వికారాబాద్, పరిగి పేరెత్తితే గుర్తుకొచ్చే రాజకీయ నాయకుడు కొప్పుల హరీశ్వర్రెడ్డి. ఆయనంటే కొందరికి ప్రాణం…మరికొందరికి ఆశ..శ్వాస. ప్రజల కోసం కష్ట పడటం, పదవుల కోసం కాకుండా నమ్మిన సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాటను నిలుపుకోవడం కోసం ఆయన పడిన కష్టం నచ్చిందని అభిమానులు చెప్తారు. ఎన్నో మంచి పనులతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన అజాత శత్రువు ఆయన. అందరినీ కలుపుకుపోయిన.. అందరితో కలిసిపోయిన నాయకుడు.
హరీశ్వర్ రెడ్డి రాజకీయ జీవితం 1972లో వార్డు మెంబర్గా మొదలైంది. 1977లో ఉప సర్పంచ్ గా, 1980లో సర్పంచ్గా గెలుపొందారు. ఆ తర్వాత పరిగి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలైనా ప్రజల్లోనే ఉండి వారి కోసం పనిచేశారు. 1985లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకుండా 1994, 1999, 2004, 2009ల్లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గెలిచిన ప్రతిసారి పరిగి ప్రజల కోసం ఏదో చేయాలనే తపన ఆయనలో కనిపించేంది. ఎన్నో అభివృద్ధి పనులు చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. సౌమ్యుడిగా పేరొందిన ఆయన డిప్యూటీ స్పీకర్, టీటీడీ బోర్డ్ సభ్యుడు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్గా తన సేవలందించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పాత రంగారెడ్డి జిల్లాలో ముందు వరుసలో నిలబడి ఉద్యమించారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన ఆయన తన పనితీరుతో సీఎం కేసీఆర్ ప్రశంసలు అందుకున్నారు.
ఆయన నడక మంచి వైపు…ఆయన ఓర్పు మార్పు వైపు…ఆయన తపన ప్రజల కోసం. నీతి-నిజాయితీ ఆయన బలం. మంచితనం, మానవత్వం ఆయన బలగం. ఇచ్చిన మాట కోసం మాట తప్పని నాయకుడు.. పేద ప్రజల గుండె చప్పుడు..న్యాయం కోసం, నిజం కోసం, మంచి కోసం జీవితమంతా పోరాడిన నిక్కచ్చి నాయకుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న నాయకుడు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండేవారు. చివరి నిమిషం వరకు ప్రజల సంక్షేమం కోసమే తపించారు. ఆయన అకాల మరణం పరిగి ప్రాంత ప్రజలను శోక సముద్రంలో ముంచెత్తింది.
-మల్లేపల్లి నర్సింలు
91827 77968