ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, రచయిత, కాలమిస్టు అశోకా మోదీ రాసిన ‘ఇండియా ఈజ్ బ్రోకెన్; ఎ పీపుల్ బిట్రేయ్డ్, 1947 టు టుడే’ గ్రంథం 75 ఏండ్ల భారత ప్రస్థానంపై ఒక సాధికారిక వ్యాఖ్యానం. స్వాతంత్య్రానంతరం ఎన్నో ఆశలతో జీవితాలు మెరుగుపడుతాయని ఆశించిన భారతీయులను వరుస ప్రభుత్వాలు ఏ విధంగా నిరాశకు గురి చేశాయో ఈ పుస్తకంలో ఆయన విశదీకరించారు. మరీ ముఖ్యంగా, మోదీ ప్రధాని అయిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా కుప్పకూలిందో, న్యాయ, మీడియా రంగాలు ఎలా అణచివేతకు గురయ్యాయో తెలిపారు. భారతదేశంలో ప్రజాస్వామ్యమే ఉనికిలో లేకుండా పోయిందని, భారత్ ‘ఎలక్టోరల్ ఆటోక్రసీ’ (ఎన్నికలు జరిగే నియంతృత్వ రాజ్యం)గా మారిపోయిందని విశ్లేషించారు. ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు…
ఢిల్లీలో అధికారం చేపట్టిన పార్టీలు అనుసరించిన అపసవ్య విధానాల వల్ల దేశంలో ఆర్థిక అంతరాలు పెరిగిపోయాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ప్రజలు ముఖ్యంగా యువత అసంతృప్తితో రగిలిపోయింది. ఇటువంటి సమయంలో 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ఈ పరిస్థితులకు హిందుత్వను జోడించారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. ఆ ఏడాది మే నెలలో ప్రధానమంత్రి పదవిని మోదీ అధిష్ఠించారు. మరుసటి నెలలోనే మూకదాడులు మొదలయ్యాయి. పుణెలో ఒక ముస్లిం సాఫ్ట్వేర్ నిపుణుడిని.. ఫేస్బుక్లో రెచ్చగొట్టే వీడియో పెట్టాడని ఆరోపిస్తూ ఒక మూక కొట్టి చంపింది. మరోవైపు, హిందుత్వ డిజిటల్ సైనికులు తమ కార్యకలాపాలను ఉధృతం చేశారు. వాజపేయి హయాంలో మంత్రిగా పని చేసి, అనంతర కాలంలో మోదీ, షాల విమర్శకుడిగా మారిన అరుణ్శౌరీనీ వారు వదల్లేదు. దివ్యాంగుడైన ఆయన కుమారుడిపై సోషల్ మీడియాలో తిట్లు కురిపించారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ మేధావి, హిందుత్వ రాజకీయాల విమర్శకుడైన ఎంఎం కల్బుర్గిని ఆగస్టు 2015లో ధార్వాడ్లోని ఆయన ఇంటిలోనే హత్య చేశారు. అక్టోబర్లో ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో ఆవు మాంసం తిన్నాడని ఆరోపిస్తూ ఒక ముస్లింను చంపారు.
దేశ తొలి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ను హిందుత్వ సిద్ధాంతకర్తగా అభివర్ణించే ప్రయత్నం పెద్ద ఎత్తున మొదలైంది. నిజానికి, పటేల్ నికరమైన గాంధేయవాది. జీవితాంతం గాంధేయ విలువలైన అహింస, సహనం పాటించారు. మైనారిటీలైన ముస్లింల పట్ల ఆయన ఏనాడూ వివక్ష చూపలేదు. అటువంటి పటేల్ను హిందుత్వ సానుభూతిపరుడిగా చిత్రీకరించటం అంటే, చరిత్రను పూర్తిగా వక్రీకరించటమే. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెలరోజులకే, ఐక్యతా విగ్రహం పేరుతో ప్రపంచంలోనే అతిపెద్దదైన 182 అడుగుల పటేల్ విగ్రహం ఏర్పాటుకు మోదీ చర్యలు చేపట్టారు. రూ.3,300 కోట్ల వ్యయంతో ఆ విగ్రహం 2018 నాటికి పూర్తయ్యింది. విగ్రహం ప్రారంభోత్సవాన్ని హిందూ సంప్రదాయ పద్ధతిలో మోదీ నిర్వహించారు. విగ్రహ ఏర్పాటు కోసం అక్కడి నుంచి తరలింపునకు గురైన స్థానికులు తమకు పునరావాస పరిహారం తగినంత ఇవ్వలేదని నిరసన తెలుపుతుంటే, వారిని పోలీసులు అడ్డుకున్నారు.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో 2017 మార్చిలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 44 ఏండ్ల వయసున్న యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవిని చేపట్టారు. హిందుత్వ శ్రేణులు ఆయనను ‘హిందూ సింహం’గా అభివర్ణించాయి. నిజంగానే, విద్వేష హిందూ రాజకీయాల్లో ఆయనది అందెవేసిన చేయి. 1998లో ఆదిత్యనాథ్ ‘గో రక్ష మంచ్’ ను ప్రారంభించారు. ఆవుల రక్షణ అనే అంశం మతపరమైన చీలికలు తీసుకురావటానికి పెద్దగా ఉపయోగపడటం లేదని గ్రహించి, 2002లో హిందూ యువవాహినిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఏకైక ఎజెండా, ముస్లింలు హిందువుల శత్రువులని ప్రచారం చేయటం, ముస్లింలపై హిందువుల్లో ద్వేషాన్ని రేకెత్తించ టం. ఈసారి ఆదిత్యనాథ్ తంత్రం ఫలించింది. ఆయన స్వస్థలం, యూపీలోని అనేక వెనుకబడిన పట్టణాల్లో ఒకటైన గోరఖ్పూర్లో మతపరమైన అల్లర్లు, దొమ్మీలు తరచూ చోటుచేసుకోవటం మొదలైంది. ఈ విధంగా రాజకీయాల్లో ఎదిగిన ఆదిత్యనాథ్, యోగిగా పేరొంది, ఆ తర్వాత సీఎం అయ్యారు.
యూపీలో దశాబ్దాలుగా ఉన్న ‘నేరస్థులు-రాజకీయ నేతల కూటమి’ అనే సంప్రదాయాన్ని యోగి కొనసాగించారు. రాష్ర్టాన్ని ఈ సంప్రదాయం భ్రష్టుపట్టించింది. అయినా, యోగి దానిని ముందుకు తీసుకెళ్లారు. ఆయన క్యాబినెట్లో దాదాపు సగం మందిపై తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలున్నాయి. స్వయంగా యోగిపైనే.. హత్యాయత్నం, విధ్వంసం, అల్లర్లు, బెదిరింపులకు పాల్పడటం వంటి కేసులు అప్పటికే నమోదై ఉన్నాయి. దేశవ్యాప్తంగా తన విమర్శకుల నోళ్లను మందబలంతో మూయించటంలో హిందుత్వ విజయం సాధించింది. 2017 జూలైలో బెంగళూరులో ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి గౌరీ లంకేశ్ను ఆమె ఇంటి ముందే ఇద్దరు దుండగులు తుపాకితో కాల్చి చంపారు. ఆమె హత్యను హిందుత్వ శ్రేణులు ట్విట్టర్లో పండుగలా జరుపుకొన్నాయి. ఆ శ్రేణుల్లో నిఖిల్ దడిచ్ ఒకరు. ‘గౌరీలంకేశ్ కుక్క చావు చచ్చింది. ఇతరులకూ అదే గతి పడుతుంది’ అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. ఆయనను ట్విట్టర్లో ఫాలో అయ్యే వాళ్లలో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఒకరు.
హిందుత్వ శక్తులు నూతనోత్సాహంతో చరిత్రకు కొత్త వ్యాఖ్యానాలు చేయటం ప్రారంభించాయి. దీనికి ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. తాను ప్రధాని అయిన ఐదు నెలలకు 2014 అక్టోబర్లో జరిగిన ఓ వైద్యుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రాచీన భారతదేశంలో వైద్యపరంగా అనేక అద్భుతాలు జరిగాయని చెబుతూ, కర్ణుడు తల్లి గర్భం నుంచి జన్మించలేదని, ఇది నాటి జన్యుశాస్త్ర అభివృద్ధికి నిదర్శనమన్నారు. వినాయకుడికి ఏనుగు తొండాన్ని అమర్చటం నాటి ప్లాస్టిక్ సర్జరీకి
ఉదాహరణ అని చెప్పారు.
బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రప్రభుత్వాలు చరిత్ర పుస్తకాల్లోని పాఠ్యాంశాలలో మార్పులు మొదలుపెట్టాయి. మధ్యయుగాల నాటి ముస్లిం పాలకుల తాలూకు అంశాలను తొలగించారు. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో నెహ్రూ పోషించిన పాత్రను మోదీ విమర్శించారు. దీంతో నాడు బీజేపీ పాలనలో ఉన్న రాజస్థాన్లో 8వ తరగతి పుస్తకం నుంచి నెహ్రూకు సంబంధించిన అంశాలన్నింటినీ తొలగించి వేశారు.
2018 జనవరి 1న పశ్చిమ మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామం భీమా కోరేగావ్లో జరుగుతున్న దళితుల విజయోత్సవాలపై హిందుత్వ సంస్థలు దాడి జరిపాయి. 200 ఏండ్ల కిందట అదే రోజున అక్కడ జరిగిన యుద్ధంలో బ్రాహ్మణుడైన పీష్వా మహారాజు సైన్యంపై దళితులతో కూడిన బ్రిటీష్ రెజిమెంట్ విజయం సాధించింది. తరతరాలుగా తమను కులం పేరుతో అణగదొక్కిన వారిపై విజయానికి గుర్తుగా దళిత సంఘాలు అక్కడ విజయోత్సవాలు నిర్వహిస్తుంటాయి. కానీ, మోదీ ప్రధాని అయిన తర్వాత ఇది హిందుత్వ శక్తులకు కంటగింపుగా మారింది. దానిపై దాడి జరిపారు. దళితుల అభ్యున్నతి పట్ల సానుభూతి ఉన్న ఐదుగురిని నక్సలైట్ల పేరుతో పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీని హత్య చేసి, ఆయన ప్రభుత్వాన్ని కూల్చటానికి వారు కుట్ర పన్నారని అభియోగం మోపారు. విచారణ వేగంగా జరుగకుండా, కనీసం బెయిల్ కూడా రాకుండా వారిపై నల్లచట్టం ఉపాను మోపారు. నేటికీ ఈ కేసు వారిపై కొనసాగుతున్నది.
2019 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి నిరాశజనకంగా ఉంది. జీడీపీ వృద్ధి రేటు పడిపోతూనే ఉన్నది. నిరుద్యోగం పెచ్చరిల్లింది. ముఖ్యంగా, ఒక ప్రణాళిక అంటూ లేకుండా తీసుకొచ్చిన నోట్లరద్దు, జీఎస్టీ వల్ల ఉద్యోగాల మీద పెద్ద దెబ్బ పడింది. ఆ ఏడాది మార్చిలో వాషింగ్టన్కు చెందిన ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ భారత్లో జరిపిన సర్వేలో పాల్గొన్న వారిలో 76 శాతం మంది ఉద్యోగావకాశాలు లేకపోవటమే తమ అతి పెద్ద సమస్య అని చెప్పారు. లోక్సభ ఎన్నికలకు మరికొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఐదేండ్ల కాలంలో మోదీ చెప్పుకోదగిన విజయాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఒకటి, స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద మరుగుదొడ్ల నిర్మాణం, రెండు.. పేదలకు సబ్సిడీపై వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీ. దేశవ్యాప్తంగా 10 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని మోదీ చెప్పుకొన్నారు.
వీటివల్ల దేశంలో పారిశుద్ధ్యం మెరుగుపడిన మాట వాస్తవమే. అయితే, స్వతంత్ర అధ్యయనాల వల్ల తెలిసిందేమిటంటే, తొందరగా నిర్మించాలన్న ఆత్రుతతో మరుగుదొడ్లను అడ్డదిడ్డంగా కట్టారు. అనేక చోట్ల నీటి సదుపాయం కల్పించలేదు. కొన్ని కూలిపోయాయి. మరికొన్ని వినియోగించుకోవటానికి వీల్లేకుండా తయారయ్యాయి. చాలాచోట్ల డ్రైనేజీతో కలుపకపోవటం వల్ల, వ్యర్థాలు భూగర్భ జలాల్లో కలిశాయి. బహిరంగ మల విసర్జన నేటికీ పలు రాష్ర్టాల్లో కొనసాగుతున్నది. మరో విషయం ఏమిటంటే, భారతదేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చటంలో, మరుగుదొడ్ల నిర్మాణం అన్నది ఒక అంశమే కానీ, అదే పూర్తి పరిష్కారం కాదు. నదుల్లో కాలుష్యం, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు అలాగే ఉన్నాయి. నమామి గంగే పేరుతో గంగానది ప్రక్షాళన కోసం మోదీ చేపట్టిన ప్రాజెక్టు కూడా ఫలితాలను ఇవ్వలేదు. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాలను మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగంగా మెరుగుపరిచారు. అంతేగాని, ఆ నదిలోకి భారీ ఎత్తున వచ్చి పడుతున్న పారిశ్రామిక, మానవ వ్యర్థాలను అడ్డుకోలేదు.
వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం కింద, సిలిండర్లను, గ్యాస్ స్టవ్ను సబ్సిడీతో మహిళలకు అందించారు. కట్టెల పొయ్యి పొగ నుంచి మహిళలకు విముక్తి కల్పించి వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ పథకాన్ని భారీ ప్రచారంతో ప్రారంభించారు. కానీ, పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరల కారణంగా, కొత్త సిలిండర్ను తీసుకోవటం కోట్లాదిమంది నిరుపేద మహిళలకు భారమయ్యింది. ఖాళీ సిలిండర్ను పక్కన పెట్టారు. కట్టెల పొయ్యే వారికి మళ్లీ దిక్కయ్యింది.
ఈ విధంగా, ఎన్నికల సమయానికి ఈ రెండు పథకాలతో ఇక ఓట్లు రావని అర్థమైంది. దీంతో హిందుత్వతో కూడిన జాతీయవాదం తెరపైకి వచ్చింది. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్లో సైనికుల కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. 40 మంది జవాన్లు మరణించారు. దేశానికి చౌకీదార్ను అని చెప్పుకున్న మోదీ, ఈ దాడికి ప్రతిగా పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి నిర్వహించారు. అయితే, ఆ ప్రాంతాన్ని సందర్శించిన జర్నలిస్టులకు అక్కడ వైమానిక దాడి జరిగిన ఆనవాళ్లేమీ కనిపించలేదు. అయినప్పటికీ, భారతదేశంలో సోషల్మీడియాలో జాతీయవాద ప్రచారం పెద్ద ఎత్తున మొదలైంది. 12 లక్షల మంది బీజేపీ సోషల్ మీడియా వలంటీర్లు ఈ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఓ వీడియోగేమ్ నుంచి తీసుకున్న క్లిప్ను, పాకిస్థాన్ మీద భారత్ జరిపిన వైమానిక దాడిగా సృష్టించారు.
దీనికి తోడుగా అదే నెలలో జరిగిన కుంభమేళాలో యోగి ఆదిత్యనాథ్తో కలిసి మోదీ పాల్గొన్నారు. అండమాన్ జైలులో సావర్కర్ను నిర్బంధించిన గదిని మోదీ సందర్శించారు. అక్కడున్న సావర్కర్ ఫొటో ముందు ధ్యానముద్రలో కూర్చున్నారు. ఆ ఫొటోను మోదీనే స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 2014 ఎన్నికల నాటి ఆర్థికాభివృద్ధి హామీ, గుజరాత్ మాడల్ వంటివన్నీ కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో, పాకిస్థాన్ను ఎదుర్కోగల దీటైన నేత మోదీ అనే ఇమేజీ, హిందుత్వ వచ్చి చేరాయి. బీజేపీ సోషల్ మీడియాలో కీలక బాధ్యతలు నిర్వహించి, ఆ పార్టీపై భ్రమలు తొలగిన తర్వాత బయటకు వచ్చిన ఒక వ్యక్తి.. ‘2014 ఎన్నికలు అభివృద్ధి ఎజెండాగా జరిగితే, 2019 ఎన్నికలు మతవిద్వేషాల ఆధారంగా జరిగాయి’ అని వ్యాఖ్యానించటం పరిస్థితికి అద్దం పట్టింది.
ఎన్నికలు దగ్గర పడిన ఏప్రిల్, మే నెలల నాటికి సోషల్ మీడియాలో విద్వేష ప్రచారం జోరందుకున్నది. వాట్సాప్, ఫేస్బుక్ కొన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ ఆర్ఎస్ఎస్కు, సీనియర్ బీజేపీ నేతలకు మినహాయింపునిచ్చాయి. ముఖ్యంగా, ఫేస్బుక్ ద్వారా పెద్ద ఎత్తున విద్వేష ప్రచారం జరిగిందని ఫేస్బుక్ అంతర్గత నివేదికలే వెల్లడించాయి. ఫ్రాన్స్ హాగెన్ అనే విజిల్ బౌలర్ ఈ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు.
భారతదేశ చరిత్రలో తొలిసారిగా లోక్సభ ఎన్నికల ఖర్చు అమెరికా అధ్యక్ష ఎన్నికలను మించిపోయింది. లోక్సభ ఎంపీల్లో ఎన్నడూ లేని విధంగా 29 శాతం మందిపై హత్య, కిడ్నాప్, డబ్బు వసూళ్లు వంటి సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. అంటే ప్రతి నలుగురిలో ఒకరికన్నా ఎక్కువ మందిపై. బీజేపీలో కూడా ఇదే వరుస. ఆ పార్టీ నుంచి ఎన్నికైన ఎంపీల్లో 29 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 2017లో మోదీ సర్కారు ఎలక్టోరల్ బాండ్లు అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. తమకు ఇష్టం ఉన్న రాజకీయ పార్టీకి వ్యక్తులుగానీ, సంస్థలుగానీ ఎంతైనా నిధులను అందజేసే విధానం ఇది. విరాళాలు ఇచ్చిన వ్యక్తులు తమ వివరాలను బయటపెట్టటం తప్పనిసరేమీ కాదు. ఎన్నికల సంఘమే స్వయంగా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. కానీ, కోర్టు ఏమీ తేల్చలేదు. ఫలితంగా, బీజేపీ లాభపడింది. సదరు బాండ్ల వల్ల వచ్చిన నిధుల్లో 95 శాతం బీజేపీకే వెళ్లాయి. డబ్బుల కోసం మరో మార్గం.. షెల్ కంపెనీలు. ఎక్కడా అడ్రస్ లేని ఈ కంపెనీల ద్వారా రాజకీయ పార్టీలకు, నేతలకు డబ్బు ప్రవహించింది.
ఈ విధంగా 2019 ఎన్నికలు ధనబలం, కండబలం, హిందుత్వ కలబోతగా జరిగాయి. మోదీ మళ్లీ విజయం సాధించారు. బీజేపీకి సీట్లు, ఓట్లు గతంలోకన్నా పెరిగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంలో పాలకుడికి, పాలితులకు మధ్య ఆర్థిక సంక్షేమ బంధం అనేది మొట్టమొదటిసారిగా, ఈ రకంగా తెగిపోయింది. ప్రజాసంక్షేమానికి సంబంధించి ఎటువంటి ఎజెండా అనేదే లేకుండాఎన్నికలు పూర్తయ్యాయి.
-అనువాదం: కె.వి.రవికుమార్
(మిగతా రేపు)