India vs Bharat | సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిగే విషయం తెలిసిందే. అయితే ఆ రోజు పార్లమెంటును సమావేశపరచటం యాదృచ్ఛికం కాదు. 1949 సెప్టెంబర్ 18వ తారీఖునే రాజ్యాంగసభ సుదీర్ఘ చర్చ తర్వాత రాజ్యాంగంలోని మొదటి అధికరణాన్ని ఆమోదించింది. అది దేశం పేరు ఏం ఉండాలనే అంశంపై రూపొందింది కావడం గమనార్హం.
అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకించటానికి రాజకీయపార్టీలు బలంగా లేకపోవటం, ప్రధాన మీడియా సంస్థలు ప్రజల పక్షాన నిలబడకపోవటం, న్యాయవ్యవస్థ నత్తనడక పెద్ద సమస్యలు. నియంతృత్వ ధోరణి ఉన్నవారు ఎదుటివారికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వరు. ఆలోచించే వ్యవధి ఇస్తే దానికి వ్యతిరేకంగా స్పందన రావటం, ఆందోళన మొదలవ్వటం, మీడియాలో రావటం ఇదంతా అనవసరం!
ఇండియా, అనగా భారత్ రాష్ర్టాల సముదాయం అని చెప్తుంది రాజ్యాంగంలోని మొదటి అధికరణం. సెప్టెంబర్ 18న పార్లమెంటును సమావేశపరచటం అంటే 75 ఏండ్ల్ల అనంతరం సరిగ్గా అదే రోజు రాజ్యాంగ సభ నిర్ణయాన్ని తిరగరాయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేది మరొకటి అని అందరికీ తెలు సు. ఒక దేశం ఒక ఎన్నిక, అదే జమిలి ఎన్నికలు, నినాదం కొన్నాళ్లు తెరమరుగై మళ్లీ హఠాత్తుగా తెరమీదకి రావటం వెనుక ఒక వ్యూహం ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రజల దృష్టిని జమిలి ఎన్నికల అంశం మీదకి మరల్చి, ఆ అంశం మీద అందరూ తర్జనభర్జన పడుతుండగా, పెద్దగా చర్చలేకుండా దేశం పేరు ఇండియా బదులు భారత్గా మార్చాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నది. అందుకే ఈ ప్రక్రియకు సెప్టెంబర్ 18ని ఎంచుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఆరోజు మొదలవటం వెనుక ఆంత ర్యం అదే అనిపిస్తుంది.
దీనికి అసలు కారణం ప్రతిపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టడమే. అయినా ఆ సంగతి పైకి అనకుండా ఇండియా అనే పేరు వలసవాదుల వారసత్వానికి చిహ్నంగా ఉన్నదని చెప్తున్నారు. ఇది చాలా దారుణమైన వాదన. క్రీ.పూ. మెగస్తనీసు అనే గ్రీకు చరిత్రకారుడు రాసిన ఇం డికా అనే గ్రంథం ఇండియా అనే పేరుకు తొలి ఆధారాల్లో ఒకటి. అంటే ఎన్నో వేల ఏండ్ల నుంచి ఐరోపాకు మనం ఇండియాగానే తెలుసు. ఇండియా అనేది ఇంగ్లీషు పాలకులు ఇచ్చిన పేరుకాదు. ఇంగ్లీషువారు మన నేల మీద అడుగు పెట్టకమునుపే వాస్కోడాగామా ఇండియాకి సముద్రమార్గం కోసం బయల్దేరాడు. అంతకుమునుపు కొలంబస్ కూడా అదేపని మీద బయల్దేరి అమెరికాను కనుగొన్నాడు. అందరూ ఇండియా చేరుకోవటానికి సముద్రమార్గం కోసం అన్వేషించారు. వారికి ఇది భారతదేశం అని తెలియదు. శకుంతలా దుష్యంతుల సంతానం భరతుడు రాజ్యమేలిన భూమి గనక ఈ గడ్డకి భారతదేశం అనే పేరు వచ్చిందని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ఆ భరతుడు చరిత్రకు చెందినవాడు కాడు. శకుంతలా దుష్యంతుల కథ పురాణమేగానీ చరిత్ర కాదు. పురాణాల్లో వాస్తవికత ఉండదు. అవి కేవలం కథలు. ఇండస్ అనే నది ఒడ్డున ఉన్న ప్రదేశం కావటంతో ఇండస్ అనేపేరు క్రమేపీ ఇండియాగా మారిపోయింది. యావత్ ప్రపంచానికి మనం ఇండియాగా తెలుసు. ఆ గుర్తింపును పోగొట్టుకోవటం అవివేకపు ఆలోచన.
అయితే, ఇప్పటికీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు అజెండాను వెల్లడించలేదు. ప్రభుత్వం తన ఉద్దేశం బయటపెట్టనంతవరకూ అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతుంటాయి. దానితో ప్రజలు అయోమయానికి గురవుతారు. ఇలా జరగాలనే ప్రభుత్వం కోరుకుంటున్నదా? ఎందుకం టే జమిలి ఎన్నికలు 2024లో ఉండకపోవచ్చని ఇప్పుడు సూచనప్రాయంగా తెలుస్తున్నది. అలాంటప్పుడు ఇంత హడావుడిగా ఈ కోవింద్ కమిటీ ఎందుకు? పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచటమెందుకు? ప్రజల దృష్టిని జమిలి ఎన్నికలమీదకి మరల్చి, హఠాత్తుగా వేరొక విషయాన్ని తెరమీదకు తెచ్చి హడావుడిగా పార్లమెంటు ఆమో దం పొందటానికా? అది దేశం పేరు మార్చటాని కి, ఉమ్మడి పౌరస్మృతి, భారతీయ శిక్షాస్మృతి లాం టి వివాదాస్పద అంశాలకు చర్చ లేకుండా పార్లమెంటు ఆమోదం పొందటానికా? ప్రభుత్వ ఆలోచన ఏమిటో ప్రజలకు చెప్పాలి కదా! మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆలోచన రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేదిగా ఉన్నప్పుడు ఇది తప్పనిసరి. ఈ కోవింద్ కమిటీ అనేది ఒక ‘రెడ్ హెర్రిం గ్’ అనుకోవాలి.
అసలు విషయాన్ని మాటున ఉంచి, వేరే విషయాన్ని తెరమీదికి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లింటాన్ని ‘రెడ్ హెర్రింగ్’ అంటారు. ప్రజల దృష్టిని వేరే అంశం మీదకు మళ్లించి, అసలు పని కానిచ్చుకోవటమే ‘రెడ్ హెర్రింగ్’ ఉద్దేశం. పార్లమెంటును సమావేశపర్చటంలో ప్రభుత్వం అసలు ఉద్దేశం దేశం పేరు ఇండియా బదులు భారత్గా మార్చటమని వదంతులు వినిపిస్తున్నాయి. పైగా జీ 20 నేతలకు రాష్ట్రపతి ఇచ్చే విందుకు ముద్రించిన ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండి యా’ కాకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉం డటం ఈ వదంతుకు ఊతమిస్తున్నది. బహుశా అది నిజమే అయి ఉండవచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే, ఒకరకంగా ఇది నోట్ల రద్దులాంటిదే. ఇండియా అనేది బ్రిటీష్ పాలనతో వచ్చిన వారసత్వం గా చూపించే ప్రయత్నం జరుగుతున్నది. అది పూర్తిగా ఆలోచనలేని వాదన. క్రీ.పూ. నుంచే ఐరోపాకు మనదేశం ఇండియాగా తెలుసు.
దేశం పేరు మార్పు అనేది ఆషామాషీ విషయం కాదు. దేశం పేరు మార్చేముందు దేశ ప్రజలను అడగరా? కేవలం పార్లమెంటు ఆమోదం పొందితే సరిపోతుందా? అదీ సార్వత్రిక ఎన్నికలు ఆరు నెలలలోపు ఉండగా? దేశం పేరు మారితే అధికార పూర్వక పేర్లలో ఇండియా ఉన్నచోటల్లా దాని స్థానంలోభారత్ను చేర్చాల్సి ఉంటుంది.ఉదాహరణకు పాస్పోర్టు. ఆపై అనేక వందల సంస్థల పేర్లు మార్చాల్సి రావచ్చు. ఇది చాలా
గందరగోళానికి దారితీస్తుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అనే సంస్థలకు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్ఠలున్నాయి. దాన్ని భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మార్చితే ఆ సంస్థకున్న బ్రాండ్ విలువ బాగా పడిపోయే ప్రమాదం ఉన్నది. ఐఐటీ అంటే అందరికీ తెలు సు. అదే బీఐటి అంటే ఐఐటీ అనుకోలేం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ సందర్భంగా ఉత్పన్నమయ్యే సమస్యలెన్నో ఉంటాయి. పేరు మార్పు పూర్తవ్వటానికి చాలా ఏండ్లు పడుతుంది. దీంతో సాధించేదేమిటి? ‘పేరులో ఏముంది, రోజా పువ్వును ఏ పేరుతో పిలిచినా అదే పరమళాన్నిస్తుంది కదా’ అని చమత్కరించాడు విలియం షేక్స్పియర్. దేశం పేరు ఇండియా అయినప్పుడు, మనం ఇండియన్స్ అని చెప్తాం ప్రపంచానికి. దేశం పేరు భారత్ అయితే ప్రజల నేషనాలిటీ ఏం ఉండాలి? మన దేశంలోనే వివిధ భాషల్లో పలువిధాలుగా అంటారు. తెలుగులో మనం భారతీయులమనుకుంటాం. మరి తమిళంలో మలయాళంలో, కన్నడంలో ఎలా అంటారు? ఇహ దేశం బయట ఏమని చెప్పాలి? భారత్ అనే దేశం పేరుతో పాటు మన నేషనాలిటీకి కూడా ఒక కామన్ పదాన్ని కనిపెట్టాలి. ‘భారత్ కా ఆద్మీ’ లేక ‘భారత్ వాలా’ అంటే సరిపోతుందా? అది ఏ భాష మాటై ఉండాలి? హిందీ మాటైతే సరిపోతుందా? ఇంగ్లీషులా హిందీ కామన్ భాష అన్న స్థాయికి ఇంకా ఎదగలేదు. మరి తమిళులు హిందీ మాటను ఒప్పుకుంటా రా? ఇది కూడా ఒక సమస్యే. అసలు ఇప్పుడున్న సమస్యలు చాలవా?
అనేక క్లిష్టమైన అంశాలు ఇమిడి ఉన్నాయి దేశం పేరు మార్పులో. వేలకోట్ల రూపాయల ధనం ఖర్చు చెయ్యాలి ఈ ప్రక్రియ పూర్తి చెయ్యటానికి. దాన్ని పూర్తిచెయ్యటానికి దీర్ఘకాలం పడుతుంది. ఇప్పుడున్న పేరుతో ఎంతో గౌరవ ప్రపత్తులు సంపాయించుకున్న సంస్థలు, కొత్తపేరుతో అదే గౌరవ ప్రపత్తులు తిరిగి పొందాలంటే ఎన్నో ఏండ్లు శ్రమించాల్సి ఉంటుంది. ఇది ఒక మతిలేని ఆలోచనగా కనిపిస్తుంది దేశ ప్రజలకు. అందువలన, ప్రతిపక్షాలు దేశ ప్రతిష్ఠను, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తమ కూటమికి ఇండి యా అనే పేరును మార్చి మరో పేరు పెట్టుకొని, ప్రభుత్వ ఆలోచనను విరమింపజేయటం ఉత్త మం! అప్పుడు ప్రతిపక్షాలు ప్రజల హృదయాల ను గెలుచుకుంటాయి. అప్పుడన్నా ప్రభుత్వ పెద్ద లు ఈ అనాలోచిత చర్య నుంచి వెనక్కి తగ్గవచ్చు. లేదా ఒక దేశం ఒక పన్నుతో మొదలైన పిచ్చి ఒక దేశం ఒక ఎన్నిక, ఒక దేశం ఒక చట్టం (ఉమ్మడి పౌరస్మృతి), ఒక దేశం ఒక భాష, ఒక దేశం ఒక నమ్మకం దిశగా ఈ ‘ఒక’ పిచ్చి పరాకాష్టకు చేరే ప్రమాదం ఉన్నది.
దేశ ప్రజలు ఆలోచించి అవగాహన చేసుకోవటానికి తగినంత సమయం ఇవ్వకుండా త్వరత్వరగా, వడివడిగా పని కానిచ్చేయటం మోదీ తీరు. నోట్ల రద్దు కానియ్యండి, లాక్డౌన్ కానీయండి.. కేవలం నాలుగే నాలుగు గంటల వ్యవధితో ప్రజల మీద రుద్దిన అత్యంత కఠిన నిర్ణయాలు. ఒకసా రి ఒక నిర్ణయాన్ని తీసుకున్నామని కరాఖండిగా చెప్తే సరే అయిందేదో అయ్యిందనే అభిప్రాయం సహజంగానే కలుగుతుంది. దీన్నే ‘ఫెయిట్ అక్కంప్లి’ అంటారు సైకాలజీ పరిభాషలో. అయిందేదో అయ్యింది, ఇప్పుడు ఒప్పుకోవడం తప్ప ఇంకేమీచేయలేమనేది దీని సారాంశం. ఆమోదయోగ్యం కాని నిర్ణయాన్ని ఆమోదింపచేయటానికి బాగా తెలిసిన మానసిక మార్గం ఇది. దీన్ని చాలా సందర్భాల్లో వాడారు మన వ్యవస్థలో. ఉదాహరణకు ఆర్టికల్ 370 రద్దు అనేది ఎటువంటి సంకేతం లేకుండా ఒకే ఒక్క రోజులో పూర్తయ్యింది. చర్చ లేదు, దానికి సమాధానమూ లేదు.
అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకించటానికి రాజకీయపార్టీలు బలంగా లేకపోవటం, ప్రధాన మీడియా సంస్థలు ప్రజల పక్షాన నిలబడకపోవటం, న్యాయవ్యవస్థ నత్తనడక పెద్ద సమస్యలు. నియంతృత్వ ధోరణి ఉన్నవారు ఎదుటివారికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వరు. ఆలోచించే వ్యవధి ఇస్తే దానికి వ్యతిరేకంగా స్పందన రావ టం, ఆందోళన మొదలవ్వటం, మీడియాలో రావ టం ఇదంతా అనవసరం! ఆందోళనలను నిలువరించటం కన్నా నివారించటం మేలు కదా అనేది పాలకుల ఉద్దేశం.
మన దేశంలో హృదయాంతరాళంలో జీర్ణించుకున్న విశ్వాసాలకు విఘాతం కలిగితే తప్ప ప్రజలు స్వచ్ఛందంగా స్పందించరు. వీధుల్లోకి వచ్చి వీరంగం సృష్టించటం భారతీయుల స్వభావం కాదు. సిద్ధాంతానికి కట్టుబడినవారు, భావజాలం తో ప్రేరేపితమైన వారు తప్ప మెజారిటీ ప్రజలు పోలీసులకు కోర్టులకు దూరంగా ఉండాలనే కోరుకుంటారు. ఆందోళన చేసేవారు, అలజడి సృష్టించేవారు ఎక్కవగా అద్దెకు వచ్చిన మూకలే. అటువంటివారు, గుంపులో గోవిందయ్యలా తప్పించుకోవచ్చనుకుంటారు. లేకపోతే వారి యజమాను లు వారి బాగోగులు చూసుకుంటారనే నమ్మకం తో ఉంటారు. సామాన్యజీవి చట్టాన్ని ఉల్లంఘించి ఆందోళన చేయాలనుకోడు. నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా ఆందోళన చేశారా? లాక్డౌన్ కూడా అంతే కదా? వందల కిలోమీట ర్లు నడుచుకుంటూ ప్రాణాంతకమైన ప్రయాణం కొనసాగించారు గానీ ఎవరైనా నోరు మెదిపారా? మన ఖర్మ ఇంతే అనుకోవటమే మనకు చేతనైనది. ఎదిరించి సాధించేదేముంది లేనిపోని గొడవల్లో ఇరుక్కోవటం తప్ప అనేది సామాన్యుడి ఆలోచన.
స్వాతంత్య్రోద్యమం ఒక అరుదైన చారిత్రక ఘట్టం. సామాన్య మనిషిని ఉద్యమంలోకి లాగటం గాంధీజీకే సాధ్యమైంది. ఆ తదుపరి తెలంగాణ ఉద్యమానికి సాధ్యమైంది సామాన్య పౌరుడిని స్వచ్ఛందంగా పోరాటంలో భాగస్వామిని చేయటం. ఇటీవలి కాలంలో రైతులు చేసిన సంవత్సరకాలపు ఆందోళన కూడా ఈ కోవదే. ఇవి రాజకీయాలకతీతంగా, విశ్వసనీయమైన నాయకత్వంలో, బలమైన భావజాలంతో నడిచిన ప్రజా ఉద్యమాలు. అందుకే ఇవి అరుదైన ఘట్టాలు.
మన దేశంలో ప్రజలు పోరాడే సంప్రదాయం లేదు. వందల ఏండ్లు రాచరికంలో బతకటంతో మనకు వారసత్వంగా అబ్బిన సంస్కృతి ఇది. అం దుకే ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేసినా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా దానికి వ్యతిరేకంగా పోరాడటం మనకు లేని అలవాటు. ఇప్పు డు రాజకీయపార్టీలు చేసే పోరాటాల్లో ప్రజల ఐచ్ఛిక భాగస్వామ్యం అస్సలు ఉండటం లేదు. కారణం సామాన్య ప్రజల విశ్వాసాన్ని రాజకీయ పార్టీలు పొందలేకపోవడమే. అందుకే నేతలు చేసే నిరసనల్లో సామాన్యులు పాల్గొనరు. అంతా అద్దె మూకలే. మన నేతల విశ్వసనీయత అంతలా పడిపోయింది. ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరించటానికి ఇదొక ప్రధాన కారణం. నేడు దేశం అనేకరంగాల్లో ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో వాటిని వదిలి దేశం పేరు మార్చటమేంటి? మార్చాల్సింది దేశం పేరు నా, దేశ ప్రజల తలరాతనా? ఇదంతా ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికేనేమో అనే సందేహమూ కలుగుతుంది.
ప్రభుత్వాలు రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ ధోరణిని కట్టడి చెయ్యటానికి న్యాయవ్యవస్థ సిధ్ధంగా లేకపోవటం, మీడియా స్వతంత్రంగా లేకపోవటం, మేధావులు చురుగ్గా లేకపోవటం కూడా కారణాలే. ఎన్నికలు ఒక్కటే ప్రజలకున్న ఆయుధం. దాన్ని వాడి ప్రజలు గెలుస్తారా లేక ప్రభుత్వ పిడివాదం గెలుస్తుందా? అనేది కాలమే చెప్పాలి. ఏమో ఎవరు చూశారు? కర్ణాటకలో ప్రజలు గెలవలేదా? మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఎంతైనా మనిషి ఆశా జీవి కదా.
-గుమ్మడిదల రంగారావు