ఢిల్లీ గద్దెపై తెలంగాణ అస్తిత్వ పతాక ఆకాశమంత ఎత్తుకు సగర్వంగా ఎగిరిన అపూర్వ సందర్భం. తెలంగాణ తల్లీ తన గడ్డకు వస్తున్నానని ప్రకటింపజేసుకున్న సన్నివేశం. ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 11 రోజుల అకుంఠిత ఆమరణ దీక్షకు ఢిల్లీ తలొగ్గిన శుభతరుణం. స్వరాష్ట్ర కాంక్షను నెరవేరుస్తామని ఢిల్లీ ప్రకటించిన సుదినం. అదే 2009, డిసెంబర్ 9.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించిన అపూర్వ సందర్భం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాఫల్య సాకార ప్రక్రియకు శ్రీకారం చుట్టిన శుభదినం. 2009 నవంబర్ 29న నాటి ఉద్యమనేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే.చంద్రశేఖర్రావు ఆమరణ దీక్ష ప్రారంభించిన మొదలు 11 రోజుల పాటు నలుదిక్కులను ఏకంచేసి కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేయక తప్పని అనివార్యతను సృష్టించిన అజరామర ఘట్టం. కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసి నేటికి సరిగ్గా పద్నాలుగేండ్లు. ఈ సందర్భంగా ఆనాటి కేసీఆర్ అకుంఠిత దీక్షను మరోసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమై హైదరాబాద్ నుంచి నవంబర్ 28న కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణభవన్కు చేరుకున్నారు. అప్పటికే ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో…. తెలంగాణ జైత్రయాత్రో.. కేసీఆర్ శవయాత్రో’ అని కేసీఆర్ నినదించి ఉండటంతో తెలంగాణవ్యాప్తంగా ఉద్విగ్న, ఉత్కంఠభరిత వాతావరణం నెలకొన్నది. కేసీఆర్ దీక్షను అడ్డుకోవడానికి కరీంనగర్ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం, తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు చేరడంతో కరీంనగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ఆమరణ దీక్ష చేపడుతారా, పోలీసులు అడ్డుకుంటారా అనే ఉత్కంఠ వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా ఆవహించింది.
నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి కరీంనగర్లో క్షణక్షణం ఉతంఠ, ఉద్విగ్నం. ఉత్కంఠ.. ఉద్వేగం కలగలిసిన వాతావరణం. దీక్షను అడ్డుకొని తీరుతామన్న ప్రభుత్వం పట్టు ఓ వైపు.. దీక్ష చేసి తీరుతానన్న కేసీఆర్ పట్టుదల మరోవైపు. కేసీఆర్ బస చేసిన ఉత్తర తెలంగాణ భవనం చుట్టూ అంచెలవారీగా పోలీసుల మోహరింపు. తెలంగాణ భవనాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అంతే ధీటుగా ప్రజలు, కార్యకర్తలు పోలీసుల ప్రయత్నాలను తిప్పికొట్టడానికి సంసిద్ధమయ్యారు. తెలంగాణ భవన్ రాత్రంతా ‘ధూం ధాం..’. పది జిల్లాల తెలంగాణ రణ నినాదమై ఎగిసిపడుతున్నది. క్షణమొక యుగంలా తెలంగాణ అంతా తెల్లవారింది. నవంబర్ 29న ఉదయం తెలంగాణ భవన్లోనే కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రభుత్వ దమనకాండను ఎండగట్టారు. ఉత్తర తెలంగాణ భవన్ నుంచి దీక్షకు సిద్ధమయ్యారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జీవీఆర్, రాజయ్య యాదవ్తో కలిసి సిద్దిపేట దీక్షాస్థలికి వాహనంలో బయల్దేరారు.
తెలంగాణ భవన్ వద్ద వేలాది మంది ప్రజలు,కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున మోహరించటం.. అక్కడేం చేసినా తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు తమ వ్యూహాన్ని కరీంనగర్ పొలిమేరలకు మార్చుకున్నారని ఆ తర్వాత అల్గునూర్లో జరిగిన పరిణామ క్రమంతో తేలిపోయింది. కేసీఆర్ కాన్వాయ్ బయల్దేరగానే, కార్తకర్తలు, మీడియా వాహనాలు కాన్వాయ్ను అనుసరించకుండా అల్గునూర్ బ్రిడ్జివద్ద నిలిపివేశారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అల్గునూరు చౌరస్తా వద్ద కేసీఆర్ వాహనాన్ని అడ్డుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ను అదుపులోకి తీసుకున్నది సాధారణ పోలీసులు కాదు. దేశ సరిహద్దుల్లో విదేశీ శక్తులు లేదా దేశ ద్రోహులతో తలపడేందుకు వినియోగించే ప్రత్యేక పోలీసు బలగం ఆక్టోపస్ను నాటి ప్రభుత్వం కేసీఆర్ను కట్టడి చేసేందుకు రంగంలోకి దింపింది.
అల్గునూర్ చౌరస్తా నుంచి కేసీఆర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వరంగల్ వైపు తరలించారు. వరంగల్ కోర్టులో ప్రవేశపెడుతారని, అక్కడినుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలిస్తారని అటు కోర్టు దగ్గర, ఇటు జైలు దగ్గర భారీ ఎత్తున ప్రజలు, తెలంగాణవాదులు, వివిధ పార్టీల శ్రేణులు చేరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే వరంగల్లో అగ్గిరాజుకుంది. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కేసీఆర్ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుంటారని సమాచారం అందుకున్న పోలీసులు ‘ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట మీదుగా హైదరాబాద్ తరలిస్తారు’ అని పక్కదారి పట్టించారు. నిజమే కావచ్చని విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వెళ్లారు. అంతే వాయువేగంతో పోలీస్ వాహనశ్రేణి వరంగల్ పోలీస్ హెడ్క్వార్టర్స్ హంటర్రోడ్ మీదుగా నాయుడు పంప్.. మామునూర్ మీదుగా తొర్రూర్ వైపు వాహనాలు అక్కడా తిరుమలగిరి నుంచి హైదరాబాద్ తరలిస్తారని వదంతులు. కానీ తొర్రూర్ మీదుగా నేరుగా ఖమ్మం తరలించారు. ‘కేసీఆర్ను పోలీసులు ఖమ్మం కోర్టులో హాజరు పరిచారు’ అనే దాకా తెలంగాణ అంతటా ఏం జరుగుతుందో తెలియని గందరగోళం, అయోమయం, ఆందోళన.
ఖమ్మం కోర్టు కేసీఆర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కేసీఆర్ తన ఆమరణ దీక్షను విరమించే ప్రసక్తే లేదని ప్రకటించి జైల్లోనే దీక్షను కొనసాగించారు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ ఖమ్మం ఆస్పత్రికి.. అక్కడినుంచి నిమ్స్కు తరలించేదాకా క్షణమొక యుగం.. ఘడియొక గండంలా తెలంగాణ తయారైంది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారంతో తెలంగాణలో అగ్గి రాజుకుంది.
ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. పోలీసులు రబ్బరు బుల్లెట్లు వదిలినా.. బాష్పవాయు గోళాలు పేల్చినా విద్యార్థులు వెనకంజ వేయలేదు. ఉద్యమకారులందరి రక్తం వేడెకింది. బస్సులు, రైళ్ల రాకపోకలు స్తంభించాయి. పరిస్థితి చేయి దాటుతుండటంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సీపీఎం మినహా అన్నిపార్టీలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించాయి. ఇదే విషయం స్పష్టంచేస్తూ ఢిల్లీకి నివేదిక కూడా ఇచ్చాయి. పర్యవసానాలు వేటికవే పోటాపోటీగా కొనసాగాయి. కేసీఆర్ దీక్ష ప్రారంభించిన 11 రోజులకు, సరిగ్గా 2009 డిసెంబర్ 9న కేంద్రం దిగివచ్చింది. అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అర్ధరాత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో యావత్ తెలంగాణ పులకించిపోయింది. ఆందోళన స్థానంలో హర్షాతిరేకాలు చేరాయి. ధర్నాలు, నిరసనల స్థానంలో సంబురాలు, విజయోత్సవాలు.
జై తెలంగాణ..!
-నూర శ్రీనివాస్