మన దేశంలో బీమా రంగం చాలా వెనుకబడి ఉన్నది. దేశ జనాభాలో 2 నుంచి 4 శాతం ప్రజలకు మాత్రమే బీమా సౌకర్యం ఉన్నదంటే ఆ రంగం పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది. ఆధునిక సమాజంలో బీమా అనేది ప్రతి వ్యక్తికి అవసరం. అధిక ప్రీమియంలు, అవగాహనా రాహిత్యం, ప్రైవేట్ బీమా కంపెనీల మోసాల కారణంగా బీమారంగం చాలా వెనుకబడి ఉన్నదని ఘంటాపథంగా చెప్పవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం బీమా రంగం విషయంలో కీలకమైన విధానాలను తీసుకువచ్చింది. ఐరోపా, అమెరికాల్లో అక్కడి జనాభాలో సుమారు 80 శాతం ప్రజలకు ప్రభుత్వాలే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రపంచ సంస్థలు, ఆక్స్ఫర్డ్ నివేదికైన బహుళ పేదరిక సూచి కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాల్లో బీమాను ఒకటిగా చూపిస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాలు మానవ సూచిలో ప్రతిసారి మొదటిస్థానం సంపాందించడంలో కీలకపాత్ర బీమారంగమే పోషిస్తున్నది. ఇలాంటి విధానమైన పద్ధతులను, అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం బీమా రంగం అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి రైతు బీమా పథకంతో ఈ రంగంలో అడుగుపెట్టింది. దేశంలో ఇప్పుడున్న కేంద్రప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థయిన ఎల్ఐసీలోని 25 శాతం వాటాను అమ్మకానికి పెట్టడానికి సిద్ధమైన తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్ఐసీకే ధీమా ఇచ్చింది. రైతుబీమా ద్వారా రైతులు చెల్లించే రూ.2700 ప్రీమియంను వారి తరపున ప్రభుత్వమే నేరుగా ఎల్ఐసీ సంస్థకు చెలిస్తున్నది. దీనిద్వారా రైతులకే కాకుండా ఎల్ఐసీకి సైతం భారీగా లాభం చేకూరుతున్నది. ‘గౌడలకు బీమా’, ‘చేనేత బీమా’, ‘దళిత రక్షణ నిధి’ లాంటి విధానాల వల్ల తెలంగాణ ప్రజలు భారీగా బీమా సౌకర్యాన్ని పొందుతున్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 63 లక్షల మంది లబ్ధిదారులు ప్రభుత్వ బీమా పొందుతున్నారు. తద్వారా దేశంలోనే అత్యధిక బీమా పొందుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది.
అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో కీలకం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో ప్రజలను మాయచేయాలని యత్నిస్తున్నది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అందులో ప్రధానాంశం ‘కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా’ అనే పథకం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగమైన యూనివర్సల్ హెల్త్ కేర్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది.
అభివృద్ధి చెందిన దేశంలో వలె ప్రతి వ్యక్తికి బీమా సౌకర్యం కల్పించే లక్ష్యంతో బీఆర్ఎస్ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 93 లక్షల బీపీఎల్ కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించనున్నది. ఇది చాలా గొప్ప నిర్ణయం.
గత పదేండ్లలో అభివృద్ధి సూచిలోని అనేక అంశాలలో తెలంగాణ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. శిశు మరణాల రేటు తగ్గించడం నుంచి తాగునీరు అందించేవరకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నది. దీనిద్వారా ఇటీవల విడుదల చేసిన పేదరిక సూచిలో తెలంగాణలో పేదరికం భారీగా తగ్గినట్టు తేల్చారు. 2015-16లో 13.8 శాతం ఉన్న పేదరికం 2019-21లో 5 శాతానికి తగ్గడం అభినందనీయం.
కేసీఆర్ బీమా పథకం దేశంలోనే భారీ బీమా పథకంగా నిలువనున్నది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అత్యధిక శాతం ప్రజలకు బీమా సౌకర్యం కలుగనున్నది. భారీ ప్రాజెక్టు, మౌలిక సదుపాయాలతో దేశంలోనే రోల్మాడల్గా సాగిన రాష్ట్రం తెలంగాణ. ఇకముందు సమ్మిళిత అభివృద్ధితో, ప్రజా సంక్షేమంతో ‘తెలంగాణ ప్రభుత్వం 3.0’గా అవతరించనున్నది. అందుకే ప్రతి పౌరుడు తమ ఊరిలోని రచ్చబండ వద్ద ఈ పథకం పట్ల సమగ్రంగా చర్చించాలి. పథకం ఆవశ్యకతను తెలుసుకున్నపుడే ప్రభుత్వం విలువ తెలుస్తుంది. ఆ దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.
కన్నోజు శ్రీహర్ష
89851 30032