ఎన్నికలు సమీపించే కొద్దీ సామాన్య ప్రజలకు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. కేసీఆర్ను, ఆయన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిరంతరం
విమర్శించటం తప్ప మరొక పనిలేకుండా ఉంటే,కేసీఆర్ మాత్రం మౌనంగా ప్రజలకు మేలుచేసే పనుల్లో తల మునకలుగా ఉన్నారు. అందుకు
రెండే రెండు తాజా ఉదాహరణలు చాలు.
ఈసారి వర్షాలు ఆలస్యమై లక్షలాది మంది రైతులు తల్లడిల్లుతుండగా, వారికి ఊరట కలిగించేందుకు ఆయన ఇదే ప్రతిపక్షాలు, సోకాల్డ్ మేధావులు అబద్ధపు ప్రచారాలతో దుమ్మెత్తిపోస్తున్న కాళేశ్వరం నీళ్లతో ప్రాజెక్టులు నింపటం మొదలుపెట్టారు. అదేవిధంగా లక్షలాది మంది గిరిజన పోడు రైతుల దశాబ్దాల సమస్య పరిష్కారం కావటంతో పాటు వారికి రైతుబంధు తదితర లాభాలు ఈ సీజన్ నుంచే లభించాలని పట్టాల పంపిణీ వేగంగా సాగిస్తున్నారు.
ఎన్నికలు అందరికీ అవసరమే. ప్రజలకు కూడా. వీరందరి కన్న అధికార పక్షానికి ఇంకా ఎక్కువ అవసరమవుతుంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలి గనుక. అందువల్ల కేసీఆర్ కావాలనుకుంటే ప్రతిపక్షాల వలె తను కూడా రాత్రింబవళ్లు అవతలివారిపై ఎదురు విమర్శలు చేస్తూ కాలం గడపవచ్చు. కనీసం ఒక వైపు పరిపాలన సాగిస్తూనే ప్రతిపక్షాలపై ఎదురుదాడి జరుపుతూ ఎన్నికల రాజకీయం నడపవచ్చు. ఆ పని కొంతవరకు తన పార్టీ నేతలు, ప్రభుత్వ బాధ్యులు చేస్తుండటం నిజమే. కానీ, ప్రజల దృష్టిలో స్వయంగా ముఖ్యమంత్రి, అందులోనూ కేసీఆర్ వంటి వాగ్ధాటి గల నాయకుడు చేయగల ఎదురు విమర్శలకు ఉండే విలువ ఎక్కువ. ఇది కేసీఆర్ గ్రహించని విషయం కాదు. అయినప్పటికీ ఆయన ఒక ముఖ్యమంత్రిగా ప్రజల పట్ల తన బాధ్యతను గుర్తెరిగి వ్యవహరిస్తున్నారు.
సామాన్య ప్రజల దృష్టికి ఇదంతా వస్తున్నది. గ్రామీణులను గాని, పట్టణాల్లోని దిగువ మధ్య తరగతిని గాని ఈ విషయమై కదిలిస్తే వస్తున్న సమాధానాల సారాంశం ఇంచుమించు ఒకేవిధంగా ఉంటున్నది. ప్రతిపక్షాల విమర్శలు మామూలే. అందులో కొత్తేమీ లేదు. వాళ్లు ఇదివరకు పాలించినపుడు ఇంతకన్న ఉద్ధరించిందేమున్నది గనుక. ఈసారి ఒకవేళ గెలిస్తే కేసీఆర్ కన్న బాగా ఏమేం చేస్తారో ఒక్కళ్లయినా చెప్పటం లేదు. ఆయనను ఇన్నాళ్లు చూసిన తర్వాత, ఆయనే మళ్లా గెలిస్తే ఇంకా మంచిపనులు చేస్తాడనిపిస్తున్నది. ఇదీ వారి సమాధానాల సారాంశం.
ఇక్కడ కొత్తగా కనిపిస్తున్న ముఖ్యమైన మార్పు ఒకటున్నది. అది హైదరాబాద్ మహానగరానికి సంబంధించినది. దిగువ మధ్య తరగతి, వివిధ తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడే ఉండి పనులు చేసుకునేవారు, పనులు చేసుకుని తమ జిల్లాలకు వస్తూ పోతూ ఉండేవారు, ఆంధ్ర ప్రాంతం వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరందరిలో అత్యధికులు కొన్నేండ్లుగా కేసీఆర్ అభిమానులే. ఇటీవలి కాలపు అభివృద్ధితో వారి అభిమానం ఇంకా పెరిగింది. ఈ తరగతి గురించి ప్రత్యేకంగా చర్చించవలసిందేమీ లేదు.
అయితే, పైవారితో పాటు ‘పక్కా మధ్య తరగతి’ అనబడే వర్గం ఒకటున్నది. వీరు ఏ ప్రాంతం వారైనా కావచ్చు. కాకపోతే తెలంగాణ వారెక్కువ. వివిధ కారణాల వల్ల ఈ హైదరాబాదీ మధ్యతరగతిలో గణనీయమైన భాగం కేసీఆర్కు వ్యతిరేకంగా ఉంటూవచ్చింది. గమనార్హమేమంటే వీరి దృష్టి సుమారు రెండేండ్లుగా మారటం మొదలైంది. అందుకు కొన్ని కారణాలున్నాయి. ఒకటి, హైదరాబాద్ నగరంలో, రాష్ట్రంలో కూడా జరుగుతున్న అభివృద్ధి. నిజానికి రాష్ట్ర అభివృద్ధి అంతకుముందు సైతం ఉన్నదే. కానీ, నగరవాసుల చూపు ఎపుడైనా, ఎక్కడైనా కొంత సంకుచితంగా, చపల చిత్తంగా ఉంటుంది. కనుక, హైదరాబాద్ అభివృద్ధి జేగీయమానంగా కనిపించిన దశలో గాని దానితో పాటు తక్కిన తెలంగాణ అభివృద్ధి వారి కంటికి ఆనలేదు. ఇప్పుడు రెండింటినీ చూస్తున్నారు. మొత్తానికి ఇందువల్ల వారికి కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఇటీవల వేగంగా తగ్గుతున్నది. ఈ విధంగా నగర అభివృద్ధి ఒకటి కాగా ఇక్కడ ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతుండటం, మంచినీరు- విద్యుత్తు- రోడ్లు వంటి పౌర సదుపాయాలు అందుకు తగినట్లు మెరుగుపడటం, అందరికీ అందుబాటులో గల జీవన వ్యయం, విద్య- వైద్య సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, శాంతిభద్రతల వంటివన్నీ కలగలిసి ఇటీవలి సంవత్సరాలలో ఈ ‘పక్కా మధ్య తరగతి’ వారు ప్రభుత్వాన్ని క్రమంగా మెచ్చుకునేట్టు చేస్తున్నాయి.
పైన పేర్కొన్న వివిధ తరగతులు గ్రామీణులు, పట్టణాల్లోని దిగువ, మధ్యతరగతి, పక్కా మధ్యతరగతి-అందరికీ కలిపి కలుగుతున్న అభిప్రాయం మరొకటి ఉన్నది. అది చాలా ముఖ్యమైంది. అదేమంటే, ఒక నాయకునిగా కేసీఆర్ను, ప్రతిపక్ష నాయకులను పోల్చిచూడటం. ఆ విధంగా చూసినపుడు, ఇతరులు ఎవ్వరూ కేసీఆర్కు సాటిరాగల నాయకునిగా వారికి కన్పించటం లేదు. వేర్వేరు కారణాల వల్ల వారిలో కొందరికి ఎవరో ఒక ప్రతిపక్ష నాయకుని పట్ల అభిమానం ఉండవచ్చు గాక. అది వ్యక్తిగత అభిమానం, లేదా సైద్ధాంతిక ఏకీభావం వంటిది ఏదైనా కావచ్చు. కానీ, ఇటువంటి ఇతరేతరాలు ఏవీ లేకుండా, యథాతథమైన నాయకత్వ లక్షణాలు, సమర్థత, అందుకు అదనంగా ఇన్నేండ్ల రికార్డును బట్టి చూసినప్పుడు మాత్రం కేసీఆర్కు దరిదాపులలోనైనా సాటిరాగల నాయకుడెవరూ ఈ తరగతుల వారికి కన్పించటం లేదు. ఇక ఉన్నత తరగతుల గురించి అయితే చెప్పనక్కరలేదు. వారికి ప్రతిపక్ష నాయకులంటే కనీస గౌరవం అయినా లేదు.
ఇటువంటి పరిస్థితి మధ్య, ఏ విధమైన విలువా లేని ప్రతిపక్షాల విమర్శలకు కేసీఆర్ స్వయంగా పూనుకొని ప్రతివిమర్శలు చేయటం అక్కరలేని పని కూడా. సాధారణ ప్రతివిమర్శలు పార్టీ వాదులు చేస్తూనే ఉన్నారు. కనుక తాను తన కర్తవ్యం అని భావించిన పద్ధతిలో పరిపాలనపై, ప్రజలకు మేలు చేయటంపై ఆయన దృష్టిని కేంద్రీకరించటమే సరైనదని భావించవచ్చు. సామాన్య ప్రజల ఆలోచన, ఆమో దం ఆ విధంగానే ఉన్నాయి. స్వయంగా కేసీఆర్ కూడా ప్రతిపక్షాల విమర్శలను ఉద్దేశించి, వాళ్లు అనేది అంటూనే ఉంటారు. మన పనేదో మనం చేసుకుంటూ పోవటం మంచిదనే వైఖరి కొన్నేండ్ల కిందటే తీసుకున్నట్టు విన్నాం. అదే వైఖరి ఇప్పటికీ కొనసాగుతున్నదనేది స్పష్టం. ప్రజలకు కూడా అదే నచ్చుతున్నట్టున్నది.
-టంకశాల అశోక్