2019లో భారత పౌరసత్వ చట్టానికి పార్లమెంటు ఒక వివాదాస్పదమైన సవరణ చేసిన విషయం అందరికీ తెలిసిందే అయినా ఆ విషయం కాలక్రమంలో మరుగునపడిపోయింది. అయితే, ఆ చట్టాన్ని అమలు చెయ్యటానికి సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మొన్న 11వ తేదీన రాజపత్రంలో ప్రచురించిన నేపథ్యంలో ఈ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సవరణ చట్టంలో ఉన్న వివాదాస్పద విషయం ఏమంటే భారత పౌరసత్వాన్ని పొందటానికి మొట్టమొదటిసారిగా మతం ఒక ప్రాతిపదిక కావడం!
సవరించిన చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మత ప్రాతిపదికన వివక్షకు, వేధింపులకు గురై మన దేశానికి శరణు వచ్చిన హిందు, క్రిస్టియన్, బౌద్ధ, పార్శీ, సిక్కు, జైన మతాలకు చెందినవారు భారత పౌరసత్వం త్వరితగతిన పొందటానికి వీలు కలుగుతుంది. ఈ ఆరు మతాలకు చెందినవారు భారత్లోకి చట్టబద్ధంగా ప్రవేశించారా లేక అక్రమంగా ప్రవేశించారా అని విచారించరు. పైగా పాత చట్టం ప్రకారం విదేశీయులు నేచురలైజేషన్ ప్రక్రియ ద్వారా పౌరసత్వం పొందటానికి భారత్లో 11 ఏండ్లు నివాసం ఉండాలని ఉంది.
సవరించిన చట్టం ప్రకారం ఆ కాల పరిమితిని ఐదేండ్లకు కుదించారు. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అయితే ఈ మూడు దేశాల్లో మత ప్రాతిపదికన వేధింపులకు గురై దేశం వదిలిన ముస్లింలకు మాత్రం సవరణ చట్టం కల్పించే వెసులుబాటు వర్తించదు. ప్రభుత్వ వాదన ఏమంటే ఈ మూడు దేశాల్లో ఇస్లాం అధికారిక మతం అయినందున ఆ దేశాల్లో ముస్లింలు మత ప్రాతిపదికన ఏ విధంగానూ వేధింపులకు గురికారు. అలాగే బంగ్లాదేశ్లో రోహింగ్యా తెగవారు కూడా. మరి వారికి ఎందుకు సవరణ చట్టం వెసులుబాటును వర్తింపచెయ్యటం లేదని అడుగుతున్నారు మేధావులు.
ప్రభుత్వం దృష్టిలో ఇవన్నీ అర్థరహిత వాదనలు. ఎందుకంటే ఎక్కడో వివక్షకు గురైన పార్శీలకు పునరావాసం కలిపించే వంకతో ఇక్కడ ముస్లింలను వివక్షకు, అభద్రతకు గురిచెయ్యటమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తున్నది పరిశీలకులకు. ఈ చట్టం భారతీయ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదనటంలో ఎటువంటి అనుమానం లేదు. ఎవరినైనా ఈ గడ్డ మీదకు ఆహ్వానించటం, ఆదరించటం భారతీయుల నైజం. బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో వేలకొలది ఆ దేశం నుంచి మన దేశంలోకి శరణార్థులుగా వచ్చారు. ఏ మతం అనేది చూడకుండా అందరినీ అక్కున చేర్చుకున్నాం, ఆదరించాం. అట్లా వచ్చినవారు తెలంగాణలో కూడా స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు.
లౌకికవాదం రాజ్య విధానమని మన రాజ్యాంగం స్పష్టంగా విశదీకరిస్తున్న నేపథ్యంలో పౌరసత్వం పొందటానికి మతాన్ని ఒక ప్రాతిపదిక చెయ్యటం, ఒక మతం వారికి సవరించిన చట్టం వర్తించదని చెప్పటం రాజ్యాంగ ఉల్లంఘనే అని మేధావులు, న్యాయకోవిదులు వాదిస్తున్నారు. రాజ్యాంగంలోని 14వ అధికరణం ఏమి చెప్తుందో చూద్దాం. భారత భూభాగంలో ఉన్న ఏ వ్యక్తికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం కల్పించే భద్రతను రాజ్యం నిరాకరించదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే వ్యక్తి అనే మాట. ప్రాథమిక హక్కులలోని 14వ అధికరణంలో మాత్రమే వ్యక్తి అనే మాట ఉంటుంది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన మిగతా అధికరణాలలో పౌరుడు అనే మాట ఉంటుంది గానీ వ్యక్తి అని ఉండదు. అంటే చట్టం ముందు ఏ వ్యక్తి అయినా, అతడు పౌరుడైనా, పరదేశీ అయినా, సమానమే అని రాజ్యాంగం చెప్తున్నది. చట్టం కల్పించే భద్రత ఈ భూభాగంలో ప్రతి వ్యక్తికీ వర్తిస్తుందని ఈ అధికరణం స్పష్టంగా చెప్తున్నది. మరి పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వర్తించదనే వాదన రాజ్యాంగ విరుద్ధమే కదా!
పార్లమెంటు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదించిన అనంతరం చట్టం అవుతుంది. అయితే చట్టాన్ని రాజపత్రంలో ప్రచురించిన తర్వాత చట్టం అమల్లోకి వస్తుంది. అలా ప్రచురించనంతవరకు చట్టం అమలుకు నోచుకోదు. అయితే ఇది రాజ్యాంగ సవరణకు వర్తించదు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చెయ్యటానికి సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావటానికి కేవలం వారం రోజుల ముందు రాజపత్రంలో ప్రచురించటం ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందటానికే అని చాలామంది భావిస్తున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం తప్పుకాదు. కానీ, రాజకీయ ప్రయోజనం కోసం రాజ్యాంగ మౌలిక స్వరూపంతో ఆటలాడుకోవటం విచారకరం.
ఎన్నికలు ఐదేండ్లకోసారి వస్తూనే ఉంటాయి. ఒక్కో ఎన్నికలో ఒక్కో విషయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. అది ఆ ఎన్నిక వరకే పరిమితమవుతుంది. కానీ, రాజ్యాంగానికి ఒక ప్రవిత్రత, ప్రతిష్ట ఉంది. అది ప్రాథమిక శాసనం; శాశ్వత శాసనం. పార్లమెంటు చేసే ఏ శాసనమైనా ప్రాథమిక శాసనానికి లోబడి ఉండాలి గానీ దాన్ని అధిగమించేదిగా ఉండరాదు. ఇది కూడా రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్న విషయమే. ఎన్నికల షెడ్యూలు ప్రకటించటానికి కేవలం వారం రోజుల ముందే ఈ వివాదాస్పద అంశానికి మరో తెరలేపటంలో ఉద్దేశం రాబోయే ఎన్నికల్లో హిందూ ఓటును స్థిరీకరించుకోవాలనుకోవటమే అని చాలామంది భావిస్తున్నారు.
ఇప్పటివరకు హిందువులు మత ప్రాతిపదికన ఓటు బ్యాంకు అవ్వలేదు. కానీ, హిందువులను ఒక ఓటు బ్యాంకుగా మార్చాలని సంఘ పరివార్ గట్టి ప్రయత్నమే చేస్తున్నది. హిందువులు మతం ప్రాతిపదికగా ఒక వర్గం అనుకోరు. హిందు అనేది మతం అనే దానికన్నా ఒక జీవన విధానం అనే సిద్ధాంతం బాగా ప్రాచుర్యం పొందింది. దీనికి కారణం లేకపోలేదు. హిందువులకు ఒక మత గ్రంథం, ఒక మత గురువు, ఒక పవిత్ర స్థలం అనేవి లేవు.
అందరూ గంపగుత్తగా గుడికి వెళ్లరు. ఎవరికి వీలైనప్పుడు వారు వెళ్తారు. హిందూ జీవన విధానంలో మతం మనిషి దైనందిన జీవితాన్ని కట్టడి చెయ్యదు. హిందువులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ఉండవచ్చు. ఒక నిర్దిష్టమైన విధానాన్ని పాటించాలని లేదు. నువ్వు హిందువు కాబట్టి ఇలా ఉండాలని శాసించే మత గురువులు, గ్రంథాలు లేవు. వైవిధ్యభరితమైన జీవన విధానం హిందువులకు ఊపిరిలాంటిది. వ్యక్తి ప్రధానమైన జీవనవిధానం హిందువు అంటే ఇక్కడ మందికన్నా మనిషి ముఖ్యం. హిందువులందరి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. కానీ, హిందూత్వ వాదులు ఈ వైవిధ్య స్ఫూర్తిని ఛిద్రం చేయాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం దేశంలో హిందువులకు, హిందుత్వానికి మధ్య ఒక సంఘర్షణ నడుస్తుంది. వైవిధ్యం హిందువుల లక్షణం. వైష్ణవులు, శైవులు, ఉత్తరాది, దక్షిణాది సంప్రదాయాలు వైవిధ్యభరితంగా ఉంటాయి. పైగా విశ్వాసం అనేది వ్యక్తిగతం అని రాజ్యాంగంలో లిఖించుకున్నాం. విశ్వాసం అనేది పరిపాలనకు, రాజ్యవ్యవస్థకు ప్రాతిపదిక కారాదనేది సగటు హిందువు అభిప్రాయం. ఈ అభిప్రాయం నేడు అపాయంలో పడింది.
భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతం ఆధారంగా మన జాతి నిర్మాణం జరగాలని స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ సృష్టికర్తలు కోరుకున్నది నేడు ప్రశ్నార్థకమైంది. భిన్నత్వ స్ఫూర్తికి భిన్నంగా నేడు రాజ్య విధానం సాగుతుంది. హిందుత్వ వాదులకు భిన్నత్వం గిట్టదు. ఐక్యం కన్నా ఏకీకరణ ముద్దు. వారికి యూనిటీ కన్నా యూనిఫార్మిటీ ముఖ్యం. అందరూ ఒకే భాష మాట్లాడాలి. ఒక సంస్కృతిని పాటించాలి.
జాతి బలపడటానికి ఏకీకరణే ప్రాతిపదిక కావాలనేది హిందూత్వ వాదుల లక్ష్యం హిందీ భాష, ఉమ్మడి పౌర స్మృతి, ఒక దేశం ఒక ఎన్నిక వంటి అంశాలు ఏకీకరణ ఉన్మాదంలో ముఖ్యమైన దశలు. అయితే, హిందుత్వ వాదుల లక్ష్యం నెరవేరేది కాదు. సముద్రంలో నీళ్లు తోడిపొయ్యాలనుకోవటం లాంటిదే వారి ప్రయత్నం. కానీ, వారు చేసే ప్రయత్నం వల్ల కలిగే గాయం త్వరగా మానేది కాదు. ఈ విషపూరిత, విధ్వంసక ధోరణిని విశాల దృక్పథం గల ప్రతి హిందువు గమనించాలి.
పరిపాలనకు ప్రాతిపదిక మత మౌఢ్యమా, ఆధునిక దృక్పథమా? అన్న సంఘర్షణను దేశం ఎదుర్కొంటుంది నేడు. విశ్వాసానికి రాజ్య విధానానికి మధ్య ఉండవలసిన స్పేస్ క్రమే ణా కుంచించుకుపోతుంది. గత దశాబ్దకాలంలో. రాజ్యాంగ వ్యవస్థలు కూడా బలవుతున్నాయి. దేవాలయాలు కట్టడం, వాటిని ప్రారంభించటం వంటి విషయాల్లో రాజ్యానికి పెద్దగా ప్రమేయం ఉండేది కాదు గతంలో. నియంత్రణ వరకే రాజ్యం పరిధి ఉండేది. నేడు, నియంత్రణ కన్నా దేవాలయాల నిర్మా ణం, నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది రాజ్యం. తద్వారా హిందువులను ప్రసన్నం చేసుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. హిందువులు ఒక ఓటు బ్యాంకుగా ఏర్పడితే ఎన్నేండ్లయినా రాజ్యాధికారం హిందుత్వ వాదుల చేతుల్లో ఉంటుంది. వారి విజయానికి ఢోకా ఉండదనేది ప్రధాన ఉద్దేశం. దీని కి ఊ అనాలా ఊహూ అనాలా అనేది హిందువులు లోతుగా ఆలోచించి నిర్ణయించాలి. దానికి ఎన్నికలే సరైన సందర్భం.
గుమ్మడిదల రంగారావు