ఒక మనిషి అయినా, రాజకీయ పార్టీ అయినా, తన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే రాను రాను మనుగడ కష్టమవుతుంది. కొన్నాళ్లు లేక కొన్నేండ్లు పరిపాలించిన పార్టీకి ప్రజల నాడి తెలుసుకునే నైపుణ్యం పెరగాలి. నేనింతే అనుకుంటే పదే పదే వైఫల్యాలనే ఎదుర్కొనవలసి వస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ర్టాలను బీజేపీకి అప్పగించింది కాంగ్రెస్. ఇక కొంతకాలం కిందట జరిగిన కర్ణాటక ఎన్నికల్లో గెలిచినా, అది కాంగ్రెస్ను కావాలని గెలిపించటం కాదు, బీజేపీ వద్దు అన్న నకారాత్మక తీర్పు అది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కేవలం ప్రచారహోరుతోనే అన్నది సుస్పష్టం. ఎన్నికల తర్వాత కూడా అధిక సంఖ్యలో ప్రజలు కేసీఆరే తమకు ముఖ్యమంత్రిగా కావాలని చెప్పటం బీఆర్ఎస్ పార్టీ విజయం. ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో జరిగిన అత్యద్భుత ప్రగతికి తార్కాణం.
Congress | 75 ఏండ్లలో అధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, వారిని విమర్శించి అధికారం చేపట్టిన జనతాదళ్, భారతీయ జనతా పార్టీ కానీ కల్పించని మౌలిక వసతులు తెలంగాణలో కేసీఆర్ కల్పించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, 24 గంటల నిరంతరాయ కరెంటు, పల్లెల్లో కూడా రోడ్లు, శుభ్రత, వాతావరణ స్వచ్ఛత కోసం కోట్ల కొద్దీ మొక్కల నాటింపు, విద్యా వికాసం కోసం 1200 పైగా గురుకులాలు, జూనియర్ ఇంటర్, డిగ్రీ, మెడికల్ కాలేజీలు, వైద్య సదుపాయం కోసం పీహెచ్సీలు, బస్తీ, పల్లె దవాఖానలు, పట్టణాల నగరాల దవాఖానల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు, జిల్లాల్లో ఉచిత డయాలసిస్, వైద్య పరీక్షా కేంద్రాలు, మారుమూల పల్లె వాసులకు కూడా ప్రసూతి సౌకర్యాలు, గర్భిణీ స్త్రీలకు ఆహారం, అన్నింటికంటే ముఖ్యమైనదిగా చెప్పవలసినది వ్యవసాయరంగ పరిరక్షణ.
దీనిని మొట్టమొదటి ప్రాధాన్యాంశంగా తీసుకుని దాదాపు ఐదు దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రంలో బక్కచిక్కిన తెలంగాణ సాగు ను ఉద్ధరించారు. ఏడు మండలాలు ఆంధ్రలో విలీనంతో కోల్పోయిన లోవర్ సీలేరు ప్రాజెక్టు, అప్పుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు సృష్టించిన కరెంటు కష్టాలు దీటుగా ఎదుర్కొని కరెంటును సరఫరా చేయటమే కాకుండా, దశాబ్దాల తరబడి మూలబడ్డ ప్రాజెక్టులను తీసుకొని అనతికాలంలో పూర్తిచేసి రైతన్నలకు కావలసిన నీటిని సాగుకు అందించారు. ఈ రెండూ లభ్యమవ్వటంతో వ్యవసాయం కళకళలాడింది. వీటికి తోడుగా రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించటంతో రైతులకు అప్పుల బాధ తప్పింది. పంటలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, దేశంలో ఎక్కడా లేనంతగా తెలంగాణ రైతు బాగపడ్డాడు. నిజానికి కేసీఆర్ పదే పదే చెప్పినట్టుగా ఈ విధానాలన్నీ స్వాతంత్య్రం వచ్చిన పది, పదిహేనేండ్లలో జరగాల్సినవి.
సరైన విపక్షమే లేకుండా అప్రతిహతంగా కాంగ్రెస్ పాలన సాగటంతో, వారికి తమ అధికారం, తమ అవినీతి సంపాదన తప్ప ఇంకేమీ పట్టలేదు. దేశంలో మౌలిక వసతులు, తప్పనిసరి ప్రాథమిక విద్య కల్పించాలన్న సోయి లేకుండా, యథేచ్ఛగా పాలన సాగించారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత వైవిధ్యం ఉన్న భారతదేశానికి సరిపోని విద్యావిధానాన్ని ప్రవేశపెట్టి, దశాబ్దాలు అదే కొనసాగించి, ప్రగతిశీల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా విపరీతమైన మేధోవలస జరుగుతుంటే పట్టనట్టు ఉండిపోయారు.
ఇక వీరి పాలనకు విసిగి భారతీయ జనతా పార్టీని గెలిపించిన ప్రజలకు పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టయింది. మత మౌఢ్యంతో పక్షపాత వైఖరితో, నియంతృత్వ పోకడలతో సాగిన బీజేపీ పాలనలో గొప్పవారు కుబేరులు, మధ్యతరగతి వారు బీదవారై కొట్టుమిట్టాడుతున్నారు. నిర్భయ కేసు గురించి అంత అల్లరి, గొడవ చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీకి అత్యాచారాల మీద ఉన్న చట్టాలు కఠినతరం చేయటానికి పదేండ్ల సమయం పట్టింది. అదే గొప్పగా చెప్పుకొంటున్నారు కేంద్ర హోంమంత్రి. మరి ఇప్పటికీ సొంత పార్టీ నేత లు చేసిన నేరాలు పార్లమెంటులో చర్చించటానికి కూడా ఇష్టపడనివారు ఈ చట్టాలని అందరికీ వర్తింపజేస్తారా? లేక బుల్డోజర్ సూత్రంలాగా తమ శత్రువుల మీద మాత్రమే ప్రయోగిస్తారా? కాలమే దానికి సమాధానం చెప్పాలి.
ఇక ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పరిస్థితికి వస్తే, అధికార పార్టీ రాజకీయాలు ప్రజా పాలన దిశగా కాకుండా, కేవలం కక్ష సాధింపు చర్యలుగా ఉండటం దురదృష్టకరం. గతాన్నే తవ్వుకుంటూ బతికేవాడికి భవిష్యత్తు ఉండదు. వర్తమానం నిన్నటి చర్యల ప్రతిఫలం ఇస్తే, భవిష్యత్తు వర్తమాన చర్యల ఫలం ఇస్తుంది. పాలనలో ప్రతిరోజూ ప్రతి గంటా ప్రతి నిమిషం చాలా ముఖ్యం. ఈ సమయాన్ని వృథా చేసి ప్రజలకిచ్చిన వాగ్దానాలు వాయిదా వేస్తూ పోతే, రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుంది. అంతేకాదు, అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజల కండ్లముందు కనిపిస్తున్న ప్రగతిని మాయం చేయలేరు. ఈ వసతులు తీసెయ్యటం, తగ్గించటం లాంటివి ప్రజలు ఒప్పుకోరు. అది పాలకులు గుర్తు పెట్టుకోవాలి.
ఇంకొక విషయం కాంగ్రెస్ పార్టీ గమనించి, గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన ప్రగతిశీల ప్రణాళికలు తిరోగమన చర్యలతో మారిస్తే, దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఫార్మాసిటీ స్థాపించటానికి సేకరించిన వేల ఎకరాల్లో కేవలం మనుషులు నివసించటానికి ఇండ్లు కట్టి ఇంకా లక్షల మందిని హైదరాబాద్లో చేరవేయవలసిన పని ప్రభుత్వానికి లేదు. కరోనా సమయంలో హైదరాబాద్ ఒక ప్రముఖ ఫార్మా కేంద్రంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇక్కడ 19 వేల ఎకరాల్లో ఫార్మసీ పరిశ్రమ పెడితే ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన ఫార్మా కేంద్రం అవుతుందనటంలో సందేహం లేదు.
అదే జరిగితే కోట్లలో పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు, వేలకొద్దీ ఉపాధి మార్గాలు ఆ చుట్టుపక్కల వెలుస్తాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారక్కరలేదు. ఆ చుట్టుపక్కల వందల కొద్దీ లే అవుట్లు వచ్చి, గృహాలు నిర్మితమై జనాలు చేరతారు. ప్రభుత్వానికి పైసా ఖర్చులేకుండా సమయం వృథా కాకుం డా ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి పురోగమన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడితే ప్రజలు హర్షిస్తారు. ఇదే కాకుండా, బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా, ఇంకా ఏ పరిశ్రమలు రాష్ర్టానికి కావాలో ఆలోచించి, ఆ దిశగా కృషిచేస్తే వారికీ మంచిది, రాష్ట్ర ప్రగతికీ తోడ్పడుతుంది. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆ రైతులు తమ విలువైన భూమిని ఇవ్వలేదని గ్రహించటం ప్రభుత్వానికి శ్రేయస్కరం. పనికిరాని, చెయ్యలేని ఫ్రీ బస్సు ప్రయాణాలు, ఫ్రీ స్కూటీ బహుమతులు కాకుండా, రేషన్లో 10 కిలోల కంది పప్పు, 10 కిలోల మినప్పప్పు, 5 కిలోల వంట నూనె ఇస్తే అన్ని కుటుంబాలు సంతోషిస్తాయి. ఇలా మహిళలు ఫ్రీ బస్సులెక్కి తిరిగితే మగవారు ఆటోలు నడపలేక అవస్థలు పడరు. మంచి పథకాలు, కుటుంబం అంతా లబ్ధి పొందేవి ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం.
అప్పులో, సప్పులో వారసత్వంగా వచ్చింది భరించటమే ఎన్నికైన ప్రభుత్వాల విధి. జరిగిపోయిన దాన్ని మించి జరగబోయే దానిమీద దృష్టిపెడితే, సమస్యలు త్వరగా తీర్చుకోవచ్చు.నకారాత్మక చర్యలు మాని, సకారాత్మక ఆలోచనలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, తను చేసిన వాగ్దానాల దిశగా దృష్టి మళ్లించవచ్చు. గతాన్ని తవ్వుకుంటూ ఏడ్చేవాడిని ఎవ్వరూ ఎక్కువ కాలం భరించరు. భవిష్యత్తు ప్రణాళికలు రచించి, వర్తమానంలో కార్యాచరణ ప్రారంభించాలి. అప్పుడే ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అలా చేసింది కాబట్టే ఇంత ప్రగతి సాధించగలిగింది.
-కనకదుర్గ దంటు
89772 43484