ఒకనాటి సాహిత్యాన్ని పరిశీలిస్తే కవయిత్రుల సంఖ్య చాలా చాలా తక్కువ. అయిదుగురి కన్నా ఎక్కువ పేర్లు వినిపించవు. ఈ కవయిత్రులు కూడా గొప్ప ఆత్మవిశ్వాసంతో ఇది మా కవిత్వం’
అని చెప్పుకోలేకపోయారు. కారణం,స్త్రీలు రాసే కవిత్వం ఓ కవిత్వమా!’ అని సమాజంలో ఒక ఈసడింపు ఉండేది. అందుకే గొప్ప రచయిత్రి, రామాయణం రాసిన మొల్ల కూడా రామచంద్రుడు సెప్పించినపలుకు మీద చెప్పాను, తప్పులెంచకుడు కవులు’అని వాపోయింది, భయపడింది.
ఆధునిక యుగం వచ్చేనాటికి ఈ పరిస్థితి మారింది, కవయిత్రుల సం ఖ్యాపెరిగింది. కవిత్వానికి కులమత ప్రాంతీయ భేదాలు లేకుం డా అద్భుతమైన కవితలు సమాజానికందిస్తున్నారు కవయిత్రులు. ముఖ్యంగా అక్షరయాన్ ద్వారా కవిత్వాన్ని ప్రోత్సహించడంతో మంచి కవితలు చదివే భాగ్యం పాఠకులకు కలుగుతున్నది. అక్షరాలతో ప్రయోగం కన్నా గొప్ప అవకాశం ఏముంటుంది కవయిత్రులకు? ఇక్కడ అక్షరం గురించి అద్భుతమైన నిర్వచనం చేసిన అజ్ఞాత కవిని స్మరించి నమస్కరించాలి
‘అక్షరంబు వలయు కుక్షి జీవనులకు నక్షరంబు జిహ్వకిక్షురసము అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంబు లోకరక్షితంబు-’
సామాజిక ప్రయోజనాల కోసం, దురాచార నిర్మూలన కోసం, సాహిత్యం ప్రయోజనకరంగాఉండటం సంస్కర్తలయుగం నుంచే మొదలైంది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కవిత ఎంత మంది తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించిందో తెలు సు అందరికీ.
నేడు కవిత్వం రాస్తున్న కవయిత్రులు వాళ్ల మనోభావాన్ని చెప్పడానికి వెనుకాడడం లేదు.ఆకాశంలో సగం స్త్రీ అని నమ్ముతుండటంతో వాస్తవికతకు దగ్గరైన కవితలు చాలా వచ్చాయి. ‘నీలి మేఘాలు’ స్త్రీవాద కవిత్వంలో ‘బందిపోటు’్ల అనే కవిత సావిత్రి కలం నుంచి వెలువడింది.
‘పాఠం ఒప్పజెప్పకపోతేపెళ్లి చేస్తానని పంతులుగారన్నప్పుడే భయం వేసింది ఆఫీసులో నా మొగుడున్నాడు అవసరమున్నా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది వాడికేం మగమహారాజని ఆడా మగా వాగినప్పుడే అర్థమయిపోయింది పెళ్లంటే పెద్ద శిక్షని మొగుడంటే స్వేచ్ఛభక్షకుడని మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందని –
అంటే సమాజంలో జెండర్ వ్యత్యాసం ఎన్నిఅనర్ధాలకు దారితీస్తోందో చెప్తూ, పెళ్లి, మొగుడు, మగమహారాజులాం టి మాటలు స్త్రీ గుండె పట్లు కదిలించివేస్తాయన్నది అక్షర సత్యం. అయినంపూడి శ్రీలక్ష్మి ,సుధా శేఖర్ కలిసి రాసిన కవితా సంకలనం ‘కనకాంబరాలు’ ఎంతో అందంగా రంగురంగులుగానే కాక, హృదయ రాగాన్ని కళారంగానికి కూడా రంగులు అద్దాయి. ఆ సంకలనంలో కవితలు. మనసు విప్పి చెప్పుకున్న మధుర రాగాలెన్నో
మగబుద్ధి :
దారం దారం నా బతుక్కి ఆధారానివై మెళ్ళో పసుపుతాడు కావా?ప్రేమనే పసుపుగా పూస్తూ ప్రేమగా అడిగాను పురుష దారం మండపం ఎక్కగానే ప్రేమ ముసుగుతీసింది మెడలో ఉరితాడై బిగిసింది –
మగబుద్ధిని విశ్లేషిస్తూ ఉరితాడు అనటం అర్థ వం తం. పురుషాధికారం ఎంత భయంకరమైనదో చిన్న కవితలో విశ్వరూపం దాల్చింది.అల్పాక్షరాలతో అనల్పార్థరచనచేయటం శ్రీ లక్ష్మీ కవనాల్లో ప్రత్యేకత.
సంసారం కవితలో ‘ఆమె అతనికి అయోమయం
అతను ఆమెకి అగమ్య గోచరం
అయినా ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండరు’
– అదే కదా కుటుంబ వ్యవస్థలోని మహాదానందం.
శ్రీలక్ష్మీ తీసుకు వచ్చిన సంకలనం ‘పసిమొలకలు – రుధిరజ్వాలలు’ కవితా సంపుటి నేటి సమాజంలో ఆడపిల్లకి రక్షణ లేక, పసి మొగ్గలు నలిగిపోయే దుస్థితిలో కనిపించే రుధిర జ్వాలలు, హాహాకారాలు పాఠకుల గుండె కదిలించే కరుణ రసాత్మక కవితలెన్నో ఉన్నాయి.
‘కన్నెపిల్లల్లారా రండి గొడ్రా ళ్ల వ్రతం చేద్దాం’ – అని దేవనపల్లి వీణా వాణి నిద్ర లేవండి కవితలో మేలుకొలుపు అన్నారు.
రంగరాజు పద్మజ నిర్భయ చట్టాన్ని తలుచుకుంటూ ‘నిర్భయ చట్టం వచ్చినా నిర్భయంగా ఉండలేవు నిన్ను నువ్వే రక్షించుకునే శక్తి దుర్గగా మారితేనే సాధ్యం’అంటారు మనుర్భవకవితలో.
కళా గోపాల్ రచించిన ‘డేగరెక్కల నీడలో’.. ‘బాల్యం నీడ డేగరెక్కల నీడలో సమాధి అవుతున్నదని’ అంటూ ‘ఇక కీచకుల పాలిట ఉరే సరి’ అని ‘గర్జిస్తున్నాయి. పసిప్రాయపు పిడికిళుల అనటంలో ఎంతో కసి వెళ్ళగక్కారు రచయిత్రి.
కొండపల్లి నిహారిణి తెగిన వీణ – అను శృతి కవితలో ‘స్త్రీ భోగవస్తువు కాదని, బతుకు నింపే భాగ్యశాలి’ అనిచెప్తూ, ‘తెగిన వీణ ఆయనా స్వచ్ఛ రాగాలే పలుకుతుంది’ అంటారు.
వాస్తవ చిత్రీకరణలో మనసు దాచుకోని భావ విపంచిని మోగిస్తున్న కళామతల్లులు కవిత్వాన్ని తీరని దాహంలాగే భావించాలని, వారి కవితలే బాలికల పాలిట రక్షణ కవచాలు కావాలని భావిస్తున్నాను. వారు ఇకముందు కూడా ఆగకుండా ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. కవిత్వమే సమాజపు రుగ్మతలను మాన్పగల ఔషధం అనేది అక్షర సత్యం! కాదేది కవితకనర్హం, గొంతు ముడులు విప్పండి.