కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన నేతలు నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురున్నారు. టికెట్లు ప్రకటించగానే అసమ్మతి భగ్గుమంది. తాడో పేడో తేల్చుకుంటామని వారంతా నామినేషన్లు వేశారు. అయితే నయానో, భయానో, బతిమాలో, బామాలో కొందరితో ఉపసంహరింపజేశారు. ఇంకా పలు నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో కొనసాగుతున్నారు. వారికి నచ్చజెప్పడానికి ప్రత్యేకంగా బుజ్జగింపుల కమిటీని వేసింది. ఈ కమిటీ ఎంపీ, ఎమ్మెల్సీ పోస్టులు ఇస్తామంటూ బిస్కెట్ వేస్తున్నది. వాటికి కూడా లొంగనివారికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నది.
ఇప్పటికే 30 మందికి ఎంపీ టికెట్, 75 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎంపీ సీట్లున్నవే 17 అందులో ఒకటి ఎంఐఎంకు మినహాయిస్తే 16 సీట్లే. అలాగే ఎమ్మెల్సీ మొత్తం సీట్ల సంఖ్య 40, ప్రస్తుత సభ్యుల పదవీకాలం ముగియడానికి దశలవారీగా కనీసం రెండు, మూడేండ్లు పడుతుంది. మరి అలాంటప్పుడు ఇంతమందికి ఎమ్మెల్సీలు ఎలా ఇస్తారు? కర్ణాటక తరహా గ్యారెంటీలు ఇక్కడ అమలుచేస్తామంటున్నారు, బహుశా అక్కడున్న 75 ఎమ్మెల్సీ సీట్లను కూడా తెలంగాణకే ఇస్తుందేమోనని రెబల్ అభ్యర్థి ఒకరు ఎద్దేవా చేశారు.
– వెల్జాల