సంగారెడ్డి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరుగుతున్నదని తెలిసి అందరితో పాటు నేనూ వెళ్లాను. ‘మీలో ఆంధ్రభూమి రిపోర్టర్ ఎవరు?’ అంటూ మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రశ్నించేసరికి ‘నేనే’ అని పరిచయం చేసుకున్నా. ఇది 1989లో అంటే దాదాపు మూడున్నర దశాబ్దాల కిందటి సంఘటన. అప్పుడు టీవీ చానల్స్ లేవు. నాలుగైదు ప్రధాన పత్రికల విలేకరులే ఉండేవారు. సాధారణంగా రాజకీయ నాయకుల విలేకరుల సమావేశంలో ఆ కాలంలో ‘ఈనాడు రిపోర్టర్ వచ్చాడా? లేదా’ అని విచారించేవారు. కానీ, ప్రత్యేకంగా ఆంధ్రభూమి రిపోర్టర్ ఎవరు? అని అడిగింది.. అప్పుడు మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అలా అడగడానికి ఓ కారణం ఉంది.
1989లో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ దిగిపోయి,మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జిల్లా సహకార బ్యాంకులకు ఎన్నికలు జరిగాయి. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే.. అన్ని జిల్లాల సహకార బ్యాంకుల అధ్యక్షులుగా ఆ పార్టీ వారే ఎన్నికవుతారు. ఉమ్మడి రాష్ట్రంలో 22 జిల్లా సహకార బ్యాంకులు ఉండగా.. 21 చోట్ల కాంగ్రెస్ వారే అధ్యక్షులయ్యారు. ఒక్క మెదక్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఓడిపోయారు. కేసీఆర్ నిలబెట్టిన కాంగ్రెస్ నేత జిల్లా సహకార బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యారు. ‘కేసీఆర్ ఎలాంటి వ్యూహం పన్నారు. టీడీపీ నిలబెట్టిన కాంగ్రెస్ నేత ఎలా గెలిచారు’ అనే కోణంలో నేను ఆర్టికల్ రాశాను. 21 జిల్లాల్లో కాంగ్రెస్ వారు గెలిస్తే ఒక్క జిల్లాలో మాత్రం టీడీపీ నిలబెట్టిన కాంగ్రెస్ నేత గెలవడం రాజకీయంగా ఆసక్తి అనిపించింది. అందుకే అదే రాశాను. ఆ వార్త కేసీఆర్కు బాగా నచ్చింది. అందుకే అలా అడిగారు. కేసీఆర్తో నాకు అదే తొలి పరిచయం. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డి అయినా.. వార్తలపరంగా సిద్దిపేటకు, సంగారెడ్డికి సంబంధాలు అంతంతమాత్రమే.
ఆంధ్రభూమి రిపోర్టర్గా 1995లో హైదరాబాద్కు వెళ్లాను. హైదరాబాద్ వచ్చిన నెలకే టీడీపీ కార్యక్రమాల బాధ్యతలు అప్పగించారు. మరో నెల రోజులకే ఎన్టీఆర్ను దించిన వైస్రాయ్ ఉదంతం జరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక కేసీఆర్ రవాణా శాఖ మంత్రి అయ్యారు. క్యాబినెట్ సమావేశం జరిగిందంటే చాలు.. కేసీఆర్ చాంబర్ కిక్కిరిసిపోయేది. కేసీఆర్ సీఎం అయ్యాక మీడియాను దూరం పెట్టారని నమ్మేవారికి ఇది నమ్మబుద్ధి కాదు. అప్పట్లో ఆయన చాంబర్లో విలేకరుల జాతర ఉండేది. 30-40 మంది జర్నలిస్టులు క్యాబినెట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్లేవారు. కేసీఆర్ వారికి సుదీర్ఘంగా వివరించేవారు. ఆర్థిక సంస్కరణలు, ప్రభుత్వం ఎలా పని చేయాలి? మారిన కాలంలో పాలనలో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండడం ఎలానో చెప్తుండేవారు. ఒకే ఒక సమస్య ఎదురయ్యేది. జర్నలిస్ట్కు కావాల్సింది క్యాబినెట్ సమావేశంలో ఏం జరిగిందనేది మాత్రమే. కేసీఆర్ చెప్పే అనేక అంశాల నుంచి క్యాబినెట్ వివరాలను వేరు చేసుకోవాలి. ఏ మంత్రి వద్దకు వెళ్లినా క్యాబినెట్లో ఏం జరిగిందనే నాలుగు ముక్కలు తెలుసుకొని రావడమే. కానీ, కేసీఆర్ వద్దకు వెళ్తే మాత్రం అనేక అంశాలపై చర్చ ఉండేది.
వచ్చిన జర్నలిస్ట్ పెద్ద పత్రికకు చెందినవాడా? చిన్న పత్రికకు చెందినవాడా? పరిచయం ఉందా? లేదా? అనే దానితో సంబంధం లేదు. అంతకుముందు క్యాబినెట్ సమావేశం వివరాలు ముగ్గురు, నలుగురు జర్నలిస్టులకే పరిమితమయ్యేవి. వారికే గుత్తాధిపత్యం అన్నట్టు ఉండేది. కేసీఆర్ మంత్రి అయ్యాక క్యాబినెట్ వివరాలంటే అందరికీ అన్నట్టు మారింది. దీంతో బాబు సన్నిహిత జర్నలిస్టులు.. క్యాబినెట్ వివరాలను కేసీఆర్ అందరికీ చెప్తున్నారు అని ఫిర్యాదు చేసేవారు. దాంతో ఒకటి రెండు సార్లు చెప్పలేదు.. ఆ తర్వాత మామూలే. మళ్లీ జర్నలిస్టుల జాతర షురూ.
2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. అయితే కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే దీనికి సంబంధించి ప్రాథమిక ప్రయత్నాలు జరిగాయి. ఆంధ్రభూమిలోనే రిపోర్టర్గా ఉన్న కేఎన్ చారిని ఓసారి నేనే కేసీఆర్కు పరిచయం చేశా. ఒకసారి పరిచయం అయితే చారి దూసుకెళ్తారు. అనేక అంశాలపై విస్తృతంగా చర్చించడానికి ఖర్చు భరించి మరీ ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. అక్కడ దేశంలో పేదరికం, వెనుకబడిన ప్రాంతాలు, నక్సలిజం, తెలంగాణ వంటి అనేక అంశాలపై చర్చలు జరిగేవి.
1999లో టీడీపీ రెండోసారి గెలిచాక కేసీఆర్కు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. మంత్రివర్గ జాబితాలో కేసీఆర్ పేరు లేకపోవడంతో సిద్దిపేట నుంచి వచ్చిన కొంతమంది మహిళలు రాజ్భవన్లోని పూలకుండీలను తోసేశారు. సినిమాల్లో భవిష్యత్తు సంఘటనలను సూచించడానికి కొన్ని సంకేతాలు చూపుతారు. ఆ రోజు రాజ్భవన్లో పగిలిన పూలకుండీలు భవిష్యత్తు రాజకీయాలకు సంకేతమని నాకనిపించింది. ఆ తర్వాత కేసీఆర్కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్తో కేసీఆర్ ఉద్యమించనున్నారని అప్పటికే ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ ప్రచారానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే కేసీఆర్ డిప్యూటీ స్పీకర్గా తన చాంబర్లో రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. అక్కడకు కాంగ్రెస్ బీట్ రిపోర్టర్లు కూడా వచ్చారు. పార్టీలో అసంతృప్తితో ఉన్నవారి గురించి చెప్పడంతో పాటు తెలంగాణ డిమాండ్ గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ బీట్ రిపోర్టర్లు మాత్రం ‘టీడీపీలో చీలిక’ అని వార్త రాస్తే, టీడీపీ బీట్ రిపోర్టర్లు ‘కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించనున్నారు’ అని రాశారు.
టీఆర్ఎస్ పుట్టిన వంద రోజులకే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. కేసీఆర్ హెలికాఫ్టర్లో ప్రచారానికి వెళ్తున్నారు.. అనే వార్త పెద్ద సంచలనంగా మారింది. అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నేను ఒకటే చెప్పా.. ‘తెలంగాణ అంటే అందరికీ చిన్నచూపు. ఆ భావనను పోగొట్టాలి. హెలికాఫ్టర్లో ప్రచారం సరైన నిర్ణయం’ అని. ప్రచారానికి వెళ్తూ నన్నూ తీసుకువెళ్లారు. సాధారణంగా ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికల రిపోర్టర్లనే తీసుకెళ్తారు. కానీ, కేసీఆర్ మాత్రం కవరేజ్ కోసం కాకుండా మాట్లాడుతూ వెళ్లవచ్చు అని నన్ను తీసుకెళ్లారని నాకు అర్థమైంది. జర్నలిస్ట్గా మూడున్నర దశాబ్దాల పరిచయంలో ‘ఇలా రాయమని, అలా ఎందుకు రాశావు’ అని ఒక్కసారి కూడా అడగలేదు. నేను పని చేసే ఆంధ్రభూమి ఓనర్, సంపాదకుడు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం. కానీ, నేను తెలంగాణ కోరుకున్నాను. ఒక్కసారి కూడా ‘పత్రికలో అలా ఎందుకు రాస్తున్నారు’ అని కేసీఆర్ అడగలేదు.
తెలంగాణ ఉద్యమకాలంలో గద్దర్ మొదలుకొని ఎంతో మందితో మాట్లాడే అవకాశం నాకు లభించింది. బాగ్ లింగంపల్లిలోని ఓ హాలులో 1969 నాటి ఉద్యమకారులతో సమావేశం జరిగింది. గద్దర్ను కలిసి తెలంగాణ వస్తుందా? అని ఆసక్తిగా అడిగితే ‘ఆంధ్ర లాబీ రానివ్వదు, రాదు’ అని అన్నారాయన. సకలజనుల సమ్మె సమయంలో కూడా ఉద్యమంలో నాయకులుగా ఉన్నవారు సైతం ‘తెలంగాణ రాదు’ అనే భావించేవారు. ఉద్యమ సన్నాహక సమయంలో నేను కూడా ‘తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు, కానీ తెలంగాణ రాదు’ అని చెప్పాను.
కానీ, ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఏ ఒక్కసారి కూడా కేసీఆర్ ‘తెలంగాణ రాదు’ అని అనలేదు. జర్నలిస్ట్ మిత్రుడు వై.నాగేశ్వరరావు ఓ సారి ‘సార్ (కేసీఆర్)తో మాట్లాడినంత సేపు తెలంగాణ వస్తుందన్న నమ్మకం కలుగుతుంది.. బయటకు వచ్చి ఎవరితో మాట్లాడినా తెలంగాణ రాదనిపిస్తుంది. అదేంటో’ అని మనసులో మాట చెప్పారు. నిజానికి అందరి అభిప్రాయం అదే. కేసీఆర్తో కొద్దిసేపు మాట్లాడితే చాలు తెలంగాణ వస్తుందన్న నమ్మకం కలిగేది. ఏ పార్టీ నాయకుడికీ అంత నమ్మకం ఉండేది కాదు. విశ్లేషణ శక్తి ఉండేది కాదు. రాజకీయ వ్యూహం ద్వారా తెలంగాణ ఎలా సాకారం అవుతుందో కేసీఆర్ అద్భుతంగా చెప్పేవారు.
గతంలో మహా టీవీకి చెందిన ఐ.వెంకట్రావుతో మాట్లాడుతూ రేవంత్రెడ్డి ఓ మాట చెప్పారు. ‘మేం ప్రత్యర్థి పార్టీ కాబట్టి విమర్శిస్తాం కానీ, కేసీఆర్ మొండి పట్టుదల వల్లనే తెలంగాణ కల సాకారమైంది’ అని రేవంత్రెడ్డి అన్నారు. సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సమావేశంలో మాట్లాడుతూ ‘చరిత్రను సృష్టించినవారు ఉంటారు. కానీ, కేసీఆర్ జాగ్రఫీని సృష్టించారు’ అని తెలంగాణ కల సాకారం చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు.
2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఎన్నో ఆటుపోట్లను చూసింది. జనాకర్షణ గల వైఎస్ఆర్ను సైతం తట్టుకొని కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టారు. ఓటమి రాటు తేలేట్టు చేస్తుంది. తప్పులను సరిదిద్దుకొనే అవకాశం ఇస్తుంది. లేచి నిలబడే ఆత్మైస్థెర్యాన్ని ఇస్తుంది. కాలం అన్నింటికీ సమాధానం చెప్తుంది. కేసీఆర్ తెలంగాణ సంపద. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం, సోనియాగాంధీ.. ఇద్దరిలో ఎవరు లేకపోయినా తెలంగాణ సాకారం అయ్యేది కాదు. ఓటమి సైతం కొన్నిసార్లు మంచి చేస్తుంది. మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తుంది. ఏడు పదుల వయసులో కేసీఆర్ తెలంగాణ కోసం మరోసారి తన వ్యూహాలకు పదును పెడతారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
-బుద్దా మురళి