తెలంగాణలో 2018 ఎన్నికల్లో 73 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటే 2023 ఎన్నికల్లో 71 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అంటే గత ఎన్నికల కంటే ఈసారి రెండు శాతం తక్కువ ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒకే దేశంలో అనేక దేశాలు అన్నట్టు ఒకవైపు గ్రామీణ ఓటర్లు ఓటు వేయడాన్ని ఒక పండుగగా భావించి ఓటు వేసే, అదే సమయంలో మహానగరాల్లో ఉండే సంపన్నులు, విద్యావంతులు, ఉద్యోగులు ఓటింగ్కు దూరంగా ఉండి పోలింగ్ పండుగను ఒక సెలవు దినంగా గడుపుతున్నారు.
గ్రామీణ ఓటర్లు బస్సుల్లో, రైళ్లల్లో వెళ్లి ఓటు వేసి వస్తుం టే, నగర ఓటరు కాలు కదపకుండా ఇంటికే పరిమితమవుతున్నాడు. గ్రామీణ ఓటర్లు ఉండే దుబ్బాకలో 84 శాతం పోలింగ్ జరిగితే నగరం నడిబొడ్డున ఉన్న యాకుత్పురాలో 39 శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారు. దుబ్బాకతో పోలిస్తే సగం మంది కూడా యాకుత్పురాలో ఓటు వేయలేదు. ఒక్క యాకుత్పురా అని కాదు హైదరాబాద్ నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి.
రాజుగారి ఇంట్లో పెళ్లికి ప్రతి ఒక్కరు బిందెడు పాలు తెచ్చి పోయాలంటే నేనొక్కడినే పాలకు బదులు నీళ్లు పోస్తే ఏం తెలుస్తుందిలే అని అందరికి అందరూ నీళ్లే తెచ్చి పోశారట. చిన్నప్పు డు చదివిన కథలానే నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుం ది అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం మీద గౌరవం పోయిం దా? ఎవరికోసమో మనం క్యూలో నిలబడి ఓటెందుకు వేయాలి అనుకుంటున్నారా? ప్రధానంగా మహానగరాల్లో పోలింగ్ శాతం ఎందుకు తగ్గుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగితే అత్యల్పంగా దాదాపు 26 శాతం ఓటింగ్ జరిగింది. ఆ రోజు క్రికెట్ ఉండడం వల్ల అలా జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతిసారి ఇలా ఏవో కుంటిసాకులతో సర్దుకు పోతున్నారు కానీ సమస్యకు కారణం ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటనే దిశగా ఆలోచన సాగడం లేదు.
ప్రతిసారి ఎన్నికల కమిషన్ ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడుతుంది. ఓటు వేయాలని సినీనటులు, క్రీడాకారులతో చెప్పిస్తున్నారు. నిజానికి గ్రామీణ ఓటరును చైతన్య పరచాల్సిన అవసరం లేదు. తమ బాధ్యతగా భావించి ఓటు వేస్తారు. మహానగరాల్లోని ఓటర్లను చైతన్య పరచాల్సిన అవసరం లేదు. చాలా చైతన్యవంతులు కానీ ఓటు వేయరు. అది ఓటరు తప్పా? లేక ఎలక్షన్ కమిషన్ తప్పా? అంటే ఎవరిదీ తప్పు కాదు మన ఎన్నికల విధానం, ఓటింగ్ తీరు మారాలి.
కొన్ని దేశాల్లో నిర్బంధ ఓటింగ్ విధానం అమలు చేస్తున్నా రు. మన దేశ పరిస్థితులు వేరు. ఇక్కడ నిర్బంధ ఓటింగ్ సాధ్యం కాదు. ఐతే ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఓటు వేయడానికి లింక్ కలిపితే కొంత ప్రయోజనం ఉండవచ్చు.గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఓటు వేయడాన్ని పండుగ జరుపుకున్నట్టు సంతోషంగా ఓటు వేస్తారు. జాబితాలో తమ ఓటు లేకపోతే తీవ్ర అవమానంగా భావిస్తారు. 1994 ప్రాంతంలో వరంగల్ జిల్లాలో నక్సలైట్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ఎన్నికల సమయంలో నక్సలైట్లు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చేవారు. గ్రామీణులకు ఆ కాలంలో నక్సలైట్ల మాట అంటే చాలా గురి. భయంతో పాటు వారంటే అభిమానం కనిపించేది. ఆ సమయంలో మీడియా బృందం మారుమూల గ్రామాల్లో పర్యటించి ఎన్నికల బహిష్కరణ గురించి ఏమనుకుంటున్నా రు? అని ఆరా తీస్తూ ‘నక్సలైట్లు ఓటింగ్లో పాల్గొనవద్దు, ఎన్నికలను బహిష్కరించమని చెబుతున్నారు కదా? మరి మీరు ఓటు వేస్తారా?’ అని అడిగినప్పుడు పల్లె జనం ‘ఓటు వేయకుండా ఉండేందుకు మేమేమన్న చచ్చిపోయామా? ఓటు వేసి తీరుతాం, వేయవద్దు అని చెప్పడానికి వాళ్లెవరు’ అని ధైర్యంగా బదులిచ్చారు. ఓటు వేయక పోవడం అనేది గ్రామీణుల దృష్టి లో చనిపోవడం లాంటిది. అదే మహానగరాల్లో పెద్ద వారికి ఓటు వేయడం అంటే నామోషీ. అందరితో సమానంగా ఓటు వేయడం ఏమిటీ అనుకుంటారు. కొంతమంది నటులు బాధ్యతగా ఓటు వేసినా చాలామంది నటులు పోలింగ్కు దూరంగానే ఉన్నారు.
మనది నిర్బంధ ఓటింగ్ విధానం కాదు. నిర్బంధ ఓటింగ్ విధానం అమలు కూడా మనదేశంలో సాధ్యం కాదు. దానికి బదులు కొన్ని సంస్కరణలు తీసుకురావడం ద్వారా ప్రతి ఒక్కరు ఓటు వేసే విధంగా చూడవచ్చు. టెక్నాలజీ ఎంతో పెరిగింది. ఓట్ల పండుగకు దీనిని ఉపయోగించుకోలేరా?
మహానగరాల్లో ఓటర్లు ఇంట్లో ఉండి పోవడం వల్లనే ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది అనే వాదన నిజంకాదు. పల్లెల్లో పరిస్థితి వేరు. నగరాల్లో అద్దె ఇండ్లల్లో నివసిస్తారు. తరుచుగా ఇల్లు మారుతుంటారు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ అడ్రస్తో ఓటు ఉంటుంది. మరో ఇంటికి వెళ్లినప్పుడు ఓటు గురించి పట్టించుకోరు. ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి వాటిని అన్నింటికీ ఉపయోగిస్తారు కాబట్టి అడ్రస్ మారగానే రేషన్కార్డు, పాన్కార్డు, ఆధార్కార్డు మార్పించుకుంటున్నారు కానీ ఓటరుకార్డు గురించి పెద్దగా పట్టించుకోరు. ఓటరుకార్డు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఓటు వేసినా, వేయకపోయినా ఒకటే అని పట్టించుకోరు. ఆధార్, పాన్కార్డు ఒకసారి తీసుకుంటే అడ్రస్ మారుతుంది తప్ప ఆ కార్డు శాశ్వతం. అదే విధంగా ఓటరు కార్డును శాశ్వతంగా ఉండేట్టు చేయాలి. దేశంలో ఉన్న 140 కోట్ల మందికి ఆధార్ కార్డు ఇవ్వగలిగినప్పుడు వారికి శాశ్వతమైన ఓటరు కార్డు ఇవ్వలేరా ? అడ్రస్ మారినప్పుడల్లా అడ్రస్ మార్చుకోవచ్చు కానీ కార్డు ఒకటే ఉండాలి. అదే విధంగా ఆధా ర్, పాన్, ఓటర్ కార్డు లింక్ చేయడంతో పాటు తప్పనిసరి చేయాలి. సంక్షేమ పథకాలతో పాటు రేషన్ కార్డుకు ఓటరు కార్డు తప్పనిసరి చేయాలి .
విదేశాల్లో ఉన్న భారతీయులకు మన దేశ పౌరసత్వంతో పాటు ఓటు హక్కు కూడా ఉండాలి అనే చర్చ చాలా కాలం నుంచి సాగుతోంది. విదేశాల్లో ఉన్నవారికి ఆన్లైన్ లో ఓటువేసే సౌకర్యం కల్పించే విషయం ఎలా ఉన్నా ఒకే నగరంలో ఇల్లు ఖాళీ చేసి మరో ఇంటికి వెళ్లిన వారు తక్షణం ఓటరు కార్డులో అడ్రస్ మార్చుకొనే సౌకర్యం ఉండాలి.
ఇతర రాష్ర్టాల్లో , ఇతర దేశాల్లో ఉద్యోగం చేసేవారు, చదువుకోవడానికి వెళ్లిన వారి పేర్లు నగరానికి చెందిన ఓటర్ల జాబితాలో ఉంటాయి కానీ వారు ఇక్కడ ఉండరు. దీనివల్ల ఓటింగ్ శాతం తక్కువ కనిపిస్తుంది. ఇతర రాష్ర్టాల్లో , దేశాల్లో తాత్కాలికంగా ఉన్నవాళ్లు ఓటు కోసం రాలేక పోవచ్చు. కనీసం అలాంటివారికైనా ఆన్లైన్లో ఓటు వేసే అవకాశాలను పరిశీలించాలి. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో దీన్ని అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్నా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో ఓటు వేసిన వారు ఆంధ్రలోనూ ఓటు వేయడానికి సిద్ధం అవుతున్నారు. రెండు రాష్ర్టాల్లోనే కాదు ఒకే నగరంలో ఒకటికన్నా ఎక్కువ చోట్ల ఓటు ఉన్నవారు కూడా ఉన్నారు. ఆధార్ను తప్పనిసరి అనుసంధానం చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఒకే ఆధార్ కార్డు ఉన్నట్టే ఒకటే ఓటర్ కార్డు ఉండేటట్ట్టు చేయాలి.
ప్రతి ఎన్నికల్లో సినిమా వారి చేత మీ ఓటు విలువైనది ఓటు వేయండి అని చెప్పి చేతులు దులుపుకొంటే ఆ ప్రచారం ఒక తంతుగానే నిలుస్తుంది కానీ ప్రయోజనం ఉండదు. నిజానికి అలా ప్రచారం చేసే నటులు ఓటు వేస్తారా? అని అనుమానం. హైదరాబాద్ ఓటర్లు పోలింగ్ రోజు ఇంటికే పరిమితమవుతున్నారు అనే విమర్శకన్నా.. ఎలక్షన్ కమిషన్ నగరంలో ఓ నాలుగైదు అపార్ట్మెంట్లను ఎంపిక చేసుకొని… ఆ అపార్ట్మెంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ? ఎన్ని పోలయ్యాయి. సగం మంది ఓటు వేయక పోవడానికి కారణం ఏమిటి అని ఓ సర్వే చేస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఇంట్లో ఉండి ఓటింగ్కు దూరంగా ఉండేవాళ్ళు ఎవరూ ఉండరు. మరి పోలింగ్ ఎందుకు తక్కువవుతున్నదంటే ఈ చిన్న సర్వేతో అసలు విషయం తెలుస్తుంది. ఐదారు అపార్ట్మెంట్స్ నుంచి సమాచారం సేకరించడం పెద్ద కష్టమేమీ కాదు. కారణాలు తెలిసినప్పుడు వాటికి పరిష్కారం ఆలోచించవచ్చు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఓటింగ్ శాతాన్ని పెంచుకోవచ్చు.
బుద్దా మురళి