రాజకీయ రంగంలోకి అధికారం చెలాయించటానికి చాలామంది వస్తారు. వారిని నేతలనే ప్రజలు భావిస్తారు. అయితే అందులో చాలారకాల వారు ఉంటారు. పార్టీ స్థాపించిన ప్రతివారూ అధినాయకుడవుతాడనే నిబంధన ఏమీ లేదు. రాజకీయ నిర్వీర్యులు, రాజకీయ పర్యాటకులు, రాజకీయ స్వలాభపరులు, రాజకీయ డ్రాపౌట్లు.. ఇలా రకరకాలుంటారు. కొందరు వడ్డించిన విస్తరిలా ఉన్న అధికార స్థానాన్ని ఆ నేతను తోసేసి ఆక్రమించేవారుంటారు.
ఇంకొందరు ‘మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి’ అని తమకు సామర్థ్యం లేకపోయినా రాజకీయాల నుంచి గౌరవప్రదంగా తప్పుకోకుండా వేళ్లాడుతూ ఉంటారు. వీరిలో చాలామంది ప్రత్యర్థి నాయకులను విమర్శించి, తిట్టి, శాపనార్థాలు పెట్టి గెలవాలనుకుంటారు. కానీ, ఎదుటివారిని చెడ్డవారన్నంతనే, మనం మంచివాళ్ళమవాలన్న నిబంధన ఏమీ లేదు కదా! అది ప్రజలకు బాగా అర్థమవుతుంది.
మరి మన దేశ పరిస్థితి విశ్లేషిస్తే… మంచి, ఆదర్శవంతమైన, ప్రజల క్షేమం, సంతోషం కోసం పనిచేసే నాగరిక రాజకీయ నాయకులు లేరా అని చూస్తే గంజాయి వనంలో తులసి మొక్కల లాగ పదిమంది కంటే తక్కువ మంది కనపడతారు. సంస్కారం, మేధ, ప్రజ్ఞ, తెలివి, విశాల భావాలు, సమర్థత, సహృదయతలతో విషపూరిత రాజకీయాల ప్రభావం లేకుండా, వారి ఆలోచనా స్థాయి, ప్రవర్తనా నియమాలు నిలుపుకొంటూ, కేవలం ప్రజా సంక్షేమం చూసే, ప్రజా సేవ చేసే రాజనీతిజ్ఞుల గురించి ఇక్కడ చెప్పుకోవటం అవసరం. ఎందుకంటే ఎన్నుకునే ప్రజలను మోసపూరిత విధానాలతో, నయవంచక మాటలతో ప్రభావితం చేసే నాయకులు రోజురోజుకు ఎక్కువవుతున్నారు కాబట్టి!
ఒక్క రైలు ప్రమాదంలో కొద్దిమంది మరణించారన్న ఆవేదనతో రైల్వేమంత్రిగా పదవిలో ఉన్న లాల్బహుదూర్ శాస్త్రి తన పదవికి రిజైన్ చేశాడు. ఆ మహానుభావుడు ఎంత బీద స్థితి నుంచి పైకి వచ్చాడంటే, చదువుకొనే రోజుల్లో ప్రయాణానికి పైసలు లేక, నది ఈదుకొని అవతలి ఒడ్డుకు రోజూ వెళ్లేవాడు. అయినా ఆయనకు ఆ ఉన్నత స్థితి మీద మోహం లేదు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం, దేశ ప్రగతి తప్ప మరో విషయం ముఖ్యం కాదు!
నరేంద్ర మోదీ రైల్వేలను ప్రైవేటీకరణ తెచ్చిన తర్వాత సుమారు 20 రైలు ప్రమాదాలు ఈ తొమ్మిదేండ్లలో జరిగాయి. రెండు రోజుల పేపర్ వార్తలు తప్ప, ప్రధానమంత్రికి ఆ ప్రమాదాలలో తమవారిని పోగొట్టుకున్న వారి గురించి కానీ, క్షతగ్రాతుల గురించి కానీ పట్టించుకోకుండా, వందేభారత్ రైలుకు జెండా ఊపుతూ ఆనందపడుతున్నాడు. నిరంకుశుడైన ఇటలీ రాజు నీరో (37-68 ఎడి) తన సొంత తల్లిని, తన దర్బారులో కొందరిని, ఎందరో ప్రజలను చంపించడమే కాకుండా, ఒక ఘోర అగ్ని ప్రమాదంలో రోమ్ నగరం సుమారు వారం రోజులు తగలబడుతూ ఉంటే తాను వయోలిన్ వాయించుకుంటూ కూర్చున్నాడట, ఏమీ చేయకుండా! గతంలో జరిగిన గోద్రా ఘటన, ప్రస్తుతం జరుగుతున్న మణిపూర్ మారణహోమం గుర్తొస్తున్నాయా మీకు?
ఇక ఆదర్శ రాజనీతిజ్ఞుడు, శత్రువులు లేని అజాత శత్రువు, ప్రతిపక్షాలు కూడా పొగిడిన ఆదర్శ పురుషుడు అటల్ బిహారీ వాజపేయి. చక్కటి కవి, సున్నిత హృదయుడు, చమత్కార భాషణుడు, తప్పు చేసినవారిని తురమగల సమర్థుడు. నిస్వార్థ సంస్కారి ఈయన. జయలలిత తన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవటంతో ఒక్క ఓటుతో మెజారిటీ కోల్పోయినప్పుడు, ఏదైనా పార్టీలోంచి ఒక్క సభ్యుడిని ప్రభావితం చేసి మద్దతు సంపాదిద్దామని పార్టీ వారు చెప్పినా వినకుండా కేవలం 13 రోజులకు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన సంస్కారి. ఏ పరిస్థితిలోనూ పదవి కోసం విలువలు వదలని మహోన్నత వ్యక్తిత్వం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి, ఈ రోజు దాకా వాజపేయి యూఎన్ఓలో ఇచ్చిన ప్రసంగం భారతదేశ నాయకుల ప్రసంగాల్లో ఉత్తమంగా పరిగణిస్తారు. కార్గిల్ యుద్ధంతో శత్రు భయంకరుడు గానూ ఉంటాడు; పూల మీద, పిల్లల మీద కవిత్వమూ రాసే సున్నిత లాల్ బహదూర్ లాగా మేటి!
వాజపేయి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ గట్టుమీద ఉన్నవారు గుర్తురాక మానరు, ఎందుకంటే మన ఖర్మ కాలి వారు మన ప్రస్తుత పాలకులు. ఎన్నికల్లో తాము గెలిచి ప్రత్యర్థి పార్టీ కూడా చెప్పుకొనేటన్ని స్థానాలు సంపాదిస్తే, ఆ పార్టీలో స్థాయి తక్కువవారిని ఏరి కోట్లు పెట్టి కొనడం మామూలే. ఇంక తమ పార్టీ ఓడితే, గుంట కింద ఉన్న నక్కలాగా వేచిచూసి, గెలిచిన పార్టీలో చిచ్చుపెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడం. ఇవి మనం 2014 నుంచీ చూస్తున్న ధారావాహికలే! మరి అదే పార్టీలో ఉండిన వాజపేయి ఎక్కడ? ఈ కొనుగోళ్లు చేసే ఈ గుజరాతీ వ్యాపారస్తులెక్కడ? ఇది రాజకీయమా? వీరు చేస్తున్నది పరిపాలనా?
ఇక ప్రస్తుత రాజకీయ చిత్రంలో ప్రజల కోసం పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమం నడిపి, అంతులేని, అవమానాలు, ఆటుపోట్లను ఎదుర్కొని, ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయాలు సాధించినా, శాస్త్రి లాగా, వాజపేయి లాగ తన పదవికి ఎన్నోసార్లు రాజీనామా చేసిన కేసీఆర్ ఈ సమర్థ రాజకీయ నాయకుల కోవలోకి వస్తారు. చావుకు సిద్ధపడి ఆమరణ దీక్ష చేసి విజయం సాధించారు. 2009లో ప్రకటించినప్పుడు రాష్ట్రం ఏర్పడకపోయినా, ఆ ప్రకటన 2014 ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బంధనమై కూర్చుంది. దానివల్లనే రాష్ట్ర ఏర్పాటు చేయవలసి వచ్చింది. అంటే రాష్ర్టాన్ని దయతో, జాలితోనే, ప్రేమతోనో కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ప్రసాదించలేదు. తెలంగాణలో ఓట్లు కాదు కదా, గుక్కెడు మంచినీళ్లు కూడా పుట్టవని భయపడి రాష్ర్టాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ తన తప్పిదాల ఫలితం తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాల్లోనూ అనుభవించింది.
‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అని దశాబ్దాలు తెలంగాణ ఇవ్వకుండా ఇక్కడి ప్రజలను ఇక్కట్లకు గురిచేసి, వందలాది మంది యువత ప్రాణత్యాగాలకు కారణమైన ఈ దుర్మార్గులు అమరవీరుల స్థూపం దగ్గర నుంచుంటే వారి పాపాలు ప్రక్షాళన అవుతాయా? పోయిన ప్రాణాలు తిరిగివస్తాయా? తెలంగాణ నిధుల నష్టం పూడ్చబడుతుందా?
ఇక లాల్బహదూర్ శాస్త్రి అకాల (అనుమానాస్పద) మరణంతో ఈ దేశాన్ని పూర్తిగా ప్రగతిలోకి తీసుకువెళ్లటానికి సమయం లేకపోయింది. అలాగే వాజపేయి సరైన సమయంలో ప్రధానమంత్రి అయి ఒక 20 ఏండ్లు పరిపాలిస్తే దేశం చాలా బాగుండేది. కానీ వారిద్దరికీ లేని అవకాశం తెలంగాణ ప్రజల అదృష్టం వల్ల కేసీఆర్కు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మోసాలు, ఆంధ్రా వారి ఆగడాలు తట్టుకొని నిలబడే సమర్థత ఉండి, అప్పటి క్లిష్ట పరిస్థితి గమనించి తానే రాష్ట్ర పాలనాపగ్గాలు పట్టుకున్న కేసీఆర్ విజయాలు వర్ణించాలంటే పుంఖానుపుంఖాలు రాయాలి. వాటిని ఇక్కడ పేర్కొనటం లేదు. కానీ, ఏ వర్గాలకు న్యాయమైందో వివరించవచ్చు.
ప్రజలకు శాంతిభద్రతలు, ప్రత్యేకంగా మహిళల భద్రత, స్త్రీల ప్రసూతి, ఆరోగ్యకరమైన భోజనం క్షేమకరమైన చికిత్స, వైద్యం, ప్రైవేటు పాఠశాలల స్థాయిలో గురుకులాలు, జిల్లాలలో బాలికల డిగ్రీ విద్యాలయాలు, వివాహానికి సహాయం వంటివి విపత్కర పరిస్థితిలో జాగ్రత్తలు, తాత్కాలిక ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులవ్వటం, అందరి జీతాల పెంపు, ఇవన్నీ ఒక్క ఎత్తయితే, రైతు సంక్షేమం, పల్లెల ప్రగతి ఇంకొక వైపు ఉంటాయి. ఇది చెయ్యటంతో గొర్రెలు, చేపల పెంపకం, ఇంకా చాలా వృత్తులు బాగుపడ్డాయి. ఇక ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోని వర్గాలకు దళితబంధు, బీసీ బంధు, ఆరోగ్యబీమా, ఇతర విధాలలో పింఛన్ వంటి సహాయం- ఈ విధంగా అందరినీ ఆదుకుంటున్న మానవీయ, సమర్థ నాయకుడు కేసీఆర్. ఒక పని విజయాన్ని ఫలితాలు నిర్ణయిస్తాయి. ఎవరికి వారు మన నాయకుడు చెప్పినట్టు ప్రశాంతంగా ఆలోచించుకుంటే 2014 ముందు, 2023లో తెలంగాణ చిత్రాన్ని గుర్తుతెచ్చుకోవాలి. కళ్లున్న కబోదులు ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు. సరిగా ఆలోచించి మీ ప్రగతి కోసం, మీ వారసుల ప్రగతి కోసం ఓటెయ్యాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి.
-కనకదుర్గ దంటు
89772 43484