ఖమ్మం సిటీ, జూన్ 5 : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సేవలు జనానికి మరింత అందుబాటులో ఉండేలా విస్తృతపర్చాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఎస్ఎన్ఎల్ నల్లగొండ బిజినెస్ ఏరియా సలహా సంఘం శుక్రవారం ఖమ్మంలో సమావేశమైంది. దీనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో రోజురోజుకు చోటుచేసుకుంటున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్థ అందిపుచ్చుకుంటూ ప్రైవేట్ టెలికం కంపెనీలకు దీటుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఏజెన్సీ, మారుమూల ప్రాంతాలు, తండాలు, గూడేలకు బీఎస్ఎన్ఎల్ సేవలు విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీపడకుండా వినియోగదారులందరికీ 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మరిన్ని టవర్స్ ఏర్పాటుకు అన్నిరకాల అనుమతులు మంజూరు చేయాలని పార్లమెంట్లో ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని ఎంపీ రవిచంద్ర హామీ ఇచ్చారు. తొలుత సమావేశానికి విచ్చేసిన ఆయనకు నల్లగొండ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పీ వెంకటేశం పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి జ్ఞాపికను ప్రదానం చేశారు.