తెలంగాణకు సొంత రాష్ట్రమా! సొంత పాలనా!అని ఆనాడు నవ్వుకున్నవాళ్లు సైతం తలదించుకునేలా అభివృద్ధిలో దూసుకుపోయింది కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు
తెలంగాణగా మార్చడంలో కేసీఆర్ కృషికి బాసటగా యువనేత కేటీఆర్ చేసిన కృషి కారణంగా రాష్ట్రం అన్నిరంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. రాష్ర్టాభివృద్ధికి వ్యవసాయం, పరిశ్రమలు జోడెడ్లుగా కేసీఆర్
ముందుకు నడిపించారు. బంగారు తెలంగాణకు అత్యంత ముఖ్యమైన ఆర్థిక వనరుల నిర్మాణంలో కేటీఆర్ ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకువెళ్లారు. తెలంగాణకు పెట్టబడులు ఆకర్షించడంలో ఆయన కృషి వెలకట్టలేనిది.
Telangana | తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, పవర్, ప్లాస్టిక్, ఇంజినీరింగ్, ఆగ్రో బేస్డ్, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్ ప్రింటింగ్, టెక్స్టైల్స్, సిమెంట్, ఎయిరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో హైదరాబాద్లోనే కాకుండా, కరీంనగర్, వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరించాయి. ఐటీ రంగంలోనూ తెలంగాణలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. గూగుల్, యాపిల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ కంపెనీలతోపాటు నోవార్టిస్, సేల్స్ఫోర్స్, వెల్స్పన్, పీఎన్జీ సహా అనేక ఇతర సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. రాష్ట్రంలో పెట్టుబడుల వల్ల యువతకు ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. ప్రత్యక్ష ఉద్యోగ కల్పనతోపాటు పరోక్ష ఉపాధి కల్పన కూడా సాధ్యమైంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా స్థూల జాతీయోత్పత్తి కూడా పెరిగింది. ప్రజల జీవనస్థాయిలో అసాధారణ మార్పులు వచ్చాయి. ప్రభుత్వానికి ఆదాయం పెరగటం వల్ల మౌలిక వసతుల కల్పన, ఇతర సామాజిక పథకాల రూపకల్పన సాధ్యమైంది.
ఆకలి కేకల గానం చేసిన తెలంగాణను దేశానికి అన్నం పెట్టే స్థాయిలో నిలబెట్టేందుకు కేసీఆర్ తనదైన మార్కుతో పరిశ్రమించారు. ఫలితంగా స్వరాష్ట్రంలో పారిశ్రామికరంగం కొత్త పుంతలు తొక్కింది. గడిచిన పదేండ్లలో రాష్ర్టానికి లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది కంపెనీల రాక చకచకా జరిగిపోయింది. లక్షలాదిగా ఉద్యోగాల సృష్టి జరిగింది. పారిశ్రామికాభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐ-పాస్ చట్టం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశ, విదేశాలకు చెందిన దిగ్గజ సంస్థలు తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చుకున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే అప్పటి సీఎం కేసీఆర్ రాష్ర్టానికి చెందిన పారిశ్రామికవేత్తలతో సుదీర్ఘ సమావేశం ఏర్పాటుచేసి రాష్ట్రంలో పారిశ్రామికరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమల స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. 2015లో టీఎస్ ఐ-పాస్ పేరుతో ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలుచేస్తూ తెలంగాణకు కొత్తగా 23 వేల పరిశ్రమలను తీసుకువచ్చారు. కేసీఆర్ దార్శనికతకు తోడు కేటీఆర్ ప్రత్యేక చొరవతో అనేక దేశ, విదేశీ కంపెనీలు రాష్ర్టానికి క్యూ కట్టాయి.
విదేశాల్లో ఎక్కడ పారిశ్రామిక సమ్మిట్లు జరిగినా వాటికి ఏటా హాజరై పారిశ్రామికవేత్తలతో సమావేశమైన కేటీఆర్ రాష్ర్టానికి పరిశ్రమలను ఆహ్వానించేవారు. ఈ సందర్భంగా రెండు ప్రపంచ సదస్సుల్లో ప్రసంగించి తెలంగాణ రాష్ట్ర ప్రగతి,ఇక్కడి వ్యాపార అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పారు.
జిల్లాల్లో ఉపాధి అవకాశాలను భారీగా సృష్టించడంతోపాటు రాష్ట్రంలో ఎగుమతులకు యోగ్యమైన, నాణ్యమైన ఉత్పత్తులను తయారుచేయాలని బీఆర్ఎస్ సర్కారు కృత నిశ్చయంతో పనిచేసింది. ఇందుకోసం జిల్లాల్లో కొత్తగా 2023లో 70 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధంచేసింది. భూ సేకరణ కోసం జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపించింది. భూ సేకరణ పూర్తయిన జిల్లాల్లో దశలవారీగా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ర్టాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రభాగాన నిలపాలన్న సంకల్పంతో కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా పారిశ్రామిక అనుకూల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని కారణంగా, 2023, జనవరి-జూన్ మధ్యకాలంలో దేశంలోకి మొత్తం రూ.1,66,294 కోట్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఇందులో జనవరి-మార్చి మధ్యలో రూ.76,361 కోట్లు, ఏప్రిల్-జూన్ మధ్యలో రూ.89,933 కోట్లు వచ్చాయి. ఈ ఆరు నెలల కాలంలో తెలంగాణకు రూ.8,655 కోట్లు రాగా, ఏపీకి కేవలం రూ.744 కోట్లు దక్కినట్లు కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం వెల్లడైంది. తెలంగాణకు ఏపీ కంటే పది రెట్లు ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూల వాతావరణం తెలంగాణలో కల్పించటమే కారణం.
దేశంలో ఎక్కడాలేని విప్లవాత్మక విధానం టీఎస్ ఐపాస్. దీనిద్వారా సింగిల్ విండో పద్ధతిలో సులభతర అనుమతులు, పరిశ్రమల కోసం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 1,43,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 2014-2023 మధ్య పరిశ్రమల కోసం టీఎస్ఐఐసీ ద్వారా 28,500 ఎకరాల కేటాయింపు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో పారిశ్రామికవాడల ఏర్పాటు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విస్తరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చేసిన మొత్తం పారిశ్రామికవాడలు 165. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 40 ఏండ్లలో అభివృద్ధి చేసినవి 109 మాత్రమే..
జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఏదైనా ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే నాలుగు ప్రధాన అంశాలపై అధ్యయనం చేస్తాయి. అవి కనెక్టివిటీ, కాస్ట్, కన్వీనియన్స్, కొలాబరేషన్. వీటినే ‘ఫోర్ సీ’గా పిలుస్తారు. ఈ విధంగా చూస్తే తెలంగాణకు అన్ని రాష్ర్టాలకు మించిన అవకాశాలు దీనిలో ఉన్నాయి. సుస్థిర పాలన, నాయకత్వం, కార్మిక లభ్యత, మేధో సంపత్తి తెలంగాణ రాష్ట్రం సొంతం. తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహానికి కారణం కేసీఆర్ పాలనాతీరు, దూరదృష్టి కాగా, కేటీఆర్ వ్యూహాత్మక ధోరణి సత్ఫలితాలను ఇచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే అధిక పెట్టుబడులు రావటానికి ఇక్కడి గుడ్ గవర్నెన్స్ పట్ల కంపెనీలకు, వ్యవస్థాపకులకు పెరిగిన విశ్వాసం, సానుకూల దృష్టే ముఖ్య కారణం. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అనుమతులు లభించేంతగా ప్రభుత్వం టీఎస్ ఐపాస్ చట్టాన్ని తీసుకువచ్చింది. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ముడిసరుకు లభించేలా కేసీఆర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది. 24 గంటల విద్యుత్తును పరిశ్రమలకు అందజేసింది.
2014కు ముందు తెలంగాణలో 12 వేల పరిశ్రమలు ఉండగా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 23 వేలకు పైగా పరిశ్రమలు కొత్తగా వచ్చాయి. 2014కు ముందు పారిశ్రామిక రంగానికి కేటాయించిన బడ్జెట్ రూ.300 కోట్లు కాగా, 2023-24లో 5 వేల కోట్ల నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ ఏర్పడక ముందు పరిశ్రమలకు రోజుకు సగటున 5 గంటల చొప్పున విద్యుత్తు ఇస్తుండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇచ్చింది. 2014కు ముందు పారిశ్రామికరంగంలో 6,64,000 మందికి ఉపాధి లభించగా, బీఆర్ఎస్ పాలనలో 22.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి.
పదేండ్ల పాటు రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం శ్రమించింది. దీని కారణంగా తెలంగాణ రాష్ర్టానికి రూ.3,30 లక్షల కోట్లు పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నెలకొల్పిన పారిశ్రామిక అనుకూల విధానాలను కొనసాగిస్తుందా? లేదా? అని పారిశ్రామికవేత్తలు, ప్రజలు అనుమానిస్తున్నారు. ఒకవేళ పారిశ్రామిక అనుకూల విధానానికి విఘాతం కలిగిస్తే రాష్ర్టానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయి. అదే జరిగితే రాష్ర్టాభివృద్ధికి అది పెను విఘాతంగా మారే అవకాశం ఉన్నది. నిరుద్యోగం పెరిగిపోయే అవకాశమూ ఉన్నది.
కరణం అంబికా కృష్ణ