలవారు కూడా. తెలంగాణ రాష్ర్టానికి ఆయనను జాతిపితగా భావిస్తా.. మరో గాంధీ, మరో నెహ్రూగానే…భావిస్తా. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ ఎలా అహింసాయుతంగా పోరాడారో..ఏ విధంగా ఆమరణ దీక్షలకు దిగారో..అలాగే తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఆఖరుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం సాధించారు.
తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణను తొమ్మిదేండ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారు… ఇంకా చేస్తున్నారు. మొదటగా కేసీఆర్ చెరువులను మరమ్మతు చేయించారు. ఆ తర్వాత మంచినీటి అవసరాన్ని గుర్తించి ఇంటింటికీ నల్లా… పథకాన్ని అమలుచేశారు. గతంలో వేసవి కాలం వస్తే ప్రతి ఊర్లో బిందెలు పట్టుకుని చాలా దూరంనుంచి నీళ్లు తెచ్చుకునే మహిళల ఫొటోలు పేపర్లలో చూసేవాళ్లం. గ్రామాల్లోనే కాదు రాజధాని నగరం హైదరాబాద్లో కూడా ప్రతి గల్లీలో ప్రైవేటు నీటి ట్యాంకర్లు కనబడేవి. కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేవు. మొత్తం రాష్ట్రంలో మంచి నీటి సమస్యను పరిష్కరించారు. దీన్ని ఎవరైనా కాదనగలరా?
రైతులు బాగుపడితే..దేశం బాగుంటుంది…
వ్యవసాయ ప్రాధాన్యం గల మన దేశంలో రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగాభివృద్ధికి..కేసీఆర్ పెద్ద పీట వేశారు. రైతు బంధు, రైతు బీమా లాంటి విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నారు. రైతులు బాగుపడితే దేశం బాగుంటుంది. ఇంకా కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టును నిర్మించారు. ఇంకా అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. తెలంగాణలో అమలవుతున్న ఎన్నో పథకాలు ఇతర రాష్ర్టాల్లో అమలు కావటం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎన్ని చెప్పినా, నిజాలు అబద్ధ్దాలుగా మార్చలేరు. రైతులకు సాగునీటితో పాటు, ఉచిత కరెంటు ఇస్తున్నారు. అలాగే ఎరువులకు, విత్తనాల కోసం పెట్టుబడి సాయంగా రైతుబంధు ఇస్తున్నారు. పండిన పంటను కూడా ప్రభుత్వమే కొంటున్నది. ఇంకా రైతులకు కావల్సిందేమిటి. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. దవాఖానల్లో వైద్యసౌకర్యాలు పెరిగాయి. ప్రభుత్వం దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించటానికి కేసీఆర్ కిట్, నగదు పంపిణీ కూడా చేస్తున్నది ప్రభుత్వం. మా బంధువులు ఎక్కువగా ఉన్న హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ర్టాలలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావటం లేదు. అక్కడి ముఖ్యమంత్రులకు కేసీఆర్కు ఉన్న విజన్ లేదు.
భూముల ధరలు పెరిగాయి
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దానికి పెద్ద ఉదాహరణ భూముల ధరలు. ధరలు చాలా పెరిగాయి. పారిశ్రామికాభివృద్ధి స్పీడ్గా సాగుతున్నది. ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ పనితీరు చాలా బాగుంది. కేటీఆర్, కవిత ఇద్దరూ కూడా చాలా తెలివైనవారు. కేటీఆర్ మంత్రిగా హైదరాబాద్లో ఎన్నో ఫ్లై ఓవర్లు కట్టారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపారు. ఎల్బీనగర్ చౌరస్తా చూస్తే ఇది హైదరాబాదేనా అన్న అనుమానం కలుగుతుంది.
తెలంగాణ మాడల్ భేష్
బీజేపీ గుజరాత్ మాడల్ ప్రచారం జరుగుతున్నా.. అక్క డ ఇలాంటి అభివృద్ధి కనిపించదు. కానీ తెలంగాణ అభివృద్ధి కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రతి వ్యక్తికి పని కల్పించాలని, ఆర్థికంగా, సామాజికంగా బాగుండాలని ప్రణాళికలు అమలు చేస్తున్నారు. దళితబం ధు కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్నారు. ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలోనూ లేదు. మా ఇంటి పక్కకే ఒక పెద్ద స్లమ్ ఉండేది. ఆ పేద కుటుంబాలకు అదే చోట కేసీఆర్ డబుల్ బెడ్రూంలు కట్టించి ఇచ్చారు. ఈ పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలైతే ఇంక కావలసింది ఏముంటుంది?
బెదిరింపులు ఉత్తవే..
తెలంగాణ వస్తే ఇతర రాష్ర్టాల వారికి భద్రత ఉండదని భయపెట్టారు. అలాంటిదేం లేదు. అవన్నీ ఒట్టి మాటలని రుజువైంది. ఇండియాలో ఎన్ని వర్గాల వారున్నారో, అన్ని వర్గాల వారు హైదరాబాద్లో ఉన్నారు. వ్యాపారస్థులకు కూడా ఎలాంటి వేధింపులు లేవు. మాదీ తెలంగాణ అని గర్వంగా చెబుతాం. మా వ్యాపారం మేం చేసుకుంటున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్టే వ్యాపార వర్గాల సమస్యలకు కూడా ఓ కార్పొరేషన్, లేదా ఓ సింగిల్ విండో లాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్ను కోరుకుంటున్నాను. ఎంతో దూరదృష్టి కల నాయకుడైన కేసీఆర్ పాలన మున్ముందు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు..
సీఎం కేసీఆర్ ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం కేటాయించిన భూమిలో భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభించాం. భవనం పూర్తయితే మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. విద్యాలయాలు, ఉపాధి శిక్షణా కార్యక్రమాలు, పేద విద్యార్థ్ధులకు ఫీజులు..ఇలా కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– ఇంటర్వ్యూ: ఎం.నాగశేషకుమార్ స్పెషల్ టాస్క్ బ్యూరో