కర్ణాటకలో తెలంగాణం వినిపించటం ఒక అరుదైన సన్నివేశం. మరీ ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో వ్యవసాయ సంక్షో భం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇదెంతో సానుకూల పరిణామం అని చెప్పవచ్చు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు తమకూ కావాలంటూ కన్నడ రైతన్న తమ రాష్ట్ర రాజధాని బెంగళూరులో కదం తొక్కాడు. చెరుకుకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వేలాదిగా తరలివచ్చిన కర్ణాటక రైతులకు తమిళనాడు, కేరళ రైతుసంఘాలు కూడా మద్దతు ప్రకటించి నిరసన ప్రదర్శనలో ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా అనేకమంది రైతులు తెలంగాణ పథకాల పేర్లను ప్ల కార్డులపై ప్రదర్శించటమే గాక, వాటిని రాష్ట్రంలోనూ అమలుచేయాలని ఎలుగెత్తి చాటారు. పైకి చూస్తే, ఇదొక రైతు ప్రదర్శన లాగానే కనిపించవచ్చు కానీ, గమనిస్తే దీన్నుంచి తీసుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి.
కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదన్న ఆవేదన, పొరుగున్న తెలంగాణ ప్రభుత్వం అక్కడి రైతులను అపురూపంగా చూసుకుంటుందన్న గౌరవం, మద్దతు ధరపై రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర సర్కారుపై ఆగ్రహం- ఈ విధంగా ఈ ప్రదర్శన బహుముఖాలుగా తనను తాను వ్యక్తం చేసుకున్నది. అంతేకాదు, దేశానికి తిండి పెట్టే రైతులకు భౌగోళిక, భాష సరిహద్దుల్లేవని నిరూపించింది. మట్టి నుంచి బంగారు పంటలను పండించే రైతులోకం అది. తల్చుకుంటే అధికార పీఠాలను బద్దలు కొట్టగలదు. ఢిల్లీలో జరిగింది కూడా అదే కదా! వారి మొక్కవోని దీక్షకు ప్రధాని మోదీ తల వంచి, క్షమాపణ చెప్పుకోక తప్పలేదు. అయినప్పటికీ, అటు కేంద్ర సర్కారులో గానీ, ఇటు పార్టీగా బీజేపీలో గానీ రైతుల పట్ల వైఖరి ఏమీ మారలేదని వారి ఆచరణే వెల్లడిస్తున్నది.
దీనికి పరిష్కారం సీఎం కేసీఆర్ చెప్పిన వ్యూహమే. పార్లమెంటరీ రాజకీయాలను, పోరాటాన్ని కలగలిపి ఉద్యమాన్ని నిర్మించాలని, తెలంగాణ ఉద్యమాన్ని ఆ రీతిగానే విజయతీరాలకు చేర్చామని అప్పట్లో తనను కలిసిన జాతీయ రైతు సంఘాల నేతలకు ఆయన తెలియజేశారు. భారతదేశ రైతు లు, వారి నేతలు ఈ విలువైన సూచనను పాటించాల్సిన అవసరం ఉన్నది. ఇక తెలంగాణ ప్రతిష్ఠ దేశవ్యాప్తంగా పెరగటమన్నది మనకు గర్వకారణం. ఇప్పటికే పొరుగు రాష్ర్టాల్లోని సరిహద్దు జిల్లాల ప్రజలు తమను తెలంగాణలో కలిపేయాలంటూ చేసిన ఉద్యమాలను చూశాం. ఇప్పుడు రైతులూ తెలంగాణ పథకాలపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేయటం చూస్తుంటే ఎనిమిదేండ్ల మన ప్రస్థానం సరైన దారిలోనే సాగుతున్నట్లుగా రుజువవుతున్నది. భరతమాత అతి పిన్న కుమార్తె నేడు తల్లి గర్వపడేస్థాయిలో అభివృద్ధి చెం దటం గొప్ప విషయం. తెలంగాణ మోడల్ దేశానికే అజెండాగా మారాలి.