KCR | కొవ్వొత్తి తాను కరిగిపోతూ మనకు వెలుగునిస్తుంది. గొప్ప నాయకుడు తాను ఓడిపోయినా తన ప్రజలను, తన సమాజాన్ని నిలబెడతాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఇదే జరిగింది. కేసీఆర్ తెలంగాణను గెలిపించి, తాను ఓడిపోయారు.
ఒకనాడు తెలంగాణ అంటే కరువు ప్రాంతం, వలసలకు నెలవు. ఒకనాడు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలకు వేదిక. ఇలా ఎన్నో సమస్యలు, కష్టాలు. ఏది చెప్పినా తెలంగాణనే గుర్తొచ్చేది. కానీ.. నేడు తెలంగాణ వేరు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాతి పదేండ్లలో తెలంగాణ ప్రాంతం రూపు రేఖలు మారిపోయాయి. ప్రతీ రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలబడేలా చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకనాడు ఓడగొట్టబడిన తెలంగాణను గెలిపించి ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడేలా చేశారు. ఏ పనిచేసినా అందులో లీనమవ్వాలి. మన అనుకున్నప్పుడే మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. అందుకే కేసీఆర్ తెలంగాణే నా కుటుంబం అనుకున్నారు. ప్రజలు బాగుంటేనే, తెలంగాణ బాగుంటుందని భావించారు. నా తెలంగాణ కుటుంబం బాగుండి, నా కుటుంబసభ్యులైన ప్రజలు మంచివాళ్లు అని అందరు చెప్పుకొనేలా చేసి ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశారు.
నాడు తెలంగాణ అంటే ఆమడదూరం పారిపోయిన కంపెనీలు సైతం వచ్చి లైన్లో నిలబడేలా చేశారు. అంటే తెలంగాణను గెలిపించారు. కానీ ఈ తెలంగాణ సమాజం మాత్రం ఆయనను ఓడించింది. అంటే తెలంగాణను ఓడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, పాలకుల మాటలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి మాట్లాడే మాటలు చూస్తే తెలంగాణ ఓడిపోయిందని చెప్పడానికి ఈ 20 రోజుల సమయం చాలా ఎక్కువే. పరాయి పాలనలో అన్నింటా దోపిడికి గురై చిక్కి శల్యమైన తెలంగాణను అనతికాలంలో ప్రపంచం ముందు ఒక అద్భుత రాష్ట్రంగా, అభివృద్ధికి రోల్ మాడల్గా నిలబెట్టింది కేసీఆర్ మేధోశక్తి. అందుకే కొత్త రాష్ట్రమైనా సరే మున్సిపాలిటీలకు, పంచాయతీలకు, ఇతర ప్రభుత్వశాఖల పనితీరుకు కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు ఇచ్చినా అందులో అగ్రభాగం తెలంగాణే అందుకున్నది. పెట్టుబడులకు స్వర్గధామమైంది.
సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. ఒక నమ్మకమైన పాలకుడు, పాలనను సజావుగా నడిపించే వ్యక్తి ఉంటేనే అన్నీ సక్రమంగా కొనసాగుతాయి. చిరు వ్యాపారులైనా, లక్షల కోట్ల వార్షికాదాయం ఉన్న బడా వ్యాపారవేత్తలైనా ఏ ఆందోళన లేకుండా ఉంటారు. నిన్న మొన్నటి వరకు మన రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాదు, పక్క రాష్ట్ర వ్యాపారులకు కూడా తమ ప్రాంతంలో పాలకుల మీద, పాలసీల మీద నమ్మకం లేక ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టారు. వ్యాపారం చేసుకుంటున్నారు. కేసీఆర్పై ఉన్న నమ్మకం, ఆయన హయాంలో తీసుకొచ్చిన సులభతర విధానాల వల్లనే ఇదంతా సాధ్యమైంది.
పదేండ్ల పాటు అహర్నిశలు శ్రమించి, ఇటుక.. ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టుగా నిర్మించిన నమ్మకాన్ని కొత్త పాలకులు తమ చిల్లర మాటలతో బూడిదలో పోసిన పన్నీరులా చేస్తున్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు గానీ, ముఖ్యమంత్రి అయ్యాక గానీ, మొన్నటి ఎన్నికల ప్రచారంలో గానీ ఏనాడూ తెలంగాణను తక్కువ చేసి మాట్లాడలేదు. తెలంగాణ ప్రజలకు ఇబ్బంది రానీయలేదు. నాకు ఏమీ అవసరం లేదు, రాష్ట్రం సాధించానన్న గొప్ప పేరు, అభివృద్ధి చేశానన్న కీర్తి చాలంటూ ఆయన చెప్పిన మాటలు అందరం విన్నాం.రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నన్ని రోజులు ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది రానీయలేదు. ఏ ఒక్క సంక్షేమ పథకం ఒక్క రోజు కూడా ఆగలేదు. 11 సీజన్లకు ఠంచన్గా రైతుబంధు రైతుల అకౌంట్లలో జమయింది. ప్రతి నెలా పింఛన్లు వచ్చాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది మొదలు పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. ఏ కుర్చీలో కూర్చొని ఒక వ్యక్తి రాష్ట్ర ఔన్నత్యాన్ని ఖండాంతరాలు దాటించారో.. అదే కుర్చీలో కూర్చొని మరో వ్యక్తి ఇప్పుడు ఖండాంతరాల్లో రాష్ట్రంపై అపఖ్యాతిని మోపుతున్నారు. ‘మార్పు రావాలి, మార్పు రావాలి’ అని సదరు పార్టీ ఇచ్చిన నినాదానికి అర్థం ఇదేనేమో. కానీ ఈ మార్పు ఎవరి కోసం? ఎందుకోసం? రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటి ఈ మార్పును ఏ ఒక్కరూ హర్షించరు.
-వై.సతీష్రెడ్డి
96414 66666
(కన్వీనర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం)