ఒకనాడు తెలంగాణది అరవై ఏండ్ల గోస. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సుదీర్ఘమైన పోరు సలిపిన చరిత్ర తెలంగాణది. చెరువులు, నీటి వనరుల విధ్వంసం, ప్రాజెక్టుల పెండింగ్.. వెరసి నాడు కంటతడి పెట్టని తెలంగాణ బిడ్డ లేడు. ఇవన్నీ చూసి చలించిపోయిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేశారు. పద్నాలుగేండ్లలో ఆయన అనేక రూపాల్లో ఉద్యమాలు చేశారు. సభలు, సమావేశాలు, నిరాహార దీక్షలు, ఆమరణ దీక్ష, సకలజనుల సమ్మె, సడక్ బంద్, వంటావార్పు, మానవహారాలు, సాగరహారం, మిలియన్ మార్చ్, జంతర్మంతర్ వద్ద ధర్నా, అఖిలపక్ష సమావేశాలు, పార్లమెంటులో ఆందోళనలు, నిరసనలు చేసి తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారు కేసీఆర్.
ఈ క్రమంలో తెలంగాణకు దివిటీగా మారారాయన. అనేక త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణను పునర్నిర్మించే గురుతర బాధ్యతను ప్రజలు ఉద్యమ నాయకుడికే అప్పగించారు. ఉమ్మడి పాలనలో ఆగమైన తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ కార్యోన్ముఖుడయ్యారు. అందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పథకాలను రూపకల్పన చేసి, వందకు వంద శాతం అమలు చేశారు. తెలంగాణను దేశానికే రోల్మాడల్గా తీర్చిదిద్దారు.
BRS | తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ పాలన సాగింది. ఆగమైన తెలంగాణను బాగు చేయడాన్ని ఓ యజ్ఞంగా ఆయన భావించారు. సుపరిపాలనలో భాగంగా రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, దళిత బంధు వంటి దేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, హరితహారం, డబుల్ బెడ్రూం ఇండ్లు లాంటి అనేక పథకాలు ప్రజల హృదయాల్లో పదిలంగా నిలిచిపోయాయి. తెలంగాణ పథకాలను చూసి దేశం గర్వించడమే గాక అనేక రాష్ర్టాలు మన పథకాలపై అధ్యయనం చేసి, వాటిని అమలు చేస్తున్నాయి. ఒకప్పుడు పశ్చిమబెంగాల్ ఆచరణను దేశం అనుకరించేది. కానీ, బీఆర్ఎస్ హయాంలో మాత్రం యావత్తు దేశం తెలంగాణ వైపు చూసింది. దేశం అబ్బురపడేలా అద్భుతమైన పథకాలను తీసుకురావడం కేసీఆర్కే సాధ్యమైంది. కేసీఆర్ పాలించిన పదేండ్లు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని.. విద్యతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యమవుతాయని భావించిన కేసీఆర్ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. దేశంలోఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం వందల సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేశారు. గురుకులాలతో పాటు ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో సన్నబియ్యం భోజనాన్ని పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో చదువుకునే ఆయా వర్గాల విద్యార్థులకు రూ.20 లక్షలు సాయం చేసి వారి బతుకులను తీర్చిదిద్దారు.
విద్యా రంగంతో పాటు వైద్య రంగం కూడా వృద్ధి చెందితేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనేది కేసీఆర్ అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే సర్కార్ దవాఖానల్లో ప్రసూతి సౌకర్యాలను మెరుగుపరిచారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలని కేసీఆర్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆడబిడ్డ పెండ్లి చేసేందుకు ఎవరూ ఇబ్బందులు పడకూడదని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేశారు. వీటి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉన్నత సామాజికవర్గంలోని వేల పేద కుటుంబాలు లబ్ధి పొందాయి. వ్యవసాయం, విద్యుత్తు, వైద్యం, విద్య, సంక్షేమ రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, మార్పులు రాష్ర్టాభివృద్ధికి దోహదం చేశాయి. కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధి చరిత్ర పుటల్లోకెక్కడం ఖాయం.
భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు కలిస్తేనే చరిత్ర అవుతుంది. చరిత్ర సక్రమంగా, న్యాయంగా లేదంటే ఈ మూడు కాలాల్లో ఏదో ఒక దాంట్లో తప్పిదం జరిగినట్టే. చరిత్ర నిర్మాణం ప్రజల కోసమే జరగాలి. ఆ చరిత్ర నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలి. అభివృద్ధి చెందాలి. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక అనేక నగరాలు మహానగరాలుగా అభివృద్ధి చెందాయి. ఆ నగరాల గత వైభవాలే ప్రస్తుత అభివృద్ధికి దోహదపడ్డాయి. అలాంటి నగరాల జాబితాలో చారిత్రకంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందున్న నగరం మన హైదరాబాద్. దేశంలో అభివృద్ధికి సూచకంగా ఢిల్లీని చూపాల్సిన గత పాలకులు అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు వంటి నగరాలను వాళ్ల రాజకీయ లబ్ధి కోసం ప్రమోట్ చేసుకున్నారు. ఇక లోతుగా విశ్లేషిస్తే.. ఏ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాష్ర్టానికే అధికంగా నిధులను కేటాయించే మోసపూరిత విధానానికి కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అదే విధానాన్ని ఇప్పటికీ అమలు చేస్తున్నాయి. అన్ని రాష్ర్టాలు, నగరాలను సమానంగా చూడకపోగా, వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం నిధులు ఇవ్వనప్పటికీ కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగింది. అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా మారింది. అటువంటి నగర అభివృద్ధి.. కాంగ్రెస్ హయాంలో అంధకారంలో చిక్కుకునే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎప్పటిలాగే ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నది. ఆరు గ్యారెంటీలు (మొత్తం 13 గ్యారెంటీలు), 420 హామీలు ఇచ్చి అధికార పీఠమెక్కిన హస్తం పార్టీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే అన్నీ హామీలు అమలు చేస్తామని సభల్లో ప్రకటనలు చేసిన కాంగ్రెస్ నేతలు నేడు వాటన్నింటిని గాలికొదిలేశారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందనడానికి ఈ వంద రోజుల పాలనే నిదర్శనం.
ఇక బీజేపీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమే. పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేసింది. నిధుల కేటాయింపు, రాష్ట్ర హక్కుల విషయంలో విపరీతమైన వివక్షను చూపింది. తెలంగాణలోని నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ర్టానికి రావాల్సిన నిధులు, హక్కులపై ఒక్కసారి కూడా మాట్లాడలేదు, పోట్లాడలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికీ తెలంగాణకు ద్రోహమే తలపెడతాయి. తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, కేంద్ర నిధుల కేటాయింపులు జరగాలన్నా, మన హక్కులను రక్షించాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిందే. తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలంటే.. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బీఆర్ఎస్ జయభేరి మోగిస్తేనే.. మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకు దక్కుతాయి. బీఆర్ఎస్ గెలుపే తెలంగాణకు రక్ష. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్, కేటీఆర్ల నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించాలి.
(వ్యాసకర్త: మల్కాజిగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి)
-రాగిడి లక్ష్మారెడ్డి
80087 24545