దేశంలో అతిపెద్ద హిందీ రాష్ర్టాలు ఉత్తరప్రదేశ్, బీహార్లో కుల రాజకీయాలు ఎక్కువ అని, అక్కడ మొదటి నుంచి రిజర్వేషన్లు ఉండేవని, వాటి కారణంగానే అక్కడి కులాల మధ్య కుమ్ములాటలు ఎక్కువనే అభిప్రాయం దక్షిణాదిలో ఉన్నది. కానీ, నిజానికి ఎమర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన లోక్సభతో పాటు అనేక ఉత్తరాది రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూశాకే హిందీ రాష్ర్టాల్లో ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సీట్ల రిజర్వేషన్ అమలు కావడం మొదలైందంటే ఇప్పటి తరం ఆశ్చర్యపోకతప్పదు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జననాయక్ కర్పూరీ ఠాకూర్కు తాజాగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించగానే ఉత్తరాదిలో ఓబీసీ కోటా అమలు, రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు ఎలా జరిగాయనే విషయాలను రాజకీయ పరిశీలకులు గుర్తుచేసుకుంటున్నారు. పూర్వపు మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ హయాంలోనే బ్రాహ్మణేతర కులాల వారికి రిజర్వేషన్ల అమలు దాదాపు నూరేండ్ల క్రితమే మొదలైంది. మైసూరు వంటి స్వదేశీ సంస్థానాల్లో కూడా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కోటా ప్రవేశపెట్టారు.
ప్రస్తుత మహారాష్ట్రలో అంతర్భాగమైన పూర్వపు కొల్హాపూర్ సంస్థానంలో అయితే 1902లోనే రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చాక కూడా మద్రాసు, మైసూరు, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ర్టాలు, సంస్థానాల్లో ఎస్సీ, ఎస్టీలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఓబీసీల కోటాను కట్టుదిట్టంగా అమలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఎస్సీలు, ఎస్టీ కోటాల అమలు నిబంధనలను రాజ్యాంగంలోనే పొందుపరచగా, ఓబీసీల కోటాలకు అవకాశమిచ్చే కొన్ని అధికరణాలను భారత సంవిధానంలో చేర్చారు. కానీ, ఓబీసీ కోటా అమలు మాత్రం కేంద్రంలో, అన్ని రాష్ర్టాల్లో వెంటనే ప్రారంభించలేదు.
కాకా కాలేల్కర్ కమిషన్ నివేదిక
ప్రముఖ సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా వంటి ప్రతిపక్ష నేతల ఒత్తిడి ఫలితంగా రాజ్యాంగంలోని 340 అధికరణం ప్రకారం వెనుకబడిన కులాల కమిషన్ను 1953లో నెహ్రూ సర్కార్ నియమించింది. బీసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని కోరుతూ సంఘ సంస్కర్త కాకా కాలేల్కర్ అధ్యక్షతన మొదటి బీసీ కమిషన్ను కేంద్రం ఏర్పాటు చేసింది. రెండేండ్ల అధ్యయనం తర్వాత 1955 మార్చి 30న కాలేల్కర్ కమిషన్ బీసీల అభ్యున్నతికి చేపట్టాల్సిన సిఫారసులతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కానీ, కమిషన్ నివేదికపై చర్చల పేరుతో నెహ్రూ సర్కారు దాన్ని పక్కనబెట్టింది. ఆరేండ్ల తర్వాత 1961లో ఈ నివేదికను కేంద్రం తిరస్కరించింది. కులాన్ని ప్రాతిపదికగా తీసుకుని కాలేల్కర్ కమిషన్ వెనుకబడిన తరగతులను గుర్తించి, నివేదిక రూపొందించిన కారణంగా దాన్ని తోసిపుచ్చుతున్నట్టు ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లను అమలు చేసే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించినప్పటికీ నెహ్రూ సర్కారు దాన్ని విస్మరించడాన్ని లోహియా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంపై జీవితాంతం రాజకీయ పోరు చేశారు లోహియా. కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించడంతో ప్రభుత్వంపై వెల్లువెత్తిన నిరసనను నెహ్రూ సర్కార్ తెలివిగా తప్పించుకోవాలని చూసింది. ఓబీసీ రిజర్వేషన్ల అమలు అంశాన్ని రాష్ర్టాల నిర్ణయాధికారానికే వదిలివేసింది.
వెనుకబడిన వర్గాలకు కోటాను రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే వాటిని ఆయా రాష్ర్టాల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థలకే పరిమితం చేసే స్వేచ్ఛను కేంద్రం ఇచ్చింది. ఇలా బీసీ కోటాల అమలు వ్యవహారాన్ని పూర్తిగా రాష్ర్టాల విచక్షణకే వదిలేసింది. ఫలితంగా యూపీ, బీహార్ వంటి అనేక ఉత్తరాది రాష్ర్టాల్లో బీసీల కోటా 1977 వరకు అమలుకు నోచుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఓడిపోయిన మూడు నెలలకు అనేక హిందీ రాష్ర్టాల ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సోషలిస్టు నేపథ్యం ఉన్న పలువురు నాయకులు జనతా ప్రభుత్వంలో కేంద్ర మంత్రులయ్యారు. యూపీ, బీహార్ రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులయ్యారు.
బీసీ కోటా అమలు చేసిన తొలి సీఎంలు 1977లో లోహియా శిష్యులు, సోషలిస్టు నేపథ్యం ఉన్న నేతలు కర్పూరీ ఠాకూర్, రామ్నరేశ్ యాదవ్ వరుసగా బీహార్, యూపీ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఓబీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కమిషన్లను నియమించాయి. కమిషన్ల నివేదికల ఆధారంగా బీసీ కులాల జాబితాలు రూపొందాయి. వాటి ప్రకారం.. ఆయా రాష్ర్టాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.
దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ముఖ్యమంత్రులుగా ఠాకూర్, యాదవ్ చరిత్రకెక్కారు. 1977లో ముంగేరీ లాల్ అధ్యక్షతన బీసీ కమిషన్ను కర్పూరీ నియమించగా, అది 1978లో నివేదిక సమర్పించింది. అదే ఏడాది నవంబర్లో బీసీలను నాలుగు క్యాటగిరీలుగా విభజించి వారికి 26 శాతం కోటా ప్రవేశపెట్టారు కర్పూరీ. బీహార్లో కేవలం 1.6 శాతం జనాభా ఉన్న సామాజికవర్గంలో జన్మించిన కర్పూరీ తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాల నుంచి తీవ్ర నిరసనలు, ఆందోళనలు ఎదురయ్యాయి.
అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన సామాజికవర్గాన్ని కించపరిచేలా కొందరు దుర్భాషలాడారు. అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగే యూపీ, బీహార్లో ఓబీసీ కోటా ప్రవేశపెట్టిన రామ్నరేశ్ యాదవ్, కర్పూరీ ఠాకూర్ రెండేండ్లకే ముఖ్యమంత్రి పదవులను కోల్పోయారు. సైద్ధాంతిక నిబద్ధత, నిజాయితీ కలిగిన కర్పూరీ సామాజిక న్యాయం కోసం, బీసీ సాధికారతకు పాటుపడిన లోహియా తర్వాత గొప్ప స్ఫూర్తి ప్రదాతగా చరిత్రలో నిలిచిపోయారు.
ఓబీసీలను విస్మరించినందుకే కాంగ్రెస్ కనుమరుగు
యూపీ, బీహార్ వంటి హిందీ రాష్ర్టాల్లో ఓబీసీలకు సర్కారీ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కోటా అమలు చేయకుండా కాంగ్రెస్ నాయకత్వం కాలక్షేపం చేసింది. ఈ కారణంగానే గత నాలుగున్నర దశాబ్దాలుగా (1989 నుంచి) ఆయా రాష్ర్టాల్లో కాంగ్రెస్ ఉనికిని కోల్పోయింది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి సొంత రాష్ట్రంగా పేర్కొనే యూపీలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80 లోక్సభ స్థానాలకు గానూ ఒకే ఒక్క సీటుకే పరిమితమైంది. బీహార్లోనూ హస్తం పార్టీకి దక్కింది ఒక్క స్థానమే.
కాంగ్రెస్ విస్మరించినందుకే సమాజ్వాదీ, ఆర్జేడీ, జేడీయూ వంటి జనతా పరివార్ పార్టీలను, బీఎస్పీ వంటి అంబేద్కర్ సిద్ధాంతాలపై ఆధారపడిన పార్టీలను ఓబీసీలు ఆదరిస్తున్నారు. పోనీ, అగ్రవర్ణాలు కాంగ్రెస్ వెంట ఉన్నాయా? అంటే అదీ లేదు. వారిలో అత్యధిక శాతం ప్రజలు బీజేపీకి మద్దతిస్తున్నారు. దశాబ్దాలుగా యూపీ, బీహార్ సహా అనేక రాష్ర్టాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్లే ఆ పార్టీ బలం దారుణంగా పడిపోయింది.
అందుకే 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా 44, 52 సీట్లకు హస్తం పార్టీ పరిమితమైంది. జనతా పార్టీ సర్కార్ అమలు చేసిన ఓబీసీ కోటాలను కాంగ్రెస్ సంపూర్ణంగా సమర్థించలేదు. అదేకాకుండా, 1990లో ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ సర్కారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు (మండల్ కోటా) కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వును రాజీవ్ గాంధీ బాహాటంగా వ్యతిరేకించారు. ‘కులగణన చేస్తాం’ అని చెప్తూ రాహుల్గాంధీ వరుసపెట్టి యాత్రలు చేస్తున్నా ఆ పార్టీ గత రాజకీయ నేపథ్యం కారణంగానే ప్రజలు నమ్మడం లేదు. ఢిల్లీలో ఓ ప్రముఖ జర్నలిస్టుకు ఒక కాంగ్రెస్ నాయకుడు ఇటీవల చెప్పినట్టుగా ఈ సారి హస్తం వనవాసం 14 ఏండ్లకు మించిపోయేలా కనిపిస్తున్నది.
నాంచారయ్య మెరుగుమాల
79819 42329