మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయ్యాయి. సాంకేతికంగా ఎంతో ఎదిగిన భారత్ సామాజికంగా ఇంకా స్వాతంత్య్రానికి పూర్వమున్న మనస్తత్వంతోనే ఉండటం విచారకరం. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల నాడిని పట్టుకున్న ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదంతో 17 ఏండ్లు ఈ దేశాన్ని పాలించారు. జనాకర్షక పథకాలను ప్రకటించి సులభంగా గద్దెనెక్కవచ్చనే విషయాన్ని ఆమె నిరూపించారు. ఆమె బాటలోనే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడుతూ ఉచితాలను ప్రకటిసూటిస్తున్నాయి. అధికారాన్ని చేపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి పార్టీ సబ్సీడీలతో పాటు ఉచితాలను ప్రకటిస్తూ ప్రజలను వెర్రివాళ్లను చేసి ఉచితాల నాదస్వరం ఊదుతూనే ఉన్నాయి. ఎందుకంటే, నాదస్వరం ఆపిన క్షణాన బలైపోతామని వాటికి తెలుసు.
అసలు ఉచితాలెందుకు? ఉచితాల వల్ల పేదల ఆర్థిక స్థితిగతులు మెరుగై, కొన్నాళ్లకు దేశంలో పేదరికమనేదే ఉండదని రాజకీయ పార్టీలు, నేతల వాదన. కానీ, వాస్తవం వేరు. ఉచితాల వల్ల లబ్ధి పొందేది రాజకీయ పార్టీలే. ఉచితాలను ప్రకటించి అధికారం చేజిక్కించుకొని, ఏదో మొక్కుబడిగా కొన్ని తాయిలాలను ఆశ్రితులకు ఇచ్చి, చేతులెత్తేయటం పాలకులకు పరిపాటిగా మారిపోయింది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఐదేండ్లలో అన్ని హామీలు అమలుచేస్తామని చెప్పి తప్పించుకుంటారు. అసలు ఉచితాలకు నిధులెలా సమకూరుస్తారనే విషయాన్ని ఎక్కడా, ఎవరూ వెల్లడించరు. ఉచితాలకు ఇచ్చేందుకు వినియోగించే ప్రతి రూపాయి మనం చెల్లించే పన్నులేననేది అందరికీ విదితమే. అయినప్పటికీ వాటి కోసమే ప్రజలు వెంపర్లాడుతుండటం బాధాకరం.
పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా ఇలాంటి నష్టపూరిత ఉచిత పథకాలు లేవు. కొవిడ్ మహమ్మారి సమయంలో ఉచితంగా రేషన్ ఇచ్చేందుకు బీజేపీ సర్కార్ పెట్రోల్ ధరలను అమాంతం పెంచేసింది. కర్ణాటకలో కరెంటు చార్జీలు, పెట్రోల్ ధరలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది ఉచితాల కోసమే. తమిళనాడు ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడానికి అదే కారణం. అయితే కొన్ని ఉచితాలు అవసరమే. ముఖ్యంగా విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం ఇచ్చే ఉచితాలు దీర్ఘకాలంలో సమాజానికి ప్రయోజనం చేకూరుస్తాయి. అయితే కొన్ని ఉచితాలు మాత్రం ప్రజలను సోమరులను చేస్తాయి. 1955లో తమిళనాడు ప్రభుత్వం తొలిసారిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అది మంచి పథకమే. కానీ, ఉచిత చీరలు, కుక్కర్లు, వాషింగ్ మెషిన్లు, టెలివిజన్ సెట్లు మొదలైన వాగ్దానాలతో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన ఉచితాల సంస్కృతితో ఎటువంటి ప్రయోజనం ఉండదు.
ఉచితాలను కొనసాగించాలంటే రాష్ట్ర సంపదను సృష్టించాలి. లేదంటే అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులు ఉచితాలకు మళ్లిపోతాయి. తద్వారా అభివృద్ధి ఆగిపోయి, రాష్ర్టాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. 1960ల్లో అన్నపూర్ణగా ప్రశంసలందుకున్న పంజాబ్ ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నది. అందుకు ప్రధాన కారణం ఉచితాలే. ప్రస్తుతం ఆ రాష్ర్టానికి రూ.2.82 లక్షల కోట్ల అప్పు ఉన్నది. అందుకే అక్కడి ఆప్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసింది.
ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి, 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీలను అమలు చేయడానికి ఆప్ సర్కార్ ఆపసోపాలు పడుతున్నది. ఉచితాలపై హిందూ సేన ఉపాధ్యక్షుడు సూర్జిత్ సింగ్ యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తత్ఫలితంగా భారత ఎన్నికల కమిషన్కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసింది.
ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే ఆరు గ్యారెంటీలంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే కానీ, ఉచిత విద్యుత్తు వల్ల రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుందో ఒకసారి ఆలోచించాలి. మనకు విద్యుత్తు ఉచితంగా లభించడం లేదు. పైగా డిమాండ్ను బట్టి పొరుగు రాష్ర్టాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 అందించడమంటే మాటలు కాదు. సీలింగ్ లేకపోవడం వల్ల రైతుబంధు ద్వారా సంపన్నులు ఎక్కువగా లబ్ధి పొందారనే విమర్శ ఉన్నది. మరి రూ.2,500 ఎవరెవరికి ఇస్తారో చూడాలి.
పేదలను ఎలా ఆకర్షించాలో రాజకీయ పార్టీలకు బాగా తెలుసు. పేదరికం లేకుండా చేయడానికే ఉచితాలు ఇస్తున్నామని పాలకులు చెప్తున్నప్పటికీ.. పేదరికం పూర్తిగా తుడిచిపెట్టుకుపోకూడదనే పార్టీలు కోరుకుంటాయేమో! ఎందుకంటే, పేదరికమే లేకుంటే ఉచితాలు ఉండవు కదా, ఉచితాలే లేకపోతే పార్టీలకు ఓట్లు పడవు కదా. భారతీయులకున్న సమస్య ఏమిటంటే ప్రాథమిక ఆర్థిక పరిజ్ఞానం లేకపోవడం. ఉచితాలు దీర్ఘకాలంలో ప్రమాదకారిగా మారి, మన కొంపలనే ముంచుతాయని అర్థం చేసుకోలేకపోవడం. మన దేశ బడ్జెట్లో 24 శాతం వడ్డీలకు, 12 శాతం సబ్సిడీలకు, 12 శాతం రక్షణకు, 9 శాతం జీతభత్యాలకు, 7 శాతం పింఛన్లకు పోతున్నది. మిగతా ఖర్చులు ఉండనే ఉన్నాయి. అంతటితో ఖజానా ఖాళీ అయిపోతుంది. మరి ఉచితాలకు? అందుకే, తమను అధికార పీఠంపైకి ఎక్కించిన ఉచితాల కోసమే ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. ఆ భారాన్ని మనపై మోపుతున్నాయి.
ఉచితాలు ఎంతో ప్రమాదకరం. ప్రతిదానికి ప్రభుత్వం మీదే ఆధారపడే పరిస్థితికి ఉచితాలు మనల్ని దిగజారుస్తాయి. ఉచితాలకు అలవాటు పడ్డవారు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడరు. దీనివల్ల ఉత్పాదకత తగ్గిపోయి, సామాజిక సమస్యలు పెరుగుతాయి. అదే సమయంలో ఉచితాల కారణంగా ఎన్నికల ప్రక్రియ దెబ్బతింటున్నది. తాయిలాలు ప్రకటించి రాజకీయ పార్టీలు ఓట్లను కొనుగోలు చేస్తుండటంతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నది.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇస్తున్న హామీలను చూస్తుంటే కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. ప్రతి పేద ఇంటికి రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం వాటిలో ఒకటి. దేశంలోని 140 కోట్ల జనాభాలో 27 శాతానికి పైగా పేదలున్నారు. ఈ లెక్కన 37.8 కోట్ల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తున్నది. ఈ మొత్తం ఎంత ఉంటుందో ఊహించుకోండి. ఇలా ఏటా ఇంటికో రూ.లక్ష ఇస్తే.. పేదరికం పోదు సరికదా, మన దేశమే అత్యంత బీద దేశాల్లో ఒకటిగా మారిపోతుంది. సాయమనేది ఉత్పాదకత పెంచేలా ఉండాలి. వివిధ వృత్తులు చేసే కార్మికులకు వారికి అవసరమైన వస్తువులు ఇస్తే వారి జీవితాలు మెరుగుపడతాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గతంలోనే చెప్పారు.
సంపన్న దేశాల్లో మన దేశంలో ఉన్నట్టుగా ఉచితాలు లేవు. ఆయా దేశాలు విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమానికే ప్రాధాన్యమిస్తాయి. కానీ, మన దేశంలో మాత్రం అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఉచితాలను ప్రకటించడం శోచనీయం. వీటి కోసం ఉపయోగించే నిధులను ఉపాధి కల్పనకు, ప్రాజెక్టుల నిర్మాణానికి, మెరుగైన సౌకర్యాల కల్పనకు, రైతులకు ప్రోత్సాహకాలు అందించడానికి వినియోగిస్తే నిస్సందేహంగా సామాజిక అభ్యున్నతి, ఆర్థిక పురోగతి సాధ్యపడుతుంది.
(రచయిత: రాజకీయ, సామాజిక విశ్లేషకుడు)
డాక్టర్ వీవీ రామారావు
98492 37663