Congress | కిందటేడాది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఎం.మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. 24 ఏండ్ల తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంబంధం లేని బయటి వ్యక్తికి ఈ పదవి లభించిందని కొందరు సంబురపడ్డారు. బాబూ జగ్జీవన్రామ్ తర్వాత 52 ఏండ్లకు మరోసారి దళిత వ్యక్తిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టిన కాంగ్రెస్ తాజాగా ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును జపిస్తున్నది. ఎన్నికల వేళ ‘దళిత ప్రధాని’ కార్డును కాంగ్రెస్ తెరపైకి తీసుకురావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.1998 నుంచి 2022 వరకు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్గాంధీ కాంగ్రెస్ అధినేతలుగా ఉన్నా రు. కానీ వరుస వైఫల్యాలతో అనూహ్యంగా ఖర్గేను కాంగ్రె స్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసింది. తాజాగా ఆ పార్టీ దళిత ప్రధాని కార్డును ప్రయోగిస్తున్నట్టు తెలుస్తున్నది.
సోనియా, రాహుల్గాంధీ నాయకత్వంలో వరుసగా రెండు పార్లమెంటు ఎన్నికల్లో (2014, 2019) కాంగ్రెస్ ఘోర పరాజయాలను చవిచూసింది. లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలంటే కనీసం 55 స్థానాలు అవసరం. ఈ రెండుసార్లూ కాంగ్రెస్ కేవలం 44, 52 సీట్లతో సరిపెట్టుకున్నది. గత పదేండ్లుగా భారత పార్లమెంటు దిగువ సభలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం ఆ పార్టీ కేంద్ర నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. దేశ చరిత్రలో కాంగ్రెస్ పదేండ్లు అధికారంలో లేకపోవడం ఇదే మొదటిసారి.
1998 మధ్యంతర ఎన్నికల్లో వాజపేయి నేతృత్వంలో బీజేపీ రెండోసారి హస్తినలో అధికారం చేపట్టింది. అప్పుడు హడావుడిగా అధ్యక్ష పదవి నుంచి బీహార్ బీసీ నేత సీతా రాం కేసరీని తొలగించారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నియామకం సాఫీగా జరిగిపోయింది. అనంతరం 1999 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కనిష్ఠ స్థాయికి (114 సీట్లు) పడిపోయింది. కాంగ్రెస్ పార్టీలో చీలిక ఫలితంగా పార్టీ ఉనికిని, దానిపై తన కుటుంబ పట్టు ను 2004 పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ద్వారా కాపాడుకోవడానికి ఏ కాంగ్రెస్ అధినేత చూపించని చొరవను సోని యా గాంధీ చూపించారు. వ్యతిరేక రాజకీయ నేపథ్యం ఉన్న రాంవిలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జన్శక్తి, డీఎంకేలతో కాంగ్రెస్ కూటమి కట్టింది. పొత్తుల ద్వారా కాంగ్రెస్ బలా న్ని 114 నుంచి 145 వరకు సోనియా తీసుకురాగలిగారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 138 సీట్లతో సరిపెట్టుకున్నది. ఆర్జేడీ, డీఎంకే వంటి కాంగ్రెస్ మిత్రపక్షాలతోపాటు వామపక్షాల బలం మొదటిసారి గణనీయంగా పెరిగింది.
బయటినుంచి కమ్యూనిస్టుల మద్దతుతో కాంగ్రెస్ నాయకత్వంలో తొలి సంకీర్ణ సర్కారు ఢిల్లీలో గద్దెనెక్కే అవకాశం వచ్చింది. ఈ ఎన్నికల్లో అప్రకటిత ప్రధాని అభ్యర్థి సోనియా గాంధీనే. కానీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నేతగా సోనియా ఎన్నికయ్యాక జరిగిన అనుకోని పరిణామాలతో ఆమె ప్రధాని పదవిని త్యాగం చేశారు. వెంటనే మాజీ ఆర్థికమంత్రి మన్మోహన్సింగ్ను ప్రధాని పదవికి సోనియా నామినేట్ చేశారు. మన్మోహన్ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టినా అన్ని అధికారాలూ తమ గుప్పిట పెట్టుకొని చేసిన మొదటి ఐదేండ్ల ‘బ్యాక్ సీట్ డ్రైవింగ్’ సోనియా కుటుంబానికి కలిసొచ్చింది.
అమెరికాతో అణు సహకార ఒప్పందానికి నిరసనగా కమ్యూనిస్టులు దూరమైనా, ఆర్జేడీ యూపీఏ నుంచి వాకౌ ట్ చేసినా 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 206 సీట్లు కైవసం చేసుకోగలిగింది. ఆ తర్వాత యూపీఏ-2 పాలనలో మన్మోహన్ నామమాత్ర ప్రధానిగా మిగిలారు. పదేం డ్ల పాలనలో వైఫల్యాలు ఆకాశాన్నంటాయి. కాంగ్రెస్ ప్రధానిగా మన్మోహన్కు తగిన గౌరవం పార్టీ అధినాయకత్వమే ఇవ్వలేదు. వీటికితోడు 2013లో రాహల్గాంధీ కాంగ్రెస్ ఉపాధ్యక్ష హోదాలో తన సొంత సర్కారు జారీచేసిన ఒక ఆర్డినెన్స్ కాపీని బహిరంగంగా చింపి ముక్కలుచేయడం ఘోర తప్పిదంగా పరిణమించింది.
2014 లోక్సభ ఎన్నికలకు ఏడాది ముందే ప్రధాని అభ్యర్థిగా నాటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీ పేరును బీజే పీ ప్రకటించింది. అయినా, అప్రకటిత ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. ఆయన తల్లి సోనియా, సోదరి ప్రియాంక చేసిన ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ స్కోరును 44 సీట్లకు పడిపోకుండా ఆపలేకపోయింది. పార్లమెంటు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు 2017లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన రాహుల్కు 2019 ఎన్నికలు నిరాశే మిగిల్చాయి. కాంగ్రెస్ బలం లోక్సభలో 8 స్థానాలు పెరిగి 52కు చేరింది. కానీ అమేథీలో రాహుల్ ఓడిపోయారు. పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్గా పరిగణించే మొన్నటి మూడు హిందీ రాష్ర్టాల ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బతిన్నది.
2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిన వెంటనే రాహుల్ రాజీనామాతో ఖాళీ అయిన అధ్యక్ష పీఠంపై చాలా ఆలస్యంగా 2022లో దళితనేత ఖర్గేను అధినాయకత్వం కూర్చోబెట్టింది. ఈసారి కూడా వెనుక సీటు డ్రైవింగ్తో ముందుకు నెట్టుకుంటూ పోవచ్చనేది సోనియా, రాహుల్, ప్రియాంక ఆలోచన. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నికైన ఏడాదికి ఇండియా కూటమిలో కొత్త నాటకానికి తెరతీశా రు. 18వ లోక్సభ ఎన్నికల్లో కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల అధ్యక్షులు ప్రతిపాదించడం కాంగ్రెస్ అనుకూల ప్రతిపక్ష రాజకీయాల్లో కొత్త మలుపు. భారత్ జోడో యాత్రతో కాస్త జనాకర్షణ సంపాదించానని భావిస్తున్న రాహుల్ గాంధీని ఇండియా ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఎక్కడ కొంప మునుగుతుందోననే భయంతో ఈ రెండు ప్రాంతీయ పక్షాలు ఖర్గే పేరును ప్రతిపాదించాయి. తమ కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు వచ్చాక ప్రధాని పదవి సం గతి చూద్దామని చెప్పి ఖర్గే తప్పించుకున్నారు. భవిష్యత్తు చిత్రం ఏమిటో ఖర్గేకు తెలియనిది కాదు.
ఖర్గే పేరు ప్రతిపాదనపై బీహార్ బడా నేతలు నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ నిరసన తెలిపారని కూడా వార్తలొచ్చాయి. ఉత్తరాదిన, ప్రధానంగా హిందీ రాష్ర్టాల్లో దళిత ప్రధాని కావాలంటే ‘కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి ఓటేయండి’ అనే నినాదం ఓట్లు రాల్చదనే వాస్తవం ఈ ఇద్దరు జనతా పరివార్ బీసీ నాయకులకు తెలుసు. 1990 మార్చి నుంచి బీహార్లో అగ్రవర్ణాలకు చెందిన వారిని ముఖ్యమంత్రులుగా కాకుండా చేసిన లాలూ, నితీశ్కు ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకూ నడిచిన ఎన్నికల రాజకీయాలు బాగానే గుర్తున్నాయి.
1979లో కేంద్రంలోని జనతా ప్రభుత్వం అంతర్గత వైరుధ్యాలతో కూలిపోయి ప్రధాని మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత జనతా పార్టీ బాబూజీని ‘దళిత ప్రధాని’గా చూపించి ఏడో లోక్సభ ఎన్నికల ప్రచారంలో కి దూకింది. అప్పట్లో బీజేపీ జనతా పార్టీలో అంతర్భాగం గా ఉండేది. ఈ ఎన్నికల్లో జనతాపార్టీకి 31 సీట్లు, దాదా పు 19 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. స్పష్టమైన విధానాలు, సూత్రబద్ధ రాజకీయాలకు చోటు దొరకని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమికి కూడా దళిత ప్రధాని నినాదం వచ్చే ఎన్నికల్లో పని చేయదనేది ఉత్తరాది రాజకీయాలపై అవగాహన ఉన్న ఎన్నికల విశ్లేషకులకు తెలుసు. ఉత్తరాది సమాజంలో వచ్చిన మార్పులు గమనించకుండా కేవలం ‘దళిత ప్రధాని’ అనే నినాదంతో ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీకి గానీ, ‘ఇండియా కూటమి’కి గానీ ఎలాంటి ఫాయిదా ఉండదనడంలో ఏ మాత్ర సందేహం లేదు.
– నాంచారయ్య మెరుగుమాల
79819 42329