ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి
తమరు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆకాశగంగను దివినుంచి భువికి దించిన నిజాన్ని కళ్లారా చూశాం! మీకు మీ కృషికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు!
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పథక రచన చేసిన ఇంజనీర్లు అనుకోని ఉండకపోవచ్చు ఆ నిర్మాణం ప్రకృతినే శాసిస్తుందని, పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా ఊహించి ఉండకపోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎదురెక్కించడమేకాక మండుటెండల్లో సైతం వర్షాలు కురిపించవచ్చని. మీరు కూడా కలగని ఉండకపోవచ్చు! కానీ జరిగింది మాత్రం ఊహాజనితమైన మార్పు! అది కాలగతినే మార్చిందనడంలో సందేహంలేదు!
నిజంగా మీరు ఆకాశగంగను దివినుంచి భువికి దింపిన అపరభగీరథులే! మీ కృషి, మీ పట్టుదల, మీ తెగువ, మీ మేధ వెరసి మీ రాజకీయ సమర్థత మండుటెండల్లో వర్షాలను కురిపించి కాలగతినే మార్చడం మీకే సాధ్యమయింది. విశాలమైన రిజర్వాయర్లతో తెలంగాణాలో మీరొక సముద్రాన్నే సృష్టించారు!
గత రెండేండ్ల నుంచి రైతుల కాయకష్టం అకాల వర్షాలకు నీటిపాలై ఉండవచ్చు… పండిన ధాన్యం నేలపాలై ఉండవచ్చు… వేలాది పాత, కొత్త ఇండ్లు భవనాలు కూలిపోయి కనుమరుగై ఉండవచ్చు! కానీ అది కాలగమనంలో ఒక మార్పుకు సంకేతమని గమనించాలి.
కాళేశ్వరం, అన్నాసాగర్,మేడిగడ్డ, లక్ష్మిబ్యారేజ్, సరస్వతీ, మేడారం, ఎల్లంపల్లి, తోటపల్లి, మిడ్ మానేర్, కొండ పోచమ్మ, మల్లన్నసాగర్ మొదలు వేలాది కుంటలు చెరువులు కుండల్లా నిండి అలుగు దుంకినపుడు, బీడు భూములన్నీ మాగాణాలైనపుడు అడవులన్నీ పచ్చని శోభతో పరవశించినపుడు ప్రకృతి తనంతట తానే తన కాలగతిని మార్చుకుంది. ఎండాకాలాన్ని వెనక్కి నెట్టి వర్షాకాలాన్ని ముందుకు తెచ్చింది. ఇది మా కన్నులు చూడని స్వప్నం!
ఆంధ్రప్రదేశ్కు సరిహద్దువెంట ఉన్న సముద్రం కారణంగా అక్కడ తుఫానులొస్తే ఇపుడు తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల నీటి వల్ల ఏర్పడిన అల్పపీడన ద్రోణులవల్ల ఆకాశం మేఘావృతమై వర్షాలను కురిపిస్తున్నది. కేవలం కాళేశ్వరం నీటి కారణంగానే ప్రకృతిలో మార్పు వచ్చిందే తప్ప మరోటికాదు. ఈ తరహా కాలం ఇప్పుడే కాదు ఇకముందు కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇకపై తెలంగాణ ప్రజలు కాలానుగుణంగా ఏర్పడిన మార్పులను గమనించవలసి ఉంటుంది. గతంలో ‘ఎండకాలమే మాకు పన్నెండు నెలలు’ అన్న మా కవి రమణారావు చరణం ఇపుడు మారింది. చెరువులు కుంటలు రిజర్వాయర్లన్నీ ఏడాదిలో 12 నెలలు నీటితోనే కళకళలాడుతున్నాయి. కాబట్టి ఇకపై ‘వర్షకాలమే మాకు పన్నెండు నెలలు’ అన్నట్టుగా తెలంగాణ రైతులు వ్యవసాయ విధానాలను మార్చు కోవలసి ఉంటుంది. ప్రజలు కాలనుగుణ మార్పును స్వాగతించాలి. ఈ మార్పు చరిత్రాత్మకం! ఆకుపచ్చ తెలంగాణ అంటే ఇదే!
ఆకాశగంగను భగీరథుడు భూమిపైకి రప్పించాడన్నది విన్నాం కానీ ఇపుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కాలగతినే మార్చిన మీ కృషిని కండ్లారా చూస్తున్నాం. మీకు వేలవేల ధన్యవాదాలు! మీ చరిత్ర ఆచంద్రతారార్కం నిలిచి ఉండాలని కోరుకుంటూ…
– దేవరశెట్టి జనార్థన్
కవి, రచయిత,తెలంగాణ ఉద్యమకారుడు, 95502 92727